Tuesday, December 31, 2013

కాంత'మ్మ' కథ

                                మా ఇంటికి ఐదారిళ్ళవతల గని రాజు గారి పొలాలకి నీళ్ళెల్లే పిల్ల కాలవ పక్కన వుండే కాంతమ్మ వాళ్ళాయన రోజూ పొద్దున్నే ఆకు పచ్చని వరి దుబ్బుల మీద నుంచి పైకొచ్చే ఎర్రటి సూర్యుడి కన్నా ముందే లేచి , ఊరికి ఉత్తరాన వున్న కొమ్మర పొలం పన్లొకెళ్ళిపొయేవాడు. వచ్చేటప్పుడు మాత్రం వస్తూ వస్తూ పొలాల మధ్య పుంత గట్టు మీద  ఉండె కల్లు కోటమ్మ కల్లు పాకలో నాలుగు డొక్కులు కల్లు తాగి , కొత్తపల్లి కాలవ గట్టు మీదుండే వడ్డోళ్ళ చిట్టెమ్మ దగ్గర రెండు కొరమేన్లు తీసుకుని సరిగ్గా సూర్యుడు తాడి చెట్టంత ఎత్తుకి వచ్చే సమయానికి ఇంటికొచ్చి కాంతమ్మకిచ్చి పులుసెట్టమనేవాడు. కాంతమ్మ తాగొచ్చిన మొగుణ్ణి ఊరంతా అదిరిపొయేలాగ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తెచ్చిన రెండు చేపల్నీ ఇంటి ముందు పిల్ల కాలవ లోకి విసిరి కొట్టి "ఇంట్లో ఉప్పు , చింత పండు కొనడానికి దిక్కు లేదు గానీ ఏమీ లేకుండా వండి వడ్డించటానికి నేనేమైనా సతీ సావిత్రిననుకున్నావా" అని మొగుణ్ణి ఎగిరి తన్నినంత పని చేసేది.బళ్ళో నాలుగో తరగతి చదివే కాంతమ్మ కొడుక్కీ వాడి చెల్లెలికీ రోజూ ఇంట్లో ఈ గొడవ మామూలే గానీ, ఓ సారి మాత్రం కాంతమ్మ వాళ్ళాయన మీద కోపం తో కొడుకుతో "మీ నాన్నకి తద్దినం పెడతాను చెరువులోకెళ్ళి తామరాకులు తెంపుకు రారా" అంటే వాడు నిజంగానే తద్దినమంటే అదేదో సుబ్బారాయుడి షష్టికి తీర్ధం లో గుడి దగ్గర పెట్టే పెరుగన్నం లాంటి దద్దోజనమునుకుని మంచినీళ్ళ చెరువులో దిగి తామరాకులు తెంపుకొచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు.

                  కల్లు కోటమ్మ కల్లమ్మటం మానేసి నాటు సారా మొదలెట్టేక, కాంతమ్మ మొగుడు కూడా రోజూ సారా తాగి ఇంటికొస్తా ఉంటే ఓ రోజు ఇద్దరికీ పెద్ద గొడవైపోయి, కాంతమ్మ మొగుడు ఇంట్లోంచి వెళ్ళి పోయి, మళ్ళీ తిరిగి రాలేదు గానీ ఊళ్ళో మాత్రం అందరూ గయ్యాళి కాంతమ్మ మొగుణ్ణి తన్ని తరిమేసిందని చెప్పుకునే వారు. తర్వాత కాంతమ్మ చేతిలో డబ్బుల కోసం ఊళ్ళో వరి పొలాల కోతలు, ఊడుపులప్పుడు శ్రీకాకుళం, విజయనగరం నుంచి పనులు చెయ్యడానికి మేస్త్రి పంజా వెంకటేసులు తీసుకొచ్చే జనాలకి పొద్దున్నే ఇడ్లీలమ్మి, ఆ పనుల్లేనప్పుడు ఇంటెనకాల ఉన్న ఖాళీ స్థలం లో కనకాంబరాలు, సీతమ్మ జడగంటలు, మధ్యాహ్నం మంగమ్మ, ముద్ద బంతి, రేక బంతి, క్రిష్ణ బంతి,మల్లి, జాజి మల్లి లాంటి పూల మొక్కలు పెంచి ఊళ్ళో పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళప్పుడు అమ్ముకుంటూ, పిల్లల్ని ఊరి బళ్ళో బడికి పంపటం మాత్రం మానలేదు. బళ్ళో పిల్లలకి వానా కాలం దొరికే తాటికాయలు తెచ్చి గుజ్జు తీసి వాము, బెల్లం వేసి పూసిన తాటి తాండ్ర ముందు మూడు రోజులూ పిలిచి పంచిపెట్టేసి, తర్వాత నుంచీ మాత్రం డబ్బులిస్తే గాని ఇవ్వనంటే, పిల్లలందరికీ బాగా నచ్చేసి తెగ కొనేసుకునేవాళ్ళు. ఓ సారి అబ్బాయి గారి చేలో ఎలుకల కోసం ఎలుకల మందు కలిపి పెట్టిన వడ్ల గింజలు తిని కాంతమ్మ పెంచే కోళ్ళల్లో ఓ కోడి పడిపోతే, అది చచ్చి పోతే రెండొందలు నష్టమని దాన్ని ఎలాగైనా బతికించాలని కోడి కి మేత తిత్తి దగ్గర కోసి, తిన్న మందంతా బయటికి తీసేస్తే కోడి బతికి పోయింది. అప్పట్నుంచీ ఊళ్ళో ఎవరి కోడి మందు తిన్నా కాంతమ్మ దగ్గరికే తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తే కోడికి ఇరవై రూపాయలు తీసుకొనేది.

     కాంతమ్మ కొడుకు ఇంటర్లో చేరాక కొడుకు చేతికి అంది వచ్చాడు కనుక, ఆసరాగా ఉంటాడని కొమ్మరలో ఉండే "అబద్ధాలు" దగ్గర కొత్తగా కొన్న నల్ల గేది, కాంతమ్మని ఓ సారి కుమ్మెయ్యడానికొస్తే  కింద పడి చెయ్యి బెణికి డాక్టర్ దగ్గరికెళ్ళాక ఎక్సరేలు, స్కానింగులూ తియ్యమంటే, బోలెడు డబ్బు దండగని చేతికి చింతపండు గుజ్జు తో చేసిన పట్టీ వేసుకుని నొప్పి తగ్గించేసుకుంది. పైగా డాక్టరు బలానికి పాలూ, గుడ్లూ తినమంటే "ఇలాంటివన్నీ ఎదిగే వయసు పిల్లలకి పెట్టాలి గానీ, ఈ వయసులో నేను తింటే నాకేమయినా అరుగుతాయా" అని చెప్పేది. పాలమ్మిన డబ్బులు వడ్డీలకిచ్చి , తాకట్టు వ్యాపారం కూడా మొదలెట్టి , ఇంటిముందు వేప చెట్టు మీద వాలే కాకులెత్తుకొచ్చే గిన్నెలూ, సబ్బులూ ,చెంచాలూ కూడా అవసరమున వాళ్ళకి సగం రేటు కి అమ్మేసేది. ఊళ్ళో కొంత మందయితే కాకులకి కాంతమ్మే ట్రయినింగిచ్చిందని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. ఎవరైనా కాంతమ్మ పీనాసితనం గురించి వేళాకోళమాడితే "ఇంటెనకాల చింత మొక్క ఉంది కదా అని రోజూ చింత చిగురు కోసేసుకుని కూరలో వేసుకుంటే కొన్నాళ్ళకే అది చచ్చి ఊరుకుంటుంది, అదే పెద్ద చెట్టయ్యే వరకూ ఓపిగ్గా ఉంటె మనమూ మన ముందు తరాలూ కూడా ఎంత తిన్నా తరగదు, డబ్బు కూడా అంతేరా అబ్బాయ్" అని అక్షరం ముక్క రాక పోయినా పెద్ద "వారెన్ బఫ్ఫెట్" లా మాట్లాడేది.
      
                కాంతమ్మ ఇంటి ముందు గనిరాజు గారి పొలాల్ని, పిల్లలు అమెరికాలో స్థిరపడిపోయారని, ఆయనకి ఒంట్లో బాగోక, వ్యవసాయం చెయ్యలేక, అమ్మేస్తానంటే రెండెకరాలు కొని అందులో ఎకరం కట్నం గా ఇచ్చి కూతురికి ఏలూరులో ఆంధ్రా బ్యాంకు లో క్లర్కు గా పని చేసే మూర్తి గారి రామానికిచ్చి పెళ్ళి చేసి, మిగిలిన ఎకరం కౌలుకిచ్చి ఆ డబ్బుల్తో ఇంకో నాలుగు గేదులు కొని చూసుకుంటూ, కొడుకుని డిగ్రీ దాక చదివించింది. కొడుకు చదువయిపోయి గణపవరం కరంటాఫీసులో ఉద్యోగం వచ్చిన రోజు మాత్రం, ఊరి జనం అందరినీ లారీ కట్టించుకుని దువ్వ దానమ్మ తల్లి గుడికి తీసుకెళ్ళి నాలుగు మేక పోతుల్ని నరికించి అందరికీ భోజనాలు పెట్టిస్తే, ఆ రోజు కాంతమ్మ పేరు ఊరు ఊరంతా మారుమోగిపోయింది. తర్వాత రెండు పోర్షన్ల పెద్ద డాబా కట్టి కొడుక్కి పెళ్ళి చేసి, మనవలు, మనవరాళ్ళూ వచ్చేసరికి  ఇంకో ఎకరం పొలం కొనేసి పిల్లా , పాపా, ఇల్లూ, పొలం, గేదులు,కోళ్ళూ అన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడిపేసేది కాంతమ్మ.

                  చాన్నాళ్ళ తర్వాత కాంతమ్మ కి వయసైపోయి కళ్ళు కనిపించటం మానేసి, డాక్టర్ కి చూపిస్తే కళ్ళల్లో శుక్లాలు వచ్చాయనీ ఆపరషన్ చెయ్యాలనీ చెప్పారు.ఇంకో అయిదారు నెలలు పోతే లయన్స్ క్లబ్బు క్యాంపు లో తణుకులో డబ్బులు తీసుకోకుండా ఊరికినే చేస్తారన్నా వినిపించుకోకుండా కొడుకు మీద దెబ్బలాడి,  భీమవరం లో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళమని మరీ కంటాపరేషను చేయించుకుంది.ఆ రోజు మాత్రం ఊరి జనం "ఒకప్పుడు డబ్బు గురించి అందరికీ బోలెడన్ని పాఠాలు చెప్పిన కాంతమ్మ కి ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి డబ్బంటే లెక్కలేని తనమొచ్చేసిందనీ,  అందుకే తర్వాత ఊరికే చేస్తారన్నా ఇరవై వేలు ఖర్చు పెట్టించి మరీ ఆపరషన్ చేయించుకుంద"ని కొందరు, "జెమిని టి.వి.లో రోజూ ఎనిమిదిన్నరకకొచ్చే "మొగలి రేకులు" సీరియల్ చూడ్డానికే ఆపరేషన్ చేయించుకుంద"ని కొందరూ తెగ చెవులు కొరుక్కున్నారు.

                  ఆ తర్వాత నెల రోజులకి సంక్రాంతి పండక్కి పిల్లలకి సున్నుండలంటే ఇష్టమని ఇంటెనకాల గాడి పొయ్యి మీద పెద్ద మూకుట్లో మినుములు వేయిస్తూ, ఆరిపోతున్న కట్టెలు పైకి ఎగదోస్తుంటే పక్కన కూర్చున్న కొడుకు, పండక్కి ఇంటికొచ్చిన కూతురుతో "అందరూ అనుకుంటున్నట్టు నాకేమీ డబ్బులు ఎక్కువయ్యి కంటాపరేషను చేయించుకోలేదురా, వయసయిపోయి ఎప్పుడు ఏ క్షణం లో పోతానో అని భయమేసి కనీసం చివరి రోజుల్లో అయినా పిల్లల్నీ , మిమ్మల్నీ కళ్ళారా చూసుకుంటూ పోవాలనే తొందరపడి చేయించుకున్నారా అబ్బాయ్" అని చెప్పింది ఎప్పుడూ దేనికీ ఎవరి ముందూ చేయి చాపటం ఎరగని కాంతమ్మ కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ.

Sunday, December 22, 2013

మాయ

".... చివరిగా, నేను విన్నవించుకునేది ఒక్కటే.
నేనెవరో నీకు తెలీదు.
కానీ నీ గురించి నాకు సర్వం తెలుసు.
నువ్వెవరో కూడా నాకు బాగా తెలుసు.
ఈ చరాచర జగత్తులో మాలాంటి అధములు అంతకన్నా అధమమయిన కృత్రిమమయిన బుధ్ధితో సృష్టించుకున్న భాషలో  దేనినయితే 'సౌందర్యం' అనే అతి సామాన్యమయిన శబ్ద ధ్వనితో వ్యక్తీకరిస్తారో అదే నువ్వు.
నేను కళ్ళు తెరవటంతోటే మొదలు పెట్టిన నా అనంతాన్వేషణకు ముగింపు పలికిన అద్భుతానివి నువ్వు.
ఇంత కాలం నా సర్వేంద్రియాలూ ఎదురు చూసింది నీ కోసమే.
ఇన్ని రోజులూ నన్ను పెంచి పోషించిన ఈ జగత్తు ఈ క్షణం నుంచీ నాకు తృణప్రాయం, కాదు కాదు మిధ్య.
నాకు జన్మతః సంక్రమించిన పురుషార్ధ సాధక సాధనని సులభతరం చేసి ముక్తి ప్రసాదించగలిగిన ఏకైక దేవతవి నువ్వు.
జఢ గాడాంధకారబంధురబంధితుడనై, అమావాస్య రాత్రులు మాత్రమే బ్రతికిన నన్ను
బయటికి లాగి నిత్య పౌర్ణములు చూపించిన జాజ్వలిత చలితవి నువ్వు.
నువ్వు లేక ఈ చీకట్లో ఒక మూల కూర్చుని బీడువారిన భూమినీ, దుమ్ము కొట్టుకుపోయిన ఆకాశాన్నీ చూస్తూ నిద్రాహారపానస్నానాదులు మరిచి మకిలమయిన నా ఈ దేహంలో భాగమయిన నా బాహువులని ఆహిరితో అందుకోవటానికి ఇంకెందుకు నీకు సందేహం?
ఓహ్...నీ కోసం ఏం చేయను చెప్పు.
నిన్ను కనుగొన్న మరు క్షణమే నా హృదయాన్ని నీకు ధారాదత్తం చేశాను.
ఇంకా ఏముంది నా దగ్గర?
ధనధాన్యవస్తుకనకవాహనాలు లేవు ఇప్పుడు నా దగ్గర.
నేను నిన్ను బంగారు పంజరంలో పెట్టి బంధించలేను. అది నాకు ఇన్ష్టం లేదు.
నేను నా ప్రేమాధికార ఉన్మత్తతతో నిన్ను గుడ్డిగా నిర్బంధించను.
నీ సహజ సౌకుమారస్వేచ్చాస్వాతంత్ర్యాలని హరించబోవటం లేదు.
ఇక మీదట ఇక్కడ విరిసే పున్నాగ జాజి మందార మల్లి బ్రహ్మకమలాది పుష్పాలకీ, శరద్రాత్రులు విరబూసే ఆకాశ నక్షత్రాలకీ, వీచే చల్లని మలయ మారుతాలకీ, నా వెచ్చని హృదయానికీ నువ్వే అధినాయకివి.
నువ్వు నా కోసం ఒక్క అడుగు ముందుకి వేయటం కోసం ప్రతిఫలంగా నన్ను పాతాళంలోకి పడిపొమ్మన్నా నేను సిధ్ధమే.
ఇంకెందుకు ఆలస్యం? నీ మౌనం తో స్తంభించిపోయిన గాలిని నీ జిహ్వాధర జనిత తరంగాలతో జీవింప జేసి నీ సమ్మతిని తెలియచేయి.
పోనీ నీ జీవన ఉదర పోషణ కోసం సంకోచిస్తున్నావా ?
నిత్యం ఎడతెగక పారే ఏటి ఒడ్డున నిత్య జీవితమయిన వెదురు మొక్కలను ఇల్లుగా మలిచి సిధ్ధం చేసే ఉంచాను.
ఆకలేస్తే రాజహంసలు, రామచిలుకలు మాత్రమే రుచి చూసి వదిలి వెళ్ళిన మధుర ఫలాలు ఏరుకొస్తాను.
నిండుగా ఉన్న తేనెపట్టును ఆశ్రయించిన తేనెటీగలు పౌర్ణమి రోజు తేనె తాగి మత్తులో జోగుతుండగా మిగిలిన మంచి తేనెను సేకరించి నీ కోసం దోసిళ్ళతో తీసుకొస్తాను.
దాహమయితే ఒడ్డున ఉన్న మొగలి, పారిజాత, సంపెంగ వృక్షాలు రాల్చిన పూలు మోసుకొచ్చి సుగంధభరిత పరిమళాలు సంతరించుకున్న తియ్యటి ఏటి నీళ్ళు ఎలాగూ ఉన్నాయి.
మన దాహాపేక్షను పెంచగలిగిన మహత్తు కలిగిన నీళ్ళవి.
నేను అల్పుడినే, దుర్భలుడినే, రధగజతురగపధాతిదళవిలసితరాజ్యాధినేతని కాదు, కానీ సూర్యచంద్రులకు గ్రహణం పట్టిన పూట ఏ అపాయమూ నీ దరి చేరనీయకుండా, నీ నిరీక్షణలో లోతుకి పోయిన నా కంటి గుహల్లో దాచి నిన్ను రక్షించుకుంటాను.
ఇంకా చాలదంటావా ?
నీ వర్ణార్ణవతరంగశోభిత ఖండ కావ్యాలు రాసి మండు వేసవి సోమరి మిట్ట మధ్యాహ్నం గానుగ చెట్టు చల్లటి నీడలో అలసట తెలియకుండా నీకు పాడి వినిపిస్తాను. అంకితమిస్తాను.
నీ సమ్మతి చాలు నాకు. దయచేసి నీ మౌనాన్ని ముగించు."
నా అర్ధింపు ముగిసింది.
నా దేవత తన ముఖ కవళికల్లో ఏ విధమయిన భావమూ పైకి ప్రకటించనీయకుండా నిలుచుంది.
"మౌనం అర్ధాంగీకారం, నాకు తెలుసు నువ్వు నా అభ్యర్ధనను మన్నించావు." అడుగు ముందుకెయ్యబోయాను.
నా దేవత పెదవులు మందార మొగ్గల్లా విచ్చుకున్నాయి.
నా మనసు రంజిల్లింది.
క్షణంలో వెయ్యో వంతులో తన అంగీకార సూచకంగా చిరు నవ్వుతో విచ్చుకున్నాయనే అనుకున్నాను.
కానీ కాదు. "ఛీ, నీచుడా నీకంటూ సాధికారిత లేని బికారివి. భయంతో గానీ, ఆశతో గానీ నన్ను నీ చుట్టూ తిప్పుకోగలిగిన బలం, ఐశ్వర్యం లేని దరిద్రుడివి, నిన్ను ఎలా వరిస్తాననుకున్నావ్ ?" అని పిడుగు పడ్డట్టు గర్జించటానికి.
నేను ఆ మాటలు భరించలేక మోకాళ్ళపై కూల బడిపోయాను.
దానికి వంద రెట్లు క్రోధంతో అగ్ని గుండాల్లా రగులుతున్న ఆమె కళ్ళతో నన్ను కాల్చేస్తూ ధగధ్ధగాయమాన వజ్రవైఢూర్యాది నవరత్నఖచితసువర్ణాభరణావృతమయిన తెల్లకలువలాంటి ఎడమ పాదాన్ని పైకెత్తి, సీతాకోకచిలుకల రెక్కలు తెంపుకొచ్చి రంగుల అద్దకం అద్దిన పొడవయిన ఆమె కాలి గోళ్ళు నా గుండెల్లో దిగబడేలా తన్ని వెళ్ళిపోయింది.
కాల గతిలో రోజులు దొర్లిపోయాయి.
ఒక సూర్య గ్రహణపు చీకటి రోజు ఉన్నట్టుండి నా దేవత మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. నాకు చేరువగా. కానీ దీనంగా.
"ఇప్పుడు నేను కోరుకున్న నాలుగు బంగారు గోడల మధ్య, ఒక ఆజానుబాహుడి సమక్షంలో వెండి పళ్ళెంలో ప్రతి రోజూ పంచభక్ష్య పరమాన్నాలూ భుజిస్తున్నాను. కానీ నాకు అతడి ఐశ్వర్యం మొహం మొత్తింది. అతడి బలం నన్ను భయపెడుతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను." అంది.
నిజం తెలుసుకున్నందుకు నా మనసు ఆనంద కందళితమయ్యింది.
కానీ కొన్నాళ్ళకి
"నీ సోమరి జీవితంలో నాకు ఏ విధమయిన ఉత్సుకతా కనిపించటం లేదు. నేను నా బంగారు పంజరానికే వెళ్తాను."
వెళ్ళిపోయింది.
మళ్ళీ కొన్నాళ్ళకి...
"నాకు అక్కడ ఊపిరాడటం లేదు అందుకే వచ్చాను. ఇక్కడ గాలి బాగుంది."
కొన్నాళ్ళకి...
"ఇక్కడ ఏదో దుర్గంధం. నేను ఉండలేను. వెళ్ళాలి."
మళ్ళీ...
"అక్కడి బంగారు గోడలు చూసి చూసి నాకు కళ్ళు మండుతున్నాయి. ఇక్కడి వెన్నెల కోసం..."
మళ్ళీ...
మళ్ళీ..
ఇలా నా అమాయకపు 'సౌందర్యం' అటూ ఇటూ పరిభ్రమిస్తూనే ఉంది. కానీ ఆమెకి తెలియని రహస్యం. "నిజానికి అక్కడా ఇక్కడా ఉన్నది నేనే. ఇదంతా ఆమె కోసం నా సర్వ శక్తులూ కూడ దీసుకుని నేను కల్పించిన మాయా నాటకం."
నా ముగ్ధ సౌందర్యానికి ఇదేమీ తెలీదు పాపం.
మళ్ళీ వస్తూనే ఉంది.
మళ్ళీ వెళ్తూనే ఉంది.
మళ్ళీ..
మళ్ళీ..
మళ్ళీ..మళ్ళీ..
కానీ ఒక నిశి రాత్రి నా దేవత నా దగ్గరగా వచ్చి "నీ గురించి నాకు సర్వం తెలుసు. నువ్వెవరో కూడా నాకు బాగా తెలుసు. ఇదంతా నీ మాయ అని కూడా తెలుసు. కానీ నాకిష్టమయిన ఈ ఆటని కావాలని నీతో మొదలుపెట్టించింది నేనే" అంది. నా హృదయం మీది గాయపు మచ్చని కొంచెం గర్వంగా, ఇంకా జాలిగా చూస్తూ.
అంటే... ఇంత కాలం నేను... ఆమె మాయలో...!?
ఓహ్...!?
ఇంక ఆ క్షణమే నన్ను తనలో ఐక్యం చేసుకుని నాకు శాశ్వతానందాన్ని ప్రసాదించింది.

Sunday, November 17, 2013

బ్లూమూన్ బిర్యాని

                     పంట కాలవ దగ్గర ఒంటి కాలి మీద నించున్న కొల్లేటి కొంగ, చూసి చూసి చేప పిల్లని పట్టుకుని గుటుక్కున మింగినట్టు జనవరి నెల ఉదయపు చలిని ఉన్నట్టుండి,  పొద్దెక్కిన సూర్యుడు ఆక్రమించుకున్నాడు. మా ఊరికి దగ్గరలో ఉన్న ఏకైక కాలేజీ,  గణపవరం చింతలపాటి మూర్తి రాజు గారి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో,  మేమందరం 'బహు తిక్క శాస్త్రం' అని పిలుచుకొనే 'భౌతిక శాస్త్రం' తరగతిలో మా పాండురంగారావు సారు ఎందుకో గానీ ఆ రోజు పాఠం పక్కన పెట్టి బాతా ఖానీ మొదలెట్టారు. ఐఏయస్, ఐపీయస్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకుండా మెల్లిగా ఏదోలాగ బతికెయ్యటానికి సరిపడా ఒక డిగ్రీ ఉంటే చాలురా అనుకుని ఉసూరుమంటూ క్లాసుకొచ్చే మా లాంటి చాలా మందిని ఆ దిశగా ఉత్సాహ పరచటానికి అప్పుడప్పుడూ ఇలాంటి వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు ఇవ్వటం ఆయనకు మామూలే. ఎవరితోనయినా మొహమాటం లేకుండా మాట్లాడే మా వెనక బెంచీ గుంపులో ఉండే గణేష్ గాడయితే "అలాంటివన్నీ నా లాంటి పీత బుర్రలవాళ్ళ వల్ల ఏమవుతుంది సార్" అన్నాడు. దానికి సమాధానంగా "కరెంటు,  ఇంకా బోలెడు కనిపెట్టిన ఎడిసన్ తన ఇంట్లో ఉండే ఒక పెద్ద పిల్లి, ఇంకో చిన్న పిల్లీ అటూ ఇటూ తిరుగుతుంటే అస్తమానూ వాటికోసం తలుపు తీసి , వెయ్య వలసి వస్తుందని తలుపు కింద ఒక పెద్ద కన్నం, ఒక చిన్న కన్నం చేయించాడంట. అంత గొప్ప ఎడిసనే తెలివి తక్కువగా ఆలోచించగా లేనిది మనం ఎంత. అందుకే మన ప్రయత్నం మాత్రం మనం ఎప్పుడూమానకూడదురా గన్నయ్యా" అన్నారు మాష్టారు. ఆయన ఉదాహరణల పారాయణం కొనసాగుతుండగానే క్లాసు అయిపోయింది. తర్వాత తెలుగు క్లాసు. తెలుగంటే చాలా సులువయిన సబ్జక్ట్,  పరీక్షకి ముందు రోజు కూర్చుని చదివినా పాసై పోవచ్చని అప్పటికే మా సీనియర్లు ఉచిత సలహా కూడా ఇవ్వటంతో తరచూ ఆ క్లాసు గైర్హాజరవ్వటం మాకు పొరపాటున అలవాటయిపోయింది. ఆ రోజు కూడా క్లాసు ఎగ్గొట్టి కాలేజీకి దూరంగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని మా స్నేహితుడు నర్సిపూడి వెంకటరెడ్డి గాడు చెప్పే జోకులు వింటూ నవ్వుకుంటున్నాం. ఇంతలో దగ్గరలో ఉన్న రెండంతస్తుల డాబాలోనుంచి మంచి కోడి బిర్యానీ వాసన ఎగురుకుంటూ వచ్చి మా అందరినీ దాటుకుని ఎటో వెళ్ళిపోయింది. ఆ వాసన తగిలాక మా గణేష్ గాడు "నటరాజు థియేటర్ సెంటర్లో భీమవరం రాజులు కొత్తగా పెట్టిన బ్లూమూన్ హోటల్లో కోడి బిర్యాని కుమ్మేసిందని అందరూ అంటున్నారు. రేపు ఒకసారెళ్ళి సుబ్బరంగా తినేసి రావాలి రా" అన్నాడు. వెంకటరెడ్డి గాడి జోకులతో పాటు వీడి బిర్యాని ఆత్రం కూడా మా అందరికీ తెగ నవ్వు తెప్పించింది.

               ఆ తర్వాత రోజు ఎంఏ ఫిలాసఫీ కూడా చదివేసిన మా గోపాలం సారు,  ఇంగ్లీషు క్లాసులో సీరియస్ గా షేక్స్పియర్ గురించో, వాల్టెయిర్ గురించో, స్పినోజా గురించో కాకుండా ముల్లా నసీరుద్దీన్ హాస్యం గురించి మాట్లాడుతుంటే సైకిల్ తొక్కీ, తొక్కీ చెమటతో పాటు వచ్చి క్లాసులో కూర్చున్న మా ఒళ్ళంతా నవ్వులతో తడిసిపోయింది. క్లాసు అయిపోయి బయటికి వచ్చాక గణేష్ గాడి మొహం మాత్రం తెగులు తగిలిన కొబ్బరి మట్ట లాగా వాడిపోయి ఉంది. వాడి మొహం చూశాక నిన్న బిర్యానీ వాసనలకి సంబంధించిన రసాయనాలు వాడి బుర్రలో ఇంకా ఇంకిపోలేదని అర్ధమయ్యింది. అయినా వాడి అత్యాశ కానీ,  అత్యవసరంగా మా డొక్కు సైకిళ్ళు పంక్చర్ అయితే ఉండాల్సిన మూడు నాలుగు రూపాయలు తప్ప,  ఇప్పటికిప్పుడు బ్లూమూన్ లో దర్జాగా కూర్చుని బిర్యానీ తినాలంటే కావలసిన డబ్బులు మమ్మలనందరినీ కలిపి ఈడ్చి తన్నినా దొరకవు. గణేష్ గాడికయితే అరిగిపోయిన బ్రేకు ముక్కలు పీకి కొత్తవి వెయ్యమంటే సైకిల్ కొట్టు సూరయ్య పది రూపాయలు అడుగుతాడని,  బ్రేకులు కూడా లేకుండా ఎంత స్పీడుగా వెళ్ళే సైకిలయినా కాలికి ఉన్న హవాయి చెప్పులతోనే నేల మీద గట్టిగా నొక్కి పెట్టి మరీ ఆపేయటం అలవాటు. డబ్బులు బాగా అవసరమయిన ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ,  'తొలిప్రేమ' లాంటి సినిమాలొచ్చినప్పుడు కనీసం నేల టిక్కెట్టు డబ్బుల కోసమూ,  గట్టిగా గోకితే మెలికలు తిరిగిపోయి కాస్తో, కూస్తో డబ్బులు ఖర్చు పెట్టే పాతిక ఎకరాలకి ఏకైక వారసుడు పిప్పర శీను గాడు ఆ మధ్యన ఆకతాయిగాళ్ళతో కలిసి పేకాటాకి అలవాటు పడ్డాక,  పేకాటలో డబ్బులు తగలెయ్యకురా అంటే "డబ్బులదేముంది రా కుక్కని కొడితే రాలతాయని" అనేవాడు. కానీ తర్వాత వాడి పేకాట ప్రావీణ్యం గురించీ, డబ్బులు అప్పులిచ్చి ఎగ్గొట్టించుకోవటంలో చెయ్యి తిరిగిన నైపుణ్యం గురించీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి చదువూ, గిదువూ, కాలేజీ ,గీలేజీ ఏమీ వద్దు ఇంట్లో కూర్చో అంటే కోపగించుకుని దూళ్ళ పాకలో అటక మీద ఉన్న మోనోక్రోటోఫాస్,  చేలో పురుగులకి కూడా ఉంచకుండా సగం పైనే తాగేశాక తణుకు పెద్ద ఆసుపత్రి లో చేర్పిస్తే,  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కాబట్టి గణేష్ గాడి బిర్యానీ కోరిక తీరే దారులన్నీ ప్రస్తుతానికి మూసుకుపోయాయి. ఈ లోగా పరీక్షల హడావుడి మొదలై వేసవికాలం శెలవులు కూడా వచ్చేశాయి.

                          శెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన గణేష్ గాడు చాలా హుషారుగా ఉన్నాడు. వాడి బిర్యానీ కోరిక తీరే రోజు రానే వచ్చిందని మాకు అర్ధమయ్యింది. మా గుంపులో "వీడు చాలా ముదురు" అని అందరూ చెప్పుకునే రాజేష్ గాడయితే "డబ్బులు ఎక్కడ కొట్టుకొచ్చావురా?" అని తిన్నగా విషయం అడిగేస్తే, తన దగ్గర బిర్యానీకి సరిపడా డబ్బులు ఉన్నాయని చెప్పకుండానే మా అందరికీ ఎలా తెలిసిందా అని గణేష్ గాడు ముందు కంగారు పడ్డాడు గానీ,  తర్వాత, వాడి బిర్యానీ ఆత్రం వల్ల దానికి సంబంధించి ఏ విధమయిన భావమూ వాడి మొహం దాచలేకపోతుందని వాడికి వాడే అర్ధం చేసేసుకుని  "శెలవుల్లో మినప చేల కోతలకి పనిలోకెళ్ళి సంపాదించిన డబ్బుల్లో మా నాన్నకి ఇచ్చెయ్యగా మిగిలిన డబ్బులు నలభై రూపాయలు ఉన్నాయి. ఈ రోజు ఎలాగయినా బ్లూమూన్ ని దున్నెయ్యాలి" అన్నాడు. అనుకున్నట్టే ఆ రోజు మధ్యాహ్నం క్లాసు అయిపోగానే భోజన విరామం సమయానికి గణేష్ గాడు సైకిలెక్కి ఒక్క తొక్కు తొక్కితే దెబ్బకి అది వెళ్ళి నటరాజు థియేటర్ సెంటర్లో ఆగింది. కానీ  అక్కడ ఉండాల్సిన బ్లూమూన్ హోటల్ మాయమైపోయి హోటల్ మూసేసి తాళాలేసి ఉన్నాయి. కంగారు పడ్డ గణేష్ గాడు పక్కన ఉన్న వెంకటరత్నం గారి స్వీటు కొట్లో ఆరా తీయగా "మొన్న సంక్రాంతికి జరిగిన కోడి పందాల్లో ఆ హోటల్ యజమాని బాగా డబ్బులు పోగొట్టుకుని ఇంక హోటల్ నడపలేక నిన్న కాక మొన్న హోటల్ ఎత్తేసారని" చెప్పారు. ఉస్సూరుమంటూ మళ్ళీ కాలేజీకొచ్చిన గణేష్ గాడు చివరి పీరియడ్ లో ఐహెచ్ సీ క్లాసులో రామాచారి గారు అన్ని రకాల భారతీయ తత్వ శాస్త్ర సిధ్ధాంతాల గురించీ చెపుతూ చివరిగా "యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కుత్వా ఘృతం పైవేత్. భస్మీ భూతస్య దేహస్య. పునరాగమనం క్రుతా" అని చార్వాకుల తత్వ సూత్రం గురించి కూడా చెపుతూ "అప్పు చేసి అయినా మనకి ఇష్టమయిన నెయ్యితోనే భోజనం చెయ్యాలి. ఎందుకంటే ఆ తర్వాత చనిపోయాక కాలిపోయే ఈ దేహం మళ్ళీ అనుభవిద్దామన్నా తిరిగిరాదు" అని విడమర్చి అర్ధం కూడా చెప్పారు. ఇది విన్న గణేష్ గాడికి అప్పు చెయ్యాల్సిన అవసరం లేక పోయినా తన బిర్యానీ కోరిక తీరనందుకు మనసులో బాధ ఎక్కువైపోయి క్లాసు అయిపోగానే విచారంగా ఇంటికెళ్ళిపోయాడు.

                                మరుపు మానవ సహజం కాబట్టి,  కొన్నాళ్ళకి ఇంక రెండు మూడు రోజుల్లో గణేష్ గాడి బుర్రలోంచి బిర్యానీ కి సంబంధించిన ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుపోయి దాని గురించి మర్చిపోతాడనగా ఒక రోజు సరిపల్లె నుంచి రోజూ  నటరాజు సెంటర్ లోంచే కాలేజీకి వచ్చే అన్నవరం, కాలేజీలో అడుగు పెట్టగానే గణేష్ గాడిని వెతుక్కుని మరీ వెళ్ళి "బ్లూమూన్ హోటల్ మళ్ళీ తెరిచినట్టున్నార్రా"  అని ఉప్పందించాడు.  హోటల్ మళ్ళీ తెరవటం నిజమే కానీ, అదృష్టం ఆలస్యంగా వచ్చినా  దురదృష్టమే అన్నట్టు,  అంతకు రెండు రోజుల ముందే గణేష్ గాడి సైకిల్ ఒకటి కాదు రెండు పంక్చర్లయితే,  పనిలో పనిగా పంక్చర్లతో పాటు డబ్బులు ఊరికే పడున్నాయి కదా అని కొత్త బ్రేకులు కూడా వేయించేసి ఉన్న డబ్బుల్లో ఇరవై రూపాయలు అవగొట్టేశాడు. అయినా మిగిలిన ఇరవై రూపాయలతో సగం బిర్యానీ అయినా వస్తుంది కదా అని బ్లూమూన్ కెళ్ళి కౌంటర్ టేబుల్ మీద ఇరవై రూపాయలూ పెట్టి హాఫ్ బిర్యానీ అనగానే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టు హోటల్ యజమాని కోడి పందాల్లో పోగొట్టుకున్న డబ్బులు కోడి బిర్యానీ తో రాబట్టుకోవాలనూకున్నాడో ఏమో "రేట్లు పెరిగాయి ఇప్పుడు హాఫ్ పాతిక,  ఫుల్ యాభై" అన్న మాటలతోపాటు "దేర్ ఈజ్ నో సిన్సియర్ లవ్ దేన్ ది లవ్ ఆఫ్ ఫుడ్" అన్న బెర్నార్డ్ షా కొటేషన్ రాసి ఉన్న మెను కార్డు గణేష్ గాడి మొహం మీద కొడితే,  ఇరవై రూపాయలూ జేబులో పెట్టేసుకుని కొటేషన్ మాత్రం చదివి నీరుగారిపోయి ఇంటికెళ్ళిపోయాడు. ఆతర్వాత రెండు రోజులకి వాడి నాయనమ్మ కడుపులో మంట అని గొణుగుతుందని ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టరు రవి కుమార్ కి చూపిస్తే రోజూ మాదీఫల రసం తాగితే తగ్గుతుందంటే ముసలి దాని బాధ పడలేక ఉన్న ఇరైవై రూపాయలతో ఆ మందు కొని ఇచ్చేశాడు. ఇంకా కొన్నాళ్ళకి ఒక సారి రోడ్డు మీద కొత్త వంద రూపాయల నోటు ఎవరో పాడేసుకుంటే గణేష్ గాడికి దొరగ్గానే చార్వాకుల తత్వ సిధ్ధాంతం గుర్తొచ్చి ఆ డబ్బులతో బిర్యానీ తినేద్దామనుకున్నాడు గానీ,  చిన్నప్పుడు మాష్టార్ల బలవంతం మీద అందరూ చందాలు వేసుకుని బళ్ళో వేయించుకుని 'బాలరాజు కథ' సినిమా చూసిన రొజే  ఆ సినిమాలో పిల్ల హీరో లాగానే ఎప్పుడూ నిజాయితీ గానే ఉండాలనీ , కష్ట పడకుండా వచ్చిన సొమ్ము ముట్టుకోకూడదని నిర్ణయించేసుకున్నాడు కాబట్టీ, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక గణేష్ గాడు కూడా వాడి మాట వాడే వినడు కాబట్టీ,  ఆ వంద రూపాయలూ వంతెన కింద కాలవ గట్టు మీద ఉన్న వినాయకుడి గుడి హుండీలో వేసేసి దండం పెట్టుకుని వచ్చేశాడు.

                                              మళ్ళీ డిసెంబరు నెల కూడా వచ్చేసింది. మేమయితే అందరం గణేష్ గాడి బిర్యానీ గురించి  ఎప్పుడో మర్చిపోయాం. కానీ ఉన్నట్టుండి ఒక రోజు వాడి మొహం రాబోయే సంవత్సరం జనవరి ఒకటికి మా ఊళ్ళో చిన్నారావు గారి ఇంటికి వార్తాపత్రిక తో పాటు వచ్చే కొత్త క్యాలెండర్ లాగా కళ కళ లాడిపోతుంది. మేమెవ్వరం అడక్కుండానే వాడే మా దగ్గరికొచ్చి "మొన్న శెలవు రోజు అబ్బాయి గారి దొడ్లో క్రికెట్ ఆడుకుంటుంటే బుల్లియ్య గారి చేలో ఎలకలు పట్టడానికి వెళ్తున్న రత్తయ్య పిలిచి, మనుషుల్లేరు పనికి సాయం చెయ్యమంటే వెళితే ముప్ప్పై ఎలుకలు దొరికాయి. అందులో ఎలుకకి ఐదు రూపాయల చొప్పున నాకూ ఒక పాతిక రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో బ్లూమూన్ లో బిర్యానీ తినేశాను" అన్నాడు. వాడి ఆనందం చూసి తిరిగి ఏదో ఒకటి అడగక పోతే బాగోదని "బ్లూమూన్ లో బిర్యానీ బాగుందా?" అని అడగ్గానే "తీరిగ్గా కూర్చుని బాగుందో బాలేదో రుచి చూసేంత ఎక్కడ ఉందక్కడ ? సగం బిర్యానీ అంటే వాడు ఇచ్చే రెండు ముక్కలు, గుప్పెడు బిర్యానీ అన్నం, వేడి వేడి గా ఇలా నోట్లో వేసుకోగానే అలా కడుపులోకెళ్ళిపోయింది." అని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు మొహం పెట్టి "ఇంకోసారి మనసారా ఫుల్ బిర్యానీ తినాలిరా" అన్నాడు. కధ మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ఫుల్ బిర్యాని కోసం. అనవసరంగా అడిగి గుర్తు చేశామని మేమందరం తలలు పట్టుకున్నాం గానీ, ఈసారి వాడి దూకుడు చూశాక మాత్రం,  బిర్యానీ కోసం ఐఏయస్ అయినా అవలీలగా చదివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపించింది. ఎందుకంటే ఇన్నాళ్ళూ వాడి కళ్ళల్లో కోరిక మాత్రమే కనిపించింది గానీ, ఆ రోజు నుంచీ పట్టుదల కూడా కనిపించటం మొదలయింది.

Monday, October 28, 2013

వడ్డీల బుజ్జిగాడు

             ఇప్పటికిప్పుడు మీలో ఎవరికయినా బస్సు దొరికితే పట్టుకుని వెళ్ళి మా ఊళ్ళో  దిగి,  "మంచినీళ్ళ చెరువు ఎక్కడ ?" అని అడిగితే ఎవరయినా చెపుతారు. చెరువుదగ్గరికెళ్ళాక మాలపల్లి రేవు కూడా దాటి ముందుకెళ్తే కుడి పక్కన బ్రాహ్మల అబ్బాయి గారి రేవు, ఎడం పక్కన వాళ్ళదే రేపో మాపో పడిపోవటానికి సిధ్ధంగా ఉన్న పాతకాలం నాటి పెద్ద మండువా లోగిలి పెంకుటిల్లూ కనిపిస్తాయి. అవి కూడా దాటుకుని వెళ్ళాక కొత్తగా కట్టిన పెద్ద డాబాలో ఉండే బుజ్జి గాడిని పొరపాటున పలకరిస్తే "హై హై నాయకా" సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా బూతులు కలిపేసిన తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. ఇప్పుడంటే ఇలా ఉన్నాడు గానీ చిన్నప్పుడు వీడు చాలా బుధ్ధిమంతుడని ఊళ్ళో ఎవరినడిగినా అనుమానం లేకుండా చెపుతారు. చిన్నప్పుడు ఒకరోజు, పగిలిపోయిన పలక ముక్క పట్టుకుని నాతోపాటే ఒకటో తరగతిలో నా పక్కనే కూర్చుని "క్ష" గుణింతం దిద్దుతుండగా, ఖమ్మం దగ్గర అశ్వారావుపేట దగ్గర దొంగ సారా కాసేచోట కాపలా పనికి వెళ్ళి ఉండిపోయిన వాళ్ళ నాన్న, ఆ వచ్చిన డబ్బులు ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపకపోగా, అక్కడే ఎవరినో రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడని తెలిసి మనసులో బాధ పెట్టుకుని బుజ్జిగాడి వాళ్ళమ్మ కొమ్మర పొలం రాజుల చెరువులో దూకి చచ్చిపోయిందని వాడికి పెద్దమ్మ వరసయ్యే కాలవ కాడ సత్తెమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చి చెబితే, ఆ పలక ముక్క అక్కడే పడేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకెప్పుడూ బళ్ళోకి రాలేదు. ఇంకా వీడి చిన్నప్పటి విశేషాలు కూడా కావాలంటే, ఆ నీళ్ళ చెరువు రేవు దగ్గరే తొగర చెట్టుకి ఆనుకుని వున్న చుట్టు గుడిసెలో ఉండే సూరయ్య ని అడిగితే "బుజ్జి గాడి చిన్నతనం లో శ్రీరామనవమి, కప్పాలమ్మ జాతర లాంటి పండుగ రోజుల్లో గుడి దగ్గర బుల్లియ్య గారి మైకు సెట్టులోంచి వచ్చే పాటలన్నీ విన్నది విన్నట్టు గుర్తుంచుకుని, కృష్ణాష్టమి ఇంక నాలుగు రోజులుందనగా, పది మంది పిల్లల్ని కూడగట్టుకుని వేప కొమ్మల చిడతలతో తాళమేసుకుంటూ ఆ పాటలన్నీ పాడుకుంటూ ఇంటింటికీ తిరిగి డబ్బులు పోగు చేసి పెరుగు పిడతలో వేసి ఇస్తే తప్ప కృష్ణాష్టమి రోజు ఊరి జనమంతా ఉట్టి కొట్టేవారు కాద" ని చెపుతాడు.  

         మరి ఒకప్పుడు అంత నెమ్మదస్తుడూ, బుధ్ధిమంతుడు అయిన బుజ్జిగాడు ఇప్పుడు ఇంత కఠినం గా ఎలా మారిపోయాడా అని మీకు అనుమానమొచ్చిందా ? అయితే పైపులొదిలే రవణయ్యకి కాలు బెణికి నీళ్ళొదలటం ఆలస్యమయిపోయిందని, గబగబా బిందె పట్టుకుని ఆ రేవు దగ్గరకొచ్చిన బుజ్జి గాడి వాళ్ళ మేనత్తని ఇదే మాట అడిగి చూడండి. "చిన్నప్పుడంటే ఏదో మాట వరసకి అబధ్ధాలాడకూడదు, ఎప్పుడూ శాంతం గానే ఉండాలని చెపుతాం గానీ, పెద్దయ్యాక కూడా ఇవన్నీ పాటిస్తూ కూర్చుంటే ఈ రోజుల్లో బతగ్గలమా? అయినా మా వాడు చేసే వడ్డీ వ్యాపారానికి ఆ మాత్రం కరుగ్గా లేకపోతే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తారా ఎవరన్నా?" అని బుజ్జి గాడిని వెనకేసుకొచ్చి మాట్లాడి మరీ నీళ్ళ బిందె పట్టుకుని గబగబా వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ పోయిన కొన్నాళ్ళకి వానా కాలం రోజుల్లో ఒకసారి ఆకాశంలో బ్రహ్మ రాక్షసుడుకి ఆకలేసి అరుస్తున్నట్టు పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడుతుంటే, అందరికీ భయమేసి ఇళ్ళల్లోకెళ్ళిపోయి తలుపులేసేసుకున్నారు. బుజ్జిగాడు మాత్రం నాలుగు గేదెలూ, మూడు ఆవులు ఉన్న గనిరాజు గారి గేదుల పాక దగ్గర కానుగ చెట్టు కింద గాలి వానకి రాలిపోయిన కానుగు పూలు వాన నీటిలో కొట్టుకుపోతుంటే, వాటి మధ్యన నుంచుని ఎదురుగా ఉన్న పేడ గుట్ట వైపు అదే లోకం చూస్తూ ఎంతసేపటికీ అక్కడే ఉన్నాడు. ఈ చిత్రం చూసిన బుజ్జి గాడి మేనత్త ఖాళీ యూరియా సంచిని వాన కోటు లాగ నెత్తి మీద వేసుకుని వచ్చి వాడిని ఇంటి గుమ్మం అరుగు మీదకి లాక్కెళ్ళి పోతే "పేడ గుట్ట మీద పిడుగు పడితే ఆ పేడ గుట్ట అంతా బంగారం అయిపోతుందని మా అమ్మ చెప్పింద"ని చెప్పాడు. ఈ వయసులోనే వీడికి ఇంత డబ్బు యావ ఉంటే ఇంక పెద్ద వాడయితే ఏమవుతాడో అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. 

                 
                 బుజ్జిగాడి గురించి ఇంకా నన్ను కూడా అడిగితే ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం మా ఇద్దరి మధ్యా జరిగిన చాలా సంఘటనలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. ఒక రోజు ఉన్నట్టుండి పెద్దబాలశిక్ష కొనుక్కుని నా దగ్గరకొచ్చి మళ్ళీ చదువుకుంటా చదువు చెప్పమన్నాడు. ఇప్పటికిప్పుడు ఈ బుధ్ధి ఎందుకు పుట్టిందా అన్ని అడిగితే "డబ్బు సంపాదించాలంటే చదువుండాలంట కదా" అన్నాడు అమాయకంగా. సరే అని ముందు లెక్కలు మొదలెడితే నాలుగు రోజులు బాగానే విన్నాడు కానీ తర్వాత ఒక రోజు తీసివేతలు చెప్పేటప్పుడు "చిన్న అంకెలోంచి పెద్ద అంకె తియ్యలేం కాబట్టి పక్కనున్న అంకె నుంచి అప్పు తెచ్చుకోవాలని" చెపితే "మనుషుల దగ్గరయితే అప్పు తెచ్చుకోవచ్చు గానీ అంకెల దగ్గర అప్పు ఎలా తెచ్చుకుంటామని" ఎదురు ప్రశ్నలు వేసి నోటి లెక్కలయితే వేసుకోవచ్చు గానీ ఈ తిరకాసు లెక్కల పాఠాలు చదవటం నా వల్ల కాదని ఆ పెద్దబాలశిక్ష కూడా అక్కడే పాడేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకెప్పుడూ రాలేదు కూడా. నేను అర్ధమయ్యేలా చెప్పే విధానం సరిగ్గా లేక వాడు అక్కడితో చదువు మానేసి వెళ్ళిపోయాడేమో అన్న భాధ నన్ను ఆ తర్వాత చాన్నాళ్ళు పీడించింది గానీ, అంతా మర్చిపోయిన కొన్నాళ్ళకి నా చదువు అయిపోయే నాటికి బుజ్జిగాడు కొబ్బరికాయల వ్యాపారం మొదలెట్టాడని తెలిసింది. అలా చిన్నగా మొదలయిన వ్యాపారం ఆ తర్వాత టోకున చుట్టు పక్కల రైతుల దగ్గర కొని పెద్ద పట్టణాలకీ, నగరాలకీ ఎగుమతి చేసే స్థాయికి చేరింది. మధ్యలో పనిలో పనిగా వడ్డీల వ్యాపారం కూడా మొదలెట్టి రోజు వారీ వడ్డీ, నెల వారీ వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ లాంటి అన్నిరకాల వడ్డీలకీ డబ్బులు తిప్పి, ఊళ్ళో అందరూ వడ్డీల బుజ్జిగాడని పిలిచే స్థాయికి ఎదిగిపోయాడు. చందమామ కధల్లో నర మాంసం రుచి మరిగిన ఒంటి కొమ్ము రాకాసి లాగా ఒక్కసారి డబ్బు సంపాదించటం అలవాటుపడ్డాక అక్కడితో ఆగాలనిపించదు కాబట్టి, బుజ్జిగాడు కూడా అక్కడితో ఆగకుండా తన వ్యాపారాన్ని చిన్న కార్లు కొని అద్దెకి తిప్పటం, జెనరేటర్లు కొని కరంటు పోయినప్పుడు గణపవరం లో ఉండే నటరాజు, మహాలక్ష్మి, కుమారి లాంటి సినిమా ధియేటర్లకి అద్దెకివ్వటం, చీటీలు కట్టించుకోవటంతో పాటు, గణపవరం కోటయ్యగారి కొట్టు సందులో ఎరువుల కొట్టు పెట్టటం దగ్గర నుంచి తణుకు, రాజమండ్రి ల్లో బట్టల కొట్టులు పెట్టటం వరకూ చెట్టు నుంచి రెండు కొబ్బరాకులు కొట్టుకొచ్చి కొబ్బారకుల చాప అల్లినంత సులువు గా వ్యాపారలన్నీ ఒకదానితో ఒకటి ముడి పెట్టి విస్తరించేశాడు. అంతే గాక ఇప్పటి వరకూ అన్నింటి లోనూ లాభమే తప్ప నష్టమంటే ఏమిటో కూడా తెలీకుండా మా ఊరి ధీరూభాయ్ అంబానీ అనిపించుకున్నాడు. 


           ఆ తర్వాత నేను హైదరాబాదు లో ఉద్యోగం లో చేరిపోయాక అప్పుడప్పుడూ ఎప్పుడయినా ఊరెళ్ళినప్పుడు, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, చదువు లేక పోయినా ఇన్ని వ్యాపారాలు ఎలా నెగ్గుకొస్తున్నాడా అని కుతూహలం కొద్దీ గుర్తు కోసం వాడు రాసుకున్న లెక్కల పుస్తకాలు తిరగేస్తే, అందులో ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు. వత్తులూ, దీర్ఘాలూ కూడా లేకుండా వాడికి తెలిసిన అక్షర జ్ఞానంతోనే అన్నీ రాసుకున్నాడు. అవన్నీ వాడికి తప్ప ఎన్ని డిగ్రీలు చదివిన ఎంత గొప్ప వాడికయినా ఒక్క ముక్క కూడా అర్ధం కావన్న మాట. ఆ తర్వాత ఇంకోసారయితే, మా ఊరి కుక్కల ప్రెసిడెంటు కొడుకు "చదువుకున్న వాడికన్నా చాకలోడు మేలని మన పెద్దలు ఊరికే అనలేదు ఇంత చదువు చదివి ఉన్న ఊరు కూడా వదిలేసి ఎక్కడో దూరంగా పోయి ముక్కీ మూలిగీ కష్టపడితే నీకు వచ్చే నెల జీతానికి నాలుగైదు రెట్లు మా బుజ్జి గాడు ఇక్కడే కాలు మీద కాలేసుకుని కూర్చుని సంపాదిస్తాడెహె" అన్నాడు. ఆ మాట నాకూ నిజమే అనిపించింది డబ్బు సంపాదన పరంగా నాకూ, నా చదువుకీ ఉన్న విలువ బుజ్జి గాడితో పోల్చుకుంటే చాల తక్కువ. బహుశా బుజ్జి గాడు కూడా నా గురించి ఇదే అనుకుంటూ ఉండొచ్చు. అందుకే అప్పటినుంచీ వాడికీ, నాకూ మధ్య ఏదొ తెలియని అగాధం ఏర్పడినట్టు అనిపించింది నాకు. అప్పటినుంచీ ఊరెళ్ళినప్పుడు వాడిని కలవటం కూడా బాగా తగ్గించేసి దాదాపు వాడిని మరిచిపోయే ప్రయత్నం చేసి మర్చిపోయాను కూడా. మధ్యలో ఒక సారి మాత్రం వాడికి కొడుకు పుట్టాడని తెలిసింది. 

          ఇంకా కొన్నేళ్ళకి గుండె ఆపరేషన్ చేయించుకుని చచ్చి బతికిన మా మేనత్తని చూడటానికి రెండు రోజులు శెలవు పెట్టుకుని ఊరొచ్చిన నాకు, పంచాయితీ ఆఫీసు దగ్గర బుజ్జి గాడు కనిపించి "సాయంత్రం ఓ సారి మా ఇంటికి రా రా" అన్నాడు. ఎందుకు పిలిచాడా అని అయిష్టం గానే వాడి ఇంటికెళ్ళాక కూర్చోభెట్టి "రేపు మా వాడిని బళ్ళో వేస్తున్నాం నాతో పాటు నువ్వు కూడా వచ్చి నీ చేతుల్తో మా వాడిని బళ్ళో చేర్పిస్తే నా లాగా కాకుండా నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుని బాగా చదువుకుంటాడని ఆశ" అన్నాడు వాడి మాట ధోరణి కి విరుధ్ధంగా ఎంతో సౌమ్యంగా. "అయినా మీ వాడికి పెద్ద చదువులెందుకు రా? నీకు ఉన్న వ్యాపారాలన్నీ చూసుకున్నా బోలెడు సంపాదించుకోవచ్చు" అన్నాను వెంటనే వెటకారంగా. "అప్పుడెప్పుడొ అమెరికా వాడు వదిలిన స్కైలాబ్ రాకెట్టు పేలి పోయి భూమ్మీద పడి భూమి అంతమైపోయి అందరూ చచ్చిపోతారని తెగ భయపడిపోయారని మా నాయనమ్మ చెప్పింది. నిజంగా అలాంటిదే ఇప్పుడు జరిగిందనుకుందాం, అప్పుడు నేనూ నా పిల్లలే మిగిలామనుకుందాం అప్పుడు నా వల్ల నా ముందు తరాలకి ఏ విధమయిన ఉపయోగం ఉండదు. చదువు లేక నాకు చదువుకి సంబంధించిన ఏ విధమయిన జ్ఞానం నాకు లేదు కాబట్టి నా పిల్లలకి చదువు నేర్పలేను. నా ముందు తరాలు మళ్ళీ చదువు అనేదాన్ని కనిపెట్టాలంటే ఎన్ని వేల సంవత్సరాలు కావాలంటావ్?  అదే, నా స్థానం లో నువ్వు బతికి ఉంటే చదువు అనే దాన్ని నీ ముందు తరాలకి అందించి మళ్ళీ కనిపెట్టాల్సిన అవసరమే ఉండదు. అయినా చదువుకీ డబ్బు సంపాదనకీ సంబంధమే లేదు నేను ఏం చదివి ఇంత సంపాదించాను. ఎప్పటికీ దాని విలువ దానిదే."  అన్నాడు. గుడ్డివాడు వెలుగు గురించి ఇంత అద్భుతం గా అర్ధం చేసుకుంటాడనుకోలేదు.

ఆ తర్వాత రోజు బుజ్జిగాడి కొడుకుని బళ్ళో చేర్పించి "చదువు డబ్బు సంపాదించటానికి మాత్రమే కాదు" అని నా మట్టి బుర్రకి నచ్చ చెప్పుకుంటూ మళ్ళీ హైదరాబాదు బస్సు ఎక్కేశాను.  బస్సు బయలుదేరింది గానీ నేను మాత్రం ఆ మాట దగ్గరే అగిపోయాను.  

Thursday, October 10, 2013

హైద (రా...) బాదు

పొట్ట కోస్తే అక్షరమ్ముక్క రాని చాకలోళ్ళ శీను గాడు
హైదరాబాదెళ్ళిపోయి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ
ఇస్త్రీ చొక్కా నలక్కుండా బతికేస్తున్నాడు.
భర్తకి జబ్బు చేసి అప్పులపాలయిపోయి ఉన్న అరెకరం అమ్మేసుకున్న కాంతమ్మత్త
హైదరాబాదెళ్ళిపోయి బిస్కట్ల ఫ్యాక్టరీలొ పని చేసుకుంటూ
పిల్లల్ని చదివించుకుంటూ మెల్లిగా ఏదోలాగ బతికేస్తుంది.
కిడ్నీలు పాడైపోయిన కొట్టు సత్యం హైదరాబాదెళ్ళి పోయి
ఆరోగ్యశ్రీ కింద నిమ్స్ లో నయం చేయించుకుని మనిషి మళ్ళీ మామూలయిపోయాడు.
రెండెకరాల చిన్న రైతు నారాయణ గాలి వానొచ్చి ఒక పంట
పోయినా పెద్దగా బాధపడకుండా హైదరాబాదు హైటెక్ సిటీ లో
కొడుకు సాఫ్టువేరు ఇంజినీరు కదా అన్న ధైర్యంతో అప్పుచేసయినా
మళ్ళీ పంటకి చేనుకి నీళ్ళెట్టుకుంటున్నాడు.
చదవలేక పదో తరగతిలోనే ఇంట్లోంచి పారి పోయి
హైదరాబాదు వాళ్ళ బావ దగ్గరికి వచ్చేసిన
సుబ్రమణ్యం తర్వాత ప్రింటింగు ప్రెస్ పెట్టుకుని
రాత్రీ పగలు కష్టపడి పైకొచ్చి ఇప్పుడు పదిమందికి పని చూపిస్తున్నాడు.
ఊళ్ళో పని లేక ఖాళీగా తిరుగుతున్న కుమ్మరోళ్ళ తాతారావుకి
హైదరాబాదు లో సినిమాల్లో కరంటు పని చేసుకునే వాళ్ళ దూరపు బంధువు ఫోను చేసి
నేను చూసుకుంటాలే వచ్చెయ్యమంటే రాత్రికి రాత్రి గౌతమి కి వెళ్ళిపోయాడు.
కంప్యూటర్లు బాగు చెయ్యటం నేర్చుకుని హైదరాబు వచ్చేసిన
వెంకట్ సొంతంగా హార్డువేరు బిజినెస్ పెట్టుకుని ఇప్పుడు
లక్షాధికారి అనిపించుకుంటున్నాడు.
ఒళ్ళు గుల్లవుతుందన్నా వినిపించుకోకుండా డిగ్రీ ఫెయిలయిపోయిన కోటి గాడు
హైదరాబాదెళ్ళిపోయి ఫార్మా కంపనీలో యాసిడ్ బక్కెట్లు మోసి
ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు.
తాపీ పని చేసుకునే తాడి కొండయ్య హైదరాబాదులో ఉద్యోగం
రావాలంటే ఇంగ్లీషు చదువులుండాలని ఫీజులు ఎక్కువయినా
పట్టించుకోకుండా కొడుకుని ఇంగ్లీషు మీడియం బళ్ళో చేర్పించేశాడు.
మొన్నటికి మొన్న కూకట్ పల్లి వెళ్ళే బస్సు నంబరు 226 లో
కాలు పెట్టటానికి కూడా చోటు లేకపోయినా జేబులోనుంచి ఫోను తీసి
"ఒరేయ్ హైదరాబాదు వచ్చెయ్ రా అంతా నేను చూసుకుంటా లేవెహే" అని
తమ్ముడికో, బావమరిదికో, స్నేహితుడికో భరోసా ఇచ్చేస్తున్నారెవరో.
మా వాడికి హైదరాబాదులో ఉద్యోగమొచ్చిందని గర్వం గా చెప్పుకుందామని చూసే తండ్రులూ.
మా అమ్మాయికి హైదరాబాదు సంబంధం దొరికితే నిశ్చింతగా ఉందామనుకునే తల్లులు.
వీళ్ళెవరూ పడ్డ కష్టాలెపుడూ పైకి చెప్పుకోలేదు.
కష్ట పడేవాడెపుడూ కష్టాలు చెప్పుకోడు .
ఇదంతా గతం నుంచి వర్తమానం వరకూ సాగిన ప్రయాణం.
కానీ ఇప్పుడు, భవిష్యత్తు గురించే భయమంతా.
అందుకే, ఈ గొడవంతా.

Monday, August 12, 2013

ఆగస్టు పదిహేను, న్యూటన్ చక్రం,...

జంధ్యాల గారి సినిమా లో కామెడీ లాగా
బాల్యం ఎప్పుడు గుర్తు చేసుకున్నా కొత్తగానే ఉంటుంది.
నా చిన్నప్పుడు మా బళ్ళో రెండు చెక్క బీరువాలు ఉండేవి.
అందులో ఒకదాని మీద  "ప్రయోగ శాల" అనీ,
ఇంకో దాని మీద "గ్రంధాలయం" అనీ రాసి ఉండేది.
ఆ పేర్ల లోని గాంభీర్యం చూసి అందులో ఏముందో
తెలుసుకోవాలని మా పిల్లకాయలందరికీ తెగ ఉత్కంఠ.
నిజం చెప్పాలంటే అది మా సైన్సు మాస్టారు మాత్రమే
విప్పి చెప్పగలిగిన ఒక పెద్ద పొడుపు కథ.
ఆయనే ఒక అమావాస్య రోజున ఆ రెండు బీరువాలూ తెరిచి
వాటిల్లోంచి ఒక న్యూటన్ చక్రం, నాలుగు చందమామ పుస్తకాలు
బయటికి తీసి అందరికీ కనిపించేలాగ టేబులు మీద పెట్టి
న్యూటన్ చక్రం గిర్రుమని తిప్పి ఒక్క తెల్ల రంగులోనే
ఏడు రంగులూ ఎలా కలిసుంటాయో చూపించారు.
ఆ విచిత్రం చూసి మా వాళ్ళందరికీ చిటారు కొమ్మన
మిఠాయి పొట్లం చేతికొచ్చినంత ఆనందమయిపోయింది.
నాకు మాత్రం మనం కూడా ఇలాంటి చక్రమే ఏదో ఒకటి
కనిపెట్టెయ్యాలన్నంత ఆవేశమొచ్చేసింది.
ఆ రోజు మొదలయిన నా ప్రయత్నం ఆ తర్వాత
ముంజెకాయల బండి చక్రాలు మించి ముందుకెళ్ళలేదు.
అందుకే అప్పటి నుంచీ "అమావాస్య పూట ఏ పనీ
మొదలెట్టకూడద"ని చెప్పిన మా నాయనమ్మ మాట మీద
నమ్మకం ఎక్కువయ్యింది. కానీ ఇప్పటికీ నాకు మాత్రం
ఆ రెండు చెక్క బీరువాల ముందు మనకి తెలిసిన ఇస్రోలు,
సెంట్రల్ లైబ్రరీలూ కూడా దిగదుడుపే అనిపిస్తుంది.
ఇంకా,  ఆగస్టు పదిహేను రోజు చాక్లెట్లు తినేసి అటునుంచి అటే
"గ్యాంగ్ లీడర్" సినిమా చూసొచ్చి మనమే పెద్ద హీరో అయిపొయినట్టు.
దానికి తోడు ఆదివారం టీవీలో మాయ మంత్రాలు, కత్తి యుధ్ధాల
సినిమలొస్తే మన ఊహలకి రెక్కలొచ్చినట్టే.
పరీక్షల్లొ "ఇందీవరాక్షుని వృత్తాంతం" పాఠంలోని "అనినన్ గన్నులు జేవురింప..." పద్యం
మన దగ్గర కాపీ కొట్టిన నెల తక్కువ నారాయణ గాడు
ఆ తర్వాత ఐ ఐ టీ లో చదివి ఇప్పుడు పెద్ద పుడింగు.
చెప్పుకోవటానికి ఎంత గర్వంగా ఉంది.
దీపావళి కి రీలు తుపాకీ కోసం
మూడు రోజులు ముందునుంచీ, మూడు పూటలా ఏడుపే.
ఒక్కోసారి పెటేపుకాయ చెతిలోనే పేలిపోయేది.
మొట్ట మొదటిసారి చెట్టెక్కి గుత్తులు గుత్తులుగా
కోసుకుని తిన్న నేరేడుపళ్ళ రుచి ముందు
ఇప్పటి వాషింగ్టన్ యాపిల్స్ రుచి ఎంత.
మామిడి కాయలు దొంగతనం చేశామని ఊరంతా తెలిసిపోయి
పంచాయతీలో పెట్టి ఉరిశిక్ష వేసేస్తారేమో అని భయపడిపోయి
ఇల్లొదిలి పారిపోదామనుకుని, సాయంత్రం మళ్ళీ ఆకలేసి
ఇంటికెళ్ళిపోయినప్పుడు పడ్డ టెన్షను ముందు ఇప్పుడు మన బాసులు
ఇచ్చే డెడ్ లైన్ల టెన్షన్ ఒక లెక్కా.
ఎంత కఠిన హృదయుడయినా ఒక్కసారి
బాల్యం గుర్తు చేసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు.
"గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అన్నారు.
అదేం చిత్రమో, ఆ గత కాలం ఎప్పుడూ బాల్యం దగ్గరే ఆగిపోతుంది.
ఆ బాల్యం మన మనసు మీదికి ఎప్పుడు పాకినా, జిరాక్సు తీసిన జీవితానికి అలవాటుపడ్డ
మన ఖాళీ బుర్రల నిండా కొన్ని రంగుల నీడలు అలుముకుంటాయి.
అంతకన్నా ఏం కావాలి.
ఈ మాత్రం దానికి టైం మెషీన్ కనిపెట్టే వరకూ కూడా ఆగక్కర్లేదు.
ఒక్క సారి కళ్ళు మూసుకోండి చాలు.

Wednesday, August 7, 2013

తెలుగు పల్లకి

అమ్మపాలకి తోడ బుట్టువు, ఒక్క మాటలో తేనె బిందువు.
నోటి మాటకి అందమిచ్చిన రాజ భాష మన ఠీవి తెలుగు.
ఆరి పోనిది, అంతు లేనిది అమర భాష ఇది అమృతం.
ఊపిరుండిన, దేహముండిన తెలుగు మరచిన ఏమి సుఖం.

ఆది నన్నయ ఘంటము కదపగ, కృష్ణ రాయలు మురిసిన,
వేమన్న, పోతన్న శివమెత్తంగా, అన్నమయ్య పద కదము తొక్కగా,
కందుకూరి, గురజాడ, శ్రీరంగం శీనయ్య, తెలుగు పల్లకి మోయ బ్రౌనయ్య.
ఎంత మంది లేరు మునిగి తరియించగా ఇది తెలుగు గంగ.

ఆవకాయ ఘాటు, గోంగూరలో పులుపు,
పూర్ణాలలో తీపి, ఉలవ చారు ఊట తేట తెలుగు మాట.
అవధాన క్రతువులు, త్యాగరాయ క్రుతులు
మన భాష తనలోన కలిపేసుకోలేదా.
ఘన చరిత కలిగింది, రస భరితమయ్యింది.

జన భాష, మన భాష చక్కంగ పలకంగ
పలుకు పలుకుకు రాగ మాలికలు కాగ.
చిన్నోళ్ళు, పెద్దోళ్ళు  గర్వంగ గొంతెత్తి, చాటి చెప్పగ రండి.
యాస ఏదయిన, హొయలు పోవు భాష తెలుగు మాది.
తెలుగు వెలుగులున్న మాకు లేనిదేది, తెలుగు జాతి మాది, మాకు లేదు సాటి.

Friday, June 7, 2013

పిల్లల దొంగలు

ఎండా కాలం తర్వాత చినుకులు పడటం మొదలయ్యింది. పిల్లలకి వేసవి శెలవులు కూడా అయిపోయాయి. దాచి పెట్టుకున్న తాయిలాలేవో బయటికి తీసినట్టు మొన్నటిదాకా ఎండిపోయిన  చేల గట్లు, కాలవ గట్లు, చెట్లూ పచ్చగా అవుతున్నాయి. చేల నిండా నీళ్ళు నిండి పురుగు, పుట్ర, కప్పలు గోల చెయ్యటం మొదలెట్టాయి. బాతులు మేపుకుని బతికే బాతులోళ్ళు ఈ పురుగులు, నత్తలు తినే బాతుల్ని గుంపులు గుంపులుగా తోలుకొచ్చి కొత్తపల్లి పొలాల్లోనూ,  మా ఊరి పొలిమేర దాకా ఉన్న కొమ్మర పొలాల్లోనూ మేపుకుని వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే శెలవులకి, ఆటలకి అలవాటు పడ్డ పిల్లలందరూ బడి అయిపోగానే సాయంత్రం తొందరగా అన్నం తినేసి రాత్రి చీకటి పడేదాకా వీధి దీపాల వెలుగులో పెంకులాట, తొక్కుడు బిళ్ళ, రాముడు సీత, పంది మరుగు, దొంగా పోలీసు ఆడుకునేవాళ్ళు కానీ, ఈ మధ్యన మా ఊరి చుట్టుపక్కల ఊళ్ళళ్ళో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు తిరుగుతున్నారని తెలిసి చీకటి పడ్డాక చిన్న పిల్లల్ని బయటికి పంపటం మానేశారు ఊరి జనం. పిల్లలు అన్నం తినటానికి మారాం చేసినా, అల్లరి చేసినా, ఒంటి మీద గోచీ తప్ప ఏమీ లేకుండా చుట్టుపక్కల ఊళ్ళళ్ళో అడుక్కుంటూ తిరిగే మొండోడి కి ఇచ్చేస్తాననో, బ్రాహ్మల అబ్బాయి గారి చెరువు గట్టు మీద చింత చెట్టు మీద ఉండే ఒంటి కన్ను రాక్షసుడికి ఇచ్చేస్తాననో, పిల్లల్ని ఎత్తుకెళ్ళి పోయేవాళ్ళకి ఇచ్చేస్తాననో భయపెట్టే పెద్ద  వాళ్ళు,  నిజం గానే పిల్లల దొంగలు తిరుగుతున్నారని తెలిసి భయపడిపోయి ఉప్పు, ముగ్గు అమ్ముకునే వాళ్ళు, ఆడవాళ్ళు తల దువ్వుకున్నప్పుడు వచ్చే జుట్టు పోగు చేసి ఇస్తే బుడగలు ఇచ్చేవాళ్ళు, పాత ఇనుప ముక్కలకి వేరు శనగ పప్పు అచ్చులు ఇచ్చే వాళ్ళూ, ఇలా అమ్ముకోవాడానికి కూడా ఎవరొచ్చినా అనుమానంగా చూడటం మొదలెట్టారు. దానికి తోడు మొన్న పని మీద తాడేపల్లిగూడెం వెళ్ళి వచ్చేటప్పుడు బస్సులో "ఆకుతీగలపాడు లో అప్పారావు గారి రెండో పిల్లోడిని ఎవరో ఎత్తుకు పోయారని" చెప్పుకుంటుంటే విన్నానని చాకలి తిప్పడు చెప్పిన దగ్గర నుంచీ జనానికి అనుమానంతో పాటు భయం కూడా ఎక్కువయ్యింది.

              ఆ రోజు పొద్దున్నే వాయుగుండం పట్టిందని రేడియోలోవార్తల్లో వచ్చింది. డిగ్రీ మధ్యలో ఆపేసి పోలీసు డిపార్టుమెంటులో కానిస్టేబులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న రామయ్య గారి రాంబాబు పొలం వెళ్ళి  వర్షంలో తడుస్తూనే పొలానికి గట్టులంకలు వేసి,  భుజం మీద పార, గడ్డపార తో సాయంత్రం చీకటి పడుతుండగా ఇంటికొచ్చేటప్పుడు పుంత రోడ్డు దగ్గర ఒక మగ మనిషి, చంకలో చిన్న పిల్లాడితో ఒక ఆడ మనిషీ అనుమానంగా తిరుగుతుంటే దగ్గరికెళ్ళి మీరెవరని అడిగితే,  బాతులు మేపుకునే వాళ్ళమనీ,  దారి తప్పి వాళ్ళ మనుషుల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చామనీ భయం భయం గా చెప్పారు. వాళ్ళ వాలకం చూస్తుంటే రెండు రోజులనుంచీ స్నానం కూడా చేసినట్టు లేదు, చిన్న పిల్ల వాడు మాత్రం కడిగిన ముత్యంలా శుభ్రంగా కొత్త బట్టలతో ఉన్నాడు. వీళ్ళే ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళేమోనని రాంబాబుకి అనుమానమొచ్చి గట్టిగా అడిగితే, 
పిల్లవాడు కొడుకనీ, పక్కన ఉన్న మగ మనిషి తమ్ముడనీ ఈ రోజు పిల్లవాడి పుట్టిన రోజని తల స్నానం చేయించి కొత్త బట్టలేశామనీ చెప్పి సారా తాగకపోయినా, మామూలుగానే చింత నిప్పుల్లా ఉండే రాంబాబు కళ్ళు చూసి భయమేసి అక్కడి నునంచి గబగబా వెళ్ళి పోతుంటే  "బాతులోళ్ళు కూడా పుట్టిన రోజులు చేసుకుంటారా? అబధ్ధాలు చెప్పి తప్పించుకుని పారి పోదామనుకుంటున్నారా?" అని ఇద్దరినీ రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఊరి మధ్యన చెరువు గట్టు మీద వీధి దీపం వెలుగులో నిలువు కాళ్ళ మీద నుంచో బెట్టాడు.

                   రాంబాబు,  పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే దొంగల్ని పట్టుకుని లాక్కొచ్చాడని అర గంటలో ఊరంతా తెలిసిపోయింది.  ప్రెసిడెంటు రంగబాబు గారితో సహా ఊరి జనం అందరూ చెరువు గట్టు మీద వాళ్ళిద్దరి చుట్టూ మూగి "మీ ముఠా లో ఎంత మంది ఉన్నారు? ఇప్పటి దాకా ఏ ఏ ఊళ్ళల్లో ఎంత మందిని ఎత్తుకెళ్ళిపోయారు? మొన్న ఆకుతీగలపాడు లో పిల్లోడిని మాయం చేసింది కూడా మీరేనా? ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఎవరికయినా అమ్మేస్తున్నారా? లేకపోతే కాళ్ళూ చేతులూ విరగ్గొట్టి ముష్టెత్తుకు రమ్మంటున్నారా?" అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే,  కీచురాళ్ళ అరుపులతో పాటు మనుషుల అరుపులు కూడా కలిసిపోయాయి. ఊరి మొత్తానికి ఒకే ఒక ఫోను ఉన్న ధాన్యం వ్యాపారం చేసే నారాయణ మూర్తి గారి ఇంట్లోంచి గణపవరం పోలీస్ స్టేషన్ కి ఫోను చేస్తే,  గాలి వానకి వైర్లు తెగిపోయి ఫోను పని చెయ్యలేదు. వాళ్ళు మాత్రం మేము అలాంటి  వాళ్ళం కాదని నెత్తీ, నోరూ కొట్టుకుని మొత్తుకుంటుంటే,  ఇలా అడిగితే చెప్పరని రాంబాబు మగ మనిషిని లాక్కెళ్ళి చెట్టు మొదట్లో ఎర్ర చీమల పుట్ట ఉన్న కుంకుడు కాయ చెట్టుకి కట్టేసి, ఆడ మనిషి దగ్గర చంకలో పిల్ల వాడిని లాక్కుని  ఆవిడ రెండు చేతులూ నులక తాడు తో కట్టి పచ్చి తాటి కమ్మ తీసుకుని ఇద్దరినీ చితక బాదేశాడు. నరశింహం గారయితే ఇలాంటి వాళ్ళని బతకనివ్వ కూడదని కిరసనాయిలు డబ్బా తీసుకొచ్చేస్తే వాళ్ళమ్మ గారు "తెల్లారాక పోలీసులొచ్చి చూసుకుంటార"ని చెప్పి బలవంతంగా ఆపారు కాబట్టి సరిపోయింది కానీ లేక పోతే అప్పుడే వాళ్ళిద్దరికీ భూమ్మీద నూకలు తీరిపోయేవి.  ప్రెసిడెంటు రంగ బాబు గారు,  ఇలాంటి కరుడు గట్టిన దొంగల ముఠా వాళ్ళని పట్టుకున్నందుకు రాంబాబుని మెచ్చుకుని తణుకు లో యస్.ఐ. గా పని చేస్తున్న వాళ్ళ బావమరిదికి చెప్పి రికమండేషన్ చేసి రాంబాబుకు కానిస్టేబులు ఉద్యోగం వచ్చేలా చేస్తానన్నారు. 

            ఆ రాత్రి దొంగలిద్దరికీ పచ్చి మంచి నీళ్ళు కూడా ఎవరూ ఇవ్వలేదు. కానీ, వాన చినుకులు మాత్రం పడుతూనే ఉన్నాయి. రాత్రంతా చీకట్లో పచ్చగడ్డిలో దాక్కుని అరిచిన కప్పలు  తెల్లారి వర్షం తగ్గాక బయటకొచ్చి కళ్ళు  పైకెత్తి అటూ, ఇటూ చూస్తున్నాయి. పంచాయితీ లో మెంబరు గా ఉన్న యేసుపాదం సైకిలేసుకెళ్ళి గణపవరం పోలీస్ స్టేషన్ లో విషయం చెప్పి అర్జెంటుగా రమ్మంటే ఇద్దరు పోలీసులు టీవీయస్ మీద వచ్చి ఆ దొంగలిద్దరికీ కట్లు తీసి ఆరా తీశాక చెప్పింది ఏమిటంటే, వాళ్ళు నిజంగానే బాతులు మేపుకునే వాళ్ళేననీ, ఆ బాబు ఆవిడ సొంత కొడుకనీ, రాత్రి బాగా పొద్దు పోయాక ఈ ఆడమనిషి భర్త, బంధువులు వీళ్ళకోసం వెతుక్కుంటూ వచ్చి స్టేషన్ లో కూడా వాకబు చేసుకుని వెళ్ళారనీ, అసలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు లేరనీ, అదంతా పుకారు తప్ప ఇప్పటి వరకూ ఈ తాలూకాలో ఎక్కడా పిల్లలు తప్పిపోయినట్టు ఒక్క కంప్లయింటు కూడా రాలేదనీని. అసలు విషయం తెలిశాక, ఆ పిల్ల వాడిని వాళ్ళకి ఇచ్చేసి, వెలుగులో సరిగ్గా చూస్తే వాడు అచ్చం వాళ్ళ అమ్మ పోలికలతోనే ఉన్నాడని చెఫ్పుకుని, అకారణంగా కొట్టి హింసించామని పశ్చాత్తాపంతో ఊరి జనమూ, ఊరికి మొనగాడనిపించుకుందామనుకుంటే అలా జరగనందుకు రాంబాబూ చాలా భాధ పడ్డారు.

             అదీ కాక తాను చితక బాదేసిన ఆ ఇద్దరికీ ఏమయినా అయితే పోలీసులొచ్చి పట్టుకెళ్ళిపోతారని భయంతోనో, లేకపోతే బాతులోళ్ళ బంధువొలొచ్చి కక్ష్య తీర్చుకుంటారన్న భయంతోనో తెలీదు గానీ, పోలీసు అవుతాడనుకున్న రాంబాబు దొంగలాగా బంధువుల ఊరు జంగారెడ్డిగూడెం పారిపోయి మళ్ళీ మూడు నెలల వరకూ ఊళ్ళో ఎక్కడా కనిపించలేదు.

Tuesday, May 21, 2013

'ధర్మ' సందేహం

2012 మే నెల.
మాయన్ లు చెప్పిన యుగాంతానికి ఇంక ఏడు నెలలు ఉందనగా..
ఎండ మండిపోతుంది.
అదీ సాయంత్రం పూట కూడా.
బహుశా నలభై అయిదు డిగ్రీలు ఉంటుందేమో?
ఈ వేడి సాయంత్రం ఒక స్నేహితుడిని కలవటానికి బయలుదేరాను.
ఇక్కడ ఎర్రగడ్డలో బస్సెక్కి కూకట్ పల్లి వెళ్ళాలి.
బస్సు/ఆటో కోసం ఎదురు చూస్తున్నాను.
గొంతు తడారిపోతుంది.
ఇంత వేడి ఈ మధ్య కాలం లో ఎప్పుడూ చూడలేదు.
నిజంగానే దీనంతటికీ కారణం "గ్లోబల్ వార్మింగేనా?"
పొదుపుని, పంచుకోవటాన్ని పక్కన పెట్టేసి Use and Throw ని ప్రోత్సహించి ప్రపంచాన్నే పెద్ద Super Market చేసి కాలుష్యాన్ని పెంచిన అమెరికా నా? చైనానా? అసలు దీనంతటికీ మూల కారణమయిన పారిశ్రామిక విప్లవమా? దానికి కారణమయిన మనిషి కనిపెట్టిన ఆవిరి యంత్రమా? సైన్సా?  నరుక్కునే కొమ్మ మీద కూర్చోవాలని ఎవరూ అనుకోరు కాబట్టి మనిషికి ప్రకృతిని నాశనం చెయ్యటం తప్పనపుడు ఆ ప్రకృతికి దూరంగా జరగటం కూడా అనివార్యం. ముందు ముందు మనుషులు గాలి, నీరు, ఆహారం కూడా అవసరం లేని కృత్రిమ జీవులుగా తమని తాము మార్చేసుకుంటారేమో అన్న భయం కూడా నాలో మొదలయ్యింది. రిచర్డ్ ఫెన్మెన్ చెప్పినట్టు "సైన్స్ అనేది తాళం చెవి లాంటిది. దాంతో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారలూ తెరుచుకుంటాయి."
కానీ నరక ద్వారానికి అయస్కాంత శక్తి కూడా ఉన్నట్టుంది.
నా పక్కన ఒక ముష్టి వాడున్నాడు.
వాడికి కుష్ఠు వ్యాధి కూడా ఉన్నట్టుంది.
ముందు ఒక చిరిగిన గుడ్డ పరుచుకుని కూర్చున్నాడు.
రామాయణ కాలంలో శ్రీ రాముడు పరిపాలించినప్పుడు నెలకి మూడు వానలతో, అతివృష్టి అనావృష్టి రహితంగా, పాడి పంటలతో సుఖ సంతోషాలతో రామరాజ్యం వర్ధిల్లిందని విన్నాను. ఇప్పుడు కూడా అలాంటి శ్రీ రామ రాజ్యం సాకారమవ్వాలని కోరుకుని నేనెప్పుడూ అత్యాశకి పోలేదు కానీ, వాజపేయి ప్రభుత్వం లో జాతీయ రహదారులన్నీ నాలుగు లేన్లు గా అభివృధ్ధి చేస్తునారని తెలిసినప్పుడు, ముందు ముందు భారత దేశం ఆర్ధికంగా అన్ని అగ్ర దేశాలనీ అధిగమిస్తుందని పేపర్లలో చదివినప్పుడు, చంద్రబాబు నాయుడిని బిల్ క్లింటన్ మెచ్చుకున్నప్పుడు, మన ప్రధాని ప్రసంగ పాఠాన్ని ఒబామా చెవులు రిక్కించి వింటూ మన్మోహన్ సింగ్ ని ఆరాధనగా చూసినప్పుడూ పేదరికం లేని, ముష్టి వాళ్ళు లేని దేశాన్ని ముందు ముందు చూడబోతున్నానన్న నమ్మకం పెరుగుతూ వచ్చింది. హరిత విప్లవం గురించి విన్నప్పుడు ఆహార కొరత ఉండదనుకున్నాను కానీ,  మన తాత ముత్తాతలు అతి సాధారణం గా తిన్న సహజమయిన ఆహారాన్ని,  ఇప్పుడు ఖరీదయిన ఆర్గానిక్ ఆహారం గా డబ్బున్నవాళ్ళకే పరిమితం చేసి,  పురుగుమందులు నిండిన తిండిని మనకే ఎక్కువరేటు కి అమ్ముతారనుకోలేదు. శ్వేత విప్లవం గురించి విన్నప్పుడు కనీసం చిన్న పిల్లలకయినా సమృధ్ధిగా పాలు దొరుకుతాయనుకున్నాను కానీ, అందులో అరవై శాతం రసాయనాలు నిండిన కల్తీ పాలే ఉంటాయనుకోలేదు. ఒకప్పటి కన్నా ఇప్పటి హైదరాబాదు లోనే ముష్టి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు.
నాకు దాహం ఎక్కువయ్యింది.
నా పక్కనున్న ముష్టి వాడు ధర్మం కోసం నన్నేమయినా అడుగుతాడేమోనని ఎదురు చూశాను కానీ, ఏమీ అడక్కుండా వాడి లోకం లో వాడున్నాడు. నా లాంటి వాళ్ళు కాకపోతే ఈ ముష్ఠి వాళ్ళ గురించి ఇంకెవరు పట్టించుకోవాలి? మనం లేకపోతే వీళ్ళెలా బతకాలి?  ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ, అలా మనం కట్టిని ట్యాక్సులే రాజకీయనాయకులు కుంభకోణాల్లో కుమ్ముకుంటుంటే నోరు మూసుకుని చూస్తూ కూర్చోవటమే కాకుండా, అదే వార్తల్ని మళ్ళీ నాలుగు రూపాయలు పెట్టి పేపరు కొనుక్కుని మరీ చదువుతున్నాం. అలాంటిది ఈ ముష్టి వాడు అడిగినా, అడగక పోయినా ఒక రెండు రూపాయలు ధర్మం చేయటంలో తప్పులేదనిపించింది. అంతకన్నా ఎక్కువగానే ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఇప్పుడే బయటికి వచ్చిన నాకే ఇంత దాహంగా ఉంటే పాపం ఉదయం నుంచీ ఇక్కడే ఉన్న ఇతనికి ఇంకెంత దాహంగా ఉండాలి. (అదేంటో మనం కష్టాల్లో ఉన్నప్పుడే మనకి అందరి కష్టాలూ గుర్తుకొస్తాయి, లేకపోతే మనలాగే అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లుతున్నారనుకుంటాం. బహుశా ఇది మానవ నైజం అనుకుంట.)
దూరంగా చెరుకు రసం అమ్మేవాడు కనిపిస్తున్నాడు.
ఇంత ఎండలో తాగడానికి ఏమయినా ఇస్తే కాదనే మానవమాత్రుడు ఎవడు ఉంటాడు.? అందుకే ఆ చెరుకురసం వాడి దగ్గరకెళ్ళి, నేనొకటి తాగి, ప్లాస్టిక్ పాత్రలో ఆ ముష్టి వాడి కోసం ఇంకొకటి తీసుకుని అతడికి ఇవ్వటానికి వెళ్తున్నాను. నేను చెయ్యబోయే ఈ చిన్న మంచి పనిని చూసి అక్కడ నా చుట్టూ ఉండే వాళ్ళు నన్ను జాలి దయ పుష్కలంగా ఉన్న ఒక మంచి మనిషిగా గుర్తిస్తారనుకున్నప్పుడు నాకు కలిగే ఆనందాన్ని తలుచుకుని నా మనసు ఇప్పుడే పులకరిస్తోంది. (నేను నిజం గా అంత దయార్ద్ర హృదయుడినే అయితే నేననుకున్న బిచ్చగాళ్ళు లేని భారత దేశం ఇంకా సాకారమవ్వ నందుకు ఈ సమయం లో నేను భాధ పడాలి.)
ఇంక నాలుగయిదు అడుగుల్లో ఆ ముష్టి వాడిని చేరుకోబోతున్నాననగా
వాడు దర్జాగా ఒక బీడీ బయటకి తీసి వెలిగించుకోవటం నా కంటబడింది.
కేవలం వేష భాషలలో తప్ప, ఇప్పటి వరకూ నేను చూసిన ఏ శ్రీమంతుడి లోనూ అంత పరిపూర్ణమయిన రాజసం నాకు కనపడలేదు. మాయన్ లు చెప్పిన యుగాంతం నిజంగా ఇప్పటికిప్పుడే వచ్చినా తనకి వచ్చేదీ, పోయీదీ ఏమీ లేదు అన్నంత నిర్లక్ష్యం అతని కళ్ళల్లో ఉంది.
నా అడుగులు ఒక్కసారిగా అక్కడితో ఆగిపోయాయి.
నేను ఈ పానీయం దానం చేసేటప్పుడు కూడా కృతజ్ఞతకి బదులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, నేను భరించలేను.
ఈ పరిస్థితుల్లో కనుక నేను వాడికి ఈ పానీయం దానం చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గొప్పగా కనిపించటం అటుంచి, రాజు గారికి పరిచర్యలు చేస్తున్న సేవకుడి లాగా కనిపిస్తాను. నన్ను ఒక వెర్రిబాగుల వాడి లాగా అనుకుని నవ్వుకోవచ్చు కూడా.
ఇప్పుడేం చేయాలి?
ఎవరేమనుకుంటే ఏంటి?
మనం చెయ్యాలనుకున్నది చేసెయ్యొచ్చు కదా?
కాని అంతకు మించిన వేరే ఏదో కారణం కోసం నా మనసు వెతుకుతుంది.
ఇప్పుడు ఇది వాడికి ఇవ్వటానికి నా అహం అడ్డొస్తుంది. మన సొంత డబ్బుతో మనం ఎన్ని భోగాలయినా అనుభవించవచ్చు. కానీ వీడు మాత్రం అందరూ దయ తలచి ధర్మం చేసిన డబ్బులతో దర్జాగా బీడీలు కాల్చుకుంటున్నాడు. (ఇప్పుడు నాకు ఒకప్పుడు మా పదో తరగతి సోషల్ మాస్టారు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే "ఈ ప్రపంచంలో మనిషి తినే ప్రతి ముద్ద, మరొకడి దగ్గర లాక్కుని తింటున్నదే" అని.)
ఎవరికి తెలుసు "పుష్పక విమానం" సినిమాలో పి.యల్.నారాయణ లాగ వీడి దగ్గర కూడా వాడి ముందు పరుచుకున్న గుడ్డ కింద బోలెడు డబ్బులున్నాయేమో? ఈ మధ్య నా స్నేహితుడు పంపిన ఒక ఈమెయిల్ లో మహా నగరాల్లో బిచ్చగాళ్ళు చాలా మంది లక్షాధికారులనీ, వాళ్ళ ఆదాయం సాఫ్టువేరు ఇంజినీరు ఆదాయం కన్నా కూడా ఎక్కువే ఉంటుందని లెక్కలతో సహా ఉంది. వీడు కూడా అలాంటివాడేనేమో?
ఇప్పుడేం చెయ్యాలి?
ఇలాంటి అయోమయ పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ నాకు ఎదురు పడలేదు.
చిన్నప్పుడు మూడో తరగతి కాపీ పుస్తకం లో "మానవ సేవే మాధవ సేవ" అని పది సార్లు రాశాను కదా అందుకోసమయినా దానం చెయ్యనా?
పోనీ మొన్న పంతులు గారు కనిపించి "ఇరవై ఒక్క వారాలు ప్రతీ శని వారం బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తే నాకు ఉన్న కష్టాలు పోయి ముందు ముందు బాగా కలిసొస్తుందని" చెప్పారు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది, దాని కోసమయినా దానం చెయ్యనా ?
పోనీ పుణ్యం కోసం?
కాకపోతే స్వర్గం కోసం?
మోక్షం కోసం?
మరో మంచి జన్మ కోసం?
మనశ్శాంతి కోసం?
అయినా ఇలాంటి అయోగ్యుడయిన బిచ్చగాడి కి చేసే దానం వల్ల నేను అనుకున్న ఫలితం సిధ్ధిస్తుందా? లేదా?
ఎంతయినా వాడు రోగిష్టి  బిచ్చగాడు. మన కళ్ళ ముందు ఒక బీడీ కాల్చినంత మాత్రాన మహాపరాధం ఏమీ చెయ్యలేదు కదా?  బహుశా వాడికి జీవితం లో మిగిలిన ఒకేఒక ఆనందం ఈ బీడీనే కావచ్చు. అయితే మాత్రం, వాడొక ముష్టి వాడు.  ఎంత పొగరు కాకపోతే నా లాంటి దాన కర్ణుల ముందు కూడా బిచ్చం అడుక్కోకుండా వాడి పాటికి వాడు బీడీ కాల్చుకుంటూ కూర్చుంటాడు?
ఇది నిజం గానే వాడు చేస్తున్న అధర్మం కాదా ?
దేశం లో ఉన్న ముష్టి వాళ్ళందరూ వీడి లాగానే తయారయితే మన లాంటి వాళ్ళందరూ మనశ్శాంతి గా ఎలా బతకాలి?
అందుకే కార్ల్ మార్క్స్ "బలవంతులు బలహీనుల కోసం ఏం చేసినా ఊరికే చెయ్యర" ని ఊరికే చెప్పలేదనుకుంట.
నేను చేసే ధర్మం వాడిని ఉధ్ధరించటానికా ?
నన్ను నేను ఉధ్ధరించుకోవటానికా?
అసలు ఈ ప్రపంచం లో మనిషికీ, మనిషికీ మధ్య అన్ని అసమానతలూ, అసూయా ద్వేషాలనూ మించిన ఆత్మ సంబంధం ఏదయినా ఉందా? లేదా?
ఉండే ఉంటుంది. బహుశా ఆ నమ్మకం తోనే వాడు అడుక్కుంటూ కూడా బీడీ కాల్చుకోగలుగుతున్నాడేమో? లేదా? దాన ధర్మాల ద్వారా పేరు ప్రఖ్యాతులనీ, పాప ప్రక్షాళననీ, మనశ్శాంతినీ కావాలనుకునే నా లాంటి వాళ్ళు ఎలాగూ వాడిని వెతుక్కుంటూ వస్తారన్న నమ్మకమేమో?
అయినా ఒక ముష్టి వాడికి చేసే ఇంత చిన్న ధర్మం కోసం ఇంతగా ఆలోచించాలా?
ఏమీ ఆశించకుండా ఏమీ చెయ్యలేమా?(ఇది కూడా మానవ నైజమే అనుకుంట)
ఇంతకీ నేను ధర్మం చెయ్యాలా? వద్దా?
అహాన్ని అధిగమించి ఆ అత్మ సంబంధాన్ని నా మనసు ఒప్పుకుంటుందా?లేదా?
అలా ఒప్పుకోలేకపోవటానికి కారణాలేంటి?
అంతా అయోమయంగా ఉంది.
ఏం చెయ్యాలో  ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.

Wednesday, May 15, 2013

చివరి మనుషులు

ఈ మధ్య ఊరెళ్ళి వచ్చాను.
ఆకు పచ్చని పొలాలన్నీ చేపల చెరువులయిపోయాయి.
మంచి నీళ్ళ చెరువేమో మురుగు కాలవయిపోయింది.
రైతులందరూ కూలీలయ్యారు.
కూలీలందరూ మహా నగరానికి వలస వెళ్ళి పోయారు.
చదువుకున్న వాళ్ళందరూ ఇంజినీర్లయిపోయారు.
చదువు లేని వాళ్ళు అప్పు చేసి ఖతరో, కువైటో వెళ్ళి, నానా
కష్టాలూ పడి చేసిన అప్పు తీర్చి
ఇంక పడలేక ఉత్త చేతుల్తో మళ్ళీ ఊరొచ్చేశారు.
కప్పల బెక బెక లూ, గాలి వాటమూ కనిపెట్టి, వాన రాకడ అంచనా వెయ్య గలిగిన రామయ్య తాతకి పక్ష వాతమొచ్చి మూలన పడి,  ప్రాణం పోకడ కోసం ఎదురు చూస్తున్నాడు.
క్యాలండర్ చూడకపోయినా తిధులు, అమావాస్యలు, పౌర్ణమిలు, పండుగలు
చెప్పేసే సూరమ్మ చచ్చి పోయిందని తెలిసింది.
రోజూ ఇంత అన్నం పెడితే చాలు విఠలాచార్యకి కూడా తెలియని కధలన్నీ
ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ గుక్క తిప్పు కోకుండా చెప్పగలిగిన
పళ్ళ వీరన్న కూడా పైకెళ్ళిపోయాడు.
రేపో మాపో అన్నట్టు ఉన్న చాకలి ముసలి మామ్మ
వీధిలో కనిపించి "నువ్వు పుట్టినప్పుడు ఆరునెలలు వచ్చేవరకూ
నేనే నీకు ఒళ్ళు తోమి స్నానం చేయించేదాన్న"ని గుర్తు చేసి మురిసిపోయి,
"ఓ యాభై రూపాయలుంటే ఇవ్వు బాబా నాలుగు లంక పొగాకు
చుట్టపీకలు కొనుక్కుంటా" అని అడిగింది, జేబులో వంద ఉంటే తీసి ఇచ్చేశాను.
ముందు దండం పెట్టి తర్వాత ముద్దు పెట్టుకుంది.
మనిషి దగ్గర చుట్ట కంపు వస్తుంది కానీ మనసు మాత్రం
పుట్టినప్పుడు ఎంత స్వచ్చంగా వుందో ఇప్పుడూ అలాగే ఉన్నట్టనిపించింది.
నారాయుడు తాత అయితే ఆధార్ కార్డు, తెల్ల కార్డు బయటికి తీసుకొచ్చి చూపించి,
"ఇదుంటే చాలు రా మనవడా నెలకి రెండొందల పింఛను, రూపాయికే కిలో బియ్యం
వస్తాయి" అని ప్రపంచం లో ఏ సమస్యకయినా బ్రహ్మాస్త్రం తన దగ్గరే ఉన్నంత ధీమా గా చెప్పాడు.
ఎంత అల్ప సంతోషులు? ఒక బిల్ గేట్స్ గురించి తెలీదు, ఒక ఒబామా గురించి తెలీదు,
యోగా, ధ్యానం, ఐ-ఫోన్, అబధ్ధం ఇవేమీ తెలీదు.
ఇప్పటి వరకూ మనం గ్రైండర్ లు వచ్చాక రుబ్బు రోళ్ళు, పురుగు మందులొచ్చాక పిచ్చుకలు,
జనారణ్యాలు వచ్చాక  పులులే అంతమయిపోతున్నాయనుకున్నాం
కానీ, ఇలాంటి మనుషులు కూడా ముందు ముందు మనం చూద్దామన్నా కనిపించక పోవచ్చు.
వీళ్ళతోపాటే కొన్ని కధలు, మాటలు, పాటలు, కొన్ని భావోద్వేగాలు అంతమైపోతాయి.
మాయన్ లు చెప్పింది యుగాంతం గురించి కాదనుకుంట.
ఇలాంటి "మనుషుల" యుగం అంతం గురించే అనుకుంట.
మనమే తప్పుగా అర్ధం చేసుకున్నాం.
కానీ ఇలాంటి "మనుషుల" ని భర్తీ చేసే మనుషులు మాత్రం మళ్ళీ రారు
పోతే పోనీ, ఏం చేస్తాం ఎంతయినా వేగము = దూరము/కాలం.

Monday, April 15, 2013

ఆ అమ్మాయి

ఆదిలక్ష్మి మళ్ళీ ఊరొచ్చేసిందని చెప్పుకోవటం మొదలెట్టారు ఓ రోజు పొద్దున్నే మా ఊరి జనం.

             రెండు రోజుల క్రితం రాత్రి ఫిబ్రవరి నెల చలికి ఆగలేక, ఎత్తుపళ్ళ వీరన్న చుట్టు గుడిసె దగ్గర నారాయుడు తాతతో కలిసి చలి మంట వేసుకుంటుంటే, గని రాజు గారి దొడ్లో పాతరలోనుంచి లాక్కొచ్చిన తేగలు కాల్చుకోవటానికి మా పక్కకొచ్చి కూర్చున్న అంజి గాడు, అంతకు ముందు రోజు పని మీద రాజమండ్రి వెళ్ళి వచ్చేటప్పుడు నిడదవోలు బస్టాండు దగ్గర ఆదిలక్ష్మి ని చూసి మాట్లాడననీ,  ఈ మధ్యనే చనిపోయిన వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యల గురించీ, ఆదిలక్ష్మి ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు కోపం తో రగిలిపోయిన ఊరి జనం గురించీ, ముఖ్యంగా ఆదిలక్ష్మి అదృష్టానికి అసూయతో కడుపు మండి ఆ రోజు ఊళ్ళో చాలా మంది ఆడవాళ్ళు అన్నం కూడా తినలేదని చెప్పాననీ రహస్యంగా మాతో చెప్పాడు.

           మా ఊరి బడి కి దగ్గర లో,  ఒకప్పుడు ఆదిలక్ష్మి వాళ్ళు ఉండే ఇల్లు ఇప్పుడు కూలిపోవటానికి సిద్ధంగా ఉంటే,  అప్పల నర్సమ్మ వాళ్ళు గేదుల్ని కట్టేసుకుంటున్నారు అందులో. ఆ ఇంటి చూరు కింద చిన్న అరుగు మీద కూర్చున్న ఆది లక్ష్మి ని చూడటానికి ఒక్కొక్కళ్ళు వచ్చి వెళ్తున్నారు ఊళ్ళో జనం. మనిషికి తగ్గ పేరు పెట్టు కుందని ఒకప్పుడు అందరూ చెప్పుకున్న ఆదిలక్ష్మి, వేసవి కాలం మా ఊరి కాలవ గట్టు మీద గడ్డి మొక్కల మధ్య రోహిణీ కార్తె ఎండలకి నీళ్ళు లేక మట్టిగొట్టుకు పోయి వాడిపోయిన తులసి మొక్కలా కనిపిస్తుందిప్పుడు. కళ్ళు పీక్కుపోయి బాగా లోతుకెళ్ళిపోయి ఉన్నాయి. అసలు ఈ అమ్మాయి అంత చిన్న చిన్న కళ్ళతో ఎలా చూడగలదా? అనిపిస్తుంది ఇప్పుడు ఆదిలక్ష్మి ని కొత్తగా చూసినవాళ్ళెవరికయినా,  కానీ ఇదివరకయితే మాత్రం ఆదిలక్ష్మి కళ్ళు చూసి అంత విశాలమయిన కళ్ళు చూడాలంటే మన రెండు కళ్ళూ సరిపోవేమో అనిపించేది.  మనిషి అంత రంగు లేకపోయినా,  ఆదిలక్ష్మి ని చూసిన ఎవరయినా,  ఇంత అందమయిన అమ్మాయిని ఈ చుట్టు పక్కల ఊళ్ళళ్ళో ఎక్కడా చూడ లేదని చెప్పేవారు కానీ,  ఎందుకంత అందం గా ఉంటుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోయే వాళ్ళు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరిని చూసినా పసిపాప లా నవ్వే స్వచ్చమయిన నవ్వే ఆ అమ్మాయి అందమని కొంతమందంటే, కాదు నవ్వు కన్నా నవ్వినప్పుడు ఆ అమ్మాయి కళ్ళు ఇంకా అందంగా ఉంటాయని ఇంకొంతమంది అనేవారు. ఓ సారి ఆదిలక్ష్మి  వాళ్ళ తాతకి కూలి డబ్బులు ఇవ్వలేదని మేస్త్రి పంజా వెంకటేశులు మీదకి ఆదిలక్ష్మి దెబ్బలాటకెళ్ళి కళ్ళెర్రచేస్తే భయపడిపోయి, డబ్బులిచ్చేసిన వెంకటేశులు మాత్రం అప్పట్నుంచీ ఆ అమ్మాయి కళ్ళు చూస్తే భయమని చెప్పేవాడు.  ఊళ్ళో అందరికీ జాతకాలు, ముహూర్తాలు చూసే బ్రాహ్మల అబ్బాయి గారి ఆచారి గారు మాత్రం ఆదిలక్ష్మి అదేదో నక్షత్రం లో పుట్టిందనీ, ఆ నక్షత్రం లో పుట్టిన వాళ్ళు తప్ప ఇంకెవరూ అంత అందం గా ఉండలేరనీ అన్నారొకసారి .

          ఇదివరకయితే ఊరి జనానికి విన సొంపయిన మువ్వల శబ్దం వినపడాలంటే రెండే రెండు సందర్భాలు. అంత పెద్ద మైసూరు ఎద్దులకి దిష్టి తగలకుండా,  మెడలో వెంట్రుకలతో చేసిన తాడుకి మువ్వలు కట్టి  బండి మీద దాళ్వా, సార్వా ల్లో పంట చేతికి రాగానే పొలాల్లోంచి, మిల్లులోకి ధాన్యం తోలడానికి పెద్ది రాజు బండి కట్టినప్పుడు ఒకసారి, సన్నని నడుము కింద వరకూ వున్న ,ఇంత లావు పొడుగు జడకి జడ గంటలు తోను, కాళ్ళకి మువ్వల పట్టీలతోను, ఉగాది పండగ రోజు ఇంటింటికీ ఉగాది పచ్చడి పంచిపెడుతూనో, ప్రతీ సంవత్సరం సంక్రాంతి వెళ్ళగానే మా ఊరి గ్రామ దేవత కప్పాలమ్మ కి జరిగే జాతర లో మొక్కు తీర్చుకున్న అరటి గెలల్లోని అరటిపళ్ళు అందరికీ పంచిపెడుతూనో ఆదిలక్ష్మి చలాకీగా ఊరంతా తిరిగినప్పుడు ఇంకోసారి.

          అరుగు మీద కూర్చుని,  చూడటానికొచ్చిన జనం అడిగే ప్రశ్నలన్నిటికీ పొడి పొడి గా సమాధానాలు చెబుతున్న ఆదిలక్ష్మి కి మధ్యాహ్నం భోజనం సమయానికి అప్పల నరసమ్మ కోడి గుడ్డు పులుసు కూరతో అన్నం తీసుకొచ్చి పెడితే, సరిగ్గా కడుపు నిండా భోజనం చేసి చానాళ్ళు అవటం వల్లనో, ఊరి భోజనం ఇంతకాలానికి తింటున్నామన్న ఆనందం వల్లనో తెలీదు గానీ గబ గబా, ఆబగా తినేసింది. అసలు ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మా, నాన్న ఉండేది కొల్లేరు దగ్గరలో అడవి కొలను అనే ఊళ్ళో. ఆదిలక్ష్మి కి అయిదేళ్ళు వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నా ట్రాక్టర్ మీద పొలం పనులు కి వెళ్ళేటప్పుడు ట్రాక్టరు తిరగబడిపోయి చనిపోయాక,  మా ఊళ్ళో ఉండే అమ్మమ్మా, తాతయ్యా  ఆదిలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే అప్పట్నుంచీ మా ఊళ్ళో చాలా మంది ఆదిలక్ష్మి ని వాళ్ళ సొంత ఇంట్లో పిల్లాలాగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆదిలక్ష్మికి పెళ్ళి వయసొచ్చాక మంచి సంబంధం చూసి చేసేద్దామని అందరూ అనుకునే సమయానికి, విదేశాలకి రొయ్యలు, చేపలు ఎగుమతి చెయ్యటానికి వ్యాపారం కోసం మా ఊరి చుట్టుపక్కల పెద్ద రైతుల దగ్గర చెరువుల్లో పెంచే చేపలు, రొయ్యలు కొనడానికి పెద్ద కారేసుకుని అప్పుడప్పుడూ మా ఊరొచ్చే రాంపండు, ఆదిలక్ష్మిని చూసి తనతో వస్తే పెళ్ళి చేసుకుంటానంటే,  తెలిస్తే వద్దంటారని ఊళ్ళోను, ఇంట్లోను ఎవరితోనూ చెప్పకుండా రాంపండు తో వెళ్ళిపోయింది.

             అలా వెళ్ళిపోయాక ఆదిలక్ష్మిని రాంపండు పెళ్ళి చేసుకోలేదు గానీ, బెంగుళూరు, హైదరాబాదు లాంటి చాలా ఊళ్ళన్నీ తిప్పి కొన్నాళ్ళకి ఆ అమ్మాయిని చావగొట్టి బయటికి గెంటేసి,  వాళ్ళకి తగిన సంబంధం చూసుకుని పెళ్ళిచేసుకున్నాడని, ఆ రోజు అరుగు మీద కూర్చుని ఆదిలక్ష్మి చెపితేనే మా ఊరి జనమందరికీ తెలిసింది. ఆ తర్వాత మొహం చెల్లక ఊరికి మళ్ళీ మొహం చూపించని ఆదిలక్ష్మి,  మళ్ళీ ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు కానీ,  తిరిగొచ్చిన ఆదిలక్ష్మి ఇప్పుడయినా ఊళ్ళో ఉండిపోతుందేమో అనుకున్నారు ఊరి జనం.

            కానీ ఆదిలక్ష్మి మాత్రం అదే రోజు సాయంత్రం చీకటి పడుతుండగా ఎంతమంది చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ వెలగపల్లి రోడ్డు దగ్గర కనిపించిన అంజిగాడితో "తినడానికి కూడా లేకపోవటం ఒక్కటే దౌర్భాగ్యం కాదు, అన్నీ ఉన్నా, మనతో పాటు కలిసి కూర్చుని తినటానికి ఎవరూ లేకపోవటం కూడా దౌర్భాగ్యమే, ఇప్పుడు నా దగ్గర రెండూ లేవు.  ఒకప్పుడు వాళ్ళు పెట్టింది తిని పెరిగిన నేను అంత గొప్పింటికి వెళ్ళిపోయాననుకుని అసూయతో కడుపు మండిన చాలా మంది ఊరి జనానికి, ఇప్పటి నా పరిస్థితి చూశాకయినా మనశ్శాంతి కలుగుతుందేమోనని" మళ్ళీ ఊరొచ్చానని చెప్పి,  వెళ్తూ వెళ్తూ చీకట్లో కలిసిపోయింది ఆదిలక్ష్మి. అన్నట్టు ఆ రోజు కూడా ఆదిలక్ష్మి పరిస్థితి  చూసి కడుపు తరుక్కుపోయి ఊళ్ళో ఎవరూ అన్నం తినలేదు.

Friday, March 1, 2013

జిలాబా కల

                   బంగార్రాజు గారి చెరువుకి దగ్గరలో రోడ్డుకానుకుని పొలాల మధ్య పెద్ద మండువా లోగిలి పెంకుటింట్లొ ఉండేవాడు మా ఫ్రెండు బాలాజి. వాళ్ళ నాన్న మీసాల సత్యనారాయణ మా ఊళ్ళో ఓ మాదిరి పెద్ద రైతు. వాడు, నేను, మా కుమ్మరోళ్ళ ప్రసాదు ఊరి బళ్ళో ఐదో తరగతి దాకా కలిసి చదువుకున్నాం. బాలాజీ గాడు ఎక్కడ విన్నాడో ఏమో తెలీదు గానీ నా పేరు గోపి కాబట్టి గో.పి అంటే గోడ మీద పిల్లి అనీ, ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అనీ మా ఇద్దరినీ బాగా వేళా కోళమాడి తెగ ఏడిపించేవాడు. దాంతో వాడి మీద మా ఇద్దరికీ పీకల్దాకా వచ్చేసి వాడిక్కూడా అలాంటి పేరే ఏదో ఒకటి పెట్టాలని తీవ్రం గా ఆలోచించి, చివరికి బాలాజి తిరగేస్తే జిలాబా కాబట్టి దాన్నే కొంచెం మార్చి వాణ్ణి జిలేబీ గాడనో జిలాబా గాడనో అందరి దగ్గరా ప్రచారం చేసి ఆనంద పడిపోయే వాళ్ళం. వాడి ఐదో తరగతి అయిపోయాక మాత్రం వాళ్ళ నాన్నకి ఎవరో "ఈ రోజుల్లో ఇంగ్లీషు మీడియం లో చదవకపోతే భవిష్యత్తు ఉండద"ని చెబితే భయపడిపోయి, ఆరో తరగతి నుంచీ మాత్రం తాడేపల్లిగూడెం లో బుజ్జి సారు గారి ఇంగ్లీషు మీడియం బళ్ళో చేర్పించేశారు. అప్పటి వరకూ బాగానే చడివేవాడు గానీ ఇంగ్లీషు మీడియం లో చేరాక  అటు తెలుగు పూర్తిగా రాక , ఇటు ఇంగ్లీషు అర్ధం కాక అన్నీ అత్తెసరు మార్కులతో పాసయ్యేవాడు.

                      మా అందరికీ బీయస్సీ చివరి సంవత్సరం పరీక్షలయిపోయాక,  ఓ రోజు వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం చెరువు గట్టు మీద నేరేడు చెట్టు నీడలో, పాత ప్రెసిడెంటు రంగ బాబు గారు వేయించిన సిమ్మెంటు బెంచీ మీద కూర్చుని, డిగ్రీలయిపోయాక ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటుంటే,  ఏమడిగినా సినిమా పాటల్లో సమాధానం చెప్పే మా ప్రసాదు గాడు గణపవరం లో ఏ ప్రైవేటు బళ్ళోనో పిల్లలకి లెక్కలు చెప్పుకుంటూ "పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్" అని వాడి జీవిత లక్ష్యాన్ని పాట లా పాడి వినిపించేశాడు. బాలాజీ గాడు మాత్రం ఎప్పుడూ మట్టి కొట్టుకుపోయిన ఈ పల్లెటూళ్ళో పడి ఉండటం కంటే ఏ ఎంసీఏ నో చదివి అమెరికా వెళ్ళి స్థిరపడాలన్న తన కల నెరవేరే వరకూ నిద్ర పోనని బెంచీ గుద్ది మరీ చెప్పేసరికి మేమెవ్వరం కలలో కూడా ఊహించ లేని దానిని చేస్తానని వాడు అంత నమ్మకం గా చెబుతుంటే, వాడి పట్టుదల చూసి ముచ్చటేసి "అదే జరిగితే మన ఊరి మొత్తానికి మొట్టమొదట విమానమెక్కి ప్రయాణం చేసింది నువ్వే అవుతావనీ, ఆ రోజు ఊరంతా నీ పేరు మారు మోగి పోతుంద"నీ వాడి భుజం తట్టి ప్రోత్సహించాం.

                  అనుకున్నట్టే బాలాజీ గాడికి ఇక్కడెక్కడా ఎంసీయే సీటు రాకపోయినా గానీ, చెన్నయ్ దగ్గర అదేదో ఊళ్ళో డొనేషన్ కట్టి మరీ చేరిపోయాడు. ఆ తర్వాత చదువయిపోయి హైదరాబాదు లో ఏదయినా పెద్ద సాఫ్ట్ వేరు కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్ళిపోదామనుకునేసరికి బిన్ లాడెన్ అమెరికా మీద బాంబులేసేసి వస్తాయనుకున్న ఉద్యోగాలన్నీ వెనక్కెళ్ళి పోతే, బాలాజీ గాడు బెంగ తో మంచమెక్కినంత పని చేశాడు. "ఈ అమెరికా గొడవంతా వదిలేసి ఇక్కడే అందరిలాగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని అత్త కూతురి ని పెళ్ళి చేసుకుని తమతో పాటే ఉంటే చాల"ని వాళ్ళ అమ్మా నాన్నా ఎంత చెప్పినా వినకుండా ఎలాగయినా అమెరికా వెళ్ళి తీరతానని భీష్మిచుకుని కూర్చున్నాడు.

             సరిగ్గా అప్పుడే వాడి కోసం ఆ దేవుడే  పంపించినట్టు, వాడి తో పాటు ఎంసీయే చదివిన అత్తిలి రామారావు గారి చిన్నా వచ్చి,  హైదరాబాదు హైటెక్ సిటీ లో ఉండే "శ్రీ వెంకటేశ్వరా టెక్నాలాజికల్ కన్సల్ టెన్సీ సర్వీసెస్" సాఫ్ట్ వేరు కంపనీ వాళ్ళు ముందు యాభై వేలు కడితే ఉద్యోగమిచ్చి నెలకి ఏడు వేలు జీతమిచ్చి ఆరు నెలల తర్వాత పదిహేను వేలు చేసి, సంవత్సరం తిరక్కుండా అమెరికా కూడా పంపిస్తారని చెప్పి, రంగు రంగుల బ్రోచర్ ఒకటి చేతిలో పెడితే,  దెబ్బకి బాలాజీ లేచి కూర్చున్నాడు. "ఉద్యోగం ఇచ్చేవాడు మనకి జీతం ఇవ్వాలి గానీ, మన దగ్గర డబ్బులు తీసుకుని మనకే ఇస్తాడంటే ఇదేదో తిరకాసు లా ఉంది" రా అంటే "దేవుడి పేరు తో కంపెనీ పెట్టి మోసం చేస్తాడా?" అని ప్రశ్న, సమాధానం ఒకే ముక్కలో చెప్పేశాడు. ఏదేమయినా గానీ వాడి అమెరికా కల నెరవేరితే అదే చాలని హైదరాబాదు బస్సెక్కించేస్తే,  అమెరికా వెళ్ళిపోతున్నామన్న ఆనందం లో వాళ్ళిద్దరూ చెరొక యాభై వేలూ కట్టేసి  ఉద్యోగం లో చేరి పోయారు.

              హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ కాదు గానీ , దానికి దగ్గర లోనే ఓ చిన్న రెండంతస్తుల భవనం లో "శ్రీ వెంకటేశ్వరా టెక్నలాజికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్" లో ఓ నాలుగు నెలలు బాలాజీ ఉద్యోగం బాగానే సాగింది గానీ ఆ తర్వాత ఆ కంపనీ వాళ్ళే ఇలా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని ఓ నాలుగైదు కోట్లు పోగయ్యాక బోర్డు తిప్పేసి కంపెనీ మూసేసి ఎటో పారి పోయారని ఓ రోజు రాత్రి తొమ్మిదింటికొచ్చే ఈటీవీ వార్తల్లో చెప్పారు.ఇప్పటికయినా ఇంటికొచ్చెయ్యమని వాళ్ళ అమ్మా , నాన్న ఫోను చేసి ఎంత చెప్పినా వినకుండా "ఎండ వస్తే దుమ్ము, వాన వస్తే బురద, ఈగల మోత, కరెంటు కోత, దోమలకి రక్త దానం తప్ప ఏమీ లేని ఆ ఊళ్ళో ఉండలేన"నీ అయినా "మొన్న కోఠి వెళ్ళినప్పుడు ఫుట్ పాత్ మీద చిలక జోస్యం చెప్పినోడు తనకి విదేశీ యోగం ఉందని బల్ల గుద్ది మరీ చెప్పాడ"నీ చెప్పే వాడు.

                చిలక జోస్యం తర్వాత బాలాజీ గాడికి నమ్మకం ఇంకా పెరిగి పోయి,  అమెరికా వెళ్ళాక ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడక పోతే బాగోదని, ట్యాంకు బండ దగ్గర రామకృష్ణ మఠం లో ఇంగ్లీషు కోర్సు అప్లికేషన్ కష్ట పడి సంపాదించి కోర్సు లో చేరి పోయాడు. ఆ తర్వాత నెల నెలా ఇంటి నుంచి డబ్బులు పంపమనటం ఇష్టం లేక అమీర్ పేట లో ఏదో చిన్న కంపెనీ లో నెలకి రెండు వేలు జీతానికి చేరిపోయి, సంవత్సరం తర్వాత సాఫ్టు వేరు ఊపందకున్నాక ఐబీయం లో ఉద్యోగం సంపాదించి మూడు నెలలు తిరక్కుండా అమెరికా వెళ్ళి స్థిరపడిపోయాడు. అప్పట్నుంచీ మా ఊళ్ళో చదువుకునే కుర్రాళ్ళందరికీ బాలాజీ గాడిని ఆదర్శం గా చూపించేవారు.

                 అమెరికాలో బాలాజీ తో పాటే పనిచేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ఫిలాసఫీ మాట్లాడే హైదరాబాదు నుంచెళ్ళిన సూర్యం మాత్రం బాలాజీ గాడితో ఓ సారి పిచ్చా పాటీ మాట్లాడుతూ "వచ్చే సంవత్సరం ప్రోజెక్ట్ అయిపోగానే హాయిగా హైదరాబాదు వెళ్ళి పోయి అమ్మా నాన్నలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పల్లెటూళ్ళో పుట్టి పెరిగినా గానీ, అత్త కూతురిని పెళ్ళి చేసుకుని ఓ పదిహేనేళ్ళ తర్వాత,  వచ్చిన డబ్బుతో అమ్మమ్మ గారి ఊరేళ్ళి పోయి చెరువు పక్కన పచ్చని పొలాల మధ్య పెద్ద మండువా లోగిలి పెంకుటిల్లు, నాలుగెకరాల పొలం, రెండు గేదులు కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ, ఆరు బయట చల్ల గాలి లొ పడుకుని పొద్దున్నే మెలకువ రాగానే ఆకాశం లో బారులు బారులు గా ఎగిరే కొంగలు లెక్క పెట్టుకుంటూ, ఇష్టమయిన పుస్తకాలు చదువుకుంటూ, కథలు, కవితలు రాసుకుంటూ ప్రశాంతం గా ఆ పల్లెటూళ్ళో కాలం గడిపేయ"టమే తన జీవితాశయమని చెప్పాడు. సూర్యం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కూడా మా ఊరి దగ్గరలోనే ఉన్న లక్ష్మీ పురం.

Thursday, February 28, 2013

స్వాములోరి పాము

               మా ఊరికి సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరం లో ఉండే కొత్తపల్లి లో కూడా మా ఊరికి మల్లే రామాలయం ఉంది. మా ఊళ్ళో రామాలయం లో పూజారులు ఎవరూ ఉండే వారు కాదు, ధ్వజ స్థంభం కూడా లేదు. ధ్వజ స్థంభం లేకపోతే ఊరికి అరిష్టమని ఓ సారి పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.కొత్తపల్లి లో ఉండే రామాలయం లో ధ్వజస్థంభం ఉండేది గానీ పూజారులు ఎవరూ ఉండే వారుకాదు.ఎప్పుడయినా పండక్కో, పబ్బానికో మాత్రం గుడికి దగ్గరలో పెంకుటింట్లో ఉండే నారాయణ స్వామి గారు గుళ్ళో దీపం వెలిగించి, తీర్థం ఇచ్చే వారు. ఓ సారి వైకుంఠ ఏకాదశి నాడు నారాయణ స్వామి గారు తెల్లవారు ఝామునే లేచి ఇంటెనకాల ఆవులు, గేదులు ఉండే పాక లో పాల తెపాల తో నీళ్ళు తీసుకెళ్ళి ఆవు పొదుగు శుభ్రం గా కడిగి  పాలు తియ్యబోతుంటే పక్కనే వీధి దీపం వెలుగులో ఏదో తెల్లగా మెరుస్తుంటే దగ్గరికెళ్ళి చేతిలోకి తీసుకోబోయి అదిరిపడి, భయపడి వెనక్కి పెరుగెట్టారు.ఇంత పెద్ద గోధుమ త్రాచు పాము లుంగ చుట్టుకుని పడుకుని ఉందక్కడ.
                    
                   గబగబా ఇంట్లోకెళ్ళి భార్యనీ, కోడుకునీ, అందరినీ పిలుచుకొచ్చి ఎటూ కదలకుండా అక్కడే పడుకున్న తాచు పాముని చూపించారు.దాని చూసి నారాయణ స్వామి గారి కొడుకు పెద్ద కర్ర తీసుకొచ్చి చంప బోతే వాళ్ళమ్మ గారు పండగ పూట సాక్షత్తూ ఆ విష్ణు మూర్తి పవళించే ఆది శేషుని అవతారమయిన సర్పాన్ని చంపకూడద నీ, కాస్సేపుంటే అదే పొలాల్లోకెళ్ళిపోతుందనీ చెపితే దాన్ని అలాగే వదిలేశారు.

                                 సూర్యోదయమయ్యాక మళ్ళీ అక్కడికెళ్ళి చూస్తే ఇంకా ఆ పాము అక్కడే ఉంది గానీ ఎటూ కదల్లేదు.ఈ లోగా ఇరుగు పొరుగు ఇళ్ళల్లో జనం కూడా వచ్చి చూస్తే పాము ఒక్క సారి తల పైకెత్తి పడగ విప్పి మళ్ళీ యధా స్థానం లో పడుకుండి పోయింది. పాము నెత్తి మీద శ్రీ కృష్ణ పాదాలు చూసిన జనం ఈ పాము సాక్షాత్తూ నాగ దేవత అవతారమని పసుపు, కుంకుమ, అగరొత్తులు తీసుకొచ్చి పూజ చేసి దణ్ణం పెట్టుకుని వెళ్ళి పోయారు. నారాయణ స్వామి గారి పాకలో పాము గురించి ఆ ఊళ్ళో అయిదో తరగతి దాకా ఉండే బళ్ళో పిల్లలందరికీ తెలిసి పోయి మధ్యాహ్నం భోజనం బెల్లు కొట్టి నప్పుడు బిల బిలా అని వచ్చి అంత పెద్ద పాముని చూసి విచిత్రం గా చెప్పుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ విషయం ఊరంతా తెలిసి పోయి జనాలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చూసి దణ్ణం పెట్టుకుని అరటి పళ్ళు, కొబ్బరి కాయలు, పాలు, గుడ్లు నైవేద్యం పెట్టి వెళ్ళిపోయే వారు.  ఆ తర్వాత కూడా ఆ పాము ఎటూ కదలకుండా అక్కడే ఉంటే నారయణ స్వామి గారికి పామంటే భయం పోయి భక్తి మొదలయ్యింది. ఆ నాగ దేవతే తమ ఇంటి దగ్గర వెలిసిందని భక్తి తో పూజ చేసి దాని దగ్గరే కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలిచ్చేవారు. ఈ విషయం అర్ధవరం లో ఉండే సిధ్ధాంతి గారికి తెలిసి వచ్చి చుట్టుపక్కలంతా పరిశీలించి ఇదంతా ఈ స్థలం మహిమే అని, అందుకే ఈ సర్పం ఇక్కడికొచ్చి స్థిర పడిందనీ, అక్కడికి దగ్గరలో ఎప్పటి నుంచో ఉన్న రెండు తలల  తాడి చెట్టుని చూపించి ఈ విచిత్రమయిన చెట్టు ఇక్కడ ఉండటానికి కారణం కూడ అదే అని చెప్పారు.
                            
                            ఆ తర్వాత నుంచీ పాము అక్కడక్కడే తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి లుంగ చుట్టుకుని పడుకుండిపోయేది.నారాయణ స్వామి గారు భక్తులందరికీ ప్రసాదాలిచ్చి , పాముకి నైవేద్యం పెట్టి అప్పుడప్పుడూ దాన్ని చేతితో ముట్టుకున్నా కూడా ఏమీ అనేది కాదు. తర్వాత నుంచీ ఆ ఒక్క కొత్త పల్లి జనమే కాకుండా మా ఊరు లాంటి చుట్టుపక్కల ఊళ్ళ జనం కూడా తండోప తండాలుగా వచ్చి దర్శించుకుని కోరికలు తీర్చమని మొక్కుకునేవారు. అలా వెళ్ళిన చాలా మందికి కోరికలు తీరాక మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకునేవాళ్ళు. జనం ఎక్కువయిపోవటం తో ఆ ఊరు తీర్థ క్షేత్రం లాగా అయిపోయింది. అక్కడికి దగ్గర్లోనే పొలాల మధ్యలో సోడా కొట్లు, బడ్డీ కొట్లు, పిల్లల బొమ్మలమ్ముకునే కొట్లూ వచ్చేసి రకరకాల బొమ్మలు అమ్మటం మొదలెట్టేరు. చిన్న పిల్లలు గాలి బొంగరాలు కొనుక్కుని అటూ ఇటూ పరుగెట్టే వాళ్ళు. పరిమిళ్ళ నుంచొచ్చే జీళ్ళ గంగయ్య ఒక స్థంభం పాతి దాని మేకుకి జీళ్ళ పాకమేసి లాగి , నువ్వులేసి చేసిన వేడి వేడి జీళ్ళు అమ్మేవాడు. చిట్టెమ్మ పుణుకులమ్మేది. మధ్యాహనం ఎండలో పడి వచ్చినోళ్ళు సోడా సుందరయ్య దగ్గర నిమ్మ సోడాలు, గోల్డుస్పాట్ రంగు నీళ్ళు తాగే వాళ్ళు. ఓ సారి మా ఊరి నుంచెళ్ళిన వెంకట రత్నం గారి చిన్నోడు తప్పిపోయి ఏడుస్తుంటే మైకు సెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తే వాళ్ళమ్మా, నాన్నా గబగబా వచ్చి తీసుకెళ్ళారు.

                               పుట్టు గుడ్డి అయినా గానీ హార్మోనియం వాయించటం లో చాలా గొప్పాయన అని అందరూ చెప్పుకునే కేశవయ్య గారిని తీసుకొచ్చి ఓ రోజు భజన కార్యక్రమం పెట్టించి పాటలు పాడించారు. తర్వాత రోజు నుంచీ చుట్టు పక్కల ఊళ్ళళ్ళో ఉండే ధాన్యం వ్యాపారులు, పొగాకు వ్యాపారులు కలిసి చందాలేసుకుని రాత్రిళ్ళు "పున్నమి నాగు", "వేట గాడు" లాంటి వీధి సినిమాలేసారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాజ కీయాల్లో తిరిగే ముగ్గుళ్ళ పెద్దబ్బులు గారు వచ్చి దర్శనం చేసుకుని ఆ తర్వాత రోజునుంచీ వచ్చిన భక్తులందరికీ అన్న దానం చేయ్యమని రోజుకి మూడు బస్తాల బియ్యం పంపేవారు.అమెరికా వెళ్ళొచ్చిన అర్ధవరం పెద్ది రాజు గారు అవసరమయితే విరాళాలు పోగు చేసి గుడి కట్టిస్తానని మాటిచ్చి,  ఆయన దగ్గరి బంధువు,  మా నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన బాపి రాజు గారితో మాట్లాడి ఆ ఊరికి రోడ్డు, బస్సు సౌకర్యం వచ్చేలా చేస్తానని చెప్పారు.

                  కొత్తపల్లికి బస్సు రావాలంటే మా ఊరి మీద నుంచే రావాలి కాబట్టి మా ఊరి మధ్య లోంచి పెద్ద రోడ్డు పడి, బస్సు తిరగటం మొదలెట్టాక ఊరి దశ తిరిగిపోద్దని చెప్పునేవాళ్ళు మా ఊరి జనం.

                         ఇంకో రెండు మూడు రోజుల్లో బస్సు, రోడ్డు శాంక్షను చేసేసినట్టు గవర్నమెంటు ఆర్డరు వచ్చేస్తుందని అందరూ అనుకునే సమయానికి,  పాము నారాయణ స్వామి గారిని కాటేసి ఆయన చచ్చి పోతే, పాము కూడా ఎటో వెళ్ళి పోయింది. కొన్ని రోజులకి నారాయణ స్వామి గారినీ, పామునీ, రెండు తలల  తాడి చెట్టునీ అందరూ మర్చి పోయి మామూలుగా మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయారు.

Tuesday, January 15, 2013

రాంబాబు చిన్నాన్న

                 నేను అయిదో తరగతిలో ఉండగా దశరా సెలవులకి మా ఊరికి ఆరేడు కిలోమీటర్ల దూరం లో బువ్వనపల్లి లో ఉండే మా మేనత్త, వాళ్ళ పెద్ద గేది ఈనిందని, నాకు జున్నంటే ఇష్టమని మా ఊరొచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది.రోజూ నా వాటా జున్ను, నాకిష్టమయిన పరమాన్నం కూడా తినేసాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కొంచెం దూరం లో పక్క వీధి లో ఉండే మా దూరపు బంధువు వరుసకి నాకు చిన్నాన్న అయ్యే, నా కన్నావయసు లో నాలుగయిదేళ్ళు పెద్ద వాడయిన రాంబాబు చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాడిని. వాళ్ళ ఇంటెనకాల పెద్ద రావి చెట్టు దాని మీద పిచ్చుక , కాకి గూళ్ళు ఉండి ఇంకా రామ చిలుక, పాల పిట్ట, గోరువంక లాంటి పిట్టలు అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళిపోయేవి.ఇంటి చుట్టూ రకరకాల కాయగూర మొక్కలతో, ఇంటి మీద, ఇల్లంతా అల్లుకు పోయిన ఆనపకాయ పాదు తో వాళ్ళ ఇల్లు నిజంగానే ఆకుపచ్చని బొమ్మరిల్లు లా ఉండేది. నేను వెళ్ళాక ఇద్దరం కలిసి పొలాల్లో పిల్ల కాలవలో చేపల కోసం ముందు రోజు వేసిన మావులు బయటికి తీసేవాళ్ళం. ఆ మావుల్లో ఒక్కో సారి చిన్న చేపలు, మట్టగుడసలు, బొమ్మిడాయలు, గొరకలు తో పాటు పెద్ద పెద్ద పాములు కూడా పడేవి. ఆ పాముల్ని జాగ్రత్తగా మళ్ళీ కాలవలో వదిలేసి చేపలన్నీ తీసుకుని, మధ్య మధ్య లో పొలం గట్ల మీద కనిపించే చిన్నచిన్న ఈత మొక్కల్ని వేళ్ళ తో సహా పెకిలించి కొడవలి తో దాన్ని మధ్య లోకి కోసి, అందులో ఉండే తెల్లని తియ్యగా ఉండే మొవ్వు తినమని నాకు ఇచ్చే వాడు, ఇంకా ఎక్కడయినా కుండ పెంకులు కనిపిస్తే తీసుకుని వాటితో దారిలో చెరువుల్లో, కాలువల్లో కప్ప గంతులు వేసుకుంటూ ఇంటికొచ్చేసేవాళ్ళం.

                          రాంబాబు చిన్నాన్న వాళ్ళ నాన్న మా చిన్న తాత అచ్చం "తాత మనవడు" సినిమా లో యస్వీ రంగారావు లా ఉండే వాడు.వ్యవసాయం పనులు తప్ప స్థోమత, శ్రద్ధ లేక వాళ్ళు గానీ, చుట్టాలు, మిగతా బంధువుల్లో గానీ ఎవరూ చదువుకోలేదు అందుకే అందర్లోకి నేనే చదువుకుంటున్నానని నన్నెంతో గొప్పగా చూసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ. ఓ సారి మా చిన్న తాత నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నాచేత మా తెలుగు వాచకం లోని "సత్యమేవ జయతే" అనే పాఠం మొత్తం చదివించుకుని విని మురిసిపోయాడు. మా రాంబాబు చిన్నాన్నయితే నన్ను భుజాలకెత్తుకుని "మా వాడు బాగా చదివేస్తాడు అప్పుడే వీడికి ఉత్తరాలు రాయటం చదవటం కూడా వచ్చేసు" నని ఊరంతా ఊరేగినంత పని చేసే వాడు.నేనెప్పుడయినా రాజమండ్రి మా మావయ గారి ఊరెళ్తే అస్తమాను

యాభయ్యేడు పదమూళ్ళెంత ?

నూట పన్నెండు లోంచి ఇరవై ఎనిమిది తీసేస్తే ఎంత ?

కేజి ఇనుము ఎక్కువ బరువా ? కేజి దూది ఎక్కువ బరువా ?

ఒక చెట్టుమీద పన్నెండు కాకులుంటే అందులో ఒక కాకి ని వేట గాడు తుపాకీ తో కాల్చేస్తే ఇంక చెట్టు మీద ఎన్ని కాకులుంటాయ్ ?

ఒక పిల్లి ఒక ఎలుకని ఇరవై నిమిషాల్లో తింటే తొమ్మిది పిల్లులు తొమ్మిది ఎలుకల్ని తినడానికి ఎంత సమయం కావాలి ?

లాంటి నాకిష్టం లేని కష్టమయిన లెక్కలూ, లాజిక్కులూ అందరి ముందూ అడిగే మా ఇంజినీరు మావయ్య, మా ఊరొచ్చినప్పుడు కూడా ఇలాగే అడిగి మా ఊళ్ళో కూడా నాకేమీ రాదని అందరూ అనుకునే లాగ నాపరువు తీసేసే వాడు.అలా కాకుండా మా రాంబాబు చిన్నాన్న వాళ్ళందరూ నన్ను ఇంత గొప్పగా చూస్తుంటే నాకు ఏనుగెక్కినంత సంతోషమొచ్చేసేది.

                        నా గురించి మా రాంబాబు చిన్నాన్న మరీ ఎక్కువ గొప్పలు చెప్పేస్తే, ఆ వీధిలోనే ఉండే నా వయసు అయిదో తరగతి పిల్లలందరూ నేనేదో పెద్ద చదివేసే వాడి లాగ, వాళ్ళందరూ చదువు రాని మొద్దుల్లగా అనిపించి మా ఇద్దరి మీదా శత్రుత్వం పెంచేసుకున్నారు.ఇంక నేను సెలవులు అయిపోయి మా ఊరు వెళ్ళిపోయే రోజు మాత్రం నన్నూ, మా రాంబాబు చిన్నాన్ననీ పిలిచి నేను నిజంగానే అంత తెలివయిన వాడినే అయితే వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళు చెప్పిన పుస్తకం చదివి చూపించమని సవాలు చేసారు.వాళ్ళ మొహాలు చూస్తే ఎలాగయినా నన్ను ఓడించాలని చూస్తున్నారనిపించినా, మహా అయితే ఏ "వినాయక చవితి వ్రతకల్పమో", "వర లక్ష్మీ వ్రతకల్పమో" ఇచ్చి అందులో తెలుగులో ఉండే సంస్కృతం కథ చదవమంటే చదివెయ్యచ్చులే అని రాంబాబు చిన్నాన్నని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.అందులో ఒకడు వాళ్ళ అన్నయ్య చదివే ఏ తొమ్మిదో, పదో తరగతి హిందీ వాచకం చేతికిచ్చి చదవమన్నాడు.ఆరో తరగతి నుంచి తప్ప మాకు హిందీ అ, ఆ లు కూడా చెప్పరనీ, ఈ పుస్తకం నేను చదవలేననీ చెప్పినా మా రాంబాబు చిన్నాన్న వినేలా లేడు.మా రాంబాబు చిన్నాన్న దృష్టిలో చదవటం వచ్చినోడికి ఏమిచ్చినా చదివెయ్యాలి చివరకి అది హిందీ అయినా, మళయాళమయినా, తమిళం అయినా సరే.చదివే వరకూ వాళ్ళు కూడా మమ్మల్ని వదిలే లా లేరు.పుస్తకం చూసి నాకు చెమటలు పట్టి చేతులు వణకటం మొదలెట్టాయి.

            ఈ ఊళ్ళో కూడా నా పరువు, నాతో పాటు నన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పినందుకు మా రాంబాబు చిన్నాన్న పరువూ కూడా పోయింది రా దేవుడా అని అనుకునే సమయానికి బళ్ళో మా అబ్రహం మాష్టారు చదివించే హిందీ "ప్రతిజ్ఞ" గుర్తొచ్చింది నాకు. "భారత దేశం నా మాతృ భూమి ..." అనే ప్రతిజ్ఞ ని అన్ని బడుల్లోనూ తెలుగులోనే చెప్పిస్తే మా బళ్ళో మాత్రం మా మాష్టారు తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీషుల్లో కూడా తెలుగులోనే రాయించి అందరి చేతా బట్టీ పట్టించి ప్రతి రోజూ పొద్దున్నే ప్రార్ధన లో రోజుకి ఒకళ్ళతో చెప్పించేవారు. వీళ్ళు కూడా నా తరగతే కాబట్టి హిందీ రాదు కదా అని నమ్మకం తో "భారత్ మేరా దేశ్ హై..." అని మొదలెట్టి దాన్నే ముందు నుంచీ, వెనకనుంచీ, మధ్య లోంచి రెండు మూడు సార్లు చదివే సరికి నేను హిందీ కూడా ఇంత బాగా, ధారాళం గా చదివేస్తున్నానని నోళ్ళెళ్ళబెట్టశారు వాళ్ళందరూ.వాళ్ళు తేరుకునే లోపు పుస్తకం వాళ్ళ చేతుల్లో పెట్టేసి మా ఊరు వెళ్ళటానికి బస్సు వచ్చేస్తుందని చెప్పి గబగబా అక్కడినుంచి బయటకొచ్చేశాను.అప్పట్నుంచీ మా రాంబాబు చిన్నాన్న కి నా మీద ఆరాధన ఇంకా ఎక్కువయిపోయి నన్ను దగ్గరుండి బస్సెక్కించి మళ్ళీ శెలవులక్కూడా తప్పకుండా రావాలని నా చేత ఒట్టేయించుకున్నత పని చేశాడు.

            ఆ తర్వాత చాన్నాళ్ళ వరకూ ఆ ఊరెళ్ళే ధైర్యం చెయ్యలేదు గానీ ఆ రోజు నాకు సంతోషాన్నిచ్చిన విషయం మాత్రం మా రాంబాబు  చిన్నాన్న కళ్ళల్లో ఆనందం. 

Saturday, January 5, 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు

                     సినిమాలు పలు రకాలు. వినోదాన్నిచ్చేవి, సందేశాన్నిచ్చేవి, ఆహ్లాదాన్నిచ్చేవి.ఉద్వేగాన్నిచ్చేవి, ఉద్రేకాన్నిచ్చేవి. ఒక్కో సారి మన దురదృష్టం కొద్దీ తలనొప్పినిచ్చేవి. "ఎటో వెళ్ళిపోయింది మనసు" వీటిలో దేన్నీ ఇవ్వదు గానీ, తనతో పాటు మనల్ని కూడా అడుగులో అడుగేయించుకుని తీసుకెళ్ళిపోతుంది. సినిమా చూసేటప్పుడు అందులోని కథలు, పాత్రలు మనకి అంతకుముందే అనుభవం లో ఉంటే లేదా ప్రస్తుతం ఆ అనుభవం నడుస్తూ ఉంటే ఆ సినిమా మన మనసుకి సులువు గా హత్తుకుంటుంది. మన మనసుకి దగ్గరగా ఉన్న సినిమా చూసాక మన అనుభవానికి కొత్త అర్ధం స్ఫురించేలా చేస్తే ఆ సినిమా మనకి చాలా అవసరం.ఇలా చాలా మందికి చాలా అవసరమయిన సినిమాల్లో "ఎటో వెళ్ళి పోయింది మనసు" కూడా ఒకటి. ప్రతి మనిషీ జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడతాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అందులోంచి "బయట" పడతాడు.ప్రేమలో మునిగి పోయాక కూడా,  శబ్ద తరంగాల చలనానికి శబ్దానికీ , శబ్దానికీ మధ్య నిశ్శబ్దం ఎంత అవసరమో,  ప్రేమ లో పరిపక్వానికి ప్రేమికుల ప్రేమకీ, ప్రేమకీ మధ్య "గొడవ" కూడా అంతే అవసరం. ద్వేషం ఉన్నచోట ప్రేమ ఉందదేమో గానీ, ప్రేమ ఉన్న చోట ఎదో ఒక సందర్భం లో ద్వేషం ఉంటుంది.ముఖ్యం గా "Conditional" ప్రేమలో కూడా "ప్రేమ" బ్రతికున్నంత వరకూ ప్రేమ ద్వేషాన్ని జయిస్తూనే ఉంటుంది. ఈ సినిమా లో ఒక అబ్బాయి అమ్మాయీ మధ్య,  బాల్యం నుంచి పెళ్ళి వరకూ ఈ జైత్ర యాత్ర మూడు సార్లు సాగింది.

               ప్రేమ కాలేజీ లో జాలీ గానే సాగినా అబ్బాయికి భాధ్యతలని నెత్తుకెత్తుకోవటం అనివార్య మయ్యాక "Continuous expression of Love" భారం గానే అనిపిస్తుంది. ఆ "Discontinuity" ని భరించలేని అమ్మాయి "Love" స్థానం లో "Hate" ని ప్రతిక్షేపించుకుని తెగే వరకూ లాగి, తెంచుకోవటం అసాధ్యమని తెలుసుకుని చివరికి కలిసి బతకాలనుకోవటం స్థూలం గా ఈ సినిమా కథ. ఇంత మంచి ప్రేమ కథ లో నాని స్నేహితుడు, సమంత స్నేహితురాలి మధ్య "ఏ మాయ చేశావే" ని అడ్డం పెట్టుకుని "ప్రేమ లేని" సందర్భాన్ని ఇరికించి పాయసం లో పచ్చిమిరపకాయ లా అడ్డం పడినా కూడా, ఆ పాత్రలకి ప్రాధాన్యాన్ని సృష్టించి ఆ విధంగా ఒక ముగింపునివ్వటం దర్శకుడి భాధ్యత.

        సమంతా మొట్టమొదటిసారి తెర మీద కనిపించే దృశ్యాని దర్శకుడు ఎంత అద్భుతం గా చిత్రీకరించాడంటే నాని మనసులో కి మన మనసు పర కాయ ప్రవేశం చేస్తుంది.

           నాని వాళ్ళ అన్నయ్య పెళ్ళి చెడిపోయిన సన్నివేశాన్ని ఎక్కడా చూపించకపోయినా, తర్వాత ఆ భాధని కుటుంబ సభ్యులు పంచుకునే సన్నివేశం లోనే అక్కడ ఏం జరిగిందో మనకి మనమే ఊహించుకునేలా చేశాడు దర్శకుడు.

             సమంత ని పెళ్ళి చేసుకోవటం సాధ్యం కాదని వేరే అమ్మాయి తో పెళ్ళికి ఒప్పుకుని,  చివరి క్షణం లో మళ్ళీ మనసు మార్చుకుని సమంత ని పెళ్ళి చేసుకోవటానికి నిర్ణయించుకున్న నాని తో "ఇష్టం లేని పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయిని జీవితాంతం భాధ పెట్టటం కన్నా పెళ్ళి ఆగి పోవటమే మంచిద" ని తండ్రి పాత్రతో చెప్పించిన మాటతో హీరో చేసినదానికి ఒక "Justification" ఇవ్వగలిగాడు దర్శకుడు. ప్రేమ కథల్నీ , ముఖ్యంగా ఈ తరం యువతీ యువకుల ప్రేమని సరిగ్గా అర్ధం చేసుకుని, అర్ధవంతం గా తెరకెక్కించటం లో గౌతం మీనన్ ఆరితేరిపోయాడని మరోసారి నిరూపించుకున్నాడు. సహజంగానే ఈ ప్రేమ కథ కి ఇళయరాజా సంగీతం పరిపూర్ణతనిచ్చింది.

              ముందే చెప్పుకున్నట్టు మనల్ని రంజింప లేని సినిమా,  మన అనుభవం లోకి రాని సినిమా మనకి వృధా. అందుకే కొంతమందికి నచ్చిన సినిమాలు మరికొంత మందికి "చెత్త" లా అనిపిస్తాయి. కొంత మందికి "చెత్త" లా అనిపించిన సినిమాలు ఇంకొంత మందికి "ఉత్తమం" గా అనిపిస్తాయి. అన్ని అనుభవాలూ , అందరికీ ఉండాలన్న రూలేమీ లేదు కాబట్టి అలాంటి వారికి ఈ సినిమా ఏదో,  లో బడ్జెట్ లో, కేవలం పది పదిహేను మంది నటీ నటులతో , నాలుగు గోడల మధ్య, డాబా మీదా, బీచ్ పక్కన తీసేసి వదిలేసిన ఒక సాదా సీదా సినిమా లా కూడా అనిపిస్తుంది.

                                    

Tuesday, January 1, 2013

వరదరాజపురం 15 కి.మీ

                              చాన్నాళ్ళ తర్వాత హైదరాబాదు నుంచి ఊరెళ్దామని బయల్దేరి తాడేపల్లిగూడెం లో రైలు దిగి బస్టాండుకొచ్చి మా ఊరి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. గూడెం నుంచి మా ఊరు పదిహేను కిలో మీటర్లు. అరగంట తర్వాత బస్సొచ్చింది. చెమటలు తుడుచుకుంటూ  గబ గబా బస్సెక్కి కిటికీ పక్క సీట్లొ కూలబడ్డాను. ఎక్కిన పావు గంట తర్వాత బస్సు బయల్దేరింది. ఐదు నిమిషాలకు కండక్టర్  టిక్కెట్ టిక్కెట్  అనుకుంటూ దగ్గరకొచ్చి "ఎక్కడికి" అన్నాడు. "వరదరాజపురం ఒకటివ్వండి"  అన్నాను డబ్బుల కోసం  జేబులో చెయ్యి పెడుతూ. తనదగ్గరున్న చార్టులో వరదరజపురానికి చార్జీ ఎంతో చూస్తూ "తొమ్మిది రూపాయలు" అన్నాడు. మా ఊరు చాలా చిన్నది అందుకే అక్కడికెళ్ళే  పాసింజర్లు కూడా చాలా తక్కువ. వూరికి చార్జీ ఎంతో కండక్టర్ కి కూడా చార్టులో చూస్తే గాని  తెలీదు. జేబులోంచి   పది రూపాయల నోటు  తీసి ఇచ్చాను. రూపాయి చిల్లర లేదు  నీ దగ్గర రూపాయుంటె ఇవ్వు రెండు రూపాయలిస్తా అన్నాడు. వెనుక జేబులోంచి రూపాయి తీసిచ్చి టిక్కెట్టు, చిల్లర తీసుకుని జేబులో వేసుకుని కిటికీ లోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను.
                     
                    బస్సు వంతెన దాటి వేంకట్రామా ధియేటరు, రేలంగి చిత్ర మందిరు దాటి పెద్ద కాలువ పక్కగా వెళ్ళే పెంటపాడు రోడ్డెక్కింది. వేసవి కాలం సెలవులు  కావటంతో  పిల్లలు ఎండి పోయిన కాలువ గట్టు పక్కన వున్న పచ్చికలో గేదెల్ని మేపుతున్నారు. చిన్నప్పుడు నేనూ ఆ పిల్లల్లో ఒకణ్నే కోతి కొమ్మచ్చి, గొళీలాట, గూటి బిళ్ళ, ఊర చెరువులో ఈత అన్నీ గుర్తొచ్చాయి నాకు. "వరదరాజపురం వచ్చింది ఇక్కడ కొత్తపల్లి రోడ్డు దగ్గర దిగుతావా ముందు మాలపల్లి వంతెన దగ్గర దిగుతావా?" అన్నాడు కండక్టరు దగ్గరకొచ్చి. ఇక్కడాపండి అన్నాన్నేను ఈ లోకంలోకొస్తూ.

           ఎదురుగా గొప్పులు గోతుల్తో ఎర్రటి కంకర్రోడ్డు , మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలొ వడ గాల్పుకి గాల్లోకి ఎగురుతున్న కంకర. క్రితం సారి ఊరి ప్రెసిడెంటుగా ఎన్నికయిన తాగుబోతు భాస్కర్రావు, గవర్నమెంటు ఈ రోడ్డుకి శాంక్షను చేసిన డబ్బులన్నీ తినేశాడని   మా ఊరి కుక్కల ప్రెసిడెంటు కొడుకు మొన్న ఫోను చేసినప్పుడు చెప్పాడు. కుడి పక్కన నిద్ర గన్నేరు చెట్టు మీద కొమ్మల్లో ఎటూ కదలకుండా కూర్చున్న రెండు కాకులు. ఈ పక్క కొమ్మ మీద తల్లి నోట్లో తిండి కోసం వెతుక్కుంటున్న ఎర్ర నోరు పిల్ల కాకుల్ని సముదాయిస్తున్న తల్లి కాకి. నాలుగడుగులు ముందుకెళ్ళాక ఎడం పక్కన కాలవవతల చింత చెట్టు కింద అర్ధవరం రాజులు పురమాయించి పెట్టిన చలివేంద్రం పోసే తాత కేకేశాడు "ఏరా అబ్బాయ్ ఇదేనా రావటం పట్టి దాటి రా మజ్జిగ తాగిది గాని " అన్నాడు. చల్లటి చలివేంద్రం తాగి ముందుకు నడిచాను.

            రోడ్డు పక్క చేను గట్టు దిబ్బ మీద విరగ కాసిన కలెక్టరు మామిడి కాయల చెట్టు చూసి నా  చిన్నప్పుడు సంఘటన ఒకటి గుర్తొచ్చింది నాకు. నేను నాలుగో తరగతి లో వున్నప్పుడనుకుంట నేనూ మా ఫ్రెండు కిట్టి గాడు చెట్టు కాయల కోసం దొంగ చాటుగా రాళ్ళతో కొడుతున్నాం ఇంతలో ఎక్కడినుంచి వచ్చోడొ గాని ఆ చెట్టు యజమాని సత్తిరాజు గారి అబ్బాయి పెద్ద శీను గట్టిగా అరుస్తూ మా వైపే గబ గబా వస్తున్నాడు మేమిద్దరం పరుగు లంకించుకున్నాం. కానీ వాడి కుక్కకి మాత్రం దొరికిపోయాం. ఇంకోసారి ఇటువంటి పని చేస్తే  పంచాయతీ లో పెట్టిస్తానని  బెదిరించి వదిలేశాడు. ఆ తర్వాత సత్తిరాజు వూళ్ళో తనకున్న వరి పొలాలన్నీ చేపల చెరువులు  చేసేసి బాగా డబ్బు గడించి రాజమండ్రి లో దేనితోనో తిరుగుతూ మహాతల్లి లాంటి వాళ్ళావిణ్ణి హింసించేవాడని,  ఆ భాధతో ఆవిడకి మతి చలించి ప్రస్తుతం పిచ్చిదానిలా తిరుగుతుందని తెలిసి మనసు ఏదోలా అయిపోయింది. "ఏరా మంచి ఎండలో బయల్దేరినట్టున్నావు ఇప్పుడు హైదరాబాదు లోనె వుంటున్నావా" అని అరిచాడు దూరంగా చేలో పిల్లిమిసర కోస్తున్న పద్దాలెంకమ్మగారి, సూర్రావు గారి అబ్బాయి చంటిగాడు. "అవున్రా" అన్నాన్నేను వాడి దగ్గరకెళ్తూ.  "మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు" అన్నాను. కొంత కాలం క్రితం జబ్బు చేసి చచ్చిపోయిన వాళ్ళమ్మ గురించి అడిగి వాడి మనసు మళ్ళీ భాధ పెట్టడం ఇష్టం లేక. వాళ్ళమ్మ చచ్చి పోయాక వెళ్ళి పోయి సినిమాల్లో జేరి పోయాడనీ , ప్రస్తుతం రాజమౌళి దగ్గర మూడో అసిస్టెంటు డైరెక్టరు గా పని జేస్తున్నాడని,  ఈ మధ్య రిలీజైన సినిమాలో వాడి పేరు కూడా పడిందనీ,  ఫోను చేసి అందరి గురించీ అడుగుతుంటాడనీ బాగా బిజీ అయిపొయాడనీ ఆనందం తో చెప్పేస్తున్నాడు వాడు. చిన్నప్పుడు వాళ్ళన్నయ్యా, నేనూ సైకిలేసుకుని గణపవరం లో వున్న ఇప్పటి ఎమ్మెల్యె బాపిరాజు గారి నాన్న మూర్తిరాజు గారి లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఆకలేసినోడికి అప్పడాలు దొరికినట్టు చదివి పాడేసేవాళ్ళం . "తర్వాత ఓ సారి మీ అన్నయ్య ఫోన్ నంబరియ్యి" అన్నాను. "ఇంటికొచ్చి నంబరిస్తా తప్పకుండా కలు" అన్నాడు మళ్ళీ పిల్లిమిసర కోసుకోవటం లో మునిగిపోతూ. రోడ్డెక్కి ముందుకి నడిచాను.

               పక్కనే బంగార్రాజు గారి చెరువు ఎండలో వెండి పళ్ళెం లా మెరిసిపోతుంది అక్కడక్కడా తామరపూలు, తామరాకులతో. చెరువు గట్టు మీద చింత చెట్టు, కొబ్బరి చెట్లూ, సపోటా చెట్లూ, గడ్డి మేటూ అక్కడంతా చల్లగా ఉండేలా ఉంది. ఈ పక్క గుడిసె బయట చెట్ల నీడలో ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైన బక్కోడు పెళ్ళాం తో కబుర్లాడుతున్నాడు. ఏదో లోకం లో ఉన్నారు వాళ్ళిద్దరూ. దూరంగా అరటి తోటల మధ్యలోంచి చిన్నప్పుడు చదువుకున్న బడి కనిపిస్తోంది. మా అబ్రహాం మాస్టారు అవ్వడానికి క్రిస్టియనే అయినా భగవద్గీతా అందులోని శ్లోకాలు విడమర్చి చెప్పేవారు మాకు అప్పుడప్పడూ. ఇంగ్లీషు, లెక్కలూ, సోషలూ, హిందీ ఇలా ఏ సబ్జెక్టు టీచరు లేక పోయినా అన్నీ ఆయనే చెప్పేసే వారు. ఒక్క చదువే కాదు పుస్తకాల బైండింగు, ఆటలు, పాటలు అన్నీ నేర్పేవారు పిల్లలకి. ఆ తర్వాత ఆ ఊరికీ  ఆ ఊరికీ ట్రాన్సఫరు అవుతూ మంచి ఉపాధ్యాయుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాని తర్వాత వాళ్ళమ్మాయి ఎవరితోనో లేచిపోతే మనుషుల్ని సృష్టించిన దేవుడి మీద కోపంతొనో, మనుషులు సృష్టించిన కట్టుబాట్ల మీద  కోపంతొనో , ఆ కట్టుబాట్లు లెక్క చేయని కూతురి మీద కోపంతోనో తెలీదు గానీ ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు. మలుపు తిరిగి ఊళ్ళోకొచ్చి అబ్బాయిగారిల్లు దాటి సిమ్మెంటు రోడ్డెక్కాను. ఈ మధ్యనే కొత్తగా డాబా కట్టుకున్న గంగ రాజు తాత వాళ్ళావిడ పలకరిస్తే మాట్లాడి డ్రైనేజి పక్కన కట్టేసిన బార కొమ్ముల గేదిని దాటాక మా ఇల్లొచ్చింది.

మా వరదరాజపురం కథలు

                 పుట్టి బుద్ధెరిగాక నాకిష్టమైన చందమామ కథల తర్వాత చిన్నప్పుడు డి.డి లో వచ్చే "మాల్గుడి డేస్" ఆ తర్వాత "అమరావతి కథలు" చూసి, ఎప్పుడైనా లైబ్రరీ కి వెళ్ళినప్పుడు "స్వాతి" కనిపిస్తే అందులో వచ్చే వంశీ "పసలపూడి కథలు" చదివి, ఇంకా తర్వాత ఇంటర్నెట్ లో నామిని సుబ్రహ్మణ్యం నాయుడి గారి "మిట్టూరోడి కథలు" తో పరిచయం పెరిగిపోయి , అచ్చం ఇలాంటి మనుషులే, ఇలాంటి మనసులే మా ఊళ్ళో కూడా బోలెడు మంది ఉన్నారనిపించేసి, వంట బాగా నచ్చేసినోడికి ఆ వంట నేర్చేసుకుని సొంతం గా చేసెయ్యాలనిపించినట్టు చదవగా, చదవగా నాకూ రాసెయ్యాలనిపించి ఆ స్థాయి లో కాక పోయినా నాకు తెలిసినట్టు నా స్థాయి లో నేను రాసుకున్న కథలే ఈ "మా వరదరాజపురం కథలు". సహజం గానే పిల్లలేంచేసినా తల్లికి "అధ్భుతమ" ని పించినట్టే నేనేం చెప్పినా, రాసినా మా ఫ్రెండ్సందరూ సూపరంటే, నాకూ ధైర్యం తెగ పెరిగి పోయి తెగించి రాసేస్తున్నాను.

                అప్పు తీసుకుని అడిగితే ప్రతి మనిషి అనుభవాలూ, జ్ఞాపకాలూ ఓ పెద్ద పుస్తకమే, మనుషులు వేరయినా "ఆత్మ" ఒకటే అయినట్టు అనుభవించ గలిగితే అందరి భాధా మన భాధ. ఆ భాధ కీ, ఆవేదనకీ, సంతోషానికీ అక్షర రూపమిచ్చి అందరికీ పంచిన ఎందరో మహానుభావులు. అటువంటి అక్షరాల అనుభవాలు నేనూ కొన్ని పోగుచేసుకున్నాక, ఓ సారి మా ఊళ్ళో రెండొందల ఎకరాలున్న సుబ్బరాజు గారి కొడుకు పెళ్ళికి ఊరందరినీ భోజనానికి పిలిస్తే, మా లాంటి పిల్లా పీచూ అందరం కలిసి భోజనాలకెళ్ళేటప్పుడు పిల్లలకి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని మా వెంకటేసులు గాడి వాళ్ళమ్మ మేమందరం ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా "ఒరేయ్ బాబూ పంక్తి లో ఎక్కువగా తినకు రా దిష్టి తగులుతుంది" అని చెప్పిన ఒకే ఒక్క మాట లో  ఆ తల్లి ప్రేమకీ, భాధ కీ, అమాయకత్వానికీ కనిపించిన పరాకాష్ఠనే అందరికీ నేను కూడా పంచాలనిపించింది.  సాధ్యమయినంత వరకూ సూటిగా, అతిశయోక్తులు లేకుండా చెప్పటానికీ, వీలయినన్ని తక్కువ ఇంగ్లీషు పదాలు ఉపయోగించటానికీ ప్రయత్నించాను.

          ఇంకా  నా గురించి చెప్పాలంటే బెంగుళూరు లో ప్రస్తుతం సాఫ్టువేరు ఇంజినీరు గా ఉద్యోగం చేసుకుంటూ కథలు రాయాలనిపించినప్పుడూ, పనంటే  బోరు కొట్టినప్పుడూ కూడా కథలు రాసుకుంటూ గడిపేస్తున్నాను. యుగ ధర్మమో, కలి ప్రభావమో తెలీదు గానీ, బ్రహ్మం గారు కాల జ్ఞానం లో చెప్పకపోయినా, చలం గారు ఎప్పుడో చెప్పేసినట్టు "Bitch Goddess of Success" చుట్టూ విరామం లేకుండా ప్రదక్షిణం చేసే అగత్యం అనివార్యమయిన మనలాంటి మనుషులందరికీ ఎప్పుడైనా ఇలాంటి కథలు కనిపిస్తే ఆగి చూసి వెళ్ళే టప్పుడు, ఈ కథలు కూడా చదివిన తర్వాత అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇంకా చిన్నప్పుడు కలువ పువ్వుల కోసమో, కలువ కాయల కోసమో చెరువులో దిగి కాలు జారి మునిగిపోబోతే బింది పట్టుకుని నీళ్ళ కోసం వచ్చి చూసి గబ గబా మనల్ని జుట్టు పట్టుకుని పైకి లాగి ఒడ్డున పడేసిన సుబ్బమ్మత్తా, మనతో పాటు అయిదో తరగతి దాక చదివి తర్వాతెప్పుడో కొయిటా వెళ్ళిపోయి అక్కడెవరో మోసం చేస్తే పాస్ పోర్టు కూడా పోగొట్టుకుని పోలీసుల చేత చావు దెబ్బలు తిని ఇంటికి తిరిగొచ్చిన రాజు గాడు, ఇంటర్లో "ద్విపద సిద్ధాంతం" అర్ధం గాక పరీక్షల్లో ఎలాగరా అనుకుంటే ఇంటికి పిలిచి మరీ ఒకటికి రెండు సార్లు అర్ధమయ్యేలా చెప్పి పంపిన లెక్కల మాస్టారు, పొలం లో ఈత పళ్ళ కోసం చెట్టెక్కి పట్టు తప్పి కింద పడి చెయ్యిరగ్గొట్టుకున్న ఈత చెట్టూ అన్నీ ఓ సారి పదిలం గా వున్నాయేమో చూసి రావాలన్న  స్పృహ మనసులో ఓ క్షణం పాటయినా అనిపించేలా చేసినా ఈ కథలూ , నేనూ అదృష్టవంతులం.

చదివిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యాలని కోరుకుంటూ.


గోపి.గారపాటి
ఈమెయిల్ : garapatigopi@gmail.com