Friday, June 22, 2018

డబ్బు ఎందుకు ? - పరిచయం


                  డబ్బు అంటే ఏమిటి? అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? ఎలా వచ్చింది? మనిషికి డబ్బుని సృష్టించవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవటం అంత అవసరమా ? అందరూ ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తారు. అందులో కొంత సొంత ఖర్చులకి ఉపయోగించుకుని మిగిలింది భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు, లేదా మరింత డబ్బు సంపాదించటనికి పెట్టుబడి గా ఉపయోగిస్తారు. ఇది డబ్బుకి సంబంచించి అందరికీ తెలిసిన ప్రాధమిక విషయం. కానీ ఇంతకు మించిన మార్మికమయిన విషయాలు డబ్బులో ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి డబ్బు గురించి తెలుసుకోవటం అంటే మానవ సమాజం గురించి తెలుసుకోవటమే. డబ్బుని సరిగ్గా అర్ధం చేసుకోవటం ద్వారా మానవ సమాజం లోని చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే డబ్బు అనేది సమాజం లో ఒక ముఖ్యమయిన అంతర్భాగం. డబ్బు అనేది సృష్టించబడిన తర్వాత అది మనుషులు మీద చూపించిన ప్రభావం తప్పకుండా పరిగణనలోకి తీసుకోదగినది. గణిత శాస్త్రం లోని రేఖా గణితం లో అన్నిటికీ మూలాధారం ఒక చిన్న చుక్క లేదా 'బిందువు'. కొన్ని బిందువులు కలిస్తేనే ఒక రేఖ, కొన్ని రేఖలు కలిస్తేనే చతురస్రం, దీర్ఘ చతురస్రం మరియు త్రిభుజం లాంటి అనేకం ఏర్పడతాయి. సమాజం లో డబ్బు కూడ ఈ బిందువు లాంటిదే. మానవ నాగరికత పురోగతిని పరిశీలిస్తే కుటుంబం, మతం, రాజ్యం లాంటి అన్నిటి పుట్టుకకి మూల కారణం డబ్బే. అయితే ఇక్కడ డబ్బు అంటే ప్రస్తుతం మనం చూస్తున్న నోట్లు, నాణేలు మాత్రమే కాదు. డబ్బు అంటే ఆస్థి, సంపద, సంపదని సృష్టించే వనరులు అని కూడా గుర్తుంచుకోవాలి.

                  ఆది మానవుడిగా ఉన్నప్పుడు మనిషి ఎక్కువగా కాయలు, పండ్లు, గింజలని ఆహారంగా ఉపయోగించేవాడు. సమయం అనుకూలిస్తే జంతువులను వేటాడేవాడు. తర్వాత వేటలో మెళకువలు సాధించి తన అవసరం కోసం ఆయుధాలని తయారుచేసుకుని ఉపయోగించుకున్నాడు. అలాగే చక్రాన్ని, లిపిని, తర్వాత ఆవిరి యంత్రాలు, కరెంటు లాంటి తన అవసరం తీర్చగల అనేక సాధనాలని కనిపెట్టి ఉపయోగించుకున్నాడు. మనిషి సృష్టించుకున్న వాటిలో డబ్బు కూడా సరిగ్గా ఇలాంటిదే. చక్రాన్ని బండి నడపటానికి, కరెంటుని బల్బుని వెలిగించటానికి ఉపయోగించుకున్నట్టే, డబ్బుని కూడా వస్తు మారకం కోసం ఉపయోగించుకోవటానికి మనిషి సృష్టించుకున్నాడు. కానీ వాటిలో దేనికీ లేని విలువ డబ్బు కి ఉంది. డబ్బుతో మనం అలాంటి సాధనాలను ఎన్నయినా కొనగలం. మన భారత దేశంలో అయితే డబ్బు ఇంచు మించు భగవంతుడితో సమానం. కింద పడ్డ డబ్బులని కళ్ళకద్దుకుని గానీ తీసుకోము.

                  అయితే డబ్బుకి నిజంగా అంత విలువ ఉందా ? ఇదంతా మనం డబ్బుకి, దానికి ఉన్న ఉపయోగపు విలువకన్నా ఎక్కువ విలువని ఊహించుకోవటం వల్ల జరిగిందా ? నిజంగా డబ్బు అంత శక్తివంతమయినది అయితే దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ? నిజానికి డబ్బుకి దానికి ఉన్న ఉపయోగపు విలువ తప్ప మరి ఏవిధమయిన విలువ లేదు. ఇది తెలుసుకోవటానికి ఒక చిన్న తర్కాన్ని ఉపయోగిస్తే చాలు. ఉదాహరణకి పైన "డబ్బు తో ఏ సాధనాలనయినా కొనగలం" అని చెప్పుకున్నాం. కానీ నిజానికి "ఏ సాధనాన్నయినా కొనటానికి మనం డబ్బు ని ఉపయోగిస్తున్నాం" అని చెప్పుకోవాలి. అంటే వస్తువులని కొనటానికి మనం డబ్బుని ఉపయోగిస్తున్నాం. అంటే వస్తువు కోసం డబ్బు కానీ డబ్బు కోసం వస్తువు కాదు. అంటే కొనటానికి లేదా అమ్మటానికి వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే డబ్బుకి విలువ. అలాంటి వస్తువులు అసలు లేకపోతే డబ్బుకి ఉండే విలువ సున్న. కానీ మనం మన ఆలోచనని దీనికి వ్యతిరేక దిశలో మాత్రమే పరిమితం చేసుకోవటం వల్ల, పూర్తి విరుధ్ధమయిన భావాన్ని కలిగి ఉంటాం.

                  ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఒక మనిషి ఎన్ని ఎక్కువ వస్తువులు లేదా సేవలు ఉపయోగించుకోవాలనుకుంటే అతనికి అంత ఎక్కువ డబ్బుతో అవసరం ఉంటుంది. ఎన్ని తక్కువ వస్తువులు లేదా సేవలు ఉపయోగించుకుంటే అంత తక్కువ డబ్బుతో అవసరం ఉంటుంది. ఏ విధమయిన వస్తువులు లేదా సేవలు అసలు ఉపయోగించుకోకపోతే అలాంటి మనిషికి జీవించటానికి ఒక్క ఆహారం విషయంలో తప్ప ఇంక డబ్బుతో అవసరం ఉండదు. నిజానికి ప్రపంచం లో కొన్ని వేల సంవత్సరాల పాటు డబ్బు అనేది ఉనికి లో లేదు. ఇప్పటికీ డబ్బుతోను, బయటి ప్రపంచం తోను సంబంధం లేకుండా ఉన్న అనేక ఆటవిక తెగలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ నాగరిక ప్రపంచం లో శాస్త్ర విజ్ఞానం తో పాటు మనుషులు ఉపయోగించుకునే వస్తువులు మరియు సేవల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. సరిగ్గా ఇక్కడే డబ్బుకి ఉన్న విలువ, శక్తి కూడా అధికం అయ్యాయి. అయితే ఇలా పుట్టుకొస్తున్న వస్తువులలో కొన్ని మాత్రమే మనిషికి అత్యవసరమయినవిగా తయారవుతాయి. అయితే మిగిలిన తక్కువ ప్రాధాన్యత ఉండే వస్తువులను కూడా ప్రజలచేత కొనిపించటం ఎలా ? సరిగ్గా ఇక్కడే వ్యాపార వర్గాలు తమ సర్వ శక్తులను ఉపయోగిస్తాయి. వాణిజ్య ప్రకటనలు అందులో ఒక ముఖ్యమయిన భాగం. ఒక వస్తువు యొక్క ప్రాముఖ్యతని అదే పనిగా ప్రజల మెదళ్ళలో చొప్పించటం వల్ల అది ఎక్కువ మంది ప్రజలకి ఒక అత్యవసరమయిన వస్తువుగా మారిపోతుంది. అంటే మనుషులు ఉపయోగించ వలసిన వస్తువుల సంఖ్య పెరుగుతుంది. అంటే పరోక్షంగా సమాజంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత, విలువ పెరుగుతుంది. కానీ ఇది పూర్తిగా ఒక ఊహా జనితమయిన, కృత్రిమమయిన విలువ. అన్ని దేశాల ప్రజలు అన్ని వస్తువులను కొనగల ఆర్ధిక స్తోమతని కలిగి ఉండక పోవచ్చు. అందుకే వ్యాపార వర్గాల దృష్టి ఎప్పుడూ ఎక్కువ జనాభా కలిగిన వర్ధమాన, ధనిక దేశాలపైన మాత్రమే ఉంటుంది. ఆఫ్రికా దేశాలలాంటి పేద దేశాలను వ్యాపార వర్గాలు అంతగా పట్టించుకోవు, కానీ వాటిని మరో రకం గా వాడుకుంటాయి. దేశాల మధ్య, ప్రజల మధ్య ఆర్ధిక అసమానతల మూలాల గురించి మనం మరో అధ్యాయంలో వివరంగా మాట్లాడుకుందాం.

                  డబ్బుకి ఉన్న ఈ రకమయిన కృత్రిమమయిన విలువని పెంచేది ఒక్క వస్తు వినిమయం మాత్రమే కాదు. కొన్ని సమాజ నియమాలు కూడా ఇందుకు కారణమవుతాయి. అందులో ఒకటి ఎక్కువ డబ్బు ఉన్నవారికి సమాజం ఎక్కువ గౌరవం ఇవ్వటం. పరువు ప్రతిష్ఠలను డబ్బుతో ముడి పెట్టటం. డబ్బు ఉన్న వారికే అధికారం ఇవ్వటం లేదా అధికారం కోసం డబ్బు కలిగి ఉండవలసిన అవసరం కలిగించే పరిస్థితులు సమాజం లో నెలకొని ఉండటం. జాగ్రత్తగా గమనిస్తే ఏవయినా రెండు వ్యవస్థలు ఒకదానినొకటి సహాయం చేసుకుని బలపరుచుకోవటం అనేది మానవ సమాజం లో అంతర్గతంగా ఉండే విషయం. కొన్ని బయటి వ్యవస్థలతో వీటికి ఏర్పడే పోటీ దీనికి ముఖ్య కారణం. ఒకదానినొకటి సహాయం చేసుకోవటం ద్వారా ఆ రెండు వ్యవస్థలు మరింత గా వృధ్ధి చెందుతాయి. దీనిని మరోలా చెప్పాలంటే పోటీని తట్టుకుని రెండు వ్యవస్థలు మరింత వృధ్ధి చెందటం కోసం ఒకదానినొకటి బలపరుచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఉదాహరణ చెప్పాలంటే 'రాజకీయాలు' మరియు 'ప్రచార మాధ్యమాలు'. ఒక్కోసారి రెండు దేశాల మధ్య ఉండే సంబంధం కూడా ఇలాంటిదే అయి ఉంటుంది. అంటే ఈ రెండూ తమ అభివృధ్ధి కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. సమాజంలో ఈ వ్యవస్థల మూలాలు ఎంతగా బలపడితే అంతగా నాటుకుపోతాయి. డబ్బు, అధికారం మధ్య ఉండే సంబంధం కూడా సరిగ్గా ఇలాంటిదే. అంటే డబ్బు ఉన్న వారికి అధికారం సంపాదించటం సులువు. అలాగే అధికారం ఉన్న వారికి డబ్బు సంపాదించటం సులువు. అందుకే ఎక్కువసార్లు ఈ రెండూ ఒకరి వద్దే ఉంటాయి. లేదా ఈ రెంటిలో ఏదో ఒకటి ఉన్నవాళ్ళు ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరింతగా వృధ్ధి చెందుతారు.(ఇంకా ఉంది)

Saturday, March 3, 2018

డబ్బు ఎందుకు ?


                 డబ్బు ఎందుకు? అని ఎవరినయినా ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం వారి వారి స్థాయిలను బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు తనకి ఇష్టమయిన బొమ్మలు, మిఠాయిలు కొనుక్కోవటానికి డబ్బులు కావాలి అంటాడు. ఒక పేద వాడు సుఖం గా బతకటానికి డబ్బు అవసరం అంటాడు. ఒక ధనికుడు అతనికి అప్పటికే అలవాటయిన విలాసవంతమయిన జీవితాన్ని కొనసాగించటానికి డబ్బులు ఆవశ్యకం అంటాడు. వస్తు వ్యామోహం ఉన్నవారికి అన్ని రకాల కొత్త కొత్త వస్తువులని కొని ఉపయోగించటం అలవాటు కాబట్టి దాని కోసం డబ్బు అవసరం. అన్నిటికీ మించి సమాజంలో గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు కూడా డబ్బు తోనే ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ నేపధ్యం లో అందరి జీవితాలు ఇది వరకు ఎన్నడూ లేనంతగా డబ్బుతో పెనవేసుకుపోయాయి. గ్రామాలు సహజం గానే డబ్బు తో తక్కువ అవసరం గల స్వయం పోషకాలుగా ఉంటాయి. నిత్య జీవనానికి అత్యవసరమయిన ఆహర ధాన్యాలు, కూరగాయలు అన్నీ తమ స్వంత భూముల్లోనే పండించుకోవటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇంటి దగ్గర పెంచుకునే పశువుల వల్ల పాలు, పెరుగు, మాంసాహారం లాంటి అవసరాలు కూడా సొంతంగానే తీరిపోతాయి. కానీ నగరాల్లో జేబులో డబ్బు లేకపోతే చిన్న పని కూడా ముందుకి కదిలే అవకాశం లేదు.

                  ఇంతగా మనిషి జీవితం లో భాగమయిపోయిన డబ్బు గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు అంటే అది సాహసంగానే కనిపిస్తుంది గానీ అదే నిజం. ఉదాహరణకి పైన డబ్బు ఎందుకు? అని వేసుకున్న ప్రశ్నకి వచ్చిన సమాధానాలలో ఒక్క చిన్న పిల్లవాడి సమాధానం తప్ప మిగిలినవన్నీ తప్పు సమాధానాలే. అది ఎలాగో తెలుసుకోవాలంటే ముందు మనం మానవ నాగరికతలో డబ్బుకి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకోవాలి. నిజానికి డబ్బు అనేది సంఘం లో మనుషుల గౌరవ మర్యాదలు పెంచటం కోసం సృష్టించబడలేదు. ఉన్న వాడు, లేనివాడు అన్న భేధాలని కల్పించటానికి గానీ, విచ్చలవిడిగా ఖర్చుపెట్టి నలుగురిలో గొప్ప తనాన్ని ప్రదర్శించటం కోసం గానీ డబ్బు కనిపెట్ట బడలేదు. కేవలం ధనవంతులయిన కారణం చేత ఎక్కువ విలువని, గౌరవ మర్యాదలని ఇవ్వటం అనేది కూడా ఒక మూఢ నమ్మకం లాంటిదే. నిజానికి ఈ విధమయిన ఆలోచనల వల్ల ఉన్న వాడు ఎలాగయినా మరింత ఉన్నవాడిగా అవ్వటానికి లేని వాడిని మరింత లేనివాడిగా తయారుచెయ్యటానికి ప్రయత్నిస్తాడు. కేవలం నాలుగు డబ్బులు ఎక్కవగా ఉండటం వల్ల తన పరపతి ఇంకా పెరుగుతుందంటే ఎవరయినా ఇలా చెయ్యటానికే ఇష్టపడతారు. 'రూపాయిని మనం పెంచితే రూపాయి మనలని పెంచుతుంది' అన్న సామెత ఇలాంటి భావాల నుంచి పుట్టిందే.

                  మానవ నాగరికత ప్రాధమిక దశలో ఉన్నప్పుడు అప్పటి అవసరాల కోసం లేదా ఒక మంచి కారణం కోసం సృష్టించబడ్డ ప్రతీదీ తర్వాత తర్వాత భ్రష్టు పట్టించ బడింది. మతం, విద్య, రాజకీయాలు లాంటివి ఇందుకు ఉదాహరణలు. డబ్బు కూడా ఇలాగే మనిషికి ఉపయోగపడే కారణం కోసం కనిపెట్టబడి చివరికి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వస్తువుగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే కేవలం నాలుగు డబ్బులకోసం అన్ని రకాలుగా దిగజారిపోయే స్థాయికి మనిషి డబ్బు విలువని పెంచాడు. నిజానికి డబ్బుకి కేవలం దాని మారకపు విలువ తప్ప మరే విలువా లేదు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో తమ అవసరానికి మించి ఎక్కువ డబ్బు కలిగి ఉండటం అనేది అవమానకరమయిన విషయంగా కూడా పరిగణిస్తారు. మన తో సహా చాలా చోట్ల పరిస్థితులు ఇందుకు విరుధ్ధం. మన దగ్గర నలుగురు మనుషులు కలిస్తే ఎక్కువగా మాట్లాడుకునేది 'ఎక్కువ డబ్బు సంపాదించటం ఎలా?' అని మాత్రమే గానీ 'డబ్బు ఎందుకు ?' అన్న ప్రశ్న ఊహ లోకి కూడా రాదు.

                  ఒక మనిషి తినడానికి ఆహారం దొరక్క చనిపోవటం వేరు, ఆహారం కొనటానికి డబ్బులు లేక ఆకలితో చనిపోవటం వేరు. వైద్యం దొరక్క చనిపోవటం వేరు, వైద్యం చేయించుకోవటానికి డబ్బులు లేక చనిపోవటం వేరు. ఇలాగే ఇంకా బోలెడన్ని చెప్పుకోవచ్చు. ఇదంతా మనిషి చరిత్రలో కేవలం డబ్బు మాత్రమే సృష్టించగలిగిన మారణహోమం. కేవలం చిల్లి గవ్వలతో మొదలయిన డబ్బు ప్రస్థానం చివరికి "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అని కార్ల్ మార్క్స్ అనేటంతగా తన విశ్వ రూపాన్ని పెంచుకుంది. అందుకే 18 వ శతాబ్దానికి చెందిన వేమన కూడా

కులము గల్గువారు, గోత్రంబు కలవారు
విద్య చేత విర్రవీగువారు
పసిడి గల్గువాని బానిస కొడుకులు

అన్నాడు. ఇక్కడ పసిడి లేదా బంగారం అనేది డబ్బు కి మరో రూపమే అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చారిత్రకం గా చూస్తే ఐశ్వర్యానికి మూల కారణమయిన లక్ష్మీ దేవి ప్రస్తావన క్రీస్తు పూర్వానికి చెందిన వేదాలలో మొట్ట మొదటిదయిన రుగ్వేదంలోనే ఉంది.

                  పుట్టి బుధ్ధెరిగిన దగ్గరనుంచీ నేను విన్న మాటలు గానీ గమనించిన సంఘటనలు గానీ ప్రత్యక్షం గానో పరోక్షంగానో ఎక్కువగా డబ్బు కి సంబంధించినవే అయి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. డబ్బు కి సంబంధించిన అన్ని విషయాల గురించీ వివరంగా రాయాలని మొదలు పెట్టాను గానీ చివరికి ఇది పరిశోధించి మరింత భాధ్యతతో రాయవలసిన ఒక పెద్ద పుస్తకంలా కనిపించింది. ముందు ముందు ఈ కింది అధ్యాయాల ద్వారా డబ్బుకి సంబంధించిన మరిన్ని వివరాల గురించి చర్చించుకుందాం.

1. పరిచయం
2. డబ్బు చరిత్ర
3. అర్ధ శాస్త్ర ప్రాధమిక సూత్రాలు
4. మానవుల పై డబ్బు ప్రభావం
5. డబ్బు యొక్క మిధ్యా విలువ
6. ఆర్ధిక అసమానతలకి మూలం
7. డబ్బు ఎలా సంపాదించాలి? ఎంత సంపాదించాలి?
8. డబ్బు యొక్క భవిష్యత్తు స్వరూపం
9. ముగింపు

Sunday, February 18, 2018

అనుభవం


నన్ను మోసం చేసిన వాడు
నా వెనకే ఉన్నాడు.
నేను మోసం చేయబోయేవాడు
నా పక్కనే ఉన్నాడు.

నేను సాయం చేసిన వాడి మొహం
ఇప్పుడు నాకు గుర్తు లేదు.
ఒకప్పుడు నాకు మంచి చేసిన వాడు
ఎక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలీదు.

నేను ప్రేమించిన సముద్రం
నన్ను తనలో కలుపుకోవటానికి
ముందుకొచ్చినప్పుడు
నేను భయపడి పారిపోయాను.

నన్ను ద్వేషించే మనిషితో
దెబ్బలాడి, దెబ్బలాడి
చివరికి నన్ను నేను కోల్పోయాను.

చీకట్లో దేన్నో గుద్దుకుని
పడిపోయినప్పుడు నా నెత్తి మీద
నక్షత్రాలు నవ్వుకోవటం తెలిసినా,
ఏమీ ఎరగనట్టు ముందుకెళ్ళిపోయాను.

అన్నీ అనుకోనివి జరుగుతున్నప్పుడు
కష్టపడి నన్ను నేను
తలకిందులుగా నిలబెట్టుకుంటాను.

నేను ఇదివరకటి మనిషిని
కాదన్న విషయం అప్పుడప్పుడూ
గుర్తుకొచ్చినా, పట్టించుకోవటం
ఎప్పుడో మానేశాను.

.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=16160)

Thursday, November 9, 2017

కుంటి కులాసం ఫిలాసఫీ


                 కుంటి కులాసానిది అసలు మా ఊరే కాదు. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ మనిషి మాత్రం చాలా విచిత్రంగా మాట్లాడేవాడు. అతని మాటలు ఎప్పుడూ కొత్తగానే ఉండేవి. అయినా కుంటి కులాసం ఊరికే అలా మాట్లాడటం లేదని, అతని ఆలోచనా విధానమే అలాంటిదని తర్వాత అర్ధమయ్యింది. వాళ్ళ ఊళ్ళో వానలు లేక దాళ్వా పంటకి కాలవలు వదలక పోతే, కొన్నాళ్ళు పని కోసం మా ఊరొచ్చాడు. 'కుంటి కులాసం' అన్న పేరు కూడా అందరూ పిలిచే పేరే గానీ అసలు పేరు మాత్రం అది కాదని చెప్పాడు. మనుషులందరూ ఒకేలాగ ఆలోచించరన్న విషయం నాకు కుంటి కులాసం తో స్నేహం చేశాకే తెలిసింది. మా ఊళ్ళో జనం కూడా "కుంటి కులాసం గాడు తలకి రోకలి చుట్టగలడు." అని చెప్పుకునే వాళ్ళు. పేరుకి తగ్గట్టు అంత కులాసాగా ఏమీ కనిపించేవాడు కాదు గానీ, కళ్ళు మాత్రం ఎప్పుడూ దేన్నో వెతుకుతున్నట్టుగా ఉండేవి. మనిషిని చూడగానే ఏ సంకోచం లేకుండా వీడితో అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉండేవాడు. అతని చుట్టూ ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. ఎంత గొప్ప పుణ్యాత్ముడికయినా చేసిన తప్పులు గుర్తుకొస్తాయేమో అన్నంత నిజాయితీ అతని కళ్ళల్లో కనిపించేది. 'కుంటి' అనేది కూడా పేరులోనే తప్ప మామూలుగానే నడిచేవాడు. మా ఊళ్ళో పెద్దిరాజు ని చిన్నప్పుడు పదో తరగతి దాకా క్లాసులో అందరికన్నా బాగా పొట్టిగా కనిపిస్తున్నాడని "పొట్టోడ"ని పిలవటం మొదలెట్టాక, ఆ తర్వాత ఇంటర్లో వాడు తాడి చెట్టంత పొడుగైపోయాడు. కొత్తగా మా ఊరొచ్చిన వాళ్ళకి విచిత్రంగా అనిపించవచ్చుగానీ, ఇప్పటికీ మా ఊళ్ళో వాడిని 'పొట్టోడు' అనే పిలుస్తారు. అచ్చం అలాగే 'కుంటి కులాసా'నికి కూడా ఇప్పుడు తనకి సంబంధం లేని పేరు స్థిరపడి పోయిందేమో అని నా అనుమానం. ఒకసారి మాత్రం జీతానికి సుబ్బరాజు గారి గేదెలని కొమ్మర పొలం తోలుకెళ్ళి మేపుతుండగా అప్పటివరకూ చేలో పిల్లిమిసర మేస్తున్న ఎర్ర గేది ఉన్నట్టుండి పోలీసోళ్ళ ఆకుమడి వైపు పరుగెత్తటం మొదలెట్టింది. అప్పుడు దాన్ని ఆపటానికి పరుగెట్టినప్పుడు మాత్రం, అడ్డదిడ్డంగా కుంటుకుంటూ పాము పాకినట్టు మెలికలు తిరుగుతూ పరుగెట్టాడు.

                  ఏదో పొట్ట కూటికోసం మా ఊరొచ్చాడు గానీ, కుంటి కులాసానికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం. ఎప్పుడయినా సంతకెళ్ళినప్పుడు గణపవరం బస్టాండు దగ్గర నించున్నప్పుడు వాళ్ళ ఊరి వైపు వెళ్ళే బస్సు కనిపిస్తే "ఈ బస్సు మా ఊరి వైపే వెళ్తుంది." అనేవాడు. ఒకసారి పుంత గట్టు మీద రేగు చెట్టు పైన వాలిన పిట్టల్ని చూపించి, "అచ్చం ఇలాంటి పిట్టలే మా ఇంటి దగ్గర సీమ చింత చెట్టు మీద కో కొల్లలు గా ఉండేవి. ఈ పిట్టలని చూస్తూ ఆడుకోవటం మా మార్క్స్ గాడికి చాలా ఇష్టం." అన్నాడు. కుంటి కులాసానికి ఒక కొడుకు ఉన్నాడని. వాడి పేరు మార్క్స్ అనీ, ఒక రోజు వాడి పుట్టిన రోజుకి వాళ్ళ అమ్మ "నీకు వీడి వయసు ఉన్నప్పుడు ఒక పసుపు చారల చొక్క ఉండేది. అది వేసుకుంటే నువ్వు చాలా ముద్దుగా ఉండేవాడివి. వీడికీ అలాంటి చొక్కానే తియ్యి" అంటే, వాళ్ళావిడ కొనమన్న ఎర్ర గళ్ళ చొక్కా కాకుండా వాళ్ళమ్మ చెప్పిన పసుపు చారల చొక్కా కొన్నాడని, వాళ్ళావిడకి కోపమొచ్చి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింద"ని చెప్పాడు. "చిన్న చిన్న విషయాలకి కూడా మనుషులు ఎందుకు ద్వేషం పెంచుకుంటారో తెలుసా ? చాలా సార్లు పైకి కనిపించే ఆ చిన్న చిన్న కారణాలు, అసలయిన కారణాలతో వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ రహస్యంగానే ఉండి పోతాయి." అని కూడా చెప్పాడు.

                  పెద్దగా ఏమీ చదువుకోలేదని చెపుతాడు గానీ, కుంటి కులాసం దగ్గర ప్రతిదానికీ కారణం వెతకటానికి ప్రయత్నిచటం అనే ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. మాట్లాడే ప్రతి మాటా ఏదో సిధ్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్టు ఉండేది. ఒక సారి మేమందరం పొలం లో ఆకు తీత పనిలో ఉండగా ఉన్నట్టుండి హొరున వర్షం, వణికించే చలి మొదలయ్యాయి. అందరం పోలీసోళ్ళ చెరువుగట్టు పైకి చేరుకుని చింత చెట్టు కింద వట్టి గడ్డి మంట వేసుకుని చలి కాసుకుంటుంటే చచ్చి పోయిన కొబ్బరి చెట్టు కమ్మలు కొట్టుకెళ్ళటానికొచ్చిన చాకలి తిప్పడు కూడా మంట దగ్గరికొచ్చి కూర్చుంటూ "శని గాడి వాన దరిద్రం లా పట్టుకుందిరా" అని వర్షాన్ని తిట్టుకుంటున్నాడు. అది విన్న నారాయుడు తాత "ఈ వానలు ఉంటేనే మనకి పంటలు పండేది,తిండి దొరికేది." అని మందలించాడు. తిప్పడు మాత్రం "ఏమో తాతా, పొద్దున్నే ఇంత చద్దన్నం తిని మట మట మని మండి పోయే ఎంత ఎండ లోనయిన పని చెయ్యొచ్చు గానీ, చిట పట మని నాలుగు చినుకులు పడితే మాత్రం మహా చిరాకు నాకు." అన్నాడు. "మీ తాత కూడా ఇలాగే వానకి పడి ఏడిసే వాడు. నీకు అన్నీ మీ తాత బుధ్ధులే వచ్చాయి." అన్నాడు నారాయుడు తాత. కుంటి కులాసం దృష్టిలో చాకలి తిప్పడు వర్షాన్ని తిట్టుకోవటం వెనక కారణం లేకపోలేదు. వాళ్ళ వృత్తి లో ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతికి ఆరేశాక ఎండ లేక బట్టలు ఆరక పోతే, అది వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళ జీవితాలు వర్షం తో కన్నా ఎండతో ఎక్కువ పెన వేసుకుని ఉన్నాయి. అందుకే ఎండని ఇష్టపడటం, వర్షాన్ని వ్యతిరేకించటం అనేది తెలియకుండానే చాకలి తిప్పడి నరాల్లో జీర్ణించుకుపోయింది. ఇదేమీ ఇప్పటికిప్పుడు కనిపెట్టిన కొత్త విషయం కాకపోవచ్చు గానీ, ఇంత చిన్న విషయాన్ని కూడా కుంటి కులాసం ప్రపంచం మొత్తానికి అన్వయించి చూసేవాడు. "ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది. ఒకరికి మేలు చేసేది మరొకరికి కీడు చేస్తుంది. మనుషుల మధ్య, దేశాల మధ్య ఘర్షణ కి ఈ వైరుధ్యమే మొదటి కారణం." అన్నాడు. అంతే కాకుండా "గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవటానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కరలేదు. నీ చుట్టూ ఉన్న మనుషులని, పరిస్థితులని లోతుగా అర్ధం చేసుకుంటే మొత్తం ప్రపంచమే అర్ధమవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో జరిగేదే మన ఊళ్ళోనూ జరుగుతుంది. మన ఊళ్ళో జరిగేదే మన రాష్ట్రం లో జరుగుతుంది. రాష్ట్రంలో జరిగేదే దేశం లో జరుగుతుంది. దేశం లో జరిగేదే ప్రపంచం మొత్తం జరుగుతుంది" అని చెప్పేవాడు.

                  కుంటి కులాసంతో పాటు ఎప్పుడూ ఒక కుక్క కూడా ఉండేది. నిజానికి ఆ కుక్క అతను మా ఊరు రావటానికి ముందు కొన్ని రోజులు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు అతనికి అలవాటయ్యింది. ఆ కుక్కకి ఒక కన్ను గుడ్డితో పాటు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేది. దాని ముందు కోమటి కొట్లో కొన్న రొట్టె ముక్కో, జంతిక ముక్కో వేస్తే విచిత్రం గా అది ఆ రొట్టె ముక్క కి వ్యతిరేక దిశలో వాసన చూసుకుంటూ వెళ్ళి చాలా సేపటికి గానీ ఆ రొట్టె ముక్క ని కనిపెట్టలేకపోయేది. "ఈ గుడ్డి కుక్కని ఇంకా నీతో ఉంచుకునే బదులు తరిమెయ్యొచ్చు కదా?" అన్నాను ఒకసారి. "ఈ కుక్క చాలా విషయాల్లో నాకన్నా గొప్పది." అన్నాడు. కుంటి కులాసం దృష్టిలో మనిషి కన్నా జంతువు గొప్పది. జంతువు కన్నా చెట్టు గొప్పది. "ఈ భూమ్మీద ఇంకా బాగు పడవలసిన అవసరం ఉన్న జీవి ఏదయినా ఉందంటే అది మనిషి మాత్రమే" అనేవాడు. ఒకసారి ఆ కుక్క కొన్ని రోజులపాటు ఎక్కడికో మాయమైపోయి మళ్ళీ తిరిగొచ్చింది. మళ్ళీ కుంటి కులాసాన్ని చూసిన ఆనందం తో తోక ఊపుకుంటూ ఆకలితొ ఉన్నానని చెప్పటానికి గుర్తుగా తల పైకెత్తి చూసింది. కుంటి కులాసం దాని ముందు కొంచెం అన్నం వేశాక, ఆబగా తినటం మొదలెట్టింది. సరిగ్గా అప్పుడే నేను గమనించిన విషయం దాని వెనక కాలు తొడ దగ్గర కండ మొత్తం ఊడిపోయి పాలిపోయిన లోపలి మాంసం విచిత్రమయిన ఆకృతులలో కనిపించటం. అది చూసి నా గుండె దడ దడ లాడింది. అయినా అదేమీ తనకి పట్టనట్టు అసలు ఆ కాలు తనది కానట్టు, ఆ కుక్క ఎప్పటిలాగానే ఉల్లాసంగా ఆనందంగా కనిపించటం నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. ఇదే మాట కుంటి కులాసం తో చెప్పాను. "ఈ కుక్క తనని తాను మర్చిపోయి ఈ ప్రకృతి లో మమేకమయినంతగా నువ్వూ నేనూ ఎప్పటికీ కాలేము. అదెప్పుడూ తనని తాను ఈ ప్రకృతిలో భాగమనే అనుకుంటుంది తప్ప వేరుగా ఊహించుకోదు. దాని ముఖం ఎలా ఉందో కూడా దానికి ఎప్పటికీ తెలీదు. మానవ నాగరికతలో మనిషి అద్దం లో ముఖం చూసుకోవటం మొదలుపెట్టిన రోజే ప్రకృతికి దూరం కావటం మొదలయింది." అన్నాడు.

                  ఒకసారి అబ్బులు గాడి పెళ్ళికి అన్నవరం వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న హోటల్ లో భోంచేస్తున్నాం. "ఇక్కడ భోజనం చాల బాగుంది" అన్నాను నేను. "ఈ వంట చేసిన వంట మనిషి చేతులు చాలా అసహ్యం గా ఉండి ఉండాలి, అందుకే వంట ఇంత బాగుంది." అన్నాడు. నిజంగానే ఆ తర్వాత, వంట చేసిన పెద్దావిడ బయటికొచ్చి, ఎన్నో ఏళ్ళుగా పొయ్యి దగ్గర ఇదే పని చెయ్యటం వల్ల నల్లటి మచ్చలు పడి బొటన వేళ్ళు వంకర పోయి ముడతలు పడ్డ చేతులు ఊపుకుంటూ "రామమ్మ గారి దొడ్లో కరివేపాకు చెట్టు రొబ్బలు నాలుగు విరుచుకు రా రా." అని ఎవరినో పురమాయించటం కనిపించింది. భోజనం అయ్యాక వెళ్ళబోతూ, పక్కనే ఉన్న పేపర్లో "వేసవి తాపానికి ఎండలో బొమ్మలు అమ్ముకునే వ్యక్తి మరణం" అన్న వార్త చదివి, "అయినా తెలిసి తెలిసీ అంత ఎండలో వాడిని బయటికి ఎవడు వెళ్ళమన్నాడు?" అన్నాను కోపంగా. "ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు." అన్నాడు.

                  ఆ రోజు కుంటికులాసం చాల సేపు చాలా విషయాలు మాట్లాడాడు. "ప్రపంచ జనాభాలో, పక్కవాడిని మోసం చేసే మనుషుల సంఖ్య కన్నా తమని తాము మోసం చేసుకునే మనుషుల సంఖ్య చాలా ఎక్కువ" అన్నాడు. అంతే గాక "ఈ వేలం వెర్రి మనుషులు డబ్బు కట్టల మధ్య చిక్కుకున్న చెద పురుగులు." అని కూడా అన్నాడు. ఎక్కువగా "మనుషులు" అన్న మాట కాకుండా దాని ముందు "వేలం వెర్రి" అనే విశేషణాన్ని చేర్చి "వేలం వెర్రి మనుషులు" అనే అనేవాడు. డబ్బు అంటే కుంటి కులాసానికి విపరీతమయిన అయిష్టత ఉండేది. "ఈ డబ్బు యావ లో పడి మనం కొత్తగా ఆలోచించటం మర్చిపోయామ" న్నది అతడి ధృఢమయిన అభిప్రాయం. "డబ్బుకి దానికి ఉన్న అసలు విలువతో పాటు, మరో 'మిధ్యా విలువ ' అనేది కూడా ఉందని కుంటి కులాసం సిధ్ధాంతం. "కావాలంటే చూడు. ముక్కూ మొహం తెలియక పోయినా నీకన్న ఎక్కువ డబ్బున్న వాడిని కలుసుకున్నప్పుడు నీ మొహం తప్పకుండా వెలిగిపోతుంది. డబ్బుకి ఉన్న 'మిధ్యా విలువ ' అంటే ఇదే. ఈ వేలం వెర్రి మనుషుల మీద డబ్బుకి ఉన్న ఆ అసలు విలువకన్నా ఈ మిధ్యా విలువ ప్రభావమే ఎక్కువ. ఇలాంటి మిధ్యా విలువలు ఈ ప్రపంచం లో ఇంకా చాలానే ఉన్నాయి." అన్నాడు. "ఎప్పుడూ ఒకేలా ఆలోచించటం మానేసి, నీకు తెలిసిన విషయాలను శీర్షాసనం కూడా వేయించు తమ్ముడు. ఎందుకంటే నీకు తెలిసిన నిజాన్ని తిరగేస్తే వచ్చేది కూడా మళ్ళీ నిజమే." అని చెప్పేవాడు.

                  ఇంకో నెల రోజులలో కుంటి కులాసం, వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడనగా, ఉన్నట్టుండి అతనితో ఉండే కుక్క, చొంగ కార్చుకుంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ పిచ్చి కుక్క ఊళ్ళో ఉంటే చాలా ప్రమాదమని అందరూ భయపడుతుంటే, కుంటి కులాసం ఊళ్ళో ఉండటం మానేసి కుక్కతో సహా, జనం సారాకి అలవాటు పడి కల్లు తాగటం మానేశాక వ్యాపారం లేక ఊరికే వదిలేసిన ఊరి చివరి కాలవ గట్టు మీద కల్లు కోటమ్మ గారి కల్లు పాకలో ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఒక రోజు అదే పాకలో చచ్చిపోయి కనిపించాడు. ఆ కుక్క కూడా మళ్ళీ ఎక్కడికో మాయమైపోయింది. నిజమో కాదో తెలీదు గానీ కుంటి కులాసం చచ్చిపోయిన రెండో రోజు మాత్రం పేపర్లో జిల్లా ఎడిషన్ లో 'పెంచుకుంటున్న పిచ్చి కుక్క కరిచి వ్యక్తి మరణం' అన్న వార్త వచ్చింది. అప్పుడే ఏలూరు నుంచి మా ఊరు చుట్టాల ఇంటికి వచ్చిన కోటేశ్వర్రావు, ప్రెసిడెంటు గారి ఇంటి దగ్గర అరుగు మీద పేపర్లో ఆ వార్త చదివి "అయినా తెలిసి తెలిసీ పిచ్చి కుక్కని ఎవడు పెంచుకోమన్నాడు?" అన్నాడు కోపంగా.

"ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు" అన్నాను వెంటనే.

Thursday, August 3, 2017

నేను



















నేను పుడుతూనే ఆకలికి ఏడుస్తున్నాననుకుంటారు గానీ
ఒక గుప్పెడు నిప్పు కణికలని
గొంతులో నింపుకునే వచ్చాను.

నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాననుకుంటారు గానీ
ఊపిరి గాలికి రెపరెపలాడే
థిక్కారపు దేహ పతాకాన్ని నేను.

నా అడుగులతో ఆకాశాన్ని కొలుస్తాను.
నా జ్ఞాన తృష్ణ కి
అనంత విశ్వాన్ని బలిస్తాను.

పశుత్వానికి దగ్గరగా పుట్టి
దైవత్వానికి దూరంగా విసిరివేయబడ్డ
మాంస ఖండాన్ని.

సిథ్థాంతాన్ని.
సిథ్థాంతాల రాథ్థాంతాన్ని.
రాథ్థాంతాల యుథ్థాన్ని.
యుథ్థానికి, యుథ్థానికి మధ్య
నెలకొన్న తాత్కాలిక శాంతి సౌహార్ద్రాన్ని.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14699)

Sunday, April 30, 2017

ఇక్కడ














ఇక్కడ, బుర్రలకి చిల్లులు పడి
నీరుగారిపోయిన మనుషులు
కిటికీ దగ్గర పావురాల్లా మూలుగుతున్నారు.

ఇక్కడ, ‘ఆత్మ విశ్వాసం’ కోసం
ఆత్మలను అమ్ముకున్న బుధ్ధిమంతులు
నడి వీధిలో ఒళ్ళు విరుచుకుని నించున్నారు.

ఇక్కడ, పగలు చేసిన పాపాలను
రాత్రి కప్పుకుని పడుకుని
ఒక కన్ను తెరిచి నిద్ర పోతున్న రహస్య మానవులు
వెన్నెల రాత్రులను వ్యర్ధం చేస్తున్నారు.

నిజం నడ్డి విరిచి, ప్రపంచానికి
కుంటి నడక నేర్పిన అవకాశవాదుల స్తోత్ర పాఠాలు
ఇక్కడ, నిత్య పారాయణాలు.

లోకమే ఒక బలిపీఠం.
జీవితం, చేయక తప్పని నేరం.
ఇది యుగయుగాల నరమేధం.
అయినా ఇక్కడంతా, నిత్యనూతనం.

బాగున్నదానిని చెడగొట్టటం.
చెడిపోయిన దానిని బాగు చెయ్యటం.
ఇక్కడ, మన కాలక్షేపం.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14090)

Sunday, March 5, 2017

వెంకటేశులుకి దిష్టి తగిలింది


                 అయితే గియితే అప్పట్లో దూరదర్శన్ లో వార్తలు చదివే 'శాంతి స్వరూప్' లాగా నున్నగా తల దువ్వుకుని, ఇస్త్రీ బట్టలేసుకుని, నూనె సుద్దల్లాగా మెరిసిపోతూ బళ్ళోకొచ్చే మారుబోయిన వాళ్ళ ముత్యం గాడికో, మీసాల నారాయణరావు గారి బాలాజీ గాడికో లేకపోతే వాళ్ళ ఊళ్ళో అయిదో తరగతి దాకానే ఉందని ఆరో తరగతిలో మాతో పాటు చదువుకోవటానికి మా ఊరి బళ్ళోకొచ్చే మా పక్క ఊరు వెలగ పల్లి లో ఉండే వెలమ దొరగారోళ్ళ పండు గాడికో దిష్టి తగలాలి గానీ, విచిత్రంగా, ఎప్పుడూ పిర్రల దగ్గర చిరిగిపోయిన నిక్కరేసుకుని మళ్ళీ దాని మీదకి ఆ చిరుగులు కనిపించకుండా మోకాళ్ళ దాకా వచ్చే ఎవరో ఊరుకునే ఇచ్చిన లొడంగం చొక్కా వేసుకుని బళ్ళోకొచ్చే ఈనుప్పుల్లలాగా ఉండే కమతాలోళ్ళ వెంకటేశులుగాడికి దిష్టి తగిలేసింది ఒకసారి. వెంకటేశులుగాడి ఏడుపుగొట్టు దిష్టి కధ గురించి చెప్పుకునే ముందు సరదాకి వాడి చిరుగుల నిక్కరు గురించిన పిట్ట కధ కూడా చెప్పుకుందాం. అప్పట్లో మాలాంటి పిల్లలందరం చిరిగిందో, చిరగలేనిదో, పొడుగయ్యిందో, పొట్టి అయ్యిందో ఏదో ఒక చొక్కా, నిక్కరు వేసుకుని పలకా, కనికీ పట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం గానీ, మా పెద్దోళ్ళయితే వాళ్ళ చిన్నప్పుడు ఒంటి మీద చొక్కా ఏమీ లేకుండానే బడికెళ్ళి పలక కొనుక్కోవటానికి కూడా సౌకర్యం లేక బూడిద మీద పుల్ల ముక్కతో 'అ' 'ఆ' లు దిద్దుకుని చదువు నేర్చుకున్నారని ఆ తర్వాతెప్పుడో వాళ్ళే చెపితే తెలిసింది. ఈ విషయం మా తెలుగు మాస్టారు ఉమామహేశ్వర్రావు గారికి తెలుసో లేదో తెలీదు గానీ, ఆయన మాత్రం పొద్దున్నే మూడో బెల్లు కొట్టాక ప్రార్ధన అయిపోయాక తరగతి గది లోకి వెళుతున్న వెంకటేశులు గాడిని పిలిచి "అలా బుడబుక్కలోడి లాగా వదులు చొక్కా వేలాడేసుకుని తిరగక పోతే నిక్కరు లోపలికి తోసెయ్యొచ్చు కదా? ఇన్ షర్టు చేసుకున్నట్టు ఉంటుంది." అని ఒక ఉచిత సలహా ఇచ్చేవారు. వెంకటేశులు గాడికి మామూలుగానే ఎవరి మాటా కాదనే అలవాటు అస్సలు లేదు కాబట్టి, అలాగే చేసేవాడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం బెల్లు తర్వాత అన్నం తిన్నాక చుట్ట కాల్చుకోవటానికి బయటకొచ్చే మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు అక్కడే ఆడుకుంటున్న వెంకటేశులుగాడిని పిలిచి "పిర్రల దగ్గర నీ నిక్కరు చిరుగుల అందం అందరికీ చూపించకపోతే కనబడకుండా ఆ ఇన్ షర్టు తీసెయ్యొచ్చు కదా ?" అని పాపం ఆయనకి తోచిన మంచి సలహా ఆయనా ఇచ్చేవారు. వెంకటేశులు గాడు కూడా తు.చ తప్పకుండా మళ్ళీ అలాగే చేసేవాడు. ఇంచు మించు రోజూ ఇదే నిర్వాకం జరిగేది వెంకటేశులుగాడికి. ఆ రకంగా బళ్ళో ఏ రోజు చూసినా విచిత్రంగా పొద్దున్న అంతా ఇన్ షర్టు తోనూ మధ్యాహ్నం నుంచీ లొడంగం లాంటి పొడుగు చొక్కాతోనూ కనిపించేవాడు వెంకటేశులు. బాలాజి గాడి లాంటి వాళ్ళకయితే ఇదంతా చూసి వాళ్ళేదో సరాసరి ఆకాశం లోనుంచో, విష్ణుమూర్తి బొడ్డులోనుంచో ఊడిపడ్డట్టు పెద్ద నవ్వులాటగా ఉండేది. ఒక్కోసారయితే ఇలాగ పొద్దున్న ఒక వేషం మధ్యాహ్నం ఒక వేషం వెయ్యలేక నామోషీ గా అనిపించి, 'మనిషికి చావు పుట్టుకలు ఉండటం, ఆ మధ్యలో బతకటానికి డబ్బులు కావలసిరావటం, ఆ ఆర్ధిక స్థాయిని బట్టే మనిషి తన అవసరాలు నెరవేర్చుకోగలగడం' లాంటి పెద్ద పెద్ద విషయాలు అప్పటికి తెలీదు కాబట్టి తనకి సరిపోయే ఒక రెండు జతల మంచి బట్టలు ఎందుకు తీసి ఇవ్వటం లేదా? అని వెంకటేశులు గాడు వాళ్ళ అమ్మా నాన్నలని తెగ తిట్టుకునేవాడు.

                  ఇంక అసలు కధలోకి వెళితే, ఆ రోజు ఆదివారం కాబట్టి బడికి వెళ్ళవలసిన పని ఎలాగూ లేదు. అంతకన్నా సంతోషం కలిగించే విషయం ఆ రోజు మా ఊళ్ళో అందరికన్నా ఎక్కువగా రెండొందల ఎకరాలు ఉన్న సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనాలు. అంతకు ముందు రోజు రాత్రే సుబ్బ రాజు గారి మనుషులు ఇద్దరు ముగ్గురు మా ఊళ్ళో గడప గడపకీ వచ్చి ఇంట్లో అందరూ పెళ్ళి భోజనానికి రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయారు. సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనం అంటే రోజూ తినే అన్నంతో పాటు అన్నానికి ముందు అయిదు రకాలు, తర్వాత అయిదు రకాలు పిండి వంటలు పెడతారు కాబట్టి ఈ మాట తెలిసిన దగ్గర నుంచీ మా పిల్లలందరికీ ఆ సంవత్సరం సంక్రాంతి, దీపావళి లాగానే ఇంకో కొత్త పండగ ఎగస్ట్రాగా వచ్చినట్టు తెగ ఆనందమయిపోయింది. పిల్లలందరం కలిసే పెళ్ళి భోజనానికి వెళ్ళాలని అంతకు ముందే నిర్ణయించేసుకున్నాం కాబట్టి మేము అయిదారుగురుం కలిశాక వెంకటేశులుగాడిని కూడా పిలుచుకుని వెళ్ళటానికి వాళ్ళ ఇంటికెళితే ఇంకా వాళ్ళమ్మ వాడికి వీపు తోమి స్నానం చేయించటం లోనే ఉంది. సరే అని వాళ్ళ ఇంటి ముందే కాసేపు కూర్చున్నాక వాళ్ళమ్మ వాడికి రోజూ బళ్ళోకి వచ్చినప్పుడు వేసే బట్టలు కాకుండా ఇలాగ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేసుకునే కొంచెం మంచి బట్టలు వేసి మాతో పాటు పంపి, ఒక పదడుగులు ముందుకెళ్ళాక ఏదో గుర్తుకొచ్చినట్టు వెంకటేశులు గాడిని కేకపెట్టి పిలిచి "ఒరేయ్ బాబూ పంక్తి లో అందరి ముందూ ఎక్కువగా తినొద్దురా. దిష్టి తగులుతుంది." అని అందరికీ వినిపించేలాగా అరిచి చెపితే, ఏ విషయాన్ని చాటుగా చెప్పాలో ఏ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలో కూడా తెలియని ఆ మహాతల్లి అమాయకత్వానికి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటే, తన తొందరపాటుకి, కొడుక్కి రెండు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని తన నిస్సహాయతకి, సిగ్గుపడి తల వంచుకుని గుడిసె లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అందరూ వాడిని, వాళ్ళ అమ్మని చూసి నవ్వటం గమనించిన వెంకటేశులు కి ఇదంతా పెద్ద అవమానం గా అనిపించి వాళ్ళమ్మని తిట్టుకుంటూనే మొహం వేలాడేసుకుని మాతో పాటు భోజనాలకి బయలుదేరాడు.

                  మేము వెళ్ళేసరికే కుర్చీలు, బల్లలు వేసేసి అన్నీ సిధ్ధంగా ఉన్నాయి. ఇంకా మొదటి పంక్తి కాబట్టి అప్పుడే కుర్చోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే ఎవరో వచ్చి "ముందు పిల్లలకి పెట్టెయ్యండ్రా." అంటే ఇంక ఆలోచించకుండా బిల బిలా అంటూ వెళ్ళి మొదటి వరసలో కూర్చుండిపోయాం. మేము బళ్ళో మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు లెక్కలు చేసుకోవటానికి కొనమన్నారని కొన్న తెల్ల కాగితాల పుస్తకం లో ఉండే తెల్ల కాగితం లాంటి ఒక పెద్ద చుట్ట తెచ్చి మేము కూర్చున్న బల్ల మీద పరచటం కోసం దొర్లించుకుంటూ వెళ్తుంటే మొదటి సారిగా అది చూసిన మా అందరికీ చాలా విచిత్రమయిపోయింది. తరవాత మా ముందు అరిటాకులు వేసుకుంటూ మళ్ళీ అది కదలకుండా వెంటనే ఒక స్టీలు గ్లాసు పెట్టెయ్యటం కూడా చక చకా జరిగిపోయింది. ఆ తర్వాత మా అందరికీ బాగా తెలిసిన సుబ్బరాజు గారి దగ్గర పాలేరు గా చేసే కుంటి కులాసం గాడు గేదెలకి పాలు తీసే పాల తపేలాతో మా గ్లాసుల్లో మంచి నీళ్ళు పోసేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదట గా వేడి వేడి గా రెండేసి బూరెలు, ఆ బూరెల్లోకి నెయ్యి, తర్వాత పూతరేకు, చిక్కని సేమియా పాయసం, పులిహోర వడ్డించారు. వెంకటేశులు గాడయితే వాళ్ళమ్మ చెప్పిన మాట కూడా మర్చిపోయి ఏ మొహమాటం లేకుండా ఇంకో రెండు బూరెలు ఇంకొచెం పులిహోర అడిగి మరీ వేయించుకుని తిన్నాడు. తర్వాత అన్నంలోకి వంకాయ పచ్చడి, పప్పు ఆవకాయ, కొబ్బరి వేసిన దొండకాయ వేపుడు, ములక్కాడ కూర, ఆనపకాయ ముక్కలు వేసిన సాంబారు, అప్పడం, చివరిగా పెరుగు, అందులోకి నంజుకోవటానికి చక్కెరకేళీ అరటి పండు, ఆఖరున కిళ్ళి. కిళ్ళీ గురించి అయితే అప్పటివరకూ వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటుంటే వినటమే గానీ తినటం మాత్రం అదే మొదటిసారి మా అందరికీ. వెంకటేశులుగాడయితే అందరూ చూస్తుండగానే అన్నం రెండు మూడు సార్లయినా వేయించుకున్నాడు.

                  భోజనం అయ్యాక ఇంటికెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే వెంకటేశులు గాడికయితే అడుగు తీసి అడుగు వెయ్యటం కూడా కష్టం అయిపోయింది. ఎండకి ఒళ్ళంతా చెమటలు పట్టి, ఆయాసం ఎక్కువయ్యి మధ్యలో కుక్కల ప్రెసిడెంటు గారి ఇంటి ముందు ఉన్న నిద్ర గన్నేరు చెట్టు కింద కొంచెం సేపు కూర్చుంటే గానీ ఇంటికెళ్ళలేక పోయాడు. ఇంటికెళ్ళాక తల తిరుగుతున్నట్టు అయిపోయి అలాగే పడుకుండి పోయాడు. ఆ రోజు రాత్రి కూడా కడుపులో ఏదో దేవుతున్నట్టు, తిన్నదంతా గొంతులోనే ఉన్నట్టు, వికారంగా ఉన్నట్టు అనిపించి అసలు నిద్ర పొలేక ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే లేచి మొహం కడుక్కుందామని వేప పుల్ల తెంపుకుని నోట్లో పెట్టుకోగానే పెళ్ళి భోజనం లో తిన్నది తిన్నట్టే వాంతి చేసేసుకున్నాడు. దానికి తోడు వెంటనే జ్వరం, విరేచనాలు కూడా మొదలయ్యాయి. ఆ రోజు మంచం పట్టిన వెంకటేశులు గాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యి బళ్ళోకి రావటానికి పది,పదిహేను రోజులయినా పట్టింది. వెంకటేశులుకి దిష్టి తగిలిందని వాళ్ళమ్మ అయితే ముందు రెండు మూడు రోజులూ ఒక రోజు ఉప్పుగన్ను, ఇంకో రోజు నూనె గుడ్డ, మరో రోజు కోడి గుడ్డు దిష్టి తీసి పారేసింది. అయినా బాగవ్వకపోతే ఊళ్ళొ ఆరెంపీ డాక్టరుని పిలిపించి వైద్యం చేయించి మందులు కూడా ఇప్పించింది. తగ్గాక మరో పది రోజుల దాకా తన శక్తికి మించి పథ్యం కూడా పెట్టింది. ఇవన్నీ చెయ్యటానికి డబ్బులు సరిపోక వాళ్ళ అమ్మ, నాన్న కూలి పనులకి వెళ్ళేటప్పుడు చద్దన్నం పట్టుకెళ్ళటానికని కొన్న రెండు స్టీలు టిపినీలు, కోతల రోజుల్లో పనుల్లోకి వెళ్ళటానికి ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న ముప్పర్తిపాడు కొడవలి, వాళ్ళమ్మకి ఉన్న మూడే మూడు చీరల్లో ఒక చీర తీసుకెళ్ళి ఊళ్ళో తాకట్టు వ్యాపారం చేసే కాంతమ్మ గారి దగ్గర తాకట్టు పెట్ట వలసివచ్చింది. తన అనారోగ్యం తగ్గించటానికి వాళ్ళమ్మ ఎంత కష్టపడవలసి వచ్చిందో మొదటి సారిగా కళ్ళారా చూశాడు వెంకటేశులు. తనకి ఏమవుతుందో అని వాళ్ళమ్మ ఎంత భయపడిందో కూడా అర్ధం చేసుకున్నాడు.

                  అంతా అయ్యాక, ఈ దిష్టి గిష్టి ఉన్నయో లేదో ఆ దేవుడికే తెలియాలి కానీ, చచ్చి బతికిన వెంకటేశులుగాడి అనారోగ్యం గురించి అరెంపీ డాక్టరు గారిని మా ఊళ్ళో ఎవరో అడిగితే "ఊరికే వచ్చింది కదా అని అన్నీ ఒకేసారి కలిపి తినేస్తే అర్ధాకలితో ఆరుగు పోయిన పేగులు అరాయించుకోవద్దా?" అని తనకి తెలిసిన విషయం చెప్పాడు. వెంకటేశులు గాడు కూడా ఆ తర్వాత ఎప్పుడు పంక్తి భోజనాలకి వచ్చినా అంతకు ముందులా కాకుండా అప్పుడే పీకలదాక తిని వచ్చిన వాడి లాగా కొంచెమే తిని చెయ్యి కడుక్కుని వచ్చేసేవాడు. అదీగాక 'మనుషులకు రోగాలు, చావుపుట్టుకలు ఉంటాయని. సమాజం లో వివిధ ఆర్ధిక స్థాయిలు కూడా ఉంటాయని. మనిషి ఆర్ధిక స్థాయి ప్రకారమే అతని స్థానం నిర్దేశింపబడుతుందని. ఆ ఆర్ధిక స్థాయి పరిధిలో మాత్రమే తన అవసరాలను పరిమితం చేసుకోవాలని. సమాజ నియమాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణం గానే ఏ మనిషయినా నడుచుకోవాలని' లాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ అప్పటికి మా అబ్రహాం మాస్టారు సోషల్ పాఠం లో ఇంకా చెప్పకుండానే అర్ధం చేసేసుకున్నాడు.