Tuesday, January 15, 2013

రాంబాబు చిన్నాన్న

                 నేను అయిదో తరగతిలో ఉండగా దశరా సెలవులకి మా ఊరికి ఆరేడు కిలోమీటర్ల దూరం లో బువ్వనపల్లి లో ఉండే మా మేనత్త, వాళ్ళ పెద్ద గేది ఈనిందని, నాకు జున్నంటే ఇష్టమని మా ఊరొచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది.రోజూ నా వాటా జున్ను, నాకిష్టమయిన పరమాన్నం కూడా తినేసాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కొంచెం దూరం లో పక్క వీధి లో ఉండే మా దూరపు బంధువు వరుసకి నాకు చిన్నాన్న అయ్యే, నా కన్నావయసు లో నాలుగయిదేళ్ళు పెద్ద వాడయిన రాంబాబు చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాడిని. వాళ్ళ ఇంటెనకాల పెద్ద రావి చెట్టు దాని మీద పిచ్చుక , కాకి గూళ్ళు ఉండి ఇంకా రామ చిలుక, పాల పిట్ట, గోరువంక లాంటి పిట్టలు అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళిపోయేవి.ఇంటి చుట్టూ రకరకాల కాయగూర మొక్కలతో, ఇంటి మీద, ఇల్లంతా అల్లుకు పోయిన ఆనపకాయ పాదు తో వాళ్ళ ఇల్లు నిజంగానే ఆకుపచ్చని బొమ్మరిల్లు లా ఉండేది. నేను వెళ్ళాక ఇద్దరం కలిసి పొలాల్లో పిల్ల కాలవలో చేపల కోసం ముందు రోజు వేసిన మావులు బయటికి తీసేవాళ్ళం. ఆ మావుల్లో ఒక్కో సారి చిన్న చేపలు, మట్టగుడసలు, బొమ్మిడాయలు, గొరకలు తో పాటు పెద్ద పెద్ద పాములు కూడా పడేవి. ఆ పాముల్ని జాగ్రత్తగా మళ్ళీ కాలవలో వదిలేసి చేపలన్నీ తీసుకుని, మధ్య మధ్య లో పొలం గట్ల మీద కనిపించే చిన్నచిన్న ఈత మొక్కల్ని వేళ్ళ తో సహా పెకిలించి కొడవలి తో దాన్ని మధ్య లోకి కోసి, అందులో ఉండే తెల్లని తియ్యగా ఉండే మొవ్వు తినమని నాకు ఇచ్చే వాడు, ఇంకా ఎక్కడయినా కుండ పెంకులు కనిపిస్తే తీసుకుని వాటితో దారిలో చెరువుల్లో, కాలువల్లో కప్ప గంతులు వేసుకుంటూ ఇంటికొచ్చేసేవాళ్ళం.

                          రాంబాబు చిన్నాన్న వాళ్ళ నాన్న మా చిన్న తాత అచ్చం "తాత మనవడు" సినిమా లో యస్వీ రంగారావు లా ఉండే వాడు.వ్యవసాయం పనులు తప్ప స్థోమత, శ్రద్ధ లేక వాళ్ళు గానీ, చుట్టాలు, మిగతా బంధువుల్లో గానీ ఎవరూ చదువుకోలేదు అందుకే అందర్లోకి నేనే చదువుకుంటున్నానని నన్నెంతో గొప్పగా చూసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ. ఓ సారి మా చిన్న తాత నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నాచేత మా తెలుగు వాచకం లోని "సత్యమేవ జయతే" అనే పాఠం మొత్తం చదివించుకుని విని మురిసిపోయాడు. మా రాంబాబు చిన్నాన్నయితే నన్ను భుజాలకెత్తుకుని "మా వాడు బాగా చదివేస్తాడు అప్పుడే వీడికి ఉత్తరాలు రాయటం చదవటం కూడా వచ్చేసు" నని ఊరంతా ఊరేగినంత పని చేసే వాడు.నేనెప్పుడయినా రాజమండ్రి మా మావయ గారి ఊరెళ్తే అస్తమాను

యాభయ్యేడు పదమూళ్ళెంత ?

నూట పన్నెండు లోంచి ఇరవై ఎనిమిది తీసేస్తే ఎంత ?

కేజి ఇనుము ఎక్కువ బరువా ? కేజి దూది ఎక్కువ బరువా ?

ఒక చెట్టుమీద పన్నెండు కాకులుంటే అందులో ఒక కాకి ని వేట గాడు తుపాకీ తో కాల్చేస్తే ఇంక చెట్టు మీద ఎన్ని కాకులుంటాయ్ ?

ఒక పిల్లి ఒక ఎలుకని ఇరవై నిమిషాల్లో తింటే తొమ్మిది పిల్లులు తొమ్మిది ఎలుకల్ని తినడానికి ఎంత సమయం కావాలి ?

లాంటి నాకిష్టం లేని కష్టమయిన లెక్కలూ, లాజిక్కులూ అందరి ముందూ అడిగే మా ఇంజినీరు మావయ్య, మా ఊరొచ్చినప్పుడు కూడా ఇలాగే అడిగి మా ఊళ్ళో కూడా నాకేమీ రాదని అందరూ అనుకునే లాగ నాపరువు తీసేసే వాడు.అలా కాకుండా మా రాంబాబు చిన్నాన్న వాళ్ళందరూ నన్ను ఇంత గొప్పగా చూస్తుంటే నాకు ఏనుగెక్కినంత సంతోషమొచ్చేసేది.

                        నా గురించి మా రాంబాబు చిన్నాన్న మరీ ఎక్కువ గొప్పలు చెప్పేస్తే, ఆ వీధిలోనే ఉండే నా వయసు అయిదో తరగతి పిల్లలందరూ నేనేదో పెద్ద చదివేసే వాడి లాగ, వాళ్ళందరూ చదువు రాని మొద్దుల్లగా అనిపించి మా ఇద్దరి మీదా శత్రుత్వం పెంచేసుకున్నారు.ఇంక నేను సెలవులు అయిపోయి మా ఊరు వెళ్ళిపోయే రోజు మాత్రం నన్నూ, మా రాంబాబు చిన్నాన్ననీ పిలిచి నేను నిజంగానే అంత తెలివయిన వాడినే అయితే వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళు చెప్పిన పుస్తకం చదివి చూపించమని సవాలు చేసారు.వాళ్ళ మొహాలు చూస్తే ఎలాగయినా నన్ను ఓడించాలని చూస్తున్నారనిపించినా, మహా అయితే ఏ "వినాయక చవితి వ్రతకల్పమో", "వర లక్ష్మీ వ్రతకల్పమో" ఇచ్చి అందులో తెలుగులో ఉండే సంస్కృతం కథ చదవమంటే చదివెయ్యచ్చులే అని రాంబాబు చిన్నాన్నని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.అందులో ఒకడు వాళ్ళ అన్నయ్య చదివే ఏ తొమ్మిదో, పదో తరగతి హిందీ వాచకం చేతికిచ్చి చదవమన్నాడు.ఆరో తరగతి నుంచి తప్ప మాకు హిందీ అ, ఆ లు కూడా చెప్పరనీ, ఈ పుస్తకం నేను చదవలేననీ చెప్పినా మా రాంబాబు చిన్నాన్న వినేలా లేడు.మా రాంబాబు చిన్నాన్న దృష్టిలో చదవటం వచ్చినోడికి ఏమిచ్చినా చదివెయ్యాలి చివరకి అది హిందీ అయినా, మళయాళమయినా, తమిళం అయినా సరే.చదివే వరకూ వాళ్ళు కూడా మమ్మల్ని వదిలే లా లేరు.పుస్తకం చూసి నాకు చెమటలు పట్టి చేతులు వణకటం మొదలెట్టాయి.

            ఈ ఊళ్ళో కూడా నా పరువు, నాతో పాటు నన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పినందుకు మా రాంబాబు చిన్నాన్న పరువూ కూడా పోయింది రా దేవుడా అని అనుకునే సమయానికి బళ్ళో మా అబ్రహం మాష్టారు చదివించే హిందీ "ప్రతిజ్ఞ" గుర్తొచ్చింది నాకు. "భారత దేశం నా మాతృ భూమి ..." అనే ప్రతిజ్ఞ ని అన్ని బడుల్లోనూ తెలుగులోనే చెప్పిస్తే మా బళ్ళో మాత్రం మా మాష్టారు తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీషుల్లో కూడా తెలుగులోనే రాయించి అందరి చేతా బట్టీ పట్టించి ప్రతి రోజూ పొద్దున్నే ప్రార్ధన లో రోజుకి ఒకళ్ళతో చెప్పించేవారు. వీళ్ళు కూడా నా తరగతే కాబట్టి హిందీ రాదు కదా అని నమ్మకం తో "భారత్ మేరా దేశ్ హై..." అని మొదలెట్టి దాన్నే ముందు నుంచీ, వెనకనుంచీ, మధ్య లోంచి రెండు మూడు సార్లు చదివే సరికి నేను హిందీ కూడా ఇంత బాగా, ధారాళం గా చదివేస్తున్నానని నోళ్ళెళ్ళబెట్టశారు వాళ్ళందరూ.వాళ్ళు తేరుకునే లోపు పుస్తకం వాళ్ళ చేతుల్లో పెట్టేసి మా ఊరు వెళ్ళటానికి బస్సు వచ్చేస్తుందని చెప్పి గబగబా అక్కడినుంచి బయటకొచ్చేశాను.అప్పట్నుంచీ మా రాంబాబు చిన్నాన్న కి నా మీద ఆరాధన ఇంకా ఎక్కువయిపోయి నన్ను దగ్గరుండి బస్సెక్కించి మళ్ళీ శెలవులక్కూడా తప్పకుండా రావాలని నా చేత ఒట్టేయించుకున్నత పని చేశాడు.

            ఆ తర్వాత చాన్నాళ్ళ వరకూ ఆ ఊరెళ్ళే ధైర్యం చెయ్యలేదు గానీ ఆ రోజు నాకు సంతోషాన్నిచ్చిన విషయం మాత్రం మా రాంబాబు  చిన్నాన్న కళ్ళల్లో ఆనందం. 

No comments:

Post a Comment