Tuesday, December 31, 2013

కాంత'మ్మ' కథ

                                మా ఇంటికి ఐదారిళ్ళవతల గని రాజు గారి పొలాలకి నీళ్ళెల్లే పిల్ల కాలవ పక్కన వుండే కాంతమ్మ వాళ్ళాయన రోజూ పొద్దున్నే ఆకు పచ్చని వరి దుబ్బుల మీద నుంచి పైకొచ్చే ఎర్రటి సూర్యుడి కన్నా ముందే లేచి , ఊరికి ఉత్తరాన వున్న కొమ్మర పొలం పన్లొకెళ్ళిపొయేవాడు. వచ్చేటప్పుడు మాత్రం వస్తూ వస్తూ పొలాల మధ్య పుంత గట్టు మీద  ఉండె కల్లు కోటమ్మ కల్లు పాకలో నాలుగు డొక్కులు కల్లు తాగి , కొత్తపల్లి కాలవ గట్టు మీదుండే వడ్డోళ్ళ చిట్టెమ్మ దగ్గర రెండు కొరమేన్లు తీసుకుని సరిగ్గా సూర్యుడు తాడి చెట్టంత ఎత్తుకి వచ్చే సమయానికి ఇంటికొచ్చి కాంతమ్మకిచ్చి పులుసెట్టమనేవాడు. కాంతమ్మ తాగొచ్చిన మొగుణ్ణి ఊరంతా అదిరిపొయేలాగ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తెచ్చిన రెండు చేపల్నీ ఇంటి ముందు పిల్ల కాలవ లోకి విసిరి కొట్టి "ఇంట్లో ఉప్పు , చింత పండు కొనడానికి దిక్కు లేదు గానీ ఏమీ లేకుండా వండి వడ్డించటానికి నేనేమైనా సతీ సావిత్రిననుకున్నావా" అని మొగుణ్ణి ఎగిరి తన్నినంత పని చేసేది.బళ్ళో నాలుగో తరగతి చదివే కాంతమ్మ కొడుక్కీ వాడి చెల్లెలికీ రోజూ ఇంట్లో ఈ గొడవ మామూలే గానీ, ఓ సారి మాత్రం కాంతమ్మ వాళ్ళాయన మీద కోపం తో కొడుకుతో "మీ నాన్నకి తద్దినం పెడతాను చెరువులోకెళ్ళి తామరాకులు తెంపుకు రారా" అంటే వాడు నిజంగానే తద్దినమంటే అదేదో సుబ్బారాయుడి షష్టికి తీర్ధం లో గుడి దగ్గర పెట్టే పెరుగన్నం లాంటి దద్దోజనమునుకుని మంచినీళ్ళ చెరువులో దిగి తామరాకులు తెంపుకొచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు.

                  కల్లు కోటమ్మ కల్లమ్మటం మానేసి నాటు సారా మొదలెట్టేక, కాంతమ్మ మొగుడు కూడా రోజూ సారా తాగి ఇంటికొస్తా ఉంటే ఓ రోజు ఇద్దరికీ పెద్ద గొడవైపోయి, కాంతమ్మ మొగుడు ఇంట్లోంచి వెళ్ళి పోయి, మళ్ళీ తిరిగి రాలేదు గానీ ఊళ్ళో మాత్రం అందరూ గయ్యాళి కాంతమ్మ మొగుణ్ణి తన్ని తరిమేసిందని చెప్పుకునే వారు. తర్వాత కాంతమ్మ చేతిలో డబ్బుల కోసం ఊళ్ళో వరి పొలాల కోతలు, ఊడుపులప్పుడు శ్రీకాకుళం, విజయనగరం నుంచి పనులు చెయ్యడానికి మేస్త్రి పంజా వెంకటేసులు తీసుకొచ్చే జనాలకి పొద్దున్నే ఇడ్లీలమ్మి, ఆ పనుల్లేనప్పుడు ఇంటెనకాల ఉన్న ఖాళీ స్థలం లో కనకాంబరాలు, సీతమ్మ జడగంటలు, మధ్యాహ్నం మంగమ్మ, ముద్ద బంతి, రేక బంతి, క్రిష్ణ బంతి,మల్లి, జాజి మల్లి లాంటి పూల మొక్కలు పెంచి ఊళ్ళో పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళప్పుడు అమ్ముకుంటూ, పిల్లల్ని ఊరి బళ్ళో బడికి పంపటం మాత్రం మానలేదు. బళ్ళో పిల్లలకి వానా కాలం దొరికే తాటికాయలు తెచ్చి గుజ్జు తీసి వాము, బెల్లం వేసి పూసిన తాటి తాండ్ర ముందు మూడు రోజులూ పిలిచి పంచిపెట్టేసి, తర్వాత నుంచీ మాత్రం డబ్బులిస్తే గాని ఇవ్వనంటే, పిల్లలందరికీ బాగా నచ్చేసి తెగ కొనేసుకునేవాళ్ళు. ఓ సారి అబ్బాయి గారి చేలో ఎలుకల కోసం ఎలుకల మందు కలిపి పెట్టిన వడ్ల గింజలు తిని కాంతమ్మ పెంచే కోళ్ళల్లో ఓ కోడి పడిపోతే, అది చచ్చి పోతే రెండొందలు నష్టమని దాన్ని ఎలాగైనా బతికించాలని కోడి కి మేత తిత్తి దగ్గర కోసి, తిన్న మందంతా బయటికి తీసేస్తే కోడి బతికి పోయింది. అప్పట్నుంచీ ఊళ్ళో ఎవరి కోడి మందు తిన్నా కాంతమ్మ దగ్గరికే తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తే కోడికి ఇరవై రూపాయలు తీసుకొనేది.

     కాంతమ్మ కొడుకు ఇంటర్లో చేరాక కొడుకు చేతికి అంది వచ్చాడు కనుక, ఆసరాగా ఉంటాడని కొమ్మరలో ఉండే "అబద్ధాలు" దగ్గర కొత్తగా కొన్న నల్ల గేది, కాంతమ్మని ఓ సారి కుమ్మెయ్యడానికొస్తే  కింద పడి చెయ్యి బెణికి డాక్టర్ దగ్గరికెళ్ళాక ఎక్సరేలు, స్కానింగులూ తియ్యమంటే, బోలెడు డబ్బు దండగని చేతికి చింతపండు గుజ్జు తో చేసిన పట్టీ వేసుకుని నొప్పి తగ్గించేసుకుంది. పైగా డాక్టరు బలానికి పాలూ, గుడ్లూ తినమంటే "ఇలాంటివన్నీ ఎదిగే వయసు పిల్లలకి పెట్టాలి గానీ, ఈ వయసులో నేను తింటే నాకేమయినా అరుగుతాయా" అని చెప్పేది. పాలమ్మిన డబ్బులు వడ్డీలకిచ్చి , తాకట్టు వ్యాపారం కూడా మొదలెట్టి , ఇంటిముందు వేప చెట్టు మీద వాలే కాకులెత్తుకొచ్చే గిన్నెలూ, సబ్బులూ ,చెంచాలూ కూడా అవసరమున వాళ్ళకి సగం రేటు కి అమ్మేసేది. ఊళ్ళో కొంత మందయితే కాకులకి కాంతమ్మే ట్రయినింగిచ్చిందని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. ఎవరైనా కాంతమ్మ పీనాసితనం గురించి వేళాకోళమాడితే "ఇంటెనకాల చింత మొక్క ఉంది కదా అని రోజూ చింత చిగురు కోసేసుకుని కూరలో వేసుకుంటే కొన్నాళ్ళకే అది చచ్చి ఊరుకుంటుంది, అదే పెద్ద చెట్టయ్యే వరకూ ఓపిగ్గా ఉంటె మనమూ మన ముందు తరాలూ కూడా ఎంత తిన్నా తరగదు, డబ్బు కూడా అంతేరా అబ్బాయ్" అని అక్షరం ముక్క రాక పోయినా పెద్ద "వారెన్ బఫ్ఫెట్" లా మాట్లాడేది.
      
                కాంతమ్మ ఇంటి ముందు గనిరాజు గారి పొలాల్ని, పిల్లలు అమెరికాలో స్థిరపడిపోయారని, ఆయనకి ఒంట్లో బాగోక, వ్యవసాయం చెయ్యలేక, అమ్మేస్తానంటే రెండెకరాలు కొని అందులో ఎకరం కట్నం గా ఇచ్చి కూతురికి ఏలూరులో ఆంధ్రా బ్యాంకు లో క్లర్కు గా పని చేసే మూర్తి గారి రామానికిచ్చి పెళ్ళి చేసి, మిగిలిన ఎకరం కౌలుకిచ్చి ఆ డబ్బుల్తో ఇంకో నాలుగు గేదులు కొని చూసుకుంటూ, కొడుకుని డిగ్రీ దాక చదివించింది. కొడుకు చదువయిపోయి గణపవరం కరంటాఫీసులో ఉద్యోగం వచ్చిన రోజు మాత్రం, ఊరి జనం అందరినీ లారీ కట్టించుకుని దువ్వ దానమ్మ తల్లి గుడికి తీసుకెళ్ళి నాలుగు మేక పోతుల్ని నరికించి అందరికీ భోజనాలు పెట్టిస్తే, ఆ రోజు కాంతమ్మ పేరు ఊరు ఊరంతా మారుమోగిపోయింది. తర్వాత రెండు పోర్షన్ల పెద్ద డాబా కట్టి కొడుక్కి పెళ్ళి చేసి, మనవలు, మనవరాళ్ళూ వచ్చేసరికి  ఇంకో ఎకరం పొలం కొనేసి పిల్లా , పాపా, ఇల్లూ, పొలం, గేదులు,కోళ్ళూ అన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడిపేసేది కాంతమ్మ.

                  చాన్నాళ్ళ తర్వాత కాంతమ్మ కి వయసైపోయి కళ్ళు కనిపించటం మానేసి, డాక్టర్ కి చూపిస్తే కళ్ళల్లో శుక్లాలు వచ్చాయనీ ఆపరషన్ చెయ్యాలనీ చెప్పారు.ఇంకో అయిదారు నెలలు పోతే లయన్స్ క్లబ్బు క్యాంపు లో తణుకులో డబ్బులు తీసుకోకుండా ఊరికినే చేస్తారన్నా వినిపించుకోకుండా కొడుకు మీద దెబ్బలాడి,  భీమవరం లో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళమని మరీ కంటాపరేషను చేయించుకుంది.ఆ రోజు మాత్రం ఊరి జనం "ఒకప్పుడు డబ్బు గురించి అందరికీ బోలెడన్ని పాఠాలు చెప్పిన కాంతమ్మ కి ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి డబ్బంటే లెక్కలేని తనమొచ్చేసిందనీ,  అందుకే తర్వాత ఊరికే చేస్తారన్నా ఇరవై వేలు ఖర్చు పెట్టించి మరీ ఆపరషన్ చేయించుకుంద"ని కొందరు, "జెమిని టి.వి.లో రోజూ ఎనిమిదిన్నరకకొచ్చే "మొగలి రేకులు" సీరియల్ చూడ్డానికే ఆపరేషన్ చేయించుకుంద"ని కొందరూ తెగ చెవులు కొరుక్కున్నారు.

                  ఆ తర్వాత నెల రోజులకి సంక్రాంతి పండక్కి పిల్లలకి సున్నుండలంటే ఇష్టమని ఇంటెనకాల గాడి పొయ్యి మీద పెద్ద మూకుట్లో మినుములు వేయిస్తూ, ఆరిపోతున్న కట్టెలు పైకి ఎగదోస్తుంటే పక్కన కూర్చున్న కొడుకు, పండక్కి ఇంటికొచ్చిన కూతురుతో "అందరూ అనుకుంటున్నట్టు నాకేమీ డబ్బులు ఎక్కువయ్యి కంటాపరేషను చేయించుకోలేదురా, వయసయిపోయి ఎప్పుడు ఏ క్షణం లో పోతానో అని భయమేసి కనీసం చివరి రోజుల్లో అయినా పిల్లల్నీ , మిమ్మల్నీ కళ్ళారా చూసుకుంటూ పోవాలనే తొందరపడి చేయించుకున్నారా అబ్బాయ్" అని చెప్పింది ఎప్పుడూ దేనికీ ఎవరి ముందూ చేయి చాపటం ఎరగని కాంతమ్మ కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ.

4 comments: