Tuesday, December 31, 2013

కాంత'మ్మ' కథ

                                మా ఇంటికి ఐదారిళ్ళవతల గని రాజు గారి పొలాలకి నీళ్ళెల్లే పిల్ల కాలవ పక్కన వుండే కాంతమ్మ వాళ్ళాయన రోజూ పొద్దున్నే ఆకు పచ్చని వరి దుబ్బుల మీద నుంచి పైకొచ్చే ఎర్రటి సూర్యుడి కన్నా ముందే లేచి , ఊరికి ఉత్తరాన వున్న కొమ్మర పొలం పన్లొకెళ్ళిపొయేవాడు. వచ్చేటప్పుడు మాత్రం వస్తూ వస్తూ పొలాల మధ్య పుంత గట్టు మీద  ఉండె కల్లు కోటమ్మ కల్లు పాకలో నాలుగు డొక్కులు కల్లు తాగి , కొత్తపల్లి కాలవ గట్టు మీదుండే వడ్డోళ్ళ చిట్టెమ్మ దగ్గర రెండు కొరమేన్లు తీసుకుని సరిగ్గా సూర్యుడు తాడి చెట్టంత ఎత్తుకి వచ్చే సమయానికి ఇంటికొచ్చి కాంతమ్మకిచ్చి పులుసెట్టమనేవాడు. కాంతమ్మ తాగొచ్చిన మొగుణ్ణి ఊరంతా అదిరిపొయేలాగ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తెచ్చిన రెండు చేపల్నీ ఇంటి ముందు పిల్ల కాలవ లోకి విసిరి కొట్టి "ఇంట్లో ఉప్పు , చింత పండు కొనడానికి దిక్కు లేదు గానీ ఏమీ లేకుండా వండి వడ్డించటానికి నేనేమైనా సతీ సావిత్రిననుకున్నావా" అని మొగుణ్ణి ఎగిరి తన్నినంత పని చేసేది.బళ్ళో నాలుగో తరగతి చదివే కాంతమ్మ కొడుక్కీ వాడి చెల్లెలికీ రోజూ ఇంట్లో ఈ గొడవ మామూలే గానీ, ఓ సారి మాత్రం కాంతమ్మ వాళ్ళాయన మీద కోపం తో కొడుకుతో "మీ నాన్నకి తద్దినం పెడతాను చెరువులోకెళ్ళి తామరాకులు తెంపుకు రారా" అంటే వాడు నిజంగానే తద్దినమంటే అదేదో సుబ్బారాయుడి షష్టికి తీర్ధం లో గుడి దగ్గర పెట్టే పెరుగన్నం లాంటి దద్దోజనమునుకుని మంచినీళ్ళ చెరువులో దిగి తామరాకులు తెంపుకొచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు.

                  కల్లు కోటమ్మ కల్లమ్మటం మానేసి నాటు సారా మొదలెట్టేక, కాంతమ్మ మొగుడు కూడా రోజూ సారా తాగి ఇంటికొస్తా ఉంటే ఓ రోజు ఇద్దరికీ పెద్ద గొడవైపోయి, కాంతమ్మ మొగుడు ఇంట్లోంచి వెళ్ళి పోయి, మళ్ళీ తిరిగి రాలేదు గానీ ఊళ్ళో మాత్రం అందరూ గయ్యాళి కాంతమ్మ మొగుణ్ణి తన్ని తరిమేసిందని చెప్పుకునే వారు. తర్వాత కాంతమ్మ చేతిలో డబ్బుల కోసం ఊళ్ళో వరి పొలాల కోతలు, ఊడుపులప్పుడు శ్రీకాకుళం, విజయనగరం నుంచి పనులు చెయ్యడానికి మేస్త్రి పంజా వెంకటేసులు తీసుకొచ్చే జనాలకి పొద్దున్నే ఇడ్లీలమ్మి, ఆ పనుల్లేనప్పుడు ఇంటెనకాల ఉన్న ఖాళీ స్థలం లో కనకాంబరాలు, సీతమ్మ జడగంటలు, మధ్యాహ్నం మంగమ్మ, ముద్ద బంతి, రేక బంతి, క్రిష్ణ బంతి,మల్లి, జాజి మల్లి లాంటి పూల మొక్కలు పెంచి ఊళ్ళో పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళప్పుడు అమ్ముకుంటూ, పిల్లల్ని ఊరి బళ్ళో బడికి పంపటం మాత్రం మానలేదు. బళ్ళో పిల్లలకి వానా కాలం దొరికే తాటికాయలు తెచ్చి గుజ్జు తీసి వాము, బెల్లం వేసి పూసిన తాటి తాండ్ర ముందు మూడు రోజులూ పిలిచి పంచిపెట్టేసి, తర్వాత నుంచీ మాత్రం డబ్బులిస్తే గాని ఇవ్వనంటే, పిల్లలందరికీ బాగా నచ్చేసి తెగ కొనేసుకునేవాళ్ళు. ఓ సారి అబ్బాయి గారి చేలో ఎలుకల కోసం ఎలుకల మందు కలిపి పెట్టిన వడ్ల గింజలు తిని కాంతమ్మ పెంచే కోళ్ళల్లో ఓ కోడి పడిపోతే, అది చచ్చి పోతే రెండొందలు నష్టమని దాన్ని ఎలాగైనా బతికించాలని కోడి కి మేత తిత్తి దగ్గర కోసి, తిన్న మందంతా బయటికి తీసేస్తే కోడి బతికి పోయింది. అప్పట్నుంచీ ఊళ్ళో ఎవరి కోడి మందు తిన్నా కాంతమ్మ దగ్గరికే తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తే కోడికి ఇరవై రూపాయలు తీసుకొనేది.

     కాంతమ్మ కొడుకు ఇంటర్లో చేరాక కొడుకు చేతికి అంది వచ్చాడు కనుక, ఆసరాగా ఉంటాడని కొమ్మరలో ఉండే "అబద్ధాలు" దగ్గర కొత్తగా కొన్న నల్ల గేది, కాంతమ్మని ఓ సారి కుమ్మెయ్యడానికొస్తే  కింద పడి చెయ్యి బెణికి డాక్టర్ దగ్గరికెళ్ళాక ఎక్సరేలు, స్కానింగులూ తియ్యమంటే, బోలెడు డబ్బు దండగని చేతికి చింతపండు గుజ్జు తో చేసిన పట్టీ వేసుకుని నొప్పి తగ్గించేసుకుంది. పైగా డాక్టరు బలానికి పాలూ, గుడ్లూ తినమంటే "ఇలాంటివన్నీ ఎదిగే వయసు పిల్లలకి పెట్టాలి గానీ, ఈ వయసులో నేను తింటే నాకేమయినా అరుగుతాయా" అని చెప్పేది. పాలమ్మిన డబ్బులు వడ్డీలకిచ్చి , తాకట్టు వ్యాపారం కూడా మొదలెట్టి , ఇంటిముందు వేప చెట్టు మీద వాలే కాకులెత్తుకొచ్చే గిన్నెలూ, సబ్బులూ ,చెంచాలూ కూడా అవసరమున వాళ్ళకి సగం రేటు కి అమ్మేసేది. ఊళ్ళో కొంత మందయితే కాకులకి కాంతమ్మే ట్రయినింగిచ్చిందని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. ఎవరైనా కాంతమ్మ పీనాసితనం గురించి వేళాకోళమాడితే "ఇంటెనకాల చింత మొక్క ఉంది కదా అని రోజూ చింత చిగురు కోసేసుకుని కూరలో వేసుకుంటే కొన్నాళ్ళకే అది చచ్చి ఊరుకుంటుంది, అదే పెద్ద చెట్టయ్యే వరకూ ఓపిగ్గా ఉంటె మనమూ మన ముందు తరాలూ కూడా ఎంత తిన్నా తరగదు, డబ్బు కూడా అంతేరా అబ్బాయ్" అని అక్షరం ముక్క రాక పోయినా పెద్ద "వారెన్ బఫ్ఫెట్" లా మాట్లాడేది.
      
                కాంతమ్మ ఇంటి ముందు గనిరాజు గారి పొలాల్ని, పిల్లలు అమెరికాలో స్థిరపడిపోయారని, ఆయనకి ఒంట్లో బాగోక, వ్యవసాయం చెయ్యలేక, అమ్మేస్తానంటే రెండెకరాలు కొని అందులో ఎకరం కట్నం గా ఇచ్చి కూతురికి ఏలూరులో ఆంధ్రా బ్యాంకు లో క్లర్కు గా పని చేసే మూర్తి గారి రామానికిచ్చి పెళ్ళి చేసి, మిగిలిన ఎకరం కౌలుకిచ్చి ఆ డబ్బుల్తో ఇంకో నాలుగు గేదులు కొని చూసుకుంటూ, కొడుకుని డిగ్రీ దాక చదివించింది. కొడుకు చదువయిపోయి గణపవరం కరంటాఫీసులో ఉద్యోగం వచ్చిన రోజు మాత్రం, ఊరి జనం అందరినీ లారీ కట్టించుకుని దువ్వ దానమ్మ తల్లి గుడికి తీసుకెళ్ళి నాలుగు మేక పోతుల్ని నరికించి అందరికీ భోజనాలు పెట్టిస్తే, ఆ రోజు కాంతమ్మ పేరు ఊరు ఊరంతా మారుమోగిపోయింది. తర్వాత రెండు పోర్షన్ల పెద్ద డాబా కట్టి కొడుక్కి పెళ్ళి చేసి, మనవలు, మనవరాళ్ళూ వచ్చేసరికి  ఇంకో ఎకరం పొలం కొనేసి పిల్లా , పాపా, ఇల్లూ, పొలం, గేదులు,కోళ్ళూ అన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడిపేసేది కాంతమ్మ.

                  చాన్నాళ్ళ తర్వాత కాంతమ్మ కి వయసైపోయి కళ్ళు కనిపించటం మానేసి, డాక్టర్ కి చూపిస్తే కళ్ళల్లో శుక్లాలు వచ్చాయనీ ఆపరషన్ చెయ్యాలనీ చెప్పారు.ఇంకో అయిదారు నెలలు పోతే లయన్స్ క్లబ్బు క్యాంపు లో తణుకులో డబ్బులు తీసుకోకుండా ఊరికినే చేస్తారన్నా వినిపించుకోకుండా కొడుకు మీద దెబ్బలాడి,  భీమవరం లో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళమని మరీ కంటాపరేషను చేయించుకుంది.ఆ రోజు మాత్రం ఊరి జనం "ఒకప్పుడు డబ్బు గురించి అందరికీ బోలెడన్ని పాఠాలు చెప్పిన కాంతమ్మ కి ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి డబ్బంటే లెక్కలేని తనమొచ్చేసిందనీ,  అందుకే తర్వాత ఊరికే చేస్తారన్నా ఇరవై వేలు ఖర్చు పెట్టించి మరీ ఆపరషన్ చేయించుకుంద"ని కొందరు, "జెమిని టి.వి.లో రోజూ ఎనిమిదిన్నరకకొచ్చే "మొగలి రేకులు" సీరియల్ చూడ్డానికే ఆపరేషన్ చేయించుకుంద"ని కొందరూ తెగ చెవులు కొరుక్కున్నారు.

                  ఆ తర్వాత నెల రోజులకి సంక్రాంతి పండక్కి పిల్లలకి సున్నుండలంటే ఇష్టమని ఇంటెనకాల గాడి పొయ్యి మీద పెద్ద మూకుట్లో మినుములు వేయిస్తూ, ఆరిపోతున్న కట్టెలు పైకి ఎగదోస్తుంటే పక్కన కూర్చున్న కొడుకు, పండక్కి ఇంటికొచ్చిన కూతురుతో "అందరూ అనుకుంటున్నట్టు నాకేమీ డబ్బులు ఎక్కువయ్యి కంటాపరేషను చేయించుకోలేదురా, వయసయిపోయి ఎప్పుడు ఏ క్షణం లో పోతానో అని భయమేసి కనీసం చివరి రోజుల్లో అయినా పిల్లల్నీ , మిమ్మల్నీ కళ్ళారా చూసుకుంటూ పోవాలనే తొందరపడి చేయించుకున్నారా అబ్బాయ్" అని చెప్పింది ఎప్పుడూ దేనికీ ఎవరి ముందూ చేయి చాపటం ఎరగని కాంతమ్మ కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ.

Sunday, December 22, 2013

మాయ

".... చివరిగా, నేను విన్నవించుకునేది ఒక్కటే.
నేనెవరో నీకు తెలీదు.
కానీ నీ గురించి నాకు సర్వం తెలుసు.
నువ్వెవరో కూడా నాకు బాగా తెలుసు.
ఈ చరాచర జగత్తులో మాలాంటి అధములు అంతకన్నా అధమమయిన కృత్రిమమయిన బుధ్ధితో సృష్టించుకున్న భాషలో  దేనినయితే 'సౌందర్యం' అనే అతి సామాన్యమయిన శబ్ద ధ్వనితో వ్యక్తీకరిస్తారో అదే నువ్వు.
నేను కళ్ళు తెరవటంతోటే మొదలు పెట్టిన నా అనంతాన్వేషణకు ముగింపు పలికిన అద్భుతానివి నువ్వు.
ఇంత కాలం నా సర్వేంద్రియాలూ ఎదురు చూసింది నీ కోసమే.
ఇన్ని రోజులూ నన్ను పెంచి పోషించిన ఈ జగత్తు ఈ క్షణం నుంచీ నాకు తృణప్రాయం, కాదు కాదు మిధ్య.
నాకు జన్మతః సంక్రమించిన పురుషార్ధ సాధక సాధనని సులభతరం చేసి ముక్తి ప్రసాదించగలిగిన ఏకైక దేవతవి నువ్వు.
జఢ గాడాంధకారబంధురబంధితుడనై, అమావాస్య రాత్రులు మాత్రమే బ్రతికిన నన్ను
బయటికి లాగి నిత్య పౌర్ణములు చూపించిన జాజ్వలిత చలితవి నువ్వు.
నువ్వు లేక ఈ చీకట్లో ఒక మూల కూర్చుని బీడువారిన భూమినీ, దుమ్ము కొట్టుకుపోయిన ఆకాశాన్నీ చూస్తూ నిద్రాహారపానస్నానాదులు మరిచి మకిలమయిన నా ఈ దేహంలో భాగమయిన నా బాహువులని ఆహిరితో అందుకోవటానికి ఇంకెందుకు నీకు సందేహం?
ఓహ్...నీ కోసం ఏం చేయను చెప్పు.
నిన్ను కనుగొన్న మరు క్షణమే నా హృదయాన్ని నీకు ధారాదత్తం చేశాను.
ఇంకా ఏముంది నా దగ్గర?
ధనధాన్యవస్తుకనకవాహనాలు లేవు ఇప్పుడు నా దగ్గర.
నేను నిన్ను బంగారు పంజరంలో పెట్టి బంధించలేను. అది నాకు ఇన్ష్టం లేదు.
నేను నా ప్రేమాధికార ఉన్మత్తతతో నిన్ను గుడ్డిగా నిర్బంధించను.
నీ సహజ సౌకుమారస్వేచ్చాస్వాతంత్ర్యాలని హరించబోవటం లేదు.
ఇక మీదట ఇక్కడ విరిసే పున్నాగ జాజి మందార మల్లి బ్రహ్మకమలాది పుష్పాలకీ, శరద్రాత్రులు విరబూసే ఆకాశ నక్షత్రాలకీ, వీచే చల్లని మలయ మారుతాలకీ, నా వెచ్చని హృదయానికీ నువ్వే అధినాయకివి.
నువ్వు నా కోసం ఒక్క అడుగు ముందుకి వేయటం కోసం ప్రతిఫలంగా నన్ను పాతాళంలోకి పడిపొమ్మన్నా నేను సిధ్ధమే.
ఇంకెందుకు ఆలస్యం? నీ మౌనం తో స్తంభించిపోయిన గాలిని నీ జిహ్వాధర జనిత తరంగాలతో జీవింప జేసి నీ సమ్మతిని తెలియచేయి.
పోనీ నీ జీవన ఉదర పోషణ కోసం సంకోచిస్తున్నావా ?
నిత్యం ఎడతెగక పారే ఏటి ఒడ్డున నిత్య జీవితమయిన వెదురు మొక్కలను ఇల్లుగా మలిచి సిధ్ధం చేసే ఉంచాను.
ఆకలేస్తే రాజహంసలు, రామచిలుకలు మాత్రమే రుచి చూసి వదిలి వెళ్ళిన మధుర ఫలాలు ఏరుకొస్తాను.
నిండుగా ఉన్న తేనెపట్టును ఆశ్రయించిన తేనెటీగలు పౌర్ణమి రోజు తేనె తాగి మత్తులో జోగుతుండగా మిగిలిన మంచి తేనెను సేకరించి నీ కోసం దోసిళ్ళతో తీసుకొస్తాను.
దాహమయితే ఒడ్డున ఉన్న మొగలి, పారిజాత, సంపెంగ వృక్షాలు రాల్చిన పూలు మోసుకొచ్చి సుగంధభరిత పరిమళాలు సంతరించుకున్న తియ్యటి ఏటి నీళ్ళు ఎలాగూ ఉన్నాయి.
మన దాహాపేక్షను పెంచగలిగిన మహత్తు కలిగిన నీళ్ళవి.
నేను అల్పుడినే, దుర్భలుడినే, రధగజతురగపధాతిదళవిలసితరాజ్యాధినేతని కాదు, కానీ సూర్యచంద్రులకు గ్రహణం పట్టిన పూట ఏ అపాయమూ నీ దరి చేరనీయకుండా, నీ నిరీక్షణలో లోతుకి పోయిన నా కంటి గుహల్లో దాచి నిన్ను రక్షించుకుంటాను.
ఇంకా చాలదంటావా ?
నీ వర్ణార్ణవతరంగశోభిత ఖండ కావ్యాలు రాసి మండు వేసవి సోమరి మిట్ట మధ్యాహ్నం గానుగ చెట్టు చల్లటి నీడలో అలసట తెలియకుండా నీకు పాడి వినిపిస్తాను. అంకితమిస్తాను.
నీ సమ్మతి చాలు నాకు. దయచేసి నీ మౌనాన్ని ముగించు."
నా అర్ధింపు ముగిసింది.
నా దేవత తన ముఖ కవళికల్లో ఏ విధమయిన భావమూ పైకి ప్రకటించనీయకుండా నిలుచుంది.
"మౌనం అర్ధాంగీకారం, నాకు తెలుసు నువ్వు నా అభ్యర్ధనను మన్నించావు." అడుగు ముందుకెయ్యబోయాను.
నా దేవత పెదవులు మందార మొగ్గల్లా విచ్చుకున్నాయి.
నా మనసు రంజిల్లింది.
క్షణంలో వెయ్యో వంతులో తన అంగీకార సూచకంగా చిరు నవ్వుతో విచ్చుకున్నాయనే అనుకున్నాను.
కానీ కాదు. "ఛీ, నీచుడా నీకంటూ సాధికారిత లేని బికారివి. భయంతో గానీ, ఆశతో గానీ నన్ను నీ చుట్టూ తిప్పుకోగలిగిన బలం, ఐశ్వర్యం లేని దరిద్రుడివి, నిన్ను ఎలా వరిస్తాననుకున్నావ్ ?" అని పిడుగు పడ్డట్టు గర్జించటానికి.
నేను ఆ మాటలు భరించలేక మోకాళ్ళపై కూల బడిపోయాను.
దానికి వంద రెట్లు క్రోధంతో అగ్ని గుండాల్లా రగులుతున్న ఆమె కళ్ళతో నన్ను కాల్చేస్తూ ధగధ్ధగాయమాన వజ్రవైఢూర్యాది నవరత్నఖచితసువర్ణాభరణావృతమయిన తెల్లకలువలాంటి ఎడమ పాదాన్ని పైకెత్తి, సీతాకోకచిలుకల రెక్కలు తెంపుకొచ్చి రంగుల అద్దకం అద్దిన పొడవయిన ఆమె కాలి గోళ్ళు నా గుండెల్లో దిగబడేలా తన్ని వెళ్ళిపోయింది.
కాల గతిలో రోజులు దొర్లిపోయాయి.
ఒక సూర్య గ్రహణపు చీకటి రోజు ఉన్నట్టుండి నా దేవత మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. నాకు చేరువగా. కానీ దీనంగా.
"ఇప్పుడు నేను కోరుకున్న నాలుగు బంగారు గోడల మధ్య, ఒక ఆజానుబాహుడి సమక్షంలో వెండి పళ్ళెంలో ప్రతి రోజూ పంచభక్ష్య పరమాన్నాలూ భుజిస్తున్నాను. కానీ నాకు అతడి ఐశ్వర్యం మొహం మొత్తింది. అతడి బలం నన్ను భయపెడుతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను." అంది.
నిజం తెలుసుకున్నందుకు నా మనసు ఆనంద కందళితమయ్యింది.
కానీ కొన్నాళ్ళకి
"నీ సోమరి జీవితంలో నాకు ఏ విధమయిన ఉత్సుకతా కనిపించటం లేదు. నేను నా బంగారు పంజరానికే వెళ్తాను."
వెళ్ళిపోయింది.
మళ్ళీ కొన్నాళ్ళకి...
"నాకు అక్కడ ఊపిరాడటం లేదు అందుకే వచ్చాను. ఇక్కడ గాలి బాగుంది."
కొన్నాళ్ళకి...
"ఇక్కడ ఏదో దుర్గంధం. నేను ఉండలేను. వెళ్ళాలి."
మళ్ళీ...
"అక్కడి బంగారు గోడలు చూసి చూసి నాకు కళ్ళు మండుతున్నాయి. ఇక్కడి వెన్నెల కోసం..."
మళ్ళీ...
మళ్ళీ..
ఇలా నా అమాయకపు 'సౌందర్యం' అటూ ఇటూ పరిభ్రమిస్తూనే ఉంది. కానీ ఆమెకి తెలియని రహస్యం. "నిజానికి అక్కడా ఇక్కడా ఉన్నది నేనే. ఇదంతా ఆమె కోసం నా సర్వ శక్తులూ కూడ దీసుకుని నేను కల్పించిన మాయా నాటకం."
నా ముగ్ధ సౌందర్యానికి ఇదేమీ తెలీదు పాపం.
మళ్ళీ వస్తూనే ఉంది.
మళ్ళీ వెళ్తూనే ఉంది.
మళ్ళీ..
మళ్ళీ..
మళ్ళీ..మళ్ళీ..
కానీ ఒక నిశి రాత్రి నా దేవత నా దగ్గరగా వచ్చి "నీ గురించి నాకు సర్వం తెలుసు. నువ్వెవరో కూడా నాకు బాగా తెలుసు. ఇదంతా నీ మాయ అని కూడా తెలుసు. కానీ నాకిష్టమయిన ఈ ఆటని కావాలని నీతో మొదలుపెట్టించింది నేనే" అంది. నా హృదయం మీది గాయపు మచ్చని కొంచెం గర్వంగా, ఇంకా జాలిగా చూస్తూ.
అంటే... ఇంత కాలం నేను... ఆమె మాయలో...!?
ఓహ్...!?
ఇంక ఆ క్షణమే నన్ను తనలో ఐక్యం చేసుకుని నాకు శాశ్వతానందాన్ని ప్రసాదించింది.