Tuesday, January 1, 2013

వరదరాజపురం 15 కి.మీ

                              చాన్నాళ్ళ తర్వాత హైదరాబాదు నుంచి ఊరెళ్దామని బయల్దేరి తాడేపల్లిగూడెం లో రైలు దిగి బస్టాండుకొచ్చి మా ఊరి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. గూడెం నుంచి మా ఊరు పదిహేను కిలో మీటర్లు. అరగంట తర్వాత బస్సొచ్చింది. చెమటలు తుడుచుకుంటూ  గబ గబా బస్సెక్కి కిటికీ పక్క సీట్లొ కూలబడ్డాను. ఎక్కిన పావు గంట తర్వాత బస్సు బయల్దేరింది. ఐదు నిమిషాలకు కండక్టర్  టిక్కెట్ టిక్కెట్  అనుకుంటూ దగ్గరకొచ్చి "ఎక్కడికి" అన్నాడు. "వరదరాజపురం ఒకటివ్వండి"  అన్నాను డబ్బుల కోసం  జేబులో చెయ్యి పెడుతూ. తనదగ్గరున్న చార్టులో వరదరజపురానికి చార్జీ ఎంతో చూస్తూ "తొమ్మిది రూపాయలు" అన్నాడు. మా ఊరు చాలా చిన్నది అందుకే అక్కడికెళ్ళే  పాసింజర్లు కూడా చాలా తక్కువ. వూరికి చార్జీ ఎంతో కండక్టర్ కి కూడా చార్టులో చూస్తే గాని  తెలీదు. జేబులోంచి   పది రూపాయల నోటు  తీసి ఇచ్చాను. రూపాయి చిల్లర లేదు  నీ దగ్గర రూపాయుంటె ఇవ్వు రెండు రూపాయలిస్తా అన్నాడు. వెనుక జేబులోంచి రూపాయి తీసిచ్చి టిక్కెట్టు, చిల్లర తీసుకుని జేబులో వేసుకుని కిటికీ లోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను.
                     
                    బస్సు వంతెన దాటి వేంకట్రామా ధియేటరు, రేలంగి చిత్ర మందిరు దాటి పెద్ద కాలువ పక్కగా వెళ్ళే పెంటపాడు రోడ్డెక్కింది. వేసవి కాలం సెలవులు  కావటంతో  పిల్లలు ఎండి పోయిన కాలువ గట్టు పక్కన వున్న పచ్చికలో గేదెల్ని మేపుతున్నారు. చిన్నప్పుడు నేనూ ఆ పిల్లల్లో ఒకణ్నే కోతి కొమ్మచ్చి, గొళీలాట, గూటి బిళ్ళ, ఊర చెరువులో ఈత అన్నీ గుర్తొచ్చాయి నాకు. "వరదరాజపురం వచ్చింది ఇక్కడ కొత్తపల్లి రోడ్డు దగ్గర దిగుతావా ముందు మాలపల్లి వంతెన దగ్గర దిగుతావా?" అన్నాడు కండక్టరు దగ్గరకొచ్చి. ఇక్కడాపండి అన్నాన్నేను ఈ లోకంలోకొస్తూ.

           ఎదురుగా గొప్పులు గోతుల్తో ఎర్రటి కంకర్రోడ్డు , మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలొ వడ గాల్పుకి గాల్లోకి ఎగురుతున్న కంకర. క్రితం సారి ఊరి ప్రెసిడెంటుగా ఎన్నికయిన తాగుబోతు భాస్కర్రావు, గవర్నమెంటు ఈ రోడ్డుకి శాంక్షను చేసిన డబ్బులన్నీ తినేశాడని   మా ఊరి కుక్కల ప్రెసిడెంటు కొడుకు మొన్న ఫోను చేసినప్పుడు చెప్పాడు. కుడి పక్కన నిద్ర గన్నేరు చెట్టు మీద కొమ్మల్లో ఎటూ కదలకుండా కూర్చున్న రెండు కాకులు. ఈ పక్క కొమ్మ మీద తల్లి నోట్లో తిండి కోసం వెతుక్కుంటున్న ఎర్ర నోరు పిల్ల కాకుల్ని సముదాయిస్తున్న తల్లి కాకి. నాలుగడుగులు ముందుకెళ్ళాక ఎడం పక్కన కాలవవతల చింత చెట్టు కింద అర్ధవరం రాజులు పురమాయించి పెట్టిన చలివేంద్రం పోసే తాత కేకేశాడు "ఏరా అబ్బాయ్ ఇదేనా రావటం పట్టి దాటి రా మజ్జిగ తాగిది గాని " అన్నాడు. చల్లటి చలివేంద్రం తాగి ముందుకు నడిచాను.

            రోడ్డు పక్క చేను గట్టు దిబ్బ మీద విరగ కాసిన కలెక్టరు మామిడి కాయల చెట్టు చూసి నా  చిన్నప్పుడు సంఘటన ఒకటి గుర్తొచ్చింది నాకు. నేను నాలుగో తరగతి లో వున్నప్పుడనుకుంట నేనూ మా ఫ్రెండు కిట్టి గాడు చెట్టు కాయల కోసం దొంగ చాటుగా రాళ్ళతో కొడుతున్నాం ఇంతలో ఎక్కడినుంచి వచ్చోడొ గాని ఆ చెట్టు యజమాని సత్తిరాజు గారి అబ్బాయి పెద్ద శీను గట్టిగా అరుస్తూ మా వైపే గబ గబా వస్తున్నాడు మేమిద్దరం పరుగు లంకించుకున్నాం. కానీ వాడి కుక్కకి మాత్రం దొరికిపోయాం. ఇంకోసారి ఇటువంటి పని చేస్తే  పంచాయతీ లో పెట్టిస్తానని  బెదిరించి వదిలేశాడు. ఆ తర్వాత సత్తిరాజు వూళ్ళో తనకున్న వరి పొలాలన్నీ చేపల చెరువులు  చేసేసి బాగా డబ్బు గడించి రాజమండ్రి లో దేనితోనో తిరుగుతూ మహాతల్లి లాంటి వాళ్ళావిణ్ణి హింసించేవాడని,  ఆ భాధతో ఆవిడకి మతి చలించి ప్రస్తుతం పిచ్చిదానిలా తిరుగుతుందని తెలిసి మనసు ఏదోలా అయిపోయింది. "ఏరా మంచి ఎండలో బయల్దేరినట్టున్నావు ఇప్పుడు హైదరాబాదు లోనె వుంటున్నావా" అని అరిచాడు దూరంగా చేలో పిల్లిమిసర కోస్తున్న పద్దాలెంకమ్మగారి, సూర్రావు గారి అబ్బాయి చంటిగాడు. "అవున్రా" అన్నాన్నేను వాడి దగ్గరకెళ్తూ.  "మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు" అన్నాను. కొంత కాలం క్రితం జబ్బు చేసి చచ్చిపోయిన వాళ్ళమ్మ గురించి అడిగి వాడి మనసు మళ్ళీ భాధ పెట్టడం ఇష్టం లేక. వాళ్ళమ్మ చచ్చి పోయాక వెళ్ళి పోయి సినిమాల్లో జేరి పోయాడనీ , ప్రస్తుతం రాజమౌళి దగ్గర మూడో అసిస్టెంటు డైరెక్టరు గా పని జేస్తున్నాడని,  ఈ మధ్య రిలీజైన సినిమాలో వాడి పేరు కూడా పడిందనీ,  ఫోను చేసి అందరి గురించీ అడుగుతుంటాడనీ బాగా బిజీ అయిపొయాడనీ ఆనందం తో చెప్పేస్తున్నాడు వాడు. చిన్నప్పుడు వాళ్ళన్నయ్యా, నేనూ సైకిలేసుకుని గణపవరం లో వున్న ఇప్పటి ఎమ్మెల్యె బాపిరాజు గారి నాన్న మూర్తిరాజు గారి లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఆకలేసినోడికి అప్పడాలు దొరికినట్టు చదివి పాడేసేవాళ్ళం . "తర్వాత ఓ సారి మీ అన్నయ్య ఫోన్ నంబరియ్యి" అన్నాను. "ఇంటికొచ్చి నంబరిస్తా తప్పకుండా కలు" అన్నాడు మళ్ళీ పిల్లిమిసర కోసుకోవటం లో మునిగిపోతూ. రోడ్డెక్కి ముందుకి నడిచాను.

               పక్కనే బంగార్రాజు గారి చెరువు ఎండలో వెండి పళ్ళెం లా మెరిసిపోతుంది అక్కడక్కడా తామరపూలు, తామరాకులతో. చెరువు గట్టు మీద చింత చెట్టు, కొబ్బరి చెట్లూ, సపోటా చెట్లూ, గడ్డి మేటూ అక్కడంతా చల్లగా ఉండేలా ఉంది. ఈ పక్క గుడిసె బయట చెట్ల నీడలో ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైన బక్కోడు పెళ్ళాం తో కబుర్లాడుతున్నాడు. ఏదో లోకం లో ఉన్నారు వాళ్ళిద్దరూ. దూరంగా అరటి తోటల మధ్యలోంచి చిన్నప్పుడు చదువుకున్న బడి కనిపిస్తోంది. మా అబ్రహాం మాస్టారు అవ్వడానికి క్రిస్టియనే అయినా భగవద్గీతా అందులోని శ్లోకాలు విడమర్చి చెప్పేవారు మాకు అప్పుడప్పడూ. ఇంగ్లీషు, లెక్కలూ, సోషలూ, హిందీ ఇలా ఏ సబ్జెక్టు టీచరు లేక పోయినా అన్నీ ఆయనే చెప్పేసే వారు. ఒక్క చదువే కాదు పుస్తకాల బైండింగు, ఆటలు, పాటలు అన్నీ నేర్పేవారు పిల్లలకి. ఆ తర్వాత ఆ ఊరికీ  ఆ ఊరికీ ట్రాన్సఫరు అవుతూ మంచి ఉపాధ్యాయుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాని తర్వాత వాళ్ళమ్మాయి ఎవరితోనో లేచిపోతే మనుషుల్ని సృష్టించిన దేవుడి మీద కోపంతొనో, మనుషులు సృష్టించిన కట్టుబాట్ల మీద  కోపంతొనో , ఆ కట్టుబాట్లు లెక్క చేయని కూతురి మీద కోపంతోనో తెలీదు గానీ ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు. మలుపు తిరిగి ఊళ్ళోకొచ్చి అబ్బాయిగారిల్లు దాటి సిమ్మెంటు రోడ్డెక్కాను. ఈ మధ్యనే కొత్తగా డాబా కట్టుకున్న గంగ రాజు తాత వాళ్ళావిడ పలకరిస్తే మాట్లాడి డ్రైనేజి పక్కన కట్టేసిన బార కొమ్ముల గేదిని దాటాక మా ఇల్లొచ్చింది.

No comments:

Post a Comment