Tuesday, May 21, 2013

'ధర్మ' సందేహం

2012 మే నెల.
మాయన్ లు చెప్పిన యుగాంతానికి ఇంక ఏడు నెలలు ఉందనగా..
ఎండ మండిపోతుంది.
అదీ సాయంత్రం పూట కూడా.
బహుశా నలభై అయిదు డిగ్రీలు ఉంటుందేమో?
ఈ వేడి సాయంత్రం ఒక స్నేహితుడిని కలవటానికి బయలుదేరాను.
ఇక్కడ ఎర్రగడ్డలో బస్సెక్కి కూకట్ పల్లి వెళ్ళాలి.
బస్సు/ఆటో కోసం ఎదురు చూస్తున్నాను.
గొంతు తడారిపోతుంది.
ఇంత వేడి ఈ మధ్య కాలం లో ఎప్పుడూ చూడలేదు.
నిజంగానే దీనంతటికీ కారణం "గ్లోబల్ వార్మింగేనా?"
పొదుపుని, పంచుకోవటాన్ని పక్కన పెట్టేసి Use and Throw ని ప్రోత్సహించి ప్రపంచాన్నే పెద్ద Super Market చేసి కాలుష్యాన్ని పెంచిన అమెరికా నా? చైనానా? అసలు దీనంతటికీ మూల కారణమయిన పారిశ్రామిక విప్లవమా? దానికి కారణమయిన మనిషి కనిపెట్టిన ఆవిరి యంత్రమా? సైన్సా?  నరుక్కునే కొమ్మ మీద కూర్చోవాలని ఎవరూ అనుకోరు కాబట్టి మనిషికి ప్రకృతిని నాశనం చెయ్యటం తప్పనపుడు ఆ ప్రకృతికి దూరంగా జరగటం కూడా అనివార్యం. ముందు ముందు మనుషులు గాలి, నీరు, ఆహారం కూడా అవసరం లేని కృత్రిమ జీవులుగా తమని తాము మార్చేసుకుంటారేమో అన్న భయం కూడా నాలో మొదలయ్యింది. రిచర్డ్ ఫెన్మెన్ చెప్పినట్టు "సైన్స్ అనేది తాళం చెవి లాంటిది. దాంతో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారలూ తెరుచుకుంటాయి."
కానీ నరక ద్వారానికి అయస్కాంత శక్తి కూడా ఉన్నట్టుంది.
నా పక్కన ఒక ముష్టి వాడున్నాడు.
వాడికి కుష్ఠు వ్యాధి కూడా ఉన్నట్టుంది.
ముందు ఒక చిరిగిన గుడ్డ పరుచుకుని కూర్చున్నాడు.
రామాయణ కాలంలో శ్రీ రాముడు పరిపాలించినప్పుడు నెలకి మూడు వానలతో, అతివృష్టి అనావృష్టి రహితంగా, పాడి పంటలతో సుఖ సంతోషాలతో రామరాజ్యం వర్ధిల్లిందని విన్నాను. ఇప్పుడు కూడా అలాంటి శ్రీ రామ రాజ్యం సాకారమవ్వాలని కోరుకుని నేనెప్పుడూ అత్యాశకి పోలేదు కానీ, వాజపేయి ప్రభుత్వం లో జాతీయ రహదారులన్నీ నాలుగు లేన్లు గా అభివృధ్ధి చేస్తునారని తెలిసినప్పుడు, ముందు ముందు భారత దేశం ఆర్ధికంగా అన్ని అగ్ర దేశాలనీ అధిగమిస్తుందని పేపర్లలో చదివినప్పుడు, చంద్రబాబు నాయుడిని బిల్ క్లింటన్ మెచ్చుకున్నప్పుడు, మన ప్రధాని ప్రసంగ పాఠాన్ని ఒబామా చెవులు రిక్కించి వింటూ మన్మోహన్ సింగ్ ని ఆరాధనగా చూసినప్పుడూ పేదరికం లేని, ముష్టి వాళ్ళు లేని దేశాన్ని ముందు ముందు చూడబోతున్నానన్న నమ్మకం పెరుగుతూ వచ్చింది. హరిత విప్లవం గురించి విన్నప్పుడు ఆహార కొరత ఉండదనుకున్నాను కానీ,  మన తాత ముత్తాతలు అతి సాధారణం గా తిన్న సహజమయిన ఆహారాన్ని,  ఇప్పుడు ఖరీదయిన ఆర్గానిక్ ఆహారం గా డబ్బున్నవాళ్ళకే పరిమితం చేసి,  పురుగుమందులు నిండిన తిండిని మనకే ఎక్కువరేటు కి అమ్ముతారనుకోలేదు. శ్వేత విప్లవం గురించి విన్నప్పుడు కనీసం చిన్న పిల్లలకయినా సమృధ్ధిగా పాలు దొరుకుతాయనుకున్నాను కానీ, అందులో అరవై శాతం రసాయనాలు నిండిన కల్తీ పాలే ఉంటాయనుకోలేదు. ఒకప్పటి కన్నా ఇప్పటి హైదరాబాదు లోనే ముష్టి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు.
నాకు దాహం ఎక్కువయ్యింది.
నా పక్కనున్న ముష్టి వాడు ధర్మం కోసం నన్నేమయినా అడుగుతాడేమోనని ఎదురు చూశాను కానీ, ఏమీ అడక్కుండా వాడి లోకం లో వాడున్నాడు. నా లాంటి వాళ్ళు కాకపోతే ఈ ముష్ఠి వాళ్ళ గురించి ఇంకెవరు పట్టించుకోవాలి? మనం లేకపోతే వీళ్ళెలా బతకాలి?  ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ, అలా మనం కట్టిని ట్యాక్సులే రాజకీయనాయకులు కుంభకోణాల్లో కుమ్ముకుంటుంటే నోరు మూసుకుని చూస్తూ కూర్చోవటమే కాకుండా, అదే వార్తల్ని మళ్ళీ నాలుగు రూపాయలు పెట్టి పేపరు కొనుక్కుని మరీ చదువుతున్నాం. అలాంటిది ఈ ముష్టి వాడు అడిగినా, అడగక పోయినా ఒక రెండు రూపాయలు ధర్మం చేయటంలో తప్పులేదనిపించింది. అంతకన్నా ఎక్కువగానే ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఇప్పుడే బయటికి వచ్చిన నాకే ఇంత దాహంగా ఉంటే పాపం ఉదయం నుంచీ ఇక్కడే ఉన్న ఇతనికి ఇంకెంత దాహంగా ఉండాలి. (అదేంటో మనం కష్టాల్లో ఉన్నప్పుడే మనకి అందరి కష్టాలూ గుర్తుకొస్తాయి, లేకపోతే మనలాగే అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లుతున్నారనుకుంటాం. బహుశా ఇది మానవ నైజం అనుకుంట.)
దూరంగా చెరుకు రసం అమ్మేవాడు కనిపిస్తున్నాడు.
ఇంత ఎండలో తాగడానికి ఏమయినా ఇస్తే కాదనే మానవమాత్రుడు ఎవడు ఉంటాడు.? అందుకే ఆ చెరుకురసం వాడి దగ్గరకెళ్ళి, నేనొకటి తాగి, ప్లాస్టిక్ పాత్రలో ఆ ముష్టి వాడి కోసం ఇంకొకటి తీసుకుని అతడికి ఇవ్వటానికి వెళ్తున్నాను. నేను చెయ్యబోయే ఈ చిన్న మంచి పనిని చూసి అక్కడ నా చుట్టూ ఉండే వాళ్ళు నన్ను జాలి దయ పుష్కలంగా ఉన్న ఒక మంచి మనిషిగా గుర్తిస్తారనుకున్నప్పుడు నాకు కలిగే ఆనందాన్ని తలుచుకుని నా మనసు ఇప్పుడే పులకరిస్తోంది. (నేను నిజం గా అంత దయార్ద్ర హృదయుడినే అయితే నేననుకున్న బిచ్చగాళ్ళు లేని భారత దేశం ఇంకా సాకారమవ్వ నందుకు ఈ సమయం లో నేను భాధ పడాలి.)
ఇంక నాలుగయిదు అడుగుల్లో ఆ ముష్టి వాడిని చేరుకోబోతున్నాననగా
వాడు దర్జాగా ఒక బీడీ బయటకి తీసి వెలిగించుకోవటం నా కంటబడింది.
కేవలం వేష భాషలలో తప్ప, ఇప్పటి వరకూ నేను చూసిన ఏ శ్రీమంతుడి లోనూ అంత పరిపూర్ణమయిన రాజసం నాకు కనపడలేదు. మాయన్ లు చెప్పిన యుగాంతం నిజంగా ఇప్పటికిప్పుడే వచ్చినా తనకి వచ్చేదీ, పోయీదీ ఏమీ లేదు అన్నంత నిర్లక్ష్యం అతని కళ్ళల్లో ఉంది.
నా అడుగులు ఒక్కసారిగా అక్కడితో ఆగిపోయాయి.
నేను ఈ పానీయం దానం చేసేటప్పుడు కూడా కృతజ్ఞతకి బదులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, నేను భరించలేను.
ఈ పరిస్థితుల్లో కనుక నేను వాడికి ఈ పానీయం దానం చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గొప్పగా కనిపించటం అటుంచి, రాజు గారికి పరిచర్యలు చేస్తున్న సేవకుడి లాగా కనిపిస్తాను. నన్ను ఒక వెర్రిబాగుల వాడి లాగా అనుకుని నవ్వుకోవచ్చు కూడా.
ఇప్పుడేం చేయాలి?
ఎవరేమనుకుంటే ఏంటి?
మనం చెయ్యాలనుకున్నది చేసెయ్యొచ్చు కదా?
కాని అంతకు మించిన వేరే ఏదో కారణం కోసం నా మనసు వెతుకుతుంది.
ఇప్పుడు ఇది వాడికి ఇవ్వటానికి నా అహం అడ్డొస్తుంది. మన సొంత డబ్బుతో మనం ఎన్ని భోగాలయినా అనుభవించవచ్చు. కానీ వీడు మాత్రం అందరూ దయ తలచి ధర్మం చేసిన డబ్బులతో దర్జాగా బీడీలు కాల్చుకుంటున్నాడు. (ఇప్పుడు నాకు ఒకప్పుడు మా పదో తరగతి సోషల్ మాస్టారు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే "ఈ ప్రపంచంలో మనిషి తినే ప్రతి ముద్ద, మరొకడి దగ్గర లాక్కుని తింటున్నదే" అని.)
ఎవరికి తెలుసు "పుష్పక విమానం" సినిమాలో పి.యల్.నారాయణ లాగ వీడి దగ్గర కూడా వాడి ముందు పరుచుకున్న గుడ్డ కింద బోలెడు డబ్బులున్నాయేమో? ఈ మధ్య నా స్నేహితుడు పంపిన ఒక ఈమెయిల్ లో మహా నగరాల్లో బిచ్చగాళ్ళు చాలా మంది లక్షాధికారులనీ, వాళ్ళ ఆదాయం సాఫ్టువేరు ఇంజినీరు ఆదాయం కన్నా కూడా ఎక్కువే ఉంటుందని లెక్కలతో సహా ఉంది. వీడు కూడా అలాంటివాడేనేమో?
ఇప్పుడేం చెయ్యాలి?
ఇలాంటి అయోమయ పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ నాకు ఎదురు పడలేదు.
చిన్నప్పుడు మూడో తరగతి కాపీ పుస్తకం లో "మానవ సేవే మాధవ సేవ" అని పది సార్లు రాశాను కదా అందుకోసమయినా దానం చెయ్యనా?
పోనీ మొన్న పంతులు గారు కనిపించి "ఇరవై ఒక్క వారాలు ప్రతీ శని వారం బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తే నాకు ఉన్న కష్టాలు పోయి ముందు ముందు బాగా కలిసొస్తుందని" చెప్పారు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది, దాని కోసమయినా దానం చెయ్యనా ?
పోనీ పుణ్యం కోసం?
కాకపోతే స్వర్గం కోసం?
మోక్షం కోసం?
మరో మంచి జన్మ కోసం?
మనశ్శాంతి కోసం?
అయినా ఇలాంటి అయోగ్యుడయిన బిచ్చగాడి కి చేసే దానం వల్ల నేను అనుకున్న ఫలితం సిధ్ధిస్తుందా? లేదా?
ఎంతయినా వాడు రోగిష్టి  బిచ్చగాడు. మన కళ్ళ ముందు ఒక బీడీ కాల్చినంత మాత్రాన మహాపరాధం ఏమీ చెయ్యలేదు కదా?  బహుశా వాడికి జీవితం లో మిగిలిన ఒకేఒక ఆనందం ఈ బీడీనే కావచ్చు. అయితే మాత్రం, వాడొక ముష్టి వాడు.  ఎంత పొగరు కాకపోతే నా లాంటి దాన కర్ణుల ముందు కూడా బిచ్చం అడుక్కోకుండా వాడి పాటికి వాడు బీడీ కాల్చుకుంటూ కూర్చుంటాడు?
ఇది నిజం గానే వాడు చేస్తున్న అధర్మం కాదా ?
దేశం లో ఉన్న ముష్టి వాళ్ళందరూ వీడి లాగానే తయారయితే మన లాంటి వాళ్ళందరూ మనశ్శాంతి గా ఎలా బతకాలి?
అందుకే కార్ల్ మార్క్స్ "బలవంతులు బలహీనుల కోసం ఏం చేసినా ఊరికే చెయ్యర" ని ఊరికే చెప్పలేదనుకుంట.
నేను చేసే ధర్మం వాడిని ఉధ్ధరించటానికా ?
నన్ను నేను ఉధ్ధరించుకోవటానికా?
అసలు ఈ ప్రపంచం లో మనిషికీ, మనిషికీ మధ్య అన్ని అసమానతలూ, అసూయా ద్వేషాలనూ మించిన ఆత్మ సంబంధం ఏదయినా ఉందా? లేదా?
ఉండే ఉంటుంది. బహుశా ఆ నమ్మకం తోనే వాడు అడుక్కుంటూ కూడా బీడీ కాల్చుకోగలుగుతున్నాడేమో? లేదా? దాన ధర్మాల ద్వారా పేరు ప్రఖ్యాతులనీ, పాప ప్రక్షాళననీ, మనశ్శాంతినీ కావాలనుకునే నా లాంటి వాళ్ళు ఎలాగూ వాడిని వెతుక్కుంటూ వస్తారన్న నమ్మకమేమో?
అయినా ఒక ముష్టి వాడికి చేసే ఇంత చిన్న ధర్మం కోసం ఇంతగా ఆలోచించాలా?
ఏమీ ఆశించకుండా ఏమీ చెయ్యలేమా?(ఇది కూడా మానవ నైజమే అనుకుంట)
ఇంతకీ నేను ధర్మం చెయ్యాలా? వద్దా?
అహాన్ని అధిగమించి ఆ అత్మ సంబంధాన్ని నా మనసు ఒప్పుకుంటుందా?లేదా?
అలా ఒప్పుకోలేకపోవటానికి కారణాలేంటి?
అంతా అయోమయంగా ఉంది.
ఏం చెయ్యాలో  ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.

Wednesday, May 15, 2013

చివరి మనుషులు

ఈ మధ్య ఊరెళ్ళి వచ్చాను.
ఆకు పచ్చని పొలాలన్నీ చేపల చెరువులయిపోయాయి.
మంచి నీళ్ళ చెరువేమో మురుగు కాలవయిపోయింది.
రైతులందరూ కూలీలయ్యారు.
కూలీలందరూ మహా నగరానికి వలస వెళ్ళి పోయారు.
చదువుకున్న వాళ్ళందరూ ఇంజినీర్లయిపోయారు.
చదువు లేని వాళ్ళు అప్పు చేసి ఖతరో, కువైటో వెళ్ళి, నానా
కష్టాలూ పడి చేసిన అప్పు తీర్చి
ఇంక పడలేక ఉత్త చేతుల్తో మళ్ళీ ఊరొచ్చేశారు.
కప్పల బెక బెక లూ, గాలి వాటమూ కనిపెట్టి, వాన రాకడ అంచనా వెయ్య గలిగిన రామయ్య తాతకి పక్ష వాతమొచ్చి మూలన పడి,  ప్రాణం పోకడ కోసం ఎదురు చూస్తున్నాడు.
క్యాలండర్ చూడకపోయినా తిధులు, అమావాస్యలు, పౌర్ణమిలు, పండుగలు
చెప్పేసే సూరమ్మ చచ్చి పోయిందని తెలిసింది.
రోజూ ఇంత అన్నం పెడితే చాలు విఠలాచార్యకి కూడా తెలియని కధలన్నీ
ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ గుక్క తిప్పు కోకుండా చెప్పగలిగిన
పళ్ళ వీరన్న కూడా పైకెళ్ళిపోయాడు.
రేపో మాపో అన్నట్టు ఉన్న చాకలి ముసలి మామ్మ
వీధిలో కనిపించి "నువ్వు పుట్టినప్పుడు ఆరునెలలు వచ్చేవరకూ
నేనే నీకు ఒళ్ళు తోమి స్నానం చేయించేదాన్న"ని గుర్తు చేసి మురిసిపోయి,
"ఓ యాభై రూపాయలుంటే ఇవ్వు బాబా నాలుగు లంక పొగాకు
చుట్టపీకలు కొనుక్కుంటా" అని అడిగింది, జేబులో వంద ఉంటే తీసి ఇచ్చేశాను.
ముందు దండం పెట్టి తర్వాత ముద్దు పెట్టుకుంది.
మనిషి దగ్గర చుట్ట కంపు వస్తుంది కానీ మనసు మాత్రం
పుట్టినప్పుడు ఎంత స్వచ్చంగా వుందో ఇప్పుడూ అలాగే ఉన్నట్టనిపించింది.
నారాయుడు తాత అయితే ఆధార్ కార్డు, తెల్ల కార్డు బయటికి తీసుకొచ్చి చూపించి,
"ఇదుంటే చాలు రా మనవడా నెలకి రెండొందల పింఛను, రూపాయికే కిలో బియ్యం
వస్తాయి" అని ప్రపంచం లో ఏ సమస్యకయినా బ్రహ్మాస్త్రం తన దగ్గరే ఉన్నంత ధీమా గా చెప్పాడు.
ఎంత అల్ప సంతోషులు? ఒక బిల్ గేట్స్ గురించి తెలీదు, ఒక ఒబామా గురించి తెలీదు,
యోగా, ధ్యానం, ఐ-ఫోన్, అబధ్ధం ఇవేమీ తెలీదు.
ఇప్పటి వరకూ మనం గ్రైండర్ లు వచ్చాక రుబ్బు రోళ్ళు, పురుగు మందులొచ్చాక పిచ్చుకలు,
జనారణ్యాలు వచ్చాక  పులులే అంతమయిపోతున్నాయనుకున్నాం
కానీ, ఇలాంటి మనుషులు కూడా ముందు ముందు మనం చూద్దామన్నా కనిపించక పోవచ్చు.
వీళ్ళతోపాటే కొన్ని కధలు, మాటలు, పాటలు, కొన్ని భావోద్వేగాలు అంతమైపోతాయి.
మాయన్ లు చెప్పింది యుగాంతం గురించి కాదనుకుంట.
ఇలాంటి "మనుషుల" యుగం అంతం గురించే అనుకుంట.
మనమే తప్పుగా అర్ధం చేసుకున్నాం.
కానీ ఇలాంటి "మనుషుల" ని భర్తీ చేసే మనుషులు మాత్రం మళ్ళీ రారు
పోతే పోనీ, ఏం చేస్తాం ఎంతయినా వేగము = దూరము/కాలం.