Tuesday, May 27, 2014

అమ్మ చేతి ముద్ద

















('కినిగె పత్రిక' లో ప్రచురణ. :http://patrika.kinige.com/?p=2653)

కడుపు నిండా అన్నం తినేసి ఆడుకోవటానికి
వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికి
పొయ్యిలో పిడకల మీద కాల్చిన
చిక్కుడు గింజలు సిద్ధంగా ఉండేయి.


పిట్టలయినా లేవక ముందే లేచి
అబ్బాయిగారి దొడ్లో రాలిపోయిన
తాటిపళ్ళు దొంగతనంగా తెచ్చి
రొట్టె కాల్చి ఇస్తే మళ్ళీ కడుపుకి పండగే.


పరగ ఏరుకొచ్చిన గింజలు
వార్చిన గంజితో లచ్చించారు పెట్టి
అన్నం ముద్ద కలిపి నోట్లో పెడితే
ఒక్క పట్టుకే కుండ ఖాళీ.


చేపలమ్ముకునే వడ్డోళ్ళ చిట్టెమ్మ దగ్గర
గీచి గీచి బేరమాడి కొన్న నాలుగు బొమ్మిడాయిలకి
చింత కాయలడ్డమేసి పులుసెడితే
కూర వాసన నా చేతిని పట్టుకుని వారముండేది.


ఇరవై రూపాయలు పెట్టి కొన్న యాటమాసంలో
ములక్కాడా, మామిడి కాయా వేసి వండితే
తిన్న వెనకాలే నిద్ర ముంచుకొచ్చేసేది.


సుబ్బారాయుడిషష్టి తీర్థం లో
మిషను కుట్టి తెచ్చిన ఐదు రూపాయల్తో
ఖర్జూరం పండు కొని చేతిలో పెడితే
దిష్టి తగలకుండా మీద కప్పిన చీరకొంగు చాటున
గబగబా తినేసినట్టు గుర్తు.


పొరుగింటి సూరమ్మత్త ఇచ్చిన పులిసిపోయిన మజ్జిగ, మజ్జిగ పులుసయిపోయేది.
కొబ్బరి ముక్క కనిపిస్తే కొబ్బరి కోరు తాలింపు.
ఒక్క నిమ్మకాయ దొరికితే నిమ్మకాయ పులిహోర.
మా నల్ల కోడి గుడ్డెడితే నా కడుపులోకే.


పేపర్లోనో, టీవీలోనో ఆకలి గురించీ, పేదరికం గురించీ
ఎక్కడయినా కనపడితే “మేం కాదులే” అని నా నమ్మకం.


ఒక రోజు అమ్మకి ఒంట్లో బాగోపొతే ఆసుపత్రికి తీసుకెళ్ళాం.
అర్ధాకలితో అన్నేళ్ళూ ఉంటం వల్ల పేగులు అంటుకుపోయాయంట.
మిషను కుట్టీ కుట్టీ మెడ ఎముకలు ఒంగిపోయాయంట.
కనీసం గుడ్డు తిని ఎన్నాళ్ళయిందో ఎముకలు పెళుసయిపోయాయంట.
డాక్టరొచ్చి చెపితే గానీ నాకు తెలీలేదు.
మేమూ పేదోళ్ళమేనని.


Tuesday, May 20, 2014

సుబ్బారాయుడి తలకాయనొప్పి

          సుబ్బారాయుడి షష్టి కి మా పక్క టౌను గణపవరం లో సువర్ణేశ్వర స్వామి గుడి దగ్గర పెద్ద తీర్థం జరిగే రోజున పుట్టాడని ఆ పేరు పెట్టిన సుబ్రహ్మణ్యాన్ని వూళ్ళో మాత్రం అందరూ సుబ్బారాయుడని పిలిచేవారు. వాడు పుట్టిన కొన్నాళ్ళకి ఇంటికొచ్చిన కోయ దొర కి జాతకం చూపిస్తే వాడు కలెక్టరో, పెద్ద ఇంజనీరో అయిపోతాడని, ఊరికే పేరు తెస్తాడనీ చెప్తే,  వాళ్ళ ఇంట్లో ఎవరూ చదువుకోకపోయినా సుబ్బారాయుణ్ణి మాత్రం ఐదో యేట నాతో పాటే  మా ఊరి బళ్ళో ఒకటో తరగతి లో చేర్పించేసారు వాళ్ళ అమ్మ నాన్న. వాడు ఆరో తరగతిలో ఉండగా ఓసారి అరవై తెలుగు సంవత్సరాల పేర్లూ అరగంటలో చదివి అప్పచేప్పేస్తే మా తెలుగు మాస్టారి దిమ్మ తిరిగిపోయి వీడు మామూలోడు కాదని చెప్పేవారు అందరితో. ఎప్పుడైనా సుబ్బారాయుణ్ణి పొలం పనికి పంపిస్తే, కాబోయే కలెక్టరు తో పొలం పని చేయిస్తావా అని వాళ్ళ అమ్మా నాన్న ల మీదికి దెబ్బలాటకి వెళ్ళినంత పని చేసేవారు ఊరి జనం. ఒక్క క్లాసు పుస్తకాలే కాకుండా, సోమవారం సంతలో ఉప్పులూ పప్పులూ పొట్లాలు కట్టించుకొచ్చే తెలుగు,ఇంగ్లీషు పేపర్లతో పాటు కంటికి కనిపించినవన్నీ చదివేసి చివరికి ఎప్పుడు ఖాళీ వున్నా సైకిలేసుకుని గణపవరం మూర్తిరాజు గారి లైబ్రరీకెళ్ళి పుస్తకాలన్నీ నమిలి పారేసేవాడు. ఏడో తరగతి పరీక్షల్లో మండలానికే ఫస్టు వస్తే ఊళ్ళో అంబేద్కర్ విగ్రహావిష్కరణకొచ్చిన ఎమ్మార్వో గారు పెద్ద సభ పెట్టి వంద రూపాయల బహుమతి కూడా ఇచ్చారు సుబ్బారాయుడికి. అలా బాగా చదివేసి టెంతు , ఇంటర్లో   కూడా ఫస్టు మార్కులు తెచ్చుకుని డిగ్రీ లో గణపవరం గవర్నమెంటు కాలేజీలో చేరిపోయాడు.

          డిగ్రీ  రెండో సంవత్సరం లో ఉన్నప్పుడు  వేసవి కాలం సెలవుల్లో కాకినాడ వాళ్ళ మావయ్య గారింటికి వెళ్ళొచ్చిన తర్వాత నుంచీ మాత్రం సుబ్బారాయుడు క్లాసులో కూర్చునేవాడే కానీ మనిషి మాత్రం ఎక్కడో ఉండేవాడు. అదీకాక అస్తమాను తలకాయ నొప్పొస్తుందని కాలేజీకి బాగా ఎగనామం పెట్టేసి,  చిన్నప్పుడు ఆగస్టు పదిహేనుకి జెండా వందనం తర్వాత పిల్లలందరూ వెళ్తున్నారని  ఐదు రూపాయలిచ్చి వాళ్ళమ్మ సినిమా కెళ్ళ మంటే తప్ప ఎప్పుడూ సినిమా చూడని సుబ్బారాయుడు గూడెం, భీమవరం కూడా వెళ్ళి సినిమాలు చూడటం మొదలెట్టాడు.

        సుబ్బారాయుడి తలకాయ నొప్పి రోజు రోజుకీ ఎక్కువయి పోతే వాళ్ళమ్మా, నాన్నా బెంగెట్టుకుని ఏ గాలో సోకిందేమోనని  తణుకు దగ్గర పెరవలి మంత్ర గాడి దగ్గరకి తీసుకెళ్తే రెండు తాయత్తులిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకుండా ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి రాత్రికి చేతికి కట్టుకోమంటే కట్టుకున్నాడు కానీ తలనొప్పి మాత్రం తగ్గలేదు.  రాజమండ్రి లో పెద్ద పేరున్న న్యూరాలజిస్టు శివారెడ్డి గారికి తీసుకెళ్ళి చూపిస్తే ఆరు వేలు ఖర్చు పెట్టించి ఎక్సరే లు ఎం.ఆర్.ఐ స్కానింగులూ తీయించి పరీక్షలు చేసి ఏమీ లేదని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి పంపించేసారు కానీ మనిషి మాత్రం మామూలవలేదు. చివరికి రాజమండ్రిలోనే దానవాయిపేట లో ఉన్న కర్రి రామారెడ్డి గారి మానసా హాస్పిటల్లో నాలుగు రోజులుంచి వైద్యం చేయించినా గుణం కనిపించకపోతే హస్తవాసి చాలా మంచిదనీ , చాలా మందికి పెద్ద పెద్ద జబ్బులు నయం చేసిన సరిపల్లి హోమియోపతి డాక్టరు శర్మ గారి దగ్గరికి తీసుకెళ్ళమని అందరూ చెపితే తీసుకెళ్ళి చూపిస్తే ఆయన పరీక్ష చేసి ఇది మనో వ్యాధే కానీ మామూలు మందులకి తగ్గే జబ్బు కాదని చెప్పి పంపించేసారు.

          ఎప్పుడైనా గూడెం లో సెకండ్ షో సినిమా చూసి సైకిలు తొక్కుకుంటా ఇంటికొచ్చేటప్పుడు మాత్రం ఆల్ఫ్రెడ్ హిట్చ్ కాక్, అకీరా కురసోవా, క్వింటిన్ టరంటినో లాంటి నోరు తిరగని ఇంగ్లీషు సినిమా డైరెక్టర్ల గురించో, కాకినాడ వాళ్ళ మావయ్య గారింటికెళ్ళినప్పుడు చూసొచ్చిన ఇంగ్లీషు సినిమాల గురించో, క్రిష్ణవంశీ "సింధూరం", రాంగోపాల్ వర్మ "సత్య" సినిమా గురించీ ఆ గంటన్నరా ఆపకుండా మాట్లాడేవాడు సుబ్బారాయుడు.       

              చివరికి బాగా చదువుకుని పెద్ద కలెక్టరవుతాడనుకున్న సుబ్బారాయుడు తలకాయ నొప్పి వల్ల మామూలు మార్కులతో డిగ్రీ పాసయ్యాక తెలిసినోళ్ళ ద్వారా పెంటపాడు తవుడు ఫ్యాక్టరీ లో ఉద్యోగం ఇప్పించి పెళ్ళి చేసేద్దామనుకునే సమయానికి జబ్బు చేసి వాళ్ళమ్మ చచ్చి పోతే చూడటానికొచ్చిన సినిమాల్లో సెట్టింగులేసే దూరపు బంధువొకాయన వీడి సినిమా పిచ్చి గురించి విని తీసుకెళ్ళి సినిమాల్లో చేర్పించేస్తే,  తలకాయ నొప్పి తగ్గి పోయి బాగా కష్టపడి తర్వాత పెద్ద డైరెక్టరైపోయాడు.