Friday, March 1, 2013

జిలాబా కల

                   బంగార్రాజు గారి చెరువుకి దగ్గరలో రోడ్డుకానుకుని పొలాల మధ్య పెద్ద మండువా లోగిలి పెంకుటింట్లొ ఉండేవాడు మా ఫ్రెండు బాలాజి. వాళ్ళ నాన్న మీసాల సత్యనారాయణ మా ఊళ్ళో ఓ మాదిరి పెద్ద రైతు. వాడు, నేను, మా కుమ్మరోళ్ళ ప్రసాదు ఊరి బళ్ళో ఐదో తరగతి దాకా కలిసి చదువుకున్నాం. బాలాజీ గాడు ఎక్కడ విన్నాడో ఏమో తెలీదు గానీ నా పేరు గోపి కాబట్టి గో.పి అంటే గోడ మీద పిల్లి అనీ, ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అనీ మా ఇద్దరినీ బాగా వేళా కోళమాడి తెగ ఏడిపించేవాడు. దాంతో వాడి మీద మా ఇద్దరికీ పీకల్దాకా వచ్చేసి వాడిక్కూడా అలాంటి పేరే ఏదో ఒకటి పెట్టాలని తీవ్రం గా ఆలోచించి, చివరికి బాలాజి తిరగేస్తే జిలాబా కాబట్టి దాన్నే కొంచెం మార్చి వాణ్ణి జిలేబీ గాడనో జిలాబా గాడనో అందరి దగ్గరా ప్రచారం చేసి ఆనంద పడిపోయే వాళ్ళం. వాడి ఐదో తరగతి అయిపోయాక మాత్రం వాళ్ళ నాన్నకి ఎవరో "ఈ రోజుల్లో ఇంగ్లీషు మీడియం లో చదవకపోతే భవిష్యత్తు ఉండద"ని చెబితే భయపడిపోయి, ఆరో తరగతి నుంచీ మాత్రం తాడేపల్లిగూడెం లో బుజ్జి సారు గారి ఇంగ్లీషు మీడియం బళ్ళో చేర్పించేశారు. అప్పటి వరకూ బాగానే చడివేవాడు గానీ ఇంగ్లీషు మీడియం లో చేరాక  అటు తెలుగు పూర్తిగా రాక , ఇటు ఇంగ్లీషు అర్ధం కాక అన్నీ అత్తెసరు మార్కులతో పాసయ్యేవాడు.

                      మా అందరికీ బీయస్సీ చివరి సంవత్సరం పరీక్షలయిపోయాక,  ఓ రోజు వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం చెరువు గట్టు మీద నేరేడు చెట్టు నీడలో, పాత ప్రెసిడెంటు రంగ బాబు గారు వేయించిన సిమ్మెంటు బెంచీ మీద కూర్చుని, డిగ్రీలయిపోయాక ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటుంటే,  ఏమడిగినా సినిమా పాటల్లో సమాధానం చెప్పే మా ప్రసాదు గాడు గణపవరం లో ఏ ప్రైవేటు బళ్ళోనో పిల్లలకి లెక్కలు చెప్పుకుంటూ "పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్" అని వాడి జీవిత లక్ష్యాన్ని పాట లా పాడి వినిపించేశాడు. బాలాజీ గాడు మాత్రం ఎప్పుడూ మట్టి కొట్టుకుపోయిన ఈ పల్లెటూళ్ళో పడి ఉండటం కంటే ఏ ఎంసీఏ నో చదివి అమెరికా వెళ్ళి స్థిరపడాలన్న తన కల నెరవేరే వరకూ నిద్ర పోనని బెంచీ గుద్ది మరీ చెప్పేసరికి మేమెవ్వరం కలలో కూడా ఊహించ లేని దానిని చేస్తానని వాడు అంత నమ్మకం గా చెబుతుంటే, వాడి పట్టుదల చూసి ముచ్చటేసి "అదే జరిగితే మన ఊరి మొత్తానికి మొట్టమొదట విమానమెక్కి ప్రయాణం చేసింది నువ్వే అవుతావనీ, ఆ రోజు ఊరంతా నీ పేరు మారు మోగి పోతుంద"నీ వాడి భుజం తట్టి ప్రోత్సహించాం.

                  అనుకున్నట్టే బాలాజీ గాడికి ఇక్కడెక్కడా ఎంసీయే సీటు రాకపోయినా గానీ, చెన్నయ్ దగ్గర అదేదో ఊళ్ళో డొనేషన్ కట్టి మరీ చేరిపోయాడు. ఆ తర్వాత చదువయిపోయి హైదరాబాదు లో ఏదయినా పెద్ద సాఫ్ట్ వేరు కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్ళిపోదామనుకునేసరికి బిన్ లాడెన్ అమెరికా మీద బాంబులేసేసి వస్తాయనుకున్న ఉద్యోగాలన్నీ వెనక్కెళ్ళి పోతే, బాలాజీ గాడు బెంగ తో మంచమెక్కినంత పని చేశాడు. "ఈ అమెరికా గొడవంతా వదిలేసి ఇక్కడే అందరిలాగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని అత్త కూతురి ని పెళ్ళి చేసుకుని తమతో పాటే ఉంటే చాల"ని వాళ్ళ అమ్మా నాన్నా ఎంత చెప్పినా వినకుండా ఎలాగయినా అమెరికా వెళ్ళి తీరతానని భీష్మిచుకుని కూర్చున్నాడు.

             సరిగ్గా అప్పుడే వాడి కోసం ఆ దేవుడే  పంపించినట్టు, వాడి తో పాటు ఎంసీయే చదివిన అత్తిలి రామారావు గారి చిన్నా వచ్చి,  హైదరాబాదు హైటెక్ సిటీ లో ఉండే "శ్రీ వెంకటేశ్వరా టెక్నాలాజికల్ కన్సల్ టెన్సీ సర్వీసెస్" సాఫ్ట్ వేరు కంపనీ వాళ్ళు ముందు యాభై వేలు కడితే ఉద్యోగమిచ్చి నెలకి ఏడు వేలు జీతమిచ్చి ఆరు నెలల తర్వాత పదిహేను వేలు చేసి, సంవత్సరం తిరక్కుండా అమెరికా కూడా పంపిస్తారని చెప్పి, రంగు రంగుల బ్రోచర్ ఒకటి చేతిలో పెడితే,  దెబ్బకి బాలాజీ లేచి కూర్చున్నాడు. "ఉద్యోగం ఇచ్చేవాడు మనకి జీతం ఇవ్వాలి గానీ, మన దగ్గర డబ్బులు తీసుకుని మనకే ఇస్తాడంటే ఇదేదో తిరకాసు లా ఉంది" రా అంటే "దేవుడి పేరు తో కంపెనీ పెట్టి మోసం చేస్తాడా?" అని ప్రశ్న, సమాధానం ఒకే ముక్కలో చెప్పేశాడు. ఏదేమయినా గానీ వాడి అమెరికా కల నెరవేరితే అదే చాలని హైదరాబాదు బస్సెక్కించేస్తే,  అమెరికా వెళ్ళిపోతున్నామన్న ఆనందం లో వాళ్ళిద్దరూ చెరొక యాభై వేలూ కట్టేసి  ఉద్యోగం లో చేరి పోయారు.

              హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ కాదు గానీ , దానికి దగ్గర లోనే ఓ చిన్న రెండంతస్తుల భవనం లో "శ్రీ వెంకటేశ్వరా టెక్నలాజికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్" లో ఓ నాలుగు నెలలు బాలాజీ ఉద్యోగం బాగానే సాగింది గానీ ఆ తర్వాత ఆ కంపనీ వాళ్ళే ఇలా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని ఓ నాలుగైదు కోట్లు పోగయ్యాక బోర్డు తిప్పేసి కంపెనీ మూసేసి ఎటో పారి పోయారని ఓ రోజు రాత్రి తొమ్మిదింటికొచ్చే ఈటీవీ వార్తల్లో చెప్పారు.ఇప్పటికయినా ఇంటికొచ్చెయ్యమని వాళ్ళ అమ్మా , నాన్న ఫోను చేసి ఎంత చెప్పినా వినకుండా "ఎండ వస్తే దుమ్ము, వాన వస్తే బురద, ఈగల మోత, కరెంటు కోత, దోమలకి రక్త దానం తప్ప ఏమీ లేని ఆ ఊళ్ళో ఉండలేన"నీ అయినా "మొన్న కోఠి వెళ్ళినప్పుడు ఫుట్ పాత్ మీద చిలక జోస్యం చెప్పినోడు తనకి విదేశీ యోగం ఉందని బల్ల గుద్ది మరీ చెప్పాడ"నీ చెప్పే వాడు.

                చిలక జోస్యం తర్వాత బాలాజీ గాడికి నమ్మకం ఇంకా పెరిగి పోయి,  అమెరికా వెళ్ళాక ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడక పోతే బాగోదని, ట్యాంకు బండ దగ్గర రామకృష్ణ మఠం లో ఇంగ్లీషు కోర్సు అప్లికేషన్ కష్ట పడి సంపాదించి కోర్సు లో చేరి పోయాడు. ఆ తర్వాత నెల నెలా ఇంటి నుంచి డబ్బులు పంపమనటం ఇష్టం లేక అమీర్ పేట లో ఏదో చిన్న కంపెనీ లో నెలకి రెండు వేలు జీతానికి చేరిపోయి, సంవత్సరం తర్వాత సాఫ్టు వేరు ఊపందకున్నాక ఐబీయం లో ఉద్యోగం సంపాదించి మూడు నెలలు తిరక్కుండా అమెరికా వెళ్ళి స్థిరపడిపోయాడు. అప్పట్నుంచీ మా ఊళ్ళో చదువుకునే కుర్రాళ్ళందరికీ బాలాజీ గాడిని ఆదర్శం గా చూపించేవారు.

                 అమెరికాలో బాలాజీ తో పాటే పనిచేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ఫిలాసఫీ మాట్లాడే హైదరాబాదు నుంచెళ్ళిన సూర్యం మాత్రం బాలాజీ గాడితో ఓ సారి పిచ్చా పాటీ మాట్లాడుతూ "వచ్చే సంవత్సరం ప్రోజెక్ట్ అయిపోగానే హాయిగా హైదరాబాదు వెళ్ళి పోయి అమ్మా నాన్నలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పల్లెటూళ్ళో పుట్టి పెరిగినా గానీ, అత్త కూతురిని పెళ్ళి చేసుకుని ఓ పదిహేనేళ్ళ తర్వాత,  వచ్చిన డబ్బుతో అమ్మమ్మ గారి ఊరేళ్ళి పోయి చెరువు పక్కన పచ్చని పొలాల మధ్య పెద్ద మండువా లోగిలి పెంకుటిల్లు, నాలుగెకరాల పొలం, రెండు గేదులు కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ, ఆరు బయట చల్ల గాలి లొ పడుకుని పొద్దున్నే మెలకువ రాగానే ఆకాశం లో బారులు బారులు గా ఎగిరే కొంగలు లెక్క పెట్టుకుంటూ, ఇష్టమయిన పుస్తకాలు చదువుకుంటూ, కథలు, కవితలు రాసుకుంటూ ప్రశాంతం గా ఆ పల్లెటూళ్ళో కాలం గడిపేయ"టమే తన జీవితాశయమని చెప్పాడు. సూర్యం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కూడా మా ఊరి దగ్గరలోనే ఉన్న లక్ష్మీ పురం.