Sunday, October 11, 2020

దుష్ప్రచారం/Propaganda అంటే ఏమిటి ? చరిత్ర ఏం చెప్పింది ?




నా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Friday, May 29, 2020

డబ్బు గురించి మీకు తెలియని నిజాలు




నా యూట్యూబ్ ఛానల్ ( Voice Over తో). ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Friday, April 17, 2020

మీకు తెలియని మతాల చరిత్ర



















                 సీజర్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం జుడియా అన్న రాష్ట్రం లో జీసస్ అనే అబ్బాయి పుట్టాడు. అతని బాల్యం గురించి సరైన సమాచారం లేదు. ఆయన జీవించింది 30 ఏళ్ళు మాత్రమే. అందులోనూ తన జీవిత కాలం లోని చివరి 3 సంవత్సరాలు, అతని చుట్టు పక్కల ప్రాంతాలలో కొన్ని మత బోధనలు చేసి మత ప్రవక్తగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి కొంతమంది శిష్యులు కూడా తయారయ్యారు. ఇతని బోధనలు అప్పటికే ప్రచారంలో ఉన్న ఇసయా అనే యూదు ప్రవక్త బోధనలను పోలి ఉండేవి. అందుకే ఇప్పటికీ కొంత మంది యూదులు, జీసస్ తమ సంప్రదాయాలను దోచుకున్నాడని భావిస్తారు. అయితే జీసస్ బోధనలు అప్పటి దేశ కాల మాన పరిస్థితులకి నిజంగా విప్లవాత్మకమయినవి. జీసస్ ని అప్పటి కాలపు విప్లవకారుడి గా భావించాలి. మానవులందరూ సమానమే అన్న జీసస్ భావాలు రాజద్రోహకరంగా ఉన్నాయని ప్రకటించి రోమన్ అధికారులు అతనికి మరణశిక్ష విధించారు. అక్కడితో జీసస్ కధ ముగిసింది.

                  అయితే అసలు కధ ఆ తర్వాతే మొదలయింది. జీసస్ బోధనలు ఆధారంగా సెయింట్ పాల్ అనే ఆయన అనేక రచనలు చేశాడు. మానవుల పాపాలను ప్రక్షాళణ చెయ్యటం కోసం జీసస్ తన ప్రాణాలను త్యాగం చేశాడని మొదట చెప్పింది ఇతనే. అయితే ఈ మాటలు జీసస్ స్వయంగా ఎప్పుడూ చెప్పలేదు. అంతటితో ఆగకుండా, స్త్రీలు వినయంగా ఉండాలని, బానిసలు తిరుగుబాటు చెయ్యకూడదని లాంటి ఉన్నత వర్గాలను సంతృప్తి పరిచే తన సొంత అభిప్రాయలను జీసస్ భావాలుగా ప్రచారం చేశాడు. ప్రతి వ్యక్తికి తిరుగుబాటు చెయ్యగల విలువ ఉందన్న జీసస్ భావాలకి ఇవి పూర్తిగా విరుధ్ధం. తొలి దశలోని చర్చి వ్యవస్థ బలపడటానికి ఈ సెయింట్ పాల్ బోధనలు ఎక్కువగా దోహదం చేశాయి. తరువాత ఈ వ్యవస్థ క్రైస్తవ మతంగా ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. అంటే విచిత్రంగా ఏ పాలక వర్గాల ఆగ్రహానికి జీసస్ ప్రాణ త్యాగం చేశాడో అదే పాలక వర్గాల ఆదరణ పొందే విధంగా క్రైస్తవ మతం మార్చబడింది.

                  జీసస్ కి 500 సంవత్సరాలకి ముందు ఉత్తర భారత దేశంలోని గంగా మైదానంలో అనేకా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అవి తమలో తాము నిత్యం పోట్లాడుకునేవి. అలాంటి ఒక రాజ కుటుంబం లో సిధ్ధార్ధుడు అనే ఒక అబ్బాయి పుట్టాడు. అతను పెరిగి పెద్దయ్యాక నదీ జలాలకి సంబంధించి పక్క రాజ్యంతో యుధ్ధం చేయవలసి వచ్చింది. సహజంగానే సున్నిత మనస్కుడు అయిన సిధ్ధార్ధుడు ఇలాంటి గొడవలకి భయపడి భార్యని, కుమారుడినీ, రాజ్యాన్ని వదిలి జ్ఞానం కోసం అన్వేషణ చెయ్యటం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నం లో పుట్టిందే బౌధ్ధ మతం. తర్వాత సిధ్ధార్ధుడే గౌతమ బుధ్ధుడిగా ప్రసిధ్ధి పొందాడు. బుధ్ధుని తత్వశాస్త్రం మానవుని మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్నంత గొప్పగా ఆ నాటి వరకూ ప్రపంచం లోని ఏ తత్వశాస్త్రమూ అర్ధం చేసుకోలేదు. కాని దాని ఫలితాలు మాత్రం అందరికీ సమానంగా అందలేదు. జీసస్ శిష్యుల మాదిరి గానే బుధ్ధుని శిష్యుల అతి ఉత్సాహం కారణంగా బుధ్ధుని బోధనలు కూడా పూర్తిగా మారిపోయాయి. బౌధ్ధుల అభిప్రాయభేధాల కారణంగా తర్వాత బౌధ్ధం రెండు శాఖలు గా చీలిపోయింది.

                  వెయ్యి సంవత్సరాల క్రితం భారత దేశం లో హిందూ మత శాఖలయిన శైవులు వైష్ణవుల మధ్య భయంకరమయిన గొడవలు జరిగాయి. అయితే ఈ గొడవలకీ శివ, విష్ణువులకి ఏ సంబంధమూ లేదు. ఇవి తమ అధికారాన్ని నిలుపుకోవటానికీ, సంపదల మీద ఆధిపత్యానికీ రెండు వర్గాలు మధ్య దేవుడి పేరుతో జరిగిన యుధ్ధాలు మాత్రమే. దీని పర్యవసానమే దక్షిణ భారత దేశంలో నిర్మించబడ్డ గొప్ప గొప్ప శైవ, విష్ణు ఆలయాలు.

                  అరేబియన్ ఎడారిలో మక్కా అన్న చిన్న పట్టణం లో 570వ సంవత్సరంలో మహమ్మద్ ఇబిన్ అబ్దుల్లా అనే ఆయన పుట్టాడు. భర్తను పోగొట్టుకున్న ఒక ధనిక స్త్రీని పెళ్ళిచేసుకుని 40 ఏళ్ళ వయసు వచ్చేవరకూ సామాన్యమయిన జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత అతనికి భగవత్ సంబంధమయిన ఊహలు రావటం ప్రారంభమయ్యాయి. అప్పుడే, ఒక్కడే అయిన దేవునికి తాను ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. ఆ భావాలే తర్వాత ఇస్లాం మతంగా అవతరించి, ఆ మతానికి అనేకమంది అనుయాయులు ఏర్పడ్డారు.

                  ఇలా, చరిత్రకారుల కోణం లో అన్ని మతాల చరిత్రని జాగ్రత్తగా గమనిస్తే మనకి అర్ధమయ్యే విషయం ఏమిటంటే, కొంతమంది మహాత్ముల గొప్ప ఆలోచనలని Hijack చేసి, వాటికి తమ సొంత భావాలు జోడించి, తద్వారా సొంత అజెండాని అమలు పరచటం ద్వారా సామాన్యుల మీద ఆధిపత్యం చెలాయించటం/గుర్తింపు పొందటం మానవ చరిత్రలో ఒక ముఖ్యమయిన కుతంత్రం అని. ఈ ఆధిపత్యం కోసమే, ఉమ్మడి కుటుంబం వేరు పడినట్టు ప్రతి మతం మళ్ళీ అనేక శాఖలుగా విడిపోయింది.

                  ఇలా Hijack చేయబడ్డ వాళ్ళల్లో ఇప్పటి కాలం లో మహాత్మా గాంధీ, అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటివరకూ మనం మాట్లాడుకున్నది, ఇలాంటి మహాత్ములని నిజంగా, నిజాయితీగా ఆదర్శంగా తీసుకునే వారి గురించి కాదు. కేవలం దుర్వినియోగం చేసే వాళ్ళ గురించి మాత్రమే.

Friday, April 3, 2020

అందరూ తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు : క్విడ్ ప్రో కో గురించి తెలిస్తే షాక్ అవుతారు.




నా యూట్యూబ్ ఛానల్ ( ప్రస్తుతానికి No Voice Over). ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Thursday, March 19, 2020

ఈ పోస్టుకి, కరోనా వైరస్ కి సంబంధం ఉంది.


                 అప్పటి వరకు ఎవరూ ఆలోచించనంత కొత్తగా ఆలోచించి, లేదా వారికే సొంతమయిన ప్రత్యేక ప్రతిభతో ఒక పని మొదలుపెట్టి, చిత్త శుద్దితో పూర్తి చేసేవాళ్ళు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అయితే వారిలో ప్రచారానికి దూరంగా, అజ్ఞాతంగా తమ పని తాము పూర్తిచేసేవాళ్ళే ఎక్కువ. భవిష్యత్తులో జరగబోయే ఒక ఉజ్వలమయిన మార్పుకు వీరిది మొదటి అడుగు అవుతుంది. వీరిని మూల పురుషులు అనవచ్చు. సామాన్యంగా ఈ మూల కారకులు తమ శక్తి సామర్ధ్యాలు, జీవిత కాలం, తమ ఆలోచనలు, పని లోని మెళకువలు మరింత మెరుగు పరుచుకోవటానికి వినియోగిస్తారు. ప్రచార ఆర్భాటాల గురించిన స్పృహ, సమయం ఉండదు. కానీ ఇలాంటి ప్రత్యేక ప్రతిభ ఉన్నవాళ్ళని గమనిస్తూ వారికి దగ్గరగా ఉండే వాళ్ళు మరి కొంత మంది ఉంటారు. వీరికి సొంత ప్రతిభ ఉండదు. కానీ మేనేజ్ మెంట్ ప్రతిభ, వాక్చాతుర్యం, ప్రచారం చేసుకునే నేర్పు ఉంటాయి. వీరిని అనుచరులు అనవచ్చు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మూల కారకులు మరియు వారి విజయాల గురించి, వారి చుట్టూ ఉన్న వారికి లేదా వారి కుటుంబ సభ్యులు కి మాత్రమే తెలుస్తాయి. ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవటం ఈ అనుచరుల వంతు అవుతుంది. వీరు అతి త్వరలోనే ప్రపంచం మాట్లాడుకునేటంత ప్రసిధ్ధిలవుతారు. ఈ రోజు మనం చెప్పుకునే అత్యంత విజయవంతమయిన వారు ఈ కోవలోకే వస్తారు. దీనికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తమిళనాడులో పెరియార్ రామస్వామి, అన్నా దురైలు ద్రవిడ ఉద్యమ పితామహులు. ఈ సిధ్ధాంత పునాదుల మీదే కరుణా నిధి, ఎంజీయార్లు తమ తమ పార్టీల ద్వారా ముఖ్య మంత్రులు కాగలిగారు. ఇప్పటికీ ఈ పార్టీలదే అక్కడ ఆధిక్యత. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీయార్ స్థాపించిన టీడీపి ద్వారానే ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు అతి ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇదే పరిశీలన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రకి, ఈ ఉద్యమం ద్వారా అధికారంలోకి రాగలిగిన కేసీయార్ కి, ఆప్ పార్టీ ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కెజ్రీవాల్ మరియు అతని మార్గదర్శకుడు, సామాజిక వేత్త అన్నా హజారే కి వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ అనుచరుల ద్వారా ప్రభావితమయ్యేవారు లక్షలు, కోట్లలో ఉంటారు. అయితే ఇది రాజకీయాలకి మాత్రమే కాదు. వ్యాపార విజయాలకి కూడా వర్తిస్తుంది. వ్యాపార సామ్రాజ్యంలో ధీరుభాయ్ అంబాని నాటిన విత్తనం ఆయన కొడుకులు ముఖేష్ అంబాని, అనిల్ అంబాని ద్వారా ఎలా విస్తరించిందో మనందరికీ తెలుసు. ఇలా చూస్తే చిరంజీవి ద్వారా పరిచయమయిన పవన్ కల్యాణ్ కి ముందు ముందు రాజకీయ పరంగా మంచి అవకాశాలు ఉండొచ్చు. అయితే దీనికి కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన సామర్ధ్యం కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పరిశీలన మానవ నాగరికత అభివృధ్ధి క్రమానికి కూడా వర్తిస్తుంది. ఆది మానవుడు మొదట ఆఫ్రికా ఖండంలో అవతరించాడు. తర్వాత ఆసియా, యూరప్, అమెరికా ఖండాలకి మానవ జాతి విస్తరించింది. కానీ, ఆఫ్రికా మిగిలిన వారితో పోలిస్తే ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నట్టు.













ఆఫ్రికా ఖండం నుంచి మానవ జాతి విస్తరణ
Image Courtesy : Sapiens - A Brief History of Humankind.

                 ఇంకా క్లుప్తం గా చెప్పాలంటే ఒక దృగ్విషయం యొక్క మూల కారణం/మూల కారకం/మూల కారకులు ఎప్పుడూ నిశ్శబ్దంగా అజ్ఞాతంగానే ఉంటాయి/ఉంటారు. వాటి విస్తరణ మాత్రం ప్రభంజనమవుతుంది. కానీ ఇది కూడా ప్రకృతి మరియు జీవుల సహజ క్రమాన్ని సూచించే Bell Curve లాంటిదే. వీటి పని అయిపోయాక ఎక్కడో ఒక చోట వీటి ప్రభావం అంతమవక తప్పదు.












ప్రస్తుతం కరోన వైరస్ దాని జన్మ స్థానమయిన చైనా లో తగ్గుముఖం పట్టింది. కానీ ప్రపంచం మొత్తం చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదానికి, దీనికి ఏమయినా సంబంధం ఉందేమో చూడాలి.

Friday, March 13, 2020

రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల వెనుక అసలు కారణం (2:59 నిమిషాలు)




ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Friday, March 6, 2020

అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | కలుపుకోవటం | Assimilation




ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Friday, February 28, 2020

అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | విభజన



ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Monday, February 24, 2020

అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | పరిచయం



ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Saturday, January 11, 2020

మృతజీవుల మాతృభాష


                 అసలు ఆంధ్రులకి తెలుగు మీడియం కావాలా ? ఇంగ్లీషు మీడియం కావాలా ? అన్న విషయం గురించి మాట్లాడుకునే ముందు ఆంధ్రుల మనస్తత్వం గురించి కొంత మాట్లాడుకోవాలి. స్వాభావికం గా తమిళ, మరాఠీ, బెంగాలీ వారిలాగా ఆంథ్ర ప్రజలు స్వాభిమానం, సొంత ఆలోచన విధానం కలిగిన వారు కాదు. అనుకరణ వాదులు మాత్రమే. ఒక మనిషికి ఆత్మ ఉన్నట్టే, ఒక జాతికి కూడా తనకంటూ సొంత ఆత్మ ఉండాలి. కాని ఇప్పటి వరకూ ఆంధ్రా వాళ్ళు తమకంటూ ఒక సామూహిక సొంత భావజాలాన్ని, ముద్ర ని ఏర్పరుచుకోలేకపోయారు. కేంద్రం లో గానీ పక్క రాష్ట్రాలలో గానీ తెలుగు వారి మాటకి విలువ లేకపోవటానికి ఇదే అసలు కారణం. ఆంధ్రులు కష్ట పడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు మాత్రమే గానీ చురుకుగా పని చేసే వాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే డబ్బు వ్యామోహం, కుల తత్వం కలిగిన స్వార్ధ పూరిత బానిస మనస్తత్వమే ఆంధ్రుల ఆత్మ. ఇక్కడ ఎవరికీ ఎవరి మీదా నమ్మకం ఉండదు. కమ్మ వారికి రెడ్డి వారి మీద నమ్మకం ఉండదు. కాపు వారికి కమ్మ వారి మీద నమ్మకం ఉండదు. రాయల సీమ వారికి కోస్తా వారి మీద నమ్మకం ఉండదు. దళిత బహుజనులకి అగ్ర వర్ణాల మీద నమ్మకం ఉండదు. అగ్ర వర్ణాలకి దళిత బహుజనుల మీద నమ్మకం ఉండదు. గెలిపించిన నాయకుల మీద ప్రజలకి నమ్మకం ఉండదు. రాజకీయ నాయకులకి ప్రజల మీద నమ్మకం ఉండదు. విచిత్రంగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా కులతత్వం అనేది సోషల్ మీడియా ప్రభావం తో మరింత బలపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రాజకీయాలు గా లేవు. అవి ప్రతి సామాన్యుడి సొంత ఇంటి వ్యవహారాలుగా మారిపోయాయి. రాజకీయాలని రాజకీయాలుగా చూడగలిగిన ప్రజలు కలిగిన ప్రజాస్వామ్యం మాత్రమే నిజమయిన ప్రజాస్వామ్యం గా నిలబడగలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కులతత్వం, మతతత్వం తో పాటు విచ్చలవిడి ఉచిత సంక్షేమ పధకాలు కూడా రాజకీయాలని ప్రతి ఇంటి సొంత వ్యవహారంగా మార్చివేశాయి. ఈ విధమయిన ఆలోచనని కలిగించటమే మన ప్రజాస్వామ్యానికి ఉచిత సంక్షేమ పధకాలు చేస్తున్న అసలయిన నష్టం.

                 ఒక వస్తువుని కంటికి మరీ దగ్గరగా పెట్టుకుని చూస్తే మనకి ఆ వస్తువు గురించి ఏమీ అర్ధం కాదు. సరయిన దూరంలో చూస్తేనే అర్ధమవుతుంది. అలాగే మన గురించి మన పక్క రాష్ట్రాల వారి అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయంత్నం చేస్తే సరయిన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు ఏమనుకుంటారు ? అని గూగుల్ లో వెతికితే ఈ క్రింది సమాధానాలు వచ్చాయి.

1. కష్ట పడి పని చేస్తారు.
2. ఆడంబరాలకి పోయేవారు.
3. విలాసంగా బ్రతకటానికి ఇష్టపడేవారు.
4. స్నేహ శీలురు.
5. గొప్పలు చెప్పుకుంటారు.
6. సినిమాలని ఎక్కువగా ఇష్టపడేవారు.
7. డబ్బు మనుషులు.
8. జిత్తుల మారి ఆలోచనలు కలిగిన వారు.
9. అనవసరపు పోటీతత్వం కలిగిన వాళ్ళు.
10. భావోద్వేగాలు లేని వారు.
11. దక్షిణ భారత బిహారీలు.
12. అమెరికా మీద మోజు ఎక్కువ.
13. ఎక్కువ వరకట్నం తీసుకునేవాళ్ళు.


                 ఆంధ్రులు ఎప్పుడూ తమలో తాము పోట్లాడుకుంటారు. కానీ బయటివారి ఆధిపత్యం కింద పనిచేయటానికి మాత్రం ఇష్టపడతారు. యజమానులు కూడా సొంత ఆలోచనా విధానం లేకుండా కేవలం తమకి అనుగుణంగా ఉండి తమని అనుకరించే బానిసలే కావాలనుకుంటారు. ఈ విధమయిన స్వార్ధ పూరిత బానిస మనస్తత్వం వల్లనే మనం సాఫ్టువేరు ఉద్యోగాలలో ముందు వరసలో ఉండగలిగాము. మనం ఎవరితోనూ ధైర్యం గా పోరాడలేము, కేవలం కీలు బొమ్మలుగాను సొంత లాభం కోసం రాజీ పడే వాళ్ళు గాను ఉంటాము. ఆంధ్రులు అనైక్యతకి పెట్టింది పేరు. మిగిలిన రాష్ట్రాల వారు తమలో తాము ఎంత పోట్లాడుకున్నా తమ రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో మాత్రం కలిసి కట్టుగా ఉంటారు. మనం మాత్రం ఇందుకు విరుధ్ధం. కులతత్వం ఉన్నంత కాలం ఆంధ్ర దేశంలో అప నమ్మకం ఉంటుంది. అప నమ్మకం ఉన్నంత కాలం అభివృధ్ధి తో పాటు సొంత వ్యక్తిత్వం కూడా ఉండదు. ఆ రకంగా చూస్తే మన పక్క రాష్ట్రాల తో పోల్చుకుంటే మనం ఇంకా పూర్తి పరిణతి చెందిన ఆలోచన కలిగిన నాగరికులుగా తయారు కాలేదనే చెప్పాలి.



                 సొంత వ్యక్తిత్వం లేని వారికి సొంత భాష కూడా అవసరం లేదు. అందుకే ఒకప్పుడు 40 ఏళ్ళ క్రితం దేశం లో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4 వ స్థానానికి పడిపోయింది. ఒక సమాజాన్ని నాశనం చేయాలంటే ఆ సమాజం యొక్క ఉజ్వలమయిన చరిత్రని వారికి దూరం చెయ్యాలి అనేది సామ్రాజ్యవాదుల మొదటి సూత్రం. భాషని దూరం చెయ్యటం అందులో మొదటి అడుగు అయితే సొంత భాషలో ప్రాధమిక విద్యని దూరం చెయ్యటం, భాషని దూరం చెయ్యటంలో మొదటి అడుగు. దురద్రుష్టవశాత్తు సామ్రాజ్య వాద బ్రిటీషు ప్రభుత్వానికి చెందిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషకి ఎనలేని కృషి చేస్తే మనం మాత్రం తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నాం. మాకు మా తల్లి భాష అవసరం లేదు అని చెప్పగలిగిన జాతి బహుశా ప్రపంచం మొత్తం మీద ఆంధ్ర జాతి మాత్రమే అయి ఉండాలి. కంచె ఐలయ్య లాంటి దళిత బహుజన మేధావులు కూడా ఇంగ్లీషు మీడియం ని సమర్ధించటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక రకంగా ఆయనే వ్యతిరేకించిన అగ్రవర్ణ సంస్కృత ఆధిపత్యం స్థానంలో ఇంగ్లీషు ఆధిపత్యాన్ని అంగీకరించటమే అవుతుంది గానీ దళిత బహుజనుల సొంత వ్యక్తిత్వాన్ని కాపాడినట్టు కాదు. నిజానికి అచ్చమయిన, స్వఛ్ఛమయిన తెలుగు పదాలు దళిత కవుల సాహిత్యంలోనే కనపడతాయి. సంస్కృతి, భాష ఒకదాని మీద ఒకటి ఆధారపడేవి. సంస్కృతిని కోల్పోవటం భాష ని కోల్పోవటానికి కారణమవుతుంది. భాషని కోల్ఫొవటం సంస్కృతిని కోల్పోవటానికి కారణమవుతుంది.

                 విద్య యొక్క మొదటి లక్ష్యం అక్షర జ్ఞానంతో పాటు విద్యార్ధి తన చుట్టూ ఉన్న పరిస్థితులని, సమాజాన్ని అర్ధం చేసుకొనేలా చెయ్యటం. ముఖ్యంగా ప్రాధమిక విద్య లక్ష్యం ఇదే. ప్రాధమిక విద్య బతుకుతెరువుకోసమో, డబ్బు సంపాదించటం కోసమో కాదు. ఆ రకంగా చూస్తే ప్రాధమిక విద్య తల్లి భాషలో జరగటమే న్యాయం. ఎందుకంటే ఒక స్థానిక సమజం లో బ్రతికే వ్యక్తికి తన సొంత భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించిన అవగాహన చాల అవసరం. ఇంగ్లీషు మాధ్యమంలో విద్య ఇలాంటి అవకాశాన్ని దూరం చేస్తుంది. ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించవలసిన ఉన్నత విద్య మాత్రమే ఉద్యోగం కోసం. ఆంధ్రుల అసలు సమస్య ఇంగ్లీషు రాకపోవటం కాదు. ఇంగ్లీషు ఉన్నత నాగరికుల భాష, దానిని మనం తప్పని సరిగా నేర్చుకోవాలి. లేకపోతే ఎవరూ మనలని గౌరవించరు అన్న బానిస మనస్తత్వపు ఒత్తిడే ఇక్కడ సమస్య. ఈ విధమయిన ఒత్తిడి తమిళ, కన్నడ, మళయాళీ ప్రజలకి ఉండదు. అది వారికి చాల మామూలు విషయం. అందుకే దక్షిణ భారత దేశంలో మిగిలిన వారితో పోలిస్తే ఆంధ్రులు మాట్లాడే ఇంగ్లీషు అత్యంత పేలవంగా ఉంటుంది. ఇంగ్లీషు అంటే ఈ విధమయిన ఆత్మ న్యూనత ఆంధ్రులలో కొన్ని తరాలుగా ఉంది. అది ఇప్పటికీ ఉంది. మన దగ్గర వేలి ముద్ర వేసే వాడు కూడా నీళ్ళని నీళ్ళు అనటానికి బదులుగా వాటర్ అని అనటానికే ఇష్టపడతాడు. కానీ మన ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి. పరాయి భాషలో వాటిని కేవలం అనువదించుకుని పైకి మాట్లాడతాము. మనకి ఒక విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉంటే దానిని వ్యక్త పరచటానికి ఏ భాష అయినా ఒక్కటే. అసలు సమస్య మనకి విషయ పరిజ్ఞానం లేకపోవటం, విషయాన్ని సరిగ్గా బోధించగల అధ్యాపకుల కొరత మాత్రమే కానీ భాష కాదు. మనకి ఆత్మ విశ్వాసం విషయ పరిజ్ఞానం వల్ల వస్తుంది కానీ అది లేకుండా ఊరికే ఇంగ్లీషు నేర్చుకోవటం వల్ల కాదు. ఊరికే ఇంగ్లీషు నేర్చుకోవటం కాల్ సెంటర్ ఉద్యోగాలకి పనికి వస్తుంది కానీ సాంకేతిక ఉద్యోగాలలో కాదు. ఇంటర్లో బైపిసి తీసుకుంటే చాలు డాక్టరు అయిపోతాడనుకోవటం ఎంత అమాయకత్వమో, ఇంగ్లీషు మీడియంలో చదివితే జీవితం లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతాడనుకోవటం కూడా అంతే అమాయకత్వం.



                 తెలుగు మాధ్యమం లో ఒకప్పుడు భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలు చదుకోవటానికి కూడా విలువయిన తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. వాటిలో ఊరికే ఫార్ములా లు ఇవ్వటం కన్నా ముందు, ఆయా సూత్రాలు దైనందిన జీవితం లో ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎందుకు కనుగొనవలసి వచ్చిందో వివరించే విధానం ఎక్కువగా ఉండేది. దీని వల్ల ఆ విషయం మీద ఆసక్తి పెరిగేది. ఉదాహరణకి ఒక ఎత్తయిన భవనం పొడవు ఆ భవనం ఎక్కవలసిన అవసరం లేకుండానే కనుక్కోవటానికి త్రికోణమితి సూత్రాలు ఎలా ఉపయోగపడతాయి? ఒకప్పుడు భారత దేశంలో యజ్ఞ గుండాల నిర్మాణంలో త్రికోణమితిని విరివిగా ఉపయోగించేవారు లాంటి విషయాలతోపాటు, ఒక రావి ఆకు వైశాల్యం ఖచ్చితంగా కనుక్కోవటానికి ఏకీకరణ(ఇంటిగ్రేషన్) ఎలా ఉపయోగపడుతుందో లాంటి విషయాలు సరళంగా అర్ధం అయ్యేలా వివరింపబడి ఉండేవి. కాంతి వేగం కనుక్కోవటానికి మొదట గెలీలియో రెండు కొండ శిఖరాల మీద దీపపు లాంతర్లు, గడియారం ఉపయోగించి ఎలా ప్రయత్నించాడో ఒక కధలా వివరించారు. ఈ విధమయిన విధానం వల్ల విద్యార్ధికి శాస్త్ర సంబంధమయిన విషయాల మీద ఆసక్తి పెరిగి సొంతంగా ప్రయోగాలు చెయ్యటానికి ఉత్సాహం వస్తుంది. అలా కాకుండా ఏమీ అర్ధం కాకుండానే ఊరికే ఇంగ్లీషులో ఫార్ములాలు బట్టీ పట్టించి 100 కి 99 మార్కులు వెయ్యటం అనేది సృజనాత్మకత లేని, అనుకరించ గలిగిన బానిసలను మాత్రమే తయారు చేస్తుంది.

                 ప్రస్తుత సాంకేతిక యుగంలో భాషాపరమయిన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఎవరు ఏ భాషలో మాట్లాడినా తమకి కావాలసిన భాషలోకి అప్పటికప్పుడు అనువాదం అయ్యే సాంకేతికత ఇప్పటికే ప్రవేశించింది. ముందు ముందు ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవసరం అస్సలు ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పటికే తెలుగు వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత సాంకేతిక పరిస్థితులు నిజానికి ప్రాంతీయ భాషలకి ఎక్కువ మేలు చేస్తున్నాయి. ప్రయివేటు బడులలో కూడా నిర్బంధ తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టగలిగిన అనుకూలతలు ఇప్పుడు ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకి మాతృ భాషని తల్లిదండ్రులకన్నా ఖుషి టివి లాంటి కార్టూన్ చానళ్ళే ఎక్కువగా నేర్పుతున్నాయి. ఇటువంటి అనుకూల పరిస్థితులలో మనం మన తల్లి భాష ని పక్కన పెట్టటం అనేది అనాలోచిత తొందరపాటు నిర్ణయమే అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మన తెలుగుని మరిచిపోతే మన పుస్తకాలు, అందులోని విజ్ఞానం, సాహిత్యం మరుగునపడి మనకంటూ సొంత అస్థిత్వం లేని ఒక సంచార జాతిగా మిగిలిపోతాము. ఇప్పటికే ఈ విషయంలో సంస్కృతం ని ఉదాహరణగా చూశాము. ఇప్పుడు తెలుగు భాషని అశ్రధ్ధ చేసి, తర్వాత మేలుకుని తప్పు దిద్దుకోవటానికి తాపత్రయపడటంకన్నా ఇప్పుడే తగిన చర్యలు తీసుకోవటం మంచిది. విషయ పరిజ్ఞానం అనేది సొంత భాషలోను, ఇంగ్లీషులోను ప్రావీణ్యం సంపాదించి ఆ రెండు భాషలలోని పుస్తకాలని విరివిగా చదవటం వల్ల, లేదా సొంత భాషలో ప్రావీణ్యం సంపాదించి ఆ భాషలోని, ఆ భాషలోకి అనువదింపబడ్డ పుస్తకాలని విరివిగా చదవటం వల్ల మాత్రమే వస్తుంది కానీ, సగం సగం సొంత భాష, సగం సగం ఇంగ్లీషు నేర్చుకోవటం వల్ల రాదు.



తెలుగు అభివృధ్దికి సూచనలు.

1. మనం కోల్పోయిన సరళమయిన తెలుగు పదాల పదకోశ నిర్మాణానికి తగిన చర్యలు     తీసుకోవాలి.
2. అనవసరపు ఇంగ్లీషు పదాల బదులు ఈ పదాలను పత్రికలు, సినిమాలు, టీవీ     కార్యక్రమాలు, వార్తా చానళ్ళలో ఉపయోగించే విధంగా ప్రోత్సహించాలి.
3. అన్ని శాస్త్ర సంబంధ విషయాలను తెలుగులో సులువుగా అర్ధం చేసుకునే     విధమయిన పాఠ్య పుస్తకాలు రాయాలి. నిజానికి ఈ ప్రయత్నం తెలుగు అకాడమీ     ఎప్పుడో చేసింది. విజ్ఞాన్, నారాయణ, చైతన్య రాక ముందు అన్ని శాస్త్రాల పుస్తకాలు     తెలుగులోనే ఉన్నాయి. మనం చెయ్యవలసినదల్లా     వాటిని బయటకి     తీసుకురావటమే.
4. ప్రతిరోజూ ఉపయోగించే తెలుగులో, ఇంగ్లీషు పదాల ప్రయోగాన్ని అవసరమయిన     వరకు తగ్గించాలి. ఉదాహరణకి : అంకెలు, వారాలు, కూరగాయలు,     బంధుత్వపు     వరుసలు.
5. గత పది సంవత్సరాలలో అవసరం లేకపోయినా ఇంగ్లీషు వ్యామోహం వల్ల మనం     కోల్పోయిన తెలుగు పదాలని తిరిగి పునరుధ్ధరించాలి.
6. తెలుగు వికీపీడియాని అభివృధ్ధి చేసి దానికి విస్తృత వ్యాప్తి కలిగించాలి.
7. ఆంథ్రుల ఐక్యత ని తెలియ చేసే విధంగా కర్నాటక లో మాదిరి ఒక జండాని     రూపొందించాలి.
8. తమ పిల్లలు రోజు వారీ జీవితం లో సాధ్యమయినన్ని ఎక్కువ తెలుగు పదాలు     ఉపయోగించేలా తల్లి దండ్రులు ప్రోత్సహించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు     నామోషీగా భావించకూడదు.

తెలుగు భాష సరస్వతి దేవి లాంటిది, ఇంగ్లీషు భాష లక్ష్మి దేవి లాంటిది. తెలుగువారందరికీ ఇంగ్లీషు చదవటం, రాయటం, మాట్లాడటం వస్తే మంచిదే. కాని తెలుగు అవసరం అంతకు మించినది.