Thursday, November 9, 2017

కుంటి కులాసం ఫిలాసఫీ


                 కుంటి కులాసానిది అసలు మా ఊరే కాదు. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ మనిషి మాత్రం చాలా విచిత్రంగా మాట్లాడేవాడు. అతని మాటలు ఎప్పుడూ కొత్తగానే ఉండేవి. అయినా కుంటి కులాసం ఊరికే అలా మాట్లాడటం లేదని, అతని ఆలోచనా విధానమే అలాంటిదని తర్వాత అర్ధమయ్యింది. వాళ్ళ ఊళ్ళో వానలు లేక దాళ్వా పంటకి కాలవలు వదలక పోతే, కొన్నాళ్ళు పని కోసం మా ఊరొచ్చాడు. 'కుంటి కులాసం' అన్న పేరు కూడా అందరూ పిలిచే పేరే గానీ అసలు పేరు మాత్రం అది కాదని చెప్పాడు. మనుషులందరూ ఒకేలాగ ఆలోచించరన్న విషయం నాకు కుంటి కులాసం తో స్నేహం చేశాకే తెలిసింది. మా ఊళ్ళో జనం కూడా "కుంటి కులాసం గాడు తలకి రోకలి చుట్టగలడు." అని చెప్పుకునే వాళ్ళు. పేరుకి తగ్గట్టు అంత కులాసాగా ఏమీ కనిపించేవాడు కాదు గానీ, కళ్ళు మాత్రం ఎప్పుడూ దేన్నో వెతుకుతున్నట్టుగా ఉండేవి. మనిషిని చూడగానే ఏ సంకోచం లేకుండా వీడితో అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉండేవాడు. అతని చుట్టూ ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. ఎంత గొప్ప పుణ్యాత్ముడికయినా చేసిన తప్పులు గుర్తుకొస్తాయేమో అన్నంత నిజాయితీ అతని కళ్ళల్లో కనిపించేది. 'కుంటి' అనేది కూడా పేరులోనే తప్ప మామూలుగానే నడిచేవాడు. మా ఊళ్ళో పెద్దిరాజు ని చిన్నప్పుడు పదో తరగతి దాకా క్లాసులో అందరికన్నా బాగా పొట్టిగా కనిపిస్తున్నాడని "పొట్టోడ"ని పిలవటం మొదలెట్టాక, ఆ తర్వాత ఇంటర్లో వాడు తాడి చెట్టంత పొడుగైపోయాడు. కొత్తగా మా ఊరొచ్చిన వాళ్ళకి విచిత్రంగా అనిపించవచ్చుగానీ, ఇప్పటికీ మా ఊళ్ళో వాడిని 'పొట్టోడు' అనే పిలుస్తారు. అచ్చం అలాగే 'కుంటి కులాసా'నికి కూడా ఇప్పుడు తనకి సంబంధం లేని పేరు స్థిరపడి పోయిందేమో అని నా అనుమానం. ఒకసారి మాత్రం జీతానికి సుబ్బరాజు గారి గేదెలని కొమ్మర పొలం తోలుకెళ్ళి మేపుతుండగా అప్పటివరకూ చేలో పిల్లిమిసర మేస్తున్న ఎర్ర గేది ఉన్నట్టుండి పోలీసోళ్ళ ఆకుమడి వైపు పరుగెత్తటం మొదలెట్టింది. అప్పుడు దాన్ని ఆపటానికి పరుగెట్టినప్పుడు మాత్రం, అడ్డదిడ్డంగా కుంటుకుంటూ పాము పాకినట్టు మెలికలు తిరుగుతూ పరుగెట్టాడు.

                  ఏదో పొట్ట కూటికోసం మా ఊరొచ్చాడు గానీ, కుంటి కులాసానికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం. ఎప్పుడయినా సంతకెళ్ళినప్పుడు గణపవరం బస్టాండు దగ్గర నించున్నప్పుడు వాళ్ళ ఊరి వైపు వెళ్ళే బస్సు కనిపిస్తే "ఈ బస్సు మా ఊరి వైపే వెళ్తుంది." అనేవాడు. ఒకసారి పుంత గట్టు మీద రేగు చెట్టు పైన వాలిన పిట్టల్ని చూపించి, "అచ్చం ఇలాంటి పిట్టలే మా ఇంటి దగ్గర సీమ చింత చెట్టు మీద కో కొల్లలు గా ఉండేవి. ఈ పిట్టలని చూస్తూ ఆడుకోవటం మా మార్క్స్ గాడికి చాలా ఇష్టం." అన్నాడు. కుంటి కులాసానికి ఒక కొడుకు ఉన్నాడని. వాడి పేరు మార్క్స్ అనీ, ఒక రోజు వాడి పుట్టిన రోజుకి వాళ్ళ అమ్మ "నీకు వీడి వయసు ఉన్నప్పుడు ఒక పసుపు చారల చొక్క ఉండేది. అది వేసుకుంటే నువ్వు చాలా ముద్దుగా ఉండేవాడివి. వీడికీ అలాంటి చొక్కానే తియ్యి" అంటే, వాళ్ళావిడ కొనమన్న ఎర్ర గళ్ళ చొక్కా కాకుండా వాళ్ళమ్మ చెప్పిన పసుపు చారల చొక్కా కొన్నాడని, వాళ్ళావిడకి కోపమొచ్చి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింద"ని చెప్పాడు. "చిన్న చిన్న విషయాలకి కూడా మనుషులు ఎందుకు ద్వేషం పెంచుకుంటారో తెలుసా ? చాలా సార్లు పైకి కనిపించే ఆ చిన్న చిన్న కారణాలు, అసలయిన కారణాలతో వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ రహస్యంగానే ఉండి పోతాయి." అని కూడా చెప్పాడు.

                  పెద్దగా ఏమీ చదువుకోలేదని చెపుతాడు గానీ, కుంటి కులాసం దగ్గర ప్రతిదానికీ కారణం వెతకటానికి ప్రయత్నిచటం అనే ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. మాట్లాడే ప్రతి మాటా ఏదో సిధ్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్టు ఉండేది. ఒక సారి మేమందరం పొలం లో ఆకు తీత పనిలో ఉండగా ఉన్నట్టుండి హొరున వర్షం, వణికించే చలి మొదలయ్యాయి. అందరం పోలీసోళ్ళ చెరువుగట్టు పైకి చేరుకుని చింత చెట్టు కింద వట్టి గడ్డి మంట వేసుకుని చలి కాసుకుంటుంటే చచ్చి పోయిన కొబ్బరి చెట్టు కమ్మలు కొట్టుకెళ్ళటానికొచ్చిన చాకలి తిప్పడు కూడా మంట దగ్గరికొచ్చి కూర్చుంటూ "శని గాడి వాన దరిద్రం లా పట్టుకుందిరా" అని వర్షాన్ని తిట్టుకుంటున్నాడు. అది విన్న నారాయుడు తాత "ఈ వానలు ఉంటేనే మనకి పంటలు పండేది,తిండి దొరికేది." అని మందలించాడు. తిప్పడు మాత్రం "ఏమో తాతా, పొద్దున్నే ఇంత చద్దన్నం తిని మట మట మని మండి పోయే ఎంత ఎండ లోనయిన పని చెయ్యొచ్చు గానీ, చిట పట మని నాలుగు చినుకులు పడితే మాత్రం మహా చిరాకు నాకు." అన్నాడు. "మీ తాత కూడా ఇలాగే వానకి పడి ఏడిసే వాడు. నీకు అన్నీ మీ తాత బుధ్ధులే వచ్చాయి." అన్నాడు నారాయుడు తాత. కుంటి కులాసం దృష్టిలో చాకలి తిప్పడు వర్షాన్ని తిట్టుకోవటం వెనక కారణం లేకపోలేదు. వాళ్ళ వృత్తి లో ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతికి ఆరేశాక ఎండ లేక బట్టలు ఆరక పోతే, అది వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళ జీవితాలు వర్షం తో కన్నా ఎండతో ఎక్కువ పెన వేసుకుని ఉన్నాయి. అందుకే ఎండని ఇష్టపడటం, వర్షాన్ని వ్యతిరేకించటం అనేది తెలియకుండానే చాకలి తిప్పడి నరాల్లో జీర్ణించుకుపోయింది. ఇదేమీ ఇప్పటికిప్పుడు కనిపెట్టిన కొత్త విషయం కాకపోవచ్చు గానీ, ఇంత చిన్న విషయాన్ని కూడా కుంటి కులాసం ప్రపంచం మొత్తానికి అన్వయించి చూసేవాడు. "ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది. ఒకరికి మేలు చేసేది మరొకరికి కీడు చేస్తుంది. మనుషుల మధ్య, దేశాల మధ్య ఘర్షణ కి ఈ వైరుధ్యమే మొదటి కారణం." అన్నాడు. అంతే కాకుండా "గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవటానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కరలేదు. నీ చుట్టూ ఉన్న మనుషులని, పరిస్థితులని లోతుగా అర్ధం చేసుకుంటే మొత్తం ప్రపంచమే అర్ధమవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో జరిగేదే మన ఊళ్ళోనూ జరుగుతుంది. మన ఊళ్ళో జరిగేదే మన రాష్ట్రం లో జరుగుతుంది. రాష్ట్రంలో జరిగేదే దేశం లో జరుగుతుంది. దేశం లో జరిగేదే ప్రపంచం మొత్తం జరుగుతుంది" అని చెప్పేవాడు.

                  కుంటి కులాసంతో పాటు ఎప్పుడూ ఒక కుక్క కూడా ఉండేది. నిజానికి ఆ కుక్క అతను మా ఊరు రావటానికి ముందు కొన్ని రోజులు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు అతనికి అలవాటయ్యింది. ఆ కుక్కకి ఒక కన్ను గుడ్డితో పాటు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేది. దాని ముందు కోమటి కొట్లో కొన్న రొట్టె ముక్కో, జంతిక ముక్కో వేస్తే విచిత్రం గా అది ఆ రొట్టె ముక్క కి వ్యతిరేక దిశలో వాసన చూసుకుంటూ వెళ్ళి చాలా సేపటికి గానీ ఆ రొట్టె ముక్క ని కనిపెట్టలేకపోయేది. "ఈ గుడ్డి కుక్కని ఇంకా నీతో ఉంచుకునే బదులు తరిమెయ్యొచ్చు కదా?" అన్నాను ఒకసారి. "ఈ కుక్క చాలా విషయాల్లో నాకన్నా గొప్పది." అన్నాడు. కుంటి కులాసం దృష్టిలో మనిషి కన్నా జంతువు గొప్పది. జంతువు కన్నా చెట్టు గొప్పది. "ఈ భూమ్మీద ఇంకా బాగు పడవలసిన అవసరం ఉన్న జీవి ఏదయినా ఉందంటే అది మనిషి మాత్రమే" అనేవాడు. ఒకసారి ఆ కుక్క కొన్ని రోజులపాటు ఎక్కడికో మాయమైపోయి మళ్ళీ తిరిగొచ్చింది. మళ్ళీ కుంటి కులాసాన్ని చూసిన ఆనందం తో తోక ఊపుకుంటూ ఆకలితొ ఉన్నానని చెప్పటానికి గుర్తుగా తల పైకెత్తి చూసింది. కుంటి కులాసం దాని ముందు కొంచెం అన్నం వేశాక, ఆబగా తినటం మొదలెట్టింది. సరిగ్గా అప్పుడే నేను గమనించిన విషయం దాని వెనక కాలు తొడ దగ్గర కండ మొత్తం ఊడిపోయి పాలిపోయిన లోపలి మాంసం విచిత్రమయిన ఆకృతులలో కనిపించటం. అది చూసి నా గుండె దడ దడ లాడింది. అయినా అదేమీ తనకి పట్టనట్టు అసలు ఆ కాలు తనది కానట్టు, ఆ కుక్క ఎప్పటిలాగానే ఉల్లాసంగా ఆనందంగా కనిపించటం నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. ఇదే మాట కుంటి కులాసం తో చెప్పాను. "ఈ కుక్క తనని తాను మర్చిపోయి ఈ ప్రకృతి లో మమేకమయినంతగా నువ్వూ నేనూ ఎప్పటికీ కాలేము. అదెప్పుడూ తనని తాను ఈ ప్రకృతిలో భాగమనే అనుకుంటుంది తప్ప వేరుగా ఊహించుకోదు. దాని ముఖం ఎలా ఉందో కూడా దానికి ఎప్పటికీ తెలీదు. మానవ నాగరికతలో మనిషి అద్దం లో ముఖం చూసుకోవటం మొదలుపెట్టిన రోజే ప్రకృతికి దూరం కావటం మొదలయింది." అన్నాడు.

                  ఒకసారి అబ్బులు గాడి పెళ్ళికి అన్నవరం వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న హోటల్ లో భోంచేస్తున్నాం. "ఇక్కడ భోజనం చాల బాగుంది" అన్నాను నేను. "ఈ వంట చేసిన వంట మనిషి చేతులు చాలా అసహ్యం గా ఉండి ఉండాలి, అందుకే వంట ఇంత బాగుంది." అన్నాడు. నిజంగానే ఆ తర్వాత, వంట చేసిన పెద్దావిడ బయటికొచ్చి, ఎన్నో ఏళ్ళుగా పొయ్యి దగ్గర ఇదే పని చెయ్యటం వల్ల నల్లటి మచ్చలు పడి బొటన వేళ్ళు వంకర పోయి ముడతలు పడ్డ చేతులు ఊపుకుంటూ "రామమ్మ గారి దొడ్లో కరివేపాకు చెట్టు రొబ్బలు నాలుగు విరుచుకు రా రా." అని ఎవరినో పురమాయించటం కనిపించింది. భోజనం అయ్యాక వెళ్ళబోతూ, పక్కనే ఉన్న పేపర్లో "వేసవి తాపానికి ఎండలో బొమ్మలు అమ్ముకునే వ్యక్తి మరణం" అన్న వార్త చదివి, "అయినా తెలిసి తెలిసీ అంత ఎండలో వాడిని బయటికి ఎవడు వెళ్ళమన్నాడు?" అన్నాను కోపంగా. "ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు." అన్నాడు.

                  ఆ రోజు కుంటికులాసం చాల సేపు చాలా విషయాలు మాట్లాడాడు. "ప్రపంచ జనాభాలో, పక్కవాడిని మోసం చేసే మనుషుల సంఖ్య కన్నా తమని తాము మోసం చేసుకునే మనుషుల సంఖ్య చాలా ఎక్కువ" అన్నాడు. అంతే గాక "ఈ వేలం వెర్రి మనుషులు డబ్బు కట్టల మధ్య చిక్కుకున్న చెద పురుగులు." అని కూడా అన్నాడు. ఎక్కువగా "మనుషులు" అన్న మాట కాకుండా దాని ముందు "వేలం వెర్రి" అనే విశేషణాన్ని చేర్చి "వేలం వెర్రి మనుషులు" అనే అనేవాడు. డబ్బు అంటే కుంటి కులాసానికి విపరీతమయిన అయిష్టత ఉండేది. "ఈ డబ్బు యావ లో పడి మనం కొత్తగా ఆలోచించటం మర్చిపోయామ" న్నది అతడి ధృఢమయిన అభిప్రాయం. "డబ్బుకి దానికి ఉన్న అసలు విలువతో పాటు, మరో 'మిధ్యా విలువ ' అనేది కూడా ఉందని కుంటి కులాసం సిధ్ధాంతం. "కావాలంటే చూడు. ముక్కూ మొహం తెలియక పోయినా నీకన్న ఎక్కువ డబ్బున్న వాడిని కలుసుకున్నప్పుడు నీ మొహం తప్పకుండా వెలిగిపోతుంది. డబ్బుకి ఉన్న 'మిధ్యా విలువ ' అంటే ఇదే. ఈ వేలం వెర్రి మనుషుల మీద డబ్బుకి ఉన్న ఆ అసలు విలువకన్నా ఈ మిధ్యా విలువ ప్రభావమే ఎక్కువ. ఇలాంటి మిధ్యా విలువలు ఈ ప్రపంచం లో ఇంకా చాలానే ఉన్నాయి." అన్నాడు. "ఎప్పుడూ ఒకేలా ఆలోచించటం మానేసి, నీకు తెలిసిన విషయాలను శీర్షాసనం కూడా వేయించు తమ్ముడు. ఎందుకంటే నీకు తెలిసిన నిజాన్ని తిరగేస్తే వచ్చేది కూడా మళ్ళీ నిజమే." అని చెప్పేవాడు.

                  ఇంకో నెల రోజులలో కుంటి కులాసం, వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడనగా, ఉన్నట్టుండి అతనితో ఉండే కుక్క, చొంగ కార్చుకుంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ పిచ్చి కుక్క ఊళ్ళో ఉంటే చాలా ప్రమాదమని అందరూ భయపడుతుంటే, కుంటి కులాసం ఊళ్ళో ఉండటం మానేసి కుక్కతో సహా, జనం సారాకి అలవాటు పడి కల్లు తాగటం మానేశాక వ్యాపారం లేక ఊరికే వదిలేసిన ఊరి చివరి కాలవ గట్టు మీద కల్లు కోటమ్మ గారి కల్లు పాకలో ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఒక రోజు అదే పాకలో చచ్చిపోయి కనిపించాడు. ఆ కుక్క కూడా మళ్ళీ ఎక్కడికో మాయమైపోయింది. నిజమో కాదో తెలీదు గానీ కుంటి కులాసం చచ్చిపోయిన రెండో రోజు మాత్రం పేపర్లో జిల్లా ఎడిషన్ లో 'పెంచుకుంటున్న పిచ్చి కుక్క కరిచి వ్యక్తి మరణం' అన్న వార్త వచ్చింది. అప్పుడే ఏలూరు నుంచి మా ఊరు చుట్టాల ఇంటికి వచ్చిన కోటేశ్వర్రావు, ప్రెసిడెంటు గారి ఇంటి దగ్గర అరుగు మీద పేపర్లో ఆ వార్త చదివి "అయినా తెలిసి తెలిసీ పిచ్చి కుక్కని ఎవడు పెంచుకోమన్నాడు?" అన్నాడు కోపంగా.

"ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు" అన్నాను వెంటనే.

Thursday, August 3, 2017

నేను



















నేను పుడుతూనే ఆకలికి ఏడుస్తున్నాననుకుంటారు గానీ
ఒక గుప్పెడు నిప్పు కణికలని
గొంతులో నింపుకునే వచ్చాను.

నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాననుకుంటారు గానీ
ఊపిరి గాలికి రెపరెపలాడే
థిక్కారపు దేహ పతాకాన్ని నేను.

నా అడుగులతో ఆకాశాన్ని కొలుస్తాను.
నా జ్ఞాన తృష్ణ కి
అనంత విశ్వాన్ని బలిస్తాను.

పశుత్వానికి దగ్గరగా పుట్టి
దైవత్వానికి దూరంగా విసిరివేయబడ్డ
మాంస ఖండాన్ని.

సిథ్థాంతాన్ని.
సిథ్థాంతాల రాథ్థాంతాన్ని.
రాథ్థాంతాల యుథ్థాన్ని.
యుథ్థానికి, యుథ్థానికి మధ్య
నెలకొన్న తాత్కాలిక శాంతి సౌహార్ద్రాన్ని.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14699)

Sunday, April 30, 2017

ఇక్కడ














ఇక్కడ, బుర్రలకి చిల్లులు పడి
నీరుగారిపోయిన మనుషులు
కిటికీ దగ్గర పావురాల్లా మూలుగుతున్నారు.

ఇక్కడ, ‘ఆత్మ విశ్వాసం’ కోసం
ఆత్మలను అమ్ముకున్న బుధ్ధిమంతులు
నడి వీధిలో ఒళ్ళు విరుచుకుని నించున్నారు.

ఇక్కడ, పగలు చేసిన పాపాలను
రాత్రి కప్పుకుని పడుకుని
ఒక కన్ను తెరిచి నిద్ర పోతున్న రహస్య మానవులు
వెన్నెల రాత్రులను వ్యర్ధం చేస్తున్నారు.

నిజం నడ్డి విరిచి, ప్రపంచానికి
కుంటి నడక నేర్పిన అవకాశవాదుల స్తోత్ర పాఠాలు
ఇక్కడ, నిత్య పారాయణాలు.

లోకమే ఒక బలిపీఠం.
జీవితం, చేయక తప్పని నేరం.
ఇది యుగయుగాల నరమేధం.
అయినా ఇక్కడంతా, నిత్యనూతనం.

బాగున్నదానిని చెడగొట్టటం.
చెడిపోయిన దానిని బాగు చెయ్యటం.
ఇక్కడ, మన కాలక్షేపం.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14090)

Sunday, March 5, 2017

వెంకటేశులుకి దిష్టి తగిలింది


                 అయితే గియితే అప్పట్లో దూరదర్శన్ లో వార్తలు చదివే 'శాంతి స్వరూప్' లాగా నున్నగా తల దువ్వుకుని, ఇస్త్రీ బట్టలేసుకుని, నూనె సుద్దల్లాగా మెరిసిపోతూ బళ్ళోకొచ్చే మారుబోయిన వాళ్ళ ముత్యం గాడికో, మీసాల నారాయణరావు గారి బాలాజీ గాడికో లేకపోతే వాళ్ళ ఊళ్ళో అయిదో తరగతి దాకానే ఉందని ఆరో తరగతిలో మాతో పాటు చదువుకోవటానికి మా ఊరి బళ్ళోకొచ్చే మా పక్క ఊరు వెలగ పల్లి లో ఉండే వెలమ దొరగారోళ్ళ పండు గాడికో దిష్టి తగలాలి గానీ, విచిత్రంగా, ఎప్పుడూ పిర్రల దగ్గర చిరిగిపోయిన నిక్కరేసుకుని మళ్ళీ దాని మీదకి ఆ చిరుగులు కనిపించకుండా మోకాళ్ళ దాకా వచ్చే ఎవరో ఊరుకునే ఇచ్చిన లొడంగం చొక్కా వేసుకుని బళ్ళోకొచ్చే ఈనుప్పుల్లలాగా ఉండే కమతాలోళ్ళ వెంకటేశులుగాడికి దిష్టి తగిలేసింది ఒకసారి. వెంకటేశులుగాడి ఏడుపుగొట్టు దిష్టి కధ గురించి చెప్పుకునే ముందు సరదాకి వాడి చిరుగుల నిక్కరు గురించిన పిట్ట కధ కూడా చెప్పుకుందాం. అప్పట్లో మాలాంటి పిల్లలందరం చిరిగిందో, చిరగలేనిదో, పొడుగయ్యిందో, పొట్టి అయ్యిందో ఏదో ఒక చొక్కా, నిక్కరు వేసుకుని పలకా, కనికీ పట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం గానీ, మా పెద్దోళ్ళయితే వాళ్ళ చిన్నప్పుడు ఒంటి మీద చొక్కా ఏమీ లేకుండానే బడికెళ్ళి పలక కొనుక్కోవటానికి కూడా సౌకర్యం లేక బూడిద మీద పుల్ల ముక్కతో 'అ' 'ఆ' లు దిద్దుకుని చదువు నేర్చుకున్నారని ఆ తర్వాతెప్పుడో వాళ్ళే చెపితే తెలిసింది. ఈ విషయం మా తెలుగు మాస్టారు ఉమామహేశ్వర్రావు గారికి తెలుసో లేదో తెలీదు గానీ, ఆయన మాత్రం పొద్దున్నే మూడో బెల్లు కొట్టాక ప్రార్ధన అయిపోయాక తరగతి గది లోకి వెళుతున్న వెంకటేశులు గాడిని పిలిచి "అలా బుడబుక్కలోడి లాగా వదులు చొక్కా వేలాడేసుకుని తిరగక పోతే నిక్కరు లోపలికి తోసెయ్యొచ్చు కదా? ఇన్ షర్టు చేసుకున్నట్టు ఉంటుంది." అని ఒక ఉచిత సలహా ఇచ్చేవారు. వెంకటేశులు గాడికి మామూలుగానే ఎవరి మాటా కాదనే అలవాటు అస్సలు లేదు కాబట్టి, అలాగే చేసేవాడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం బెల్లు తర్వాత అన్నం తిన్నాక చుట్ట కాల్చుకోవటానికి బయటకొచ్చే మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు అక్కడే ఆడుకుంటున్న వెంకటేశులుగాడిని పిలిచి "పిర్రల దగ్గర నీ నిక్కరు చిరుగుల అందం అందరికీ చూపించకపోతే కనబడకుండా ఆ ఇన్ షర్టు తీసెయ్యొచ్చు కదా ?" అని పాపం ఆయనకి తోచిన మంచి సలహా ఆయనా ఇచ్చేవారు. వెంకటేశులు గాడు కూడా తు.చ తప్పకుండా మళ్ళీ అలాగే చేసేవాడు. ఇంచు మించు రోజూ ఇదే నిర్వాకం జరిగేది వెంకటేశులుగాడికి. ఆ రకంగా బళ్ళో ఏ రోజు చూసినా విచిత్రంగా పొద్దున్న అంతా ఇన్ షర్టు తోనూ మధ్యాహ్నం నుంచీ లొడంగం లాంటి పొడుగు చొక్కాతోనూ కనిపించేవాడు వెంకటేశులు. బాలాజి గాడి లాంటి వాళ్ళకయితే ఇదంతా చూసి వాళ్ళేదో సరాసరి ఆకాశం లోనుంచో, విష్ణుమూర్తి బొడ్డులోనుంచో ఊడిపడ్డట్టు పెద్ద నవ్వులాటగా ఉండేది. ఒక్కోసారయితే ఇలాగ పొద్దున్న ఒక వేషం మధ్యాహ్నం ఒక వేషం వెయ్యలేక నామోషీ గా అనిపించి, 'మనిషికి చావు పుట్టుకలు ఉండటం, ఆ మధ్యలో బతకటానికి డబ్బులు కావలసిరావటం, ఆ ఆర్ధిక స్థాయిని బట్టే మనిషి తన అవసరాలు నెరవేర్చుకోగలగడం' లాంటి పెద్ద పెద్ద విషయాలు అప్పటికి తెలీదు కాబట్టి తనకి సరిపోయే ఒక రెండు జతల మంచి బట్టలు ఎందుకు తీసి ఇవ్వటం లేదా? అని వెంకటేశులు గాడు వాళ్ళ అమ్మా నాన్నలని తెగ తిట్టుకునేవాడు.

                  ఇంక అసలు కధలోకి వెళితే, ఆ రోజు ఆదివారం కాబట్టి బడికి వెళ్ళవలసిన పని ఎలాగూ లేదు. అంతకన్నా సంతోషం కలిగించే విషయం ఆ రోజు మా ఊళ్ళో అందరికన్నా ఎక్కువగా రెండొందల ఎకరాలు ఉన్న సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనాలు. అంతకు ముందు రోజు రాత్రే సుబ్బ రాజు గారి మనుషులు ఇద్దరు ముగ్గురు మా ఊళ్ళో గడప గడపకీ వచ్చి ఇంట్లో అందరూ పెళ్ళి భోజనానికి రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయారు. సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనం అంటే రోజూ తినే అన్నంతో పాటు అన్నానికి ముందు అయిదు రకాలు, తర్వాత అయిదు రకాలు పిండి వంటలు పెడతారు కాబట్టి ఈ మాట తెలిసిన దగ్గర నుంచీ మా పిల్లలందరికీ ఆ సంవత్సరం సంక్రాంతి, దీపావళి లాగానే ఇంకో కొత్త పండగ ఎగస్ట్రాగా వచ్చినట్టు తెగ ఆనందమయిపోయింది. పిల్లలందరం కలిసే పెళ్ళి భోజనానికి వెళ్ళాలని అంతకు ముందే నిర్ణయించేసుకున్నాం కాబట్టి మేము అయిదారుగురుం కలిశాక వెంకటేశులుగాడిని కూడా పిలుచుకుని వెళ్ళటానికి వాళ్ళ ఇంటికెళితే ఇంకా వాళ్ళమ్మ వాడికి వీపు తోమి స్నానం చేయించటం లోనే ఉంది. సరే అని వాళ్ళ ఇంటి ముందే కాసేపు కూర్చున్నాక వాళ్ళమ్మ వాడికి రోజూ బళ్ళోకి వచ్చినప్పుడు వేసే బట్టలు కాకుండా ఇలాగ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేసుకునే కొంచెం మంచి బట్టలు వేసి మాతో పాటు పంపి, ఒక పదడుగులు ముందుకెళ్ళాక ఏదో గుర్తుకొచ్చినట్టు వెంకటేశులు గాడిని కేకపెట్టి పిలిచి "ఒరేయ్ బాబూ పంక్తి లో అందరి ముందూ ఎక్కువగా తినొద్దురా. దిష్టి తగులుతుంది." అని అందరికీ వినిపించేలాగా అరిచి చెపితే, ఏ విషయాన్ని చాటుగా చెప్పాలో ఏ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలో కూడా తెలియని ఆ మహాతల్లి అమాయకత్వానికి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటే, తన తొందరపాటుకి, కొడుక్కి రెండు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని తన నిస్సహాయతకి, సిగ్గుపడి తల వంచుకుని గుడిసె లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అందరూ వాడిని, వాళ్ళ అమ్మని చూసి నవ్వటం గమనించిన వెంకటేశులు కి ఇదంతా పెద్ద అవమానం గా అనిపించి వాళ్ళమ్మని తిట్టుకుంటూనే మొహం వేలాడేసుకుని మాతో పాటు భోజనాలకి బయలుదేరాడు.

                  మేము వెళ్ళేసరికే కుర్చీలు, బల్లలు వేసేసి అన్నీ సిధ్ధంగా ఉన్నాయి. ఇంకా మొదటి పంక్తి కాబట్టి అప్పుడే కుర్చోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే ఎవరో వచ్చి "ముందు పిల్లలకి పెట్టెయ్యండ్రా." అంటే ఇంక ఆలోచించకుండా బిల బిలా అంటూ వెళ్ళి మొదటి వరసలో కూర్చుండిపోయాం. మేము బళ్ళో మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు లెక్కలు చేసుకోవటానికి కొనమన్నారని కొన్న తెల్ల కాగితాల పుస్తకం లో ఉండే తెల్ల కాగితం లాంటి ఒక పెద్ద చుట్ట తెచ్చి మేము కూర్చున్న బల్ల మీద పరచటం కోసం దొర్లించుకుంటూ వెళ్తుంటే మొదటి సారిగా అది చూసిన మా అందరికీ చాలా విచిత్రమయిపోయింది. తరవాత మా ముందు అరిటాకులు వేసుకుంటూ మళ్ళీ అది కదలకుండా వెంటనే ఒక స్టీలు గ్లాసు పెట్టెయ్యటం కూడా చక చకా జరిగిపోయింది. ఆ తర్వాత మా అందరికీ బాగా తెలిసిన సుబ్బరాజు గారి దగ్గర పాలేరు గా చేసే కుంటి కులాసం గాడు గేదెలకి పాలు తీసే పాల తపేలాతో మా గ్లాసుల్లో మంచి నీళ్ళు పోసేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదట గా వేడి వేడి గా రెండేసి బూరెలు, ఆ బూరెల్లోకి నెయ్యి, తర్వాత పూతరేకు, చిక్కని సేమియా పాయసం, పులిహోర వడ్డించారు. వెంకటేశులు గాడయితే వాళ్ళమ్మ చెప్పిన మాట కూడా మర్చిపోయి ఏ మొహమాటం లేకుండా ఇంకో రెండు బూరెలు ఇంకొచెం పులిహోర అడిగి మరీ వేయించుకుని తిన్నాడు. తర్వాత అన్నంలోకి వంకాయ పచ్చడి, పప్పు ఆవకాయ, కొబ్బరి వేసిన దొండకాయ వేపుడు, ములక్కాడ కూర, ఆనపకాయ ముక్కలు వేసిన సాంబారు, అప్పడం, చివరిగా పెరుగు, అందులోకి నంజుకోవటానికి చక్కెరకేళీ అరటి పండు, ఆఖరున కిళ్ళి. కిళ్ళీ గురించి అయితే అప్పటివరకూ వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటుంటే వినటమే గానీ తినటం మాత్రం అదే మొదటిసారి మా అందరికీ. వెంకటేశులుగాడయితే అందరూ చూస్తుండగానే అన్నం రెండు మూడు సార్లయినా వేయించుకున్నాడు.

                  భోజనం అయ్యాక ఇంటికెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే వెంకటేశులు గాడికయితే అడుగు తీసి అడుగు వెయ్యటం కూడా కష్టం అయిపోయింది. ఎండకి ఒళ్ళంతా చెమటలు పట్టి, ఆయాసం ఎక్కువయ్యి మధ్యలో కుక్కల ప్రెసిడెంటు గారి ఇంటి ముందు ఉన్న నిద్ర గన్నేరు చెట్టు కింద కొంచెం సేపు కూర్చుంటే గానీ ఇంటికెళ్ళలేక పోయాడు. ఇంటికెళ్ళాక తల తిరుగుతున్నట్టు అయిపోయి అలాగే పడుకుండి పోయాడు. ఆ రోజు రాత్రి కూడా కడుపులో ఏదో దేవుతున్నట్టు, తిన్నదంతా గొంతులోనే ఉన్నట్టు, వికారంగా ఉన్నట్టు అనిపించి అసలు నిద్ర పొలేక ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే లేచి మొహం కడుక్కుందామని వేప పుల్ల తెంపుకుని నోట్లో పెట్టుకోగానే పెళ్ళి భోజనం లో తిన్నది తిన్నట్టే వాంతి చేసేసుకున్నాడు. దానికి తోడు వెంటనే జ్వరం, విరేచనాలు కూడా మొదలయ్యాయి. ఆ రోజు మంచం పట్టిన వెంకటేశులు గాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యి బళ్ళోకి రావటానికి పది,పదిహేను రోజులయినా పట్టింది. వెంకటేశులుకి దిష్టి తగిలిందని వాళ్ళమ్మ అయితే ముందు రెండు మూడు రోజులూ ఒక రోజు ఉప్పుగన్ను, ఇంకో రోజు నూనె గుడ్డ, మరో రోజు కోడి గుడ్డు దిష్టి తీసి పారేసింది. అయినా బాగవ్వకపోతే ఊళ్ళొ ఆరెంపీ డాక్టరుని పిలిపించి వైద్యం చేయించి మందులు కూడా ఇప్పించింది. తగ్గాక మరో పది రోజుల దాకా తన శక్తికి మించి పథ్యం కూడా పెట్టింది. ఇవన్నీ చెయ్యటానికి డబ్బులు సరిపోక వాళ్ళ అమ్మ, నాన్న కూలి పనులకి వెళ్ళేటప్పుడు చద్దన్నం పట్టుకెళ్ళటానికని కొన్న రెండు స్టీలు టిపినీలు, కోతల రోజుల్లో పనుల్లోకి వెళ్ళటానికి ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న ముప్పర్తిపాడు కొడవలి, వాళ్ళమ్మకి ఉన్న మూడే మూడు చీరల్లో ఒక చీర తీసుకెళ్ళి ఊళ్ళో తాకట్టు వ్యాపారం చేసే కాంతమ్మ గారి దగ్గర తాకట్టు పెట్ట వలసివచ్చింది. తన అనారోగ్యం తగ్గించటానికి వాళ్ళమ్మ ఎంత కష్టపడవలసి వచ్చిందో మొదటి సారిగా కళ్ళారా చూశాడు వెంకటేశులు. తనకి ఏమవుతుందో అని వాళ్ళమ్మ ఎంత భయపడిందో కూడా అర్ధం చేసుకున్నాడు.

                  అంతా అయ్యాక, ఈ దిష్టి గిష్టి ఉన్నయో లేదో ఆ దేవుడికే తెలియాలి కానీ, చచ్చి బతికిన వెంకటేశులుగాడి అనారోగ్యం గురించి అరెంపీ డాక్టరు గారిని మా ఊళ్ళో ఎవరో అడిగితే "ఊరికే వచ్చింది కదా అని అన్నీ ఒకేసారి కలిపి తినేస్తే అర్ధాకలితో ఆరుగు పోయిన పేగులు అరాయించుకోవద్దా?" అని తనకి తెలిసిన విషయం చెప్పాడు. వెంకటేశులు గాడు కూడా ఆ తర్వాత ఎప్పుడు పంక్తి భోజనాలకి వచ్చినా అంతకు ముందులా కాకుండా అప్పుడే పీకలదాక తిని వచ్చిన వాడి లాగా కొంచెమే తిని చెయ్యి కడుక్కుని వచ్చేసేవాడు. అదీగాక 'మనుషులకు రోగాలు, చావుపుట్టుకలు ఉంటాయని. సమాజం లో వివిధ ఆర్ధిక స్థాయిలు కూడా ఉంటాయని. మనిషి ఆర్ధిక స్థాయి ప్రకారమే అతని స్థానం నిర్దేశింపబడుతుందని. ఆ ఆర్ధిక స్థాయి పరిధిలో మాత్రమే తన అవసరాలను పరిమితం చేసుకోవాలని. సమాజ నియమాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణం గానే ఏ మనిషయినా నడుచుకోవాలని' లాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ అప్పటికి మా అబ్రహాం మాస్టారు సోషల్ పాఠం లో ఇంకా చెప్పకుండానే అర్ధం చేసేసుకున్నాడు.

Thursday, January 26, 2017

టాగోర్ గీతాంజలి - చలం


















               నేను ఏడో తరగతి లో వున్నప్పుడు , మా నాయనమ్మ,  కార్తీక మాసం లో , రోజూ శివుడికి పూజ చేసి, చెరువులో అరటి దొప్ప లో దీపాలొదిలి , సాయంత్రం నేను బడి నుంచి రాగానే 'కార్తీక పురాణం' పుస్తకంలోంచి నాతో రోజుకో కథ చదివించుకుని వినేది. ఆ పుస్తకం చదివాక నాకు దేవుడి మీద బోలెడన్ని సందేహాలొచ్చేసి, ఓ సారి మా తరగతిలో నాతోపాటు అందరికీ బాగా చనువు ఉన్న మా తెలుగు మాస్టారు ఉమా మహేశ్వర్రావు గారిని "దేవుడున్నాడాండీ?" అని అడిగేశాను. మామూలుగా అయితే మా లాంటి పిల్లలం అప్పుడప్పుడూ కుతూహలం కొద్దీ అడిగే "లారీలకి వెనకాల NP అని ఎందుకు రాసి ఉంటుందండీ?" "ఈ నేలని తవ్వుకుంటా కిందకంటా వెళ్ళిపోతే ఏమొస్తాదండీ?" "దూరదర్శన్ లో వార్తలు చదివే వాళ్ళు మనకి కనిపిస్తారు కదండీ, అలాగే మనం కూడా వాళ్ళకి కనిపిస్తామాండీ?" అని అడిగే వెర్రి మొర్రి కలగూరగంప ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా, నిక్కర్చిగా సమాధానాలు వివరించి చెప్పే ఆయన, ఈ ప్రశ్నకి కూడా, మా ఊరు కోమటి కొట్లో మాకు పప్పులు, బెల్లం ముక్కలు పెట్టే కోమటి తాత గారు కొట్లో వున్నారా? అని అడిగితే ఉంటే ఉన్నాడనీ, లేకపోతే లేడనీ,  ఖచ్చితం గా చెప్పేసినట్టు దేవుడు కూడా ఫలానా గుళ్ళో వున్నాడనో లేడనో తెగేసి చెప్పేస్తారుకున్నాను. కానీ నా ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం "దేవుడు ఉన్నాడనుకుంటే వున్నాడు. లేడనుకుంటే లేడు" అని. అసలు దేవుడు ఉన్నాడా ? అని మనకి అనుమానమొచ్చిందంటే దానికి కారణం దేవుడు నిజంగా ఉండయినా ఉండాలి లేదా లేని దేవుడిని ఉన్నాడని మనం నమ్ముతూ అయినా ఉండాలి. దేవుడు ఉన్నాడనటానికి ఏ విధమయిన శాస్త్రీయమయిన ఆధారం లేదు కాబట్టి దేవుడు లేడని వాదిస్తారు హేతువాదులు. దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడి అవసరం మాత్రం మనిషికి చాలా ఉంది. లేకపోతే మనిషికి నైతిక విలువలు ఇంత సులువుగా, ఇంత బాగా ఎలా అబ్బాలి ?  ముఖ్యంగా మనిషికి మనశ్శాంతి, కావాలని తప్పు చేసి దండం పెట్టి తప్పించుకోవటానికి కావలసిన ఆధారం ఎక్కడ దొరకాలి ? ప్రపంచం లో ఉన్న చట్టాలు, ప్రభుత్వాలు పనికి రాకుండా పోయిన రోజు మనిషిని,మనిషిని కలిపి ఉంచగలిగిన శక్తి ఎంతో కొంత దైవ భావానికే ఉంది. నిజానికి మతం అనేది కేవలం ఒక అభిప్రాయం. దేవుడికి, మతానికి ఏ విధమయిన సంబంధమూ లేదు. ఇప్పడు మనిషికి కావలసింది కూడా మతాన్ని, దేవుడిని విడి విడి గా చూడగలిగినంత పరిణతి సాధించటమే. మనం అనుకునే ఈ పాప పుణ్యాలకీ, స్వర్గ నరకాలకీ, పూజా పునస్కారలకీ, భయ భక్తులకీ అతీతమయిన అలాంటి దేవుడు ఉన్నాడని తెలియజెప్పి అందరికీ కావలసిన ఆ అసలయిన దేవుడిని ఒక కొత్త దేవాలయంలో ప్రతిష్టించింది గీతాంజలి.

                 తల్లి మారాం చేసే బిడ్డని లాలించి, ఆడించి, పాడించి కుదురుగా ఒక చోట కూర్చోబెట్టినట్టు టాగోర్ కూడా గీతాంజలి లో దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు లేడని వాదించే నాస్తికులనీ, ఉన్నా ఎలా చేరుకోవాలా అని ఆరాటపడే ఆస్థికులనీ సమానంగా పరవశింపజేశారు. గీతాంజలి కి నోబెల్ బహుమతి వచ్చిందని పుస్తకాల్లో చదివి, ఆ తర్వాత తొమ్మిదో తరగతి ఇంగ్లీషు వాచకం లో "Where the Mind is ..." అన్న పద్యం బట్టీ పట్టి గీతాంజలి లో దేశ భక్తి గురించి చెప్పారేమో అనుకున్నాను. ఆ తర్వాతెప్పుడో డిగ్రీ లో ఉండగా రాజమండ్రి గౌతమి లైబ్రరీ లో చలం గారి 'మైదానం' చదివి ఇంటికొచ్చేటప్పుడు ప్రకాష్ నగర్ పార్కు దగ్గర పుస్తక ప్రదర్శన లో చలం గారిదే టాగోర్ గీతాంజలి తెలుగు అనువాదం  కనిపిస్తే కోట గుమ్మం సెంటర్లో బజ్జీల బండి దగ్గర మిరపకాయ బజ్జీలు తిందామని దాచుకున్న పదిహేను రూపాయలతో ఆ పుస్తకం కొనేశాను. పుస్తకం చదివి పూర్తి చేశాక అప్పటివరకూ దేవుడి గురించి నాకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయిపోయి భగవంతుడి అసలయిన విశ్వరూపం నాకు సాక్షాత్కరించింది.

దేవుడిని కనిపెట్టటం కోసం కొట్టుమిట్టాడుతున్న వేదాంతులకీ, సైంటిస్టులకీ, బాబాలకీ, స్వాములకీ, వజ్ర కిరీటాలు చేయించే మహా భక్తులకీ, ఒంటికి బూడిద పూసుకుని ముక్కు మూసుకుని తలక్రిందులుగా తపస్సు చేసుకునే సన్యాసులకీ కూడా అర్థం కాని దేవుడి తత్వాన్ని...

 "ఊరి బాట వెంబడి ఇంటింటికీ బిచ్చమెత్తుతూ బయలు దేరాను. మిరుమిట్లు గొలిపే స్వప్నం వలే దూరంగా నీ బంగారు రధం కనిపించింది. ఈ రాజాధిరాజెవరో అని ఆశ్చర్యపడ్డాను. నా ఆశలతిశయించాయి. నా దరిద్రం తీరిపోయిందనుకున్నాను. అడక్కుండానే భిక్షం పెడతారనీ దుమ్ములో అన్నివేపులా ధనం వెదజల్లుతారనీ ఎదురుచూస్తూ నించున్నాను.నేనున్న చోటనే నీ రధం ఆగింది. నీ చూపు నా పైన నిలిచింది. చిరునవ్వుతో రధం దిగి వచ్చి నన్ను సమీపించావు. ఇంకేం ఈ నాటికి నా భాగ్యం పండిందనుకున్నాను. నువ్వు తటాలున నీ కుడి చెయ్యి చాచి "నా కేమిస్తావు?" అని అడిగావు."

"ఆభరణాలు మన ఐక్యతను చెరుపుతాయి, నీకూ నాకూ మధ్య అవి అడ్డం. నీ రహస్య వాక్కుని వినపడకుండా చేస్తుంది వాటి గలగల."

"నా జ్ఞానేంద్రియాలని ఎన్నడూ మూయను నా దృష్టి, శ్రవణం, స్పర్శ, నీ అనుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తాయి."

"ఈశ్వరుడు ఎండలో, వానలో, దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలెనే నువ్వు కూడా దుమ్ము నేల మీదికి రా!"

"ఈ అన్వేషణ అంతా అర్ధం లేనిది. అవిచ్చిన్నమయిన సంపూర్ణత అంతటా విలసిల్లుతుంది."

అని ఈశ్వరుడిని ఉద్దేశించి చేసిన కవితా గానం తో పున్నమి రోజు రాత్రి వెన్నెల పరుచుకున్నట్టు మన కళ్ళకి చూపించి, మనసుకు అనుభవింపచేసింది గీతాంజలి.

       మనిషి దేవుడి కోసం అన్వేషించటం కాదు. దేవుడే మనిషి కోసం అన్వేషిస్తున్నాడు. మనిషి దేవుడికోసం ఆరాటపడటం కాదు. దేవుడే మనిషి కోసం ఆరాటపడుతున్నాడు. ఎప్పుడూ దేవుడిని వరాలు కోరుకోవటమే కాదు. అప్పుడప్పుడూ దేవుడిని కూడా "నువ్వు బాగున్నావా?" అని అడగాలని దేవుడే మనందరినీ అర్ధిస్తున్నాడు. మనిషికి దేవుడి అవసరం ఎంత ఉందో, దేవుడికి మనిషి అవసరం కూడా అంతే ఉంది. బహుశా అందుకే దేవుడు మనిషిని సృష్టించాడేమో? "భగవంతుడు మన కోసం పరితపిస్తున్నాడ"న్న టాగోర్ మనసు ఘోష గీతాంజలి మొత్తం అంతః ప్రవాహంగా సాగుతుంది.  గీతాంజలి మీద ఉన్న ఇష్టం వల్లనో, గీతాంజలిలోనే చెప్పినట్టు రాత్రీ పగలూ కష్టపడి మన చుట్టూ మనమే అంతు లేని ఎత్తయిన గోడలు కట్టుకోవటం లో మునిగిపోయి, చీకట్లో మొద్దు బారిపోయిన మన బుర్రలకి సూటిగా చెపితే అర్థం కాదనో తెలీదు గానీ, ఆదిశంకరాచార్యుల 'భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే' బాటలో 'మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది' అన్న శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' లోకి తన ముందుమాట తో మనలని లాక్కెళ్ళి పడేసిన అదే చలం, ముందు 30 పేజీల వ్యాఖ్యానంతో టాగోర్ గీతాంజలి లోకి కూడా అడుగులో అడుగు వేయించుకుని మనలని నడిపిస్తాడు.

   అయినా గీతాంజలి గురించి చెప్పటానికి నేనెంతటి వాడిని ? చలమే చెప్పినట్టు గీతాంజలి అంతరార్ధం చలానికేం తెలుసు ? టాగోర్ కి ఎంత మాత్రం తెలుసు ? చదివి, అనుభవించి, పలవరించి ఎవరికి వాళ్ళు తెలుసుకోవలిసిందే.

Sunday, January 15, 2017

ఖైదీ నంబర్ 150 - Review

         ఏదయినా ఒక సినిమా చూడటానికి మూడు నాలుగు కిలోమీటర్లు బస్సులోనో, ఆటోలోనో వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు బస్సు ఎక్కటం కూడా మర్చిపోయి సినిమా గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూనే ఇంటికి వచ్చెయ్యటం అనేది నాకు ఇప్పటివరకూ రెండు సినిమాల విషయంలో జరిగింది. ఒకటి రాంగోపాల్ వర్మ 'సత్య ' ఇంకొకటి కృష్ణవంశీ 'సింధూరం'. మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత అలాంటి అనుభూతినే కలిగించిన సినిమా 'ఖైదీ నంబర్ 150'. ఇంకా చెప్పాలంటే ఒకప్పటి చిరంజీవితో పాటు, అప్పటి చిరంజీవి సినిమాలతో ముడి వేసుకున్న చిన్నప్పటి, పాత జ్ఞాపకాలని కూడా ఒకసారి గుర్తు చేసిన సినిమా ఇది. ఈ సినిమా కధ, కధనాలు తమిళం నుండి అరువు తెచ్చుకున్నా కూడా, తెర మీద చిరంజీవి తప్ప అవి ఏవీ మనకి గుర్తుకు రావు. ఒకప్పటి ఖైదీ, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాంధవుడు లాంటి సినిమాల లో చిరంజీవి నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ తన నట విశ్వరూపం ప్రదర్శించటం కన్నా కూలి చేసుకునే సామాన్య ప్రేక్షకుడిని కూడా తన సినిమా అలరింప చేయాలనే చిరంజీవి తపనే అతనిని ఇంత పెద్ద స్టార్ ని చేసింది. దానిని గుర్తించి ఇప్పటికీ దానికే కట్టుబడి, అలాంటి అన్ని అంశాలు చూపించటానికి అవకాశం ఉండటం వల్లనే మళ్ళీ తెరపై కనిపించటానికి ఈ సినిమాని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది.

         ఒక సామజిక సమస్య గురించి సామాన్యుడు ఎంత గొంతు చించుకున్నా ఎవరికీ పట్టదు. ఎక్కువ మందికి అది చేరుకోదు. కానీ అదే సామాజిక సమస్యని ఒక సినిమా గా చూపిస్తే, అందులోనూ ఒక పెద్ద హీరో నటించిన సినిమాలొ చూపిస్తే ఆ సమస్య గురించిన అవగాహన అందరికీ కలుగుతుంది. గత డభ్భై సంవత్సరాల నుంచీ ప్రతి తెలుగువాడిపై సినిమాల ప్రభావం చాలా ఉంది. ఒకప్పుడు అంటరానితనం, భూస్వాముల దోపిడి గురించి, వరకట్న వేధింపుల సమస్యల గురించి విరివిగా సినిమాలు వచ్చేవి. నిజానికి చాలా మంది తాము తప్పు చేస్తున్నామని తెలియకపోవటం వల్లనే తప్పు చేస్తారు. అలాంటి వాళ్ళకి సినిమాలు ఒక హెచ్చరికలా ఉంటాయి. ఎంత కాదనుకున్నా ప్రస్తుత సమాజం పైన సినిమాల ప్రభావం చాలా ఉంది. సినిమా కావాలనుకుంటే ఐన్ స్టీన్ చెప్పిన 'సాపేక్ష సిధ్ధాంతాన్ని', ఉపనిషత్తుల్లో చెప్పిన 'కార్య కారణ సంబంధాన్ని' అక్షరం ముక్క రాని వాడికి కూడా అర్ధమయ్యేలా చెప్పగలదు. ఒకప్పుడు ఎన్టీఅర్ దేవుడి సినిమాల తర్వాతే, సామాన్య ప్రజల్లో భక్తి గురించి అవగాహన ఎక్కువయ్యిందని తన అనుభవంతో మా ఊళ్ళో ముసలయ్య తాత చెప్పటం నాకు బాగా గుర్తు. అలాంటి శక్తివంతమయిన సినిమా ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సామాజిక సమస్యని కూడా ఎత్తి చూపిస్తూ చిరంజీవి మళ్ళీ మన ముందుకు రావటం ఒక మంచి నిర్ణయం. ఒకేలా ఉన్న ఇద్దరు హీరోలు. ఒక హీరో సమస్యని అనుకోని పరిస్థితుల్లో మరో హీరో పరిష్కరించటం. ఆ సమస్య రైతులకి సంబంధించినది కావటం ఈ సినిమా కధ. ఇలాంటి కధలని ఇప్పటివరకూ మనం చాలా సినిమాల్లో చూసేశాం. కానీ ఇంత సాదా సీదా కధకి చిరంజీవి తో పాటు సంభాషణలు కూడా నిజమయిన బలాన్ని ఇచ్చాయి. పాటల పరంగా 'చూడాలని ఉంది ' సినిమాలో లాంటి ఒకటి రెండు శ్రావ్యమయిన పాటలు కూడా కుదిరి ఉంటే ఇంకా బాగుండేది. పేరున్న నటీ,నటులు కేవలం నలుగురయిదుగురు మాత్రమే ఉన్న ఈ సినిమాలో నాకు ఎక్కువగా నచ్చిన అంశాలు మాత్రం చాలానే ఉన్నాయి.         

మీడియా ముందు చిరంజీవి మాట్లాడినప్పటి సంభాషణలు.

ఇంటర్వెల్ ముందు "నేను శీనుని కాదు శంకర్ ని" అని నిజంగానే శంకర్ పాత్రని ఆవాహన చేసుకున్నట్టు ఒక పూనకం తో చెప్పే సన్నివేశంలో, అద్భుతమయిన చిరంజీవి నటన.

నీరు.. నీరు.. పాట.

వన్నె తగ్గని చిరంజీవి డ్యాన్స్.

అక్కడక్కడా నవ్వించిన హాస్య సన్నివేశాలు, ముఖ్యంగా చిరంజీవి నటించినవి.

నాణేల ఫైట్.

         నిజానికి సినిమా అనేది దృశ్య ప్రధానమయిన మాధ్యమం. తక్కువ మాటలతోనే సన్నివేశాలని మనసుకు హత్తుకునే లాగా చూపించవచ్చు. కానీ కొంత కాలం నుంచీ పంచ్ డైలాగుల హవా ఎక్కువగా నడుస్తుంది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం కొంత మంది రచయితలు పంచ్ డైలాగుల బదులు అర్ధవంతమయిన సంభాషణలు రాయటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో ఉన్న "పట్నాలన్నీ పల్లెటూళ్ళకి పుట్టిన పిల్లలు." అన్న ఒక్క మాటే నన్ను ఈ సినిమా గురించి రాయాలనిపించేలా చేసింది. తమిళ మాతృకలో ఉన్న సంభాషణల గురించి నాకు ఏమీ తెలీదు గానీ, ఇలాంటి మంచి సంభాషణలు ఈ సినిమాలో ఇంకా చాలానే ఉన్నాయి. వేరే భాషలో ఉన్న మంచి కధని మన భాషలోకి అనువదించుకుని చదివి ఆనందించటంలో తప్పు లేదు. అలాగే తెలుగు సినిమాలని మిగిలిన వాళ్ళు రీమేక్ చేసుకుంటునట్టే, వేరే భాషలో ఉన్న సినిమాని మన భాషలోకి పునర్నిర్మించి అందరూ ఆస్వాదించేలా చెయ్యగలిగితే అందులోనూ తప్పులేదు. ఆ విషయం లో 'ఖైదీ నంబర్ 150' సఫలీకృతమయ్యిందని చెప్పటంలో కూడా ఏ విధమయిన సందేహం లేదు.

         చివరిగా, చిన్న చిన్న లోపాలు కనిపించినా గానీ, బహుశా ఈ సినిమా నాకు నచ్చటానికి ఒక కారణం నేను ఒకప్పటి చిరంజీవి అభిమానిని కావటం కావచ్చు, అంతకు మించి ఇప్పటికీ నేను చిరంజీవి అభిమానినే అని మరోసారి బల్ల గుద్ది చెప్పుకోవటానికి ఈ సినిమా ద్వారా నాలాంటి అభిమానులకి అవకాశం ఇవ్వటం కూడా కావచ్చు.